ఉత్తరకాండ నుంచి జనక మహారాజు జన్మ వృత్తాంతం ఇతర విశేషాలు


  • 1. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాతే రామాయణ రచన ప్రారంభిస్తారు వాల్మీకి. 

  • 2. రావణపత్ని మండోదరికి ఇద్దరు సోదరులు -మాయావి,దుందుభి.

  • 3. కుంభకర్ణుడి భార్య వజ్రజ్వాల. విభీషణుడి పత్ని సరమ,పుత్రిక అనల. ఇద్దరూ లంకలో ఉండగా సీతాదేవికి ధైర్య వచనాలు చెప్పి స్వస్థత చేకూరుస్తారు. 

  • 4. కుంభకర్ణుడి సౌకర్యార్థం రావణుడు నిర్మించిన మందిరం మూడు యోజనాల పొడవు, ఒక యోజనం వెడల్పుతో ఉండేది . ఒక యోజనం పదిహేను కిలోమీటర్లకు సమానం.

  • 5. రావణుడి దుష్కృత్యాలను భరించలేకపోయిన అతని అన్న కుబేరుడు, తమ్ముడికి హితబోధ చేసి సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో రాయబారిని పంపుతాడు. రావణుడు ఆగ్రహంతో ఊగిపోయి రాయబారి శిరస్సు ఖండించి,అతని శరీరాన్ని రాక్షసులకు విందు చేసి ,అన్నపై, ముల్లోకాలపై దండయాత్రకు బయలుదేరుతాడు. 





  • 6. కుబేరున్ని ఓడించి పుష్పక విమానాన్ని దొంగలించి అందులో తిరిగి వెళ్తున్న దశకంఠుడు అకస్మాత్తుగా విమానం ఓ చోట ఆగిపోయి కదలకుండా మొరాయించేసరికి ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పరమశివుడు కేళీవిలాసంలో ఉంటాడని,అందుకే ఆ వైపుగా ఎవ్వరినీ అనుమతించరని నందీశ్వరుని ద్వారా తెలుసుకుంటాడు. అయినా అహంకారదర్పంతో తన మార్గానికి అడ్డొచ్చిన కైలాస పర్వతాన్ని పెకలించి పారేస్తానని పిచ్చి ప్రేలాపనలు చేసి కైలాసాన్నే కదిలించబోగా పరమశివుడు తన కాలి బొటనవ్రేలితో అతన్ని అదిమిపెట్టి గర్వభంగం కలిగిస్తాడు. బరువు మొయ్యలేక దశకంఠుడు వెయ్యి సంవత్సరాల పాటూ అరుస్తూ శివ స్తోత్రాలు వల్లిస్తాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై అతనికి వెయ్యి సంవత్సరాల ఆయుష్షును తిరిగి ప్రసాదించి, చంద్రహాసమనే దివ్య ఖడ్గాన్ని కానుకగా ఇస్తాడు. 

  • 7. రావణుడి ధాటికి భయపడిపోయి ఇంద్రుడు,యముడు,వరుణుడు,కుబేరుడు పక్షులుగా జంతువులుగా మారిపోయి తప్పించుకుంటారు. ఇంద్రుడు నెమలిగా మారిపోతే,యముడు కాకిగా, వరుణుడు హంసగా, కుబేరుడు తొండగా మారిపోయి దాక్కుంటారు. ఆపదలో ఆదుకొన్నందుకు ప్రతిగా ఆయా పక్షి,జంతు సంతతికి వరాలిస్తారు దేవతలు. నెమలికి సర్పభయం లేకుండా దేవేంద్రుడు వరం ఇస్తాడు. తన ఒంటిపైనున్న వేయి కన్నులే నెమలి పింఛానికి వస్తాయని,వర్షాగమనానికి ముందు నెమలి పురి విప్పి నాట్యం చేస్తుందని వరమిస్తాడు. కాకికి ఏం తిన్నా ఏం కాదని,ఇతరులు చంపితే తప్ప దానికి చావు లేదని,దాని ద్వారానే పితరులకి ఆహారం అందుతుందని వరమిస్తాడు యముడు. వరుణుడు హంసలకు తెలుపు రంగును ప్రసాదించి, నిత్యం నీళ్ళలో ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు .కుబేరుడు తొండకు బంగారు వర్ణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. 

  • 8. మేఘనాథుడు (ఇంద్రజిత్) మండోదరీ-రావణుల ప్రథమ సంతానం. శౌర్యపరాక్రమాలలో తండ్రిని మించిన తనయుడు. శివున్ని ప్రసన్నం చేసుకొని భూమ్యాకాశాలలో ఎక్కడైనా సంచరించగల రథాన్ని, తామసి అనే మాయా విద్యను వరంగా పొందుతాడు. దేవేంద్రున్నే బంధించి బ్రహ్మ వచ్చి బ్రతిమాలితే విడిచిపెడుతూ మరిన్ని వరాలు పొందుతాడు. యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతి సారీ యజ్ఞం చేయటం,ఆ యజ్ఞకుండంలోంచి వచ్చిన రథాన్ని అధిరోహించి శాత్రవ సంహారం చెయ్యటం అతనికలవాటు. యజ్ఞం చేస్తున్నప్పుడు మధ్యలో ఆయుధం పట్టరాదనే నియమం ఉంది. యజ్ఞం నిర్విఘ్నంగా పుర్తయ్యి రథాన్ని ఎక్కాడా, ఇక తనకు పరాజయమన్న మాటే లేదు. లక్ష్మణుడు యాగాన్ని ధ్వంసం చెయ్యటంతో ఇంద్రజిత్ యాగ సామగ్రినే విసురుతూ అస్త్రాలు ప్రయోగించి అవి నిష్ఫలమవ్వటంతో అవతలివాడు మాములువ్యక్తి కాదని గ్రహించి, రావణుడికి హితబోధ చేసి విఫలుడై చివరికి యుద్ధభూమిలో వీరమరణం పొందుతాడు. 

  • 9. వాలి,సుగ్రీవులకు తల్లిదండ్రీ ఇద్దరూ ఋక్షరజస్సనే వానరమే. ఒకప్పుడు బ్రహ్మదేవుడు యోగదీక్షలో ఉండగా ఆయన కళ్ళ నుండి జారిపడ్డ అశ్రుకణమే వానర రూపం దాల్చి ఋక్షరజస్సుగా పిలవబడ్డాడు. ఈ ఋక్షరజస్సే ఒకానొక సందర్భంలో స్త్రీమూర్తిగా మారిపోయి ఇంద్రుని ద్వారా వాలిని, సూర్యుని ద్వారా సుగ్రీవున్ని పిల్లలుగా పొంది మళ్ళీ పురుషాకృతిని పొందుతాడు. 


  • 10. బాల్యంలో తన అల్లరి చేష్టలతో ఆశ్రమవాసులను విసిగిస్తూండటంతో మహర్షులు కోపించి ఇతరులు గుర్తు చేస్తే తప్ప స్వశక్తి గుర్తుకురాదని హనుమంతున్ని శపిస్తారు. 

  • 11. ఇక్ష్వాకు మహారాజుకు నూర్గురు కుమారులు. వారిలో చివరివాడు పరమ అయోగ్యుడు. అతని పేరు దండుడు. ఇక్ష్వాకు మాహారాజు వాడిని వింధ్య పర్వత ప్రాంతానికి రాజును చేసి శుక్రాచార్యులను గురువుగా నియమిస్తాడు. మూర్ఖుడైన దండుడు గురువు గారు ఆశ్రమంలో లేని సమయంలో ఆయన కుతురైన అరజను బలవంతంగా వశపరచుకొని ఆ పిమ్మట తన దారిన తను వెళ్ళిపోతాడు. జరిగిన ఘోరం గ్రహించిన శుక్రాచార్యులు ఏడు రోజుల్లోగా మట్టి వాన కురిసి దండుని రాజ్యం సర్వనాశనమవుతుందని శపిస్తాడు. అలా అప్పుడు సర్వనాశనమైన ప్రాంతమే నేటి దండకారణ్యం.

  • 12. పట్టాభిషేకానంతరం పుష్పక విమానాన్ని కుబేరుని వద్దకు పంపించేస్తాడు శ్రీరాముడు. అయితే ఆ విమానం తన వద్దనుండటం కన్నా శ్రీరాముని వద్దనుండటమే శ్రేష్ఠం అని భావించిన కుబేరుడు విమానాన్ని మళ్ళీ రాముడి వద్దకే తిప్పి పంపుతాడు. 

  • 13. శ్రీరామ పట్టాభిషేకం అయ్యాక కొద్ది రొజులు అయోధ్యలో గడిపి సుగ్రీవుడితో కలిసి కిష్కింధ కు వెళ్ళిపోతాడు హనుమంతుడు. తిరిగి అశ్వమేధయాగ సమయంలో శ్రీరాముడు కబురంపగా వానర రాజైన సుగ్రీవుడు, అతని బృందంతో అయోధ్య వస్తాడు. మన సినిమాలలో చూపించినట్లుగా పట్టాభిషేకమయ్యాక శాశ్వతంగా అయోధ్యలో శ్రీరాముడి వద్దనే ఉండిపోడు.

  • 14. లక్ష్మణుడు సీతాదేవిని అడవులలో వదిలివెళ్ళినప్పటికీ గంగా నది ఆవలి గట్టుపై నిలబడి వాల్మీకి మహర్షి వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళేంత వరకు వేచి చూస్తాడు. తర్వాతే భారమైన హృదయంతో మంత్రి సుమంత్రుని వెంట అయోధ్యకు తిరుగు ప్రయాణమవుతాడు. శ్రీరాముడి జాతకంలో తరచూ భార్యావియోగం ఉందనే విషయం తనకు,దశరథ మహారాజుకు దుర్వాస మహర్షి ద్వారా అంతకు పూర్వమే తెలుసునని,ఇది ఒకప్పుడు భృగు మహర్షి విష్ణువుకిచ్చిన శాపఫలమేనని చెప్పి లక్ష్మణున్ని ఊరడిస్తాడు సుమంత్రుడు. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తన నిజనామధేయంతోనే రక్షణ పొందుతుంది. ఆమె శ్రీరాముని ధర్మపత్ని సీత అని ఆశ్రమవాసులందరికీ తెలుసు.

  • 15. సీతాదేవి తండ్రియైన జనక మహారాజు అయోనిజుడు. పూర్వం నిమి అనే ఇక్ష్వాకు వంశ మహారాజు ఒక గొప్ప యాగం తలపెట్టి వశిష్ఠ మహర్షిని ఋత్విక్కుగా ఆహ్వానించబోతే ఆ మహర్షి తానిప్పుడు దేవేంద్రుడు నిర్వహించే యాగంలో ఉన్నానని,యాగం పరిసమాప్తమయిన వెంటనే వస్తానని చెబుతాడు. అంత వరకు వేచి ఉండలేక నిమి చక్రవర్తి తన యాగాన్ని గౌతమునితో నిర్వహిస్తాడు. యాగం జరుగుతూండగా వచ్చిన వశిష్ఠుడు తన స్థానంలో మరొకరు యాగాన్ని నిర్వహించటం గమనించి కోపోద్రిక్తుడై నిమి చక్రవర్తి శరీరం చైతన్యం కోల్పోయి జడత్వం పొందాలని శపిస్తాడు. నిమి చక్రవర్తి కుడా అదే ప్రతిశాపం వశిష్ఠునికిచ్చి గాలిలోనే యాగదీక్ష పూర్తిచేసి తన పూర్వశరీరంలో ఉండటం కంటే సకల ప్రాణుల కంటిరెప్పల పై ఉండాలని దేవతలను వరం వేడుకుంటాడు. అలా ప్రాణుల కళ్ళు విశ్రాంతి కోరుకున్నప్పుడు ఆయన కారణంగానే కంటిరెప్పలు మూసుకుంటాయి (అందుకే నిమేషము అన్నారు. దేవతల కంటిరెప్పలు కొట్టుకోవు. కాబట్టి వాళ్ళు అనిమిషులు). వారసుడి కోసం నిమి దేహాన్ని మథిస్తే పుట్టిన పిల్లవాడే జనక మహారాజు. శరీర మథనం వల్ల నిలబడిన రాజ్యం కాబట్టి ఆయన రాజ్యం మిథిలా నగరమయ్యింది.

  • 16. రావణుడి పినతల్లి కూతురు కుంభీనసి. ఆమె భర్త మధువనే రాక్షసుడు. రావణాదులు లంకలో లేని సమయంలో అతని సోదరియైన కుంభీనసిని అపహరించి రాక్షస వివాహం చేసుకుంటాడు మధువు. రావణుడికి విషయం తెలిసి మధువుని చంపబోతే, కుంభీనసి పతిభిక్ష కోరుతుంది. అప్పటికే స్వంత చెల్లెలైన శూర్పణఖకు పతీ వియోగం కలిగించి పాపం మూటగట్టుకున్న రావణుడు మరొకమారు అలాంటి కార్యమే చేయడం ఇష్టంలేక తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు. మధువు తన అపూర్వమైన భక్తిప్రపత్తులతో పరమేశ్వరున్ని మెప్పించి ఆయన శులాన్ని పొంది,అది చేతనున్నంత వరకు తనకు,తన కొడుకు లవణాసురునికి చావు లేకుండా వరం పొందుతాడు. లవణాసురుడు వరగర్వంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తూంటే మహర్షులంతా వచ్చి ప్రభువైన శ్రీరామునికి మొరపెట్టుకుంటారు. శ్రీరాముని కనిష్ఠ సోదరుడైన శతృఘ్నుడు సమరోత్సాహియై ముందుకు వచ్చి అన్నగారి నుంచి దివ్యాస్త్రం సాయంగా పొంది లవణాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతని చేతిలో శూలం లేని క్షణంలో నిర్జించి విజయాన్ని సాధిస్తాడు. అలా ఒకప్పుడు లవణాసురుడు పాలించిన నగరమే ఇప్పటి మధురా నగరం. లవణాసుర వధ తర్వాత శతృఘ్నుడు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు.


3 comments

Post a Comment

శివపురాణం నుంచి కొన్ని విశేషాలు




  1. 1.   పార్వతీదేవి విష్ణువు చెల్లెలు.అందుకే ఆయనలా నల్లగా ఉంటుంది.లక్ష్మీదేవి బ్రహ్మదేవుని చెల్లెలు.ఎర్రగా ఉంటుంది.సరస్వతి శివుని చెల్లెలు.తెల్లగా ఉంటుంది.

  2. 2.   సత్యము, శౌచము, తపస్సు, దయ నాలుగు పాదాలుగా ఉంటాయి.

  3. 3.   శివ కుటుంబంలో ఐదవవాడు చండీశ్వరుడు. చండీశ్వర స్థానంలో చిటికె మాత్రమె వెయ్యాలి. శివప్రసాదంలో మిగిలినదాన్ని ముందు చండీశ్వరుడు తింటాడు.ఆయనకు అర్పించిన తర్వాతే భక్తులు ఆరగించాలి.

  4. 4.   నవనందులుగా నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశాలు ఆంధ్ర దేశంలో ఉన్నాయి.

  5. 5.   విభూతి పెట్టుకున్నవాళ్ళంతా శైవులు కారు.విభూతి వైదికం.ఎవరైనా భస్మారాధరన చెయ్యవచ్చు. నుదుటి రాతను సైతం మార్చే శక్తి భస్మకుంది.స్నానం చేస్తే తడి విభూతిని పెట్టుకోవాలి. మూడు వ్రేళ్ళతో బూడిద పెట్టుకోరాదు. స్నానం చెయ్యనప్పుడు పొడి విభూతిని లలాటం మీద పూసుకొని వెళ్ళవచ్చు. మృగముద్ర పట్టి బూడిద పెట్టుకోవలి. ఆవు పేడను బాగా కాల్చి పొడి చేసి తయారు చేసిన బూడిద,యజ్ఞంలో ధర్భలను కాల్చి చేసిన బూడిద శ్రేష్ఠమైనవి .

  6. 6.   తల్లిదండ్రులకి రోజుకి ఒక్కసారి మాత్రమే నమస్కారం చెయ్యాలి. శివాలయంలో నాలుగైదు సార్లు నమస్కారం చెయ్యాలి. సన్యాసికి నాలుగు మార్లు నమస్కారం చెయ్యలి. ఆలయంలో తప్పకుండా కోర్కెలు కోరాలి.

  7. 7.   శివుడికి పునః ప్రతిష్ఠ లేదు.శివలింగం అరిగిపోయి ఎంత చిన్నదైపోయినా దాన్నే పూజిస్తారు.

  8. 8.   ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడ్డ మొట్ట మొదటి పట్టణం -కాశీ నగరం. ప్రపంచమంతా లయమయ్యే సమయంలో కూడా మునిగిపోని ఎకైక నగరం కాశీ. వారణ,అశి అనే రెండు నదులు కలిసి ప్రవహించటం వలన అది వారణాశి అయ్యింది. విష్ణువు చెమటలో తడిసి మునిగిపోయిన భూమి కాశి.

  9. 9.   కేదారేశ్వర లింగస్వరూపాన్ని దర్శించినవారికి మోక్షం తధ్యం. నేరుగా కన్నుతో లింగాన్ని దర్శించకుండా ఒక రాగి కంకణంలో నుంచి చూడాలి.

  10. 10.   మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూంటాయి.

  11. 11.   నారద మహర్షి శాపం కారణంగా శ్రీమహావిష్ణువు రామావతారంలో భార్యావియోగం పొందవలసి వస్తుంది. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించిన నారదుడు, మన్మథున్ని కూడా జయించానని గొప్పలు పోవటంతో ఆయన్ను పరీక్షించటానికి మహావిష్ణువు ఒక నాటకమాడుతాడు. తన మాయతో కాశీరాజు కూతురుగా జగదేక మోహనాంగిని సృష్టించి, నారదుని కళ్ళలో ఆమె పడేలా చేస్తాడు. ఆమె అందానికి వివశుడైన నారదుడు, ఆమెను ఎలాగైనా పొందాలని నిశ్చయించుకుంటాడు.ఆమె జాతకం పరిశీలించి హరియే ఆమె భర్తవుతాడని గ్రహించి, విష్ణువును ప్రార్థించి, తనను హరిలాగే చెయ్యమంటాడు. హరి అంటే కోతి అని మరొక అర్థం కూడా ఉంది. నారాయణుడు చిరునవ్వుతో అంగీకరించి నారదున్ని తనలా మార్చివేసి ముఖాన్ని మాత్రం కోతిలా చేసేస్తాడు. కాశీరాజు కూతురు స్వయంవరానికి అట్టహాసంగా వెళ్ళిన నారదుడు, ఆమె తనను కాకుండా అసలు శ్రీమహావిష్ణువును పెళ్ళాడటంతో ముందు తెల్లబోయి తర్వాత నవ్వులపాలవుతాడు. మానవ జన్మనెత్తి భార్యావియోగం అనుభవించాలని విష్ణువుని ఆగ్రహంతో శపిస్తాడు.





2 comments

Post a Comment