దృశ్యాదృశ్యాలు




కాశంలో తారల వైపు చూసి
ఆశువుగా కవిత్వం చెప్పమన్నాడో మిత్రుడు


ఆకాశ నికుంజంలో
అందంగా విరిసిన జాజిమల్లి జాబిలైతే
విరిసీ విరియని మొగ్గలే తారలు
వాలిపోయే తుమ్మెదలే కరిమబ్బులు


కలువరేకుల నా చెలికన్నుల్లో
కొలువుదీరాయి నిండుపున్నిమలు
ఆకాశమా అసూయపడకు
అమావాస్యనిశి నాకిక లేదు !


వెన్నెలవాగులో
వ్యాహ్యాళికెళ్దాం సఖీ !
నెలవంక నావనెక్కి
నక్షత్ర సుమాలు  ఏరుకొంటూ..


ఈ చీకటి నీటిగుంతలో
ఏ చిన్నారి విడిచిన కాగితపు పడవలో ఈ తారలు
కాలం కెరటాలపై స్నిగ్ధంగా సోలిపోతూ
కూతురి బాల్యచేష్టల్ని కళ్ళెదుటే నిలుపుతున్నాయ్


కొట్టుకుపోయిన కొత్త తార్రోడ్డుపై
కకావికలైన గులకరాళ్ళ మధ్య
మూతబడని మ్యాన్‌హోల్‌లా మూగగా చంద్రుడు
దశాబ్దాల నీ ప్రగతికి దేశమా !
దారుణ ప్రతీకలివే !!


కుంభకోణాల కమురుతెట్టులో
వేగిపోతున్న వ్యంజన పదార్థాలు
మినుకుబిక్కుమంటూన్న ఈ మామూలు మనుషులు
నవ్వీ నంజుకునే నేతల పీతలే అన్ని వేపులా !


సమస్య ఉప్పెనలో సర్వం కోల్పోయి
కెరటాల మబ్బులకు కృంగీ ఎదురీదీ
శరణార్థియై తరలిపోతున్నాడు శుష్కచంద్రుడు
నక్షత్రసంతతిని నడిపించుకుంటూ 


విసిరేసిన పులి విస్తట్లో
విరిగిపోయిన చుక్కల పుల్లల మధ్య
వెలిసిపోయిన జాబిలిముద్దను చూసి
పెదవి తడుపుకున్నాడో పరమనిర్భాగ్యుడు


కాముకుడి కర్కశత్వానికి
కుమిలిపోతున్న కన్నెపిల్లలా
వొళ్ళంతా మరకలతో
వికృతంగా  రోదిస్తున్నది ఒంటరి రాత్రి !


చీకటి ఉరికొయ్యల క్రింద చివరి శ్వాస పీల్చి
చిరాయువులై వెల్గుతున్నారెందరో పుణ్యమూర్తులు
క్రాంతిరేఖల వారి మార్గమే
శాంతిపుంజాల భావి ఉషస్సులకు నాంది


విబేధాలు విస్మరించి
విషాదాలు పెల్లగించి
సౌహార్ద్రత పరిఢవిల్లి 
సర్వజనాళి ఏకమైతే
వాస్తవం కాదా వసుధైక కుటుంబం !
వాకిట్లో వెలిగించిన ప్రేమామృతదీపాలు కావా
వినువీధిలో తారాతోరణం !!


భావావేశం అందరిలో ఉంది
బ్రతుకులో తారతమ్యాలే
భావనలో ప్రతిఫలిస్తాయి
స్పందించే మనసుంటే
సాక్షత్కరించే దృశ్యాలెన్నెన్నో

(సారంగలో  ప్రచురితం )


2 comments

Post a Comment

గోదావరి యాత్ర -4 (గునుపూడి, పాలకొల్లు, అంతర్వేది, యానం)

మొదటి రోజు తూగోజి లోని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాం.

రెండవ రోజు పగోజి వంతు.

ముందు గునుపూడి, ఆ పై పాలకొల్లు, అంతర్వేది, వీలు కుదిరితే యానాం చుట్టిరావాలని నిర్ణయించుకున్నాం.

ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా మా పగోజి యాత్ర ప్రారంభమైంది. ధవళేశ్వరం ఒక చిన్న గ్రామం. రాజమండ్రికి ఎనిమిది కిలోమిటర్ల దూరంలో ఉంది. పరవళ్ళు తొక్కే ఆకాశగంగను తన జాటాజూటంలో బంధించి గర్వమడగించి భువిపైకి దించిన పరమశివునిలా, మిడిసిపడే ఉత్తుంగ గోదావరికి  సర్ అర్థర్ కాటన్ దొర ముకుతాడు వేసిందిక్కడే. 1852లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్టు తన నిర్దేశిత కాలపరిమితి- వందేళ్ళనూ  దిగ్విజయంగా పూర్తిచేసుకుని 160 సంవత్సరాలైనా ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. కరువు కాటకాలతో తల్లడిల్లిపోయి భుక్తి కోసం పిల్లల్ని అమ్ముకున్న ప్రజలకు కాటన్‌దొర దార్శనికత కడుపునిండా తిండి పెట్టింది. పరాయివాడైనా పరుల సంక్షేమం కోసం పాటుపడ్డాడు కాబట్టి  పట్టం కట్టి హృదయాల్లో పదిలంగా దాచుకున్నారు ప్రజలు. ఆ మాత్రం కృతజ్ఞత పాలకులకు కొరవడింది. ఆనకట్ట క్రిందే శిథిలావస్థలోనున్న కాటన్‌మ్యూజియం నిర్లక్ష్యానికి నిలువుటద్దం పడుతుంది.

తాడేపల్లిగూడేం నుంచి భీమవరం వెళ్ళే రోడ్డు ఘోరంగా ఉంది. భీమవరం వెళ్ళాలంటే నానా సాకులు చెప్పి మా డ్రైవరు ఎందుకు తప్పించుకోబోయాడో మాకప్పుడు అర్థమయ్యింది. కంకర తేలిపోయి గుంతలు పడిన రోడ్లపై గాల్లో తేలిపోతున్నట్లుగా వెళ్ళిపోతూ అంతరిక్షంలోని భారరహిత స్థితిని పైసా ఖర్చు లేకుండా ప్రత్యక్షంగా అనుభవిస్తారు ప్రయాణికులు. వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకొనే మా చిత్తూరు జిల్లాలో రోడ్లు ఇంతకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. పిల్లకాలువ పట్టీలు పాదాలకు తొడుక్కొని పరవశంతో నర్తించే 




కన్నెపైర్లే లేకపోతే భీమవరం ప్రయాణం చప్పగా ఉండేది. త్యాగరాజుకు శ్రీరాముడు తప్ప ప్రాపంచిక సుఖాలేవీ పట్టనట్లు, మీలోని సౌందర్య పిపాస మీ సుఖలాలసను నియంత్రించగలిగితే... ఊళ్ళు దాటి వెళ్తూంటే  కలువలతో కళకళలాడే చెరువులను, మొపెడ్ల పై అరటిగెలలు రెండువైపులా వేళ్ళాడదీసుకుని బాట మీద సాగిపోయే వాహనదారులను, గోచి తప్ప ఒంటి మీద మరో వస్త్రం లేకపోయినా ప్రపంచంతో పనిలేనట్లు పరిశ్రమించే రైతులను చూస్తూ రోడ్ల దుస్థితి లాంటి ప్రాపంచిక కష్టాలు మరచిపోయి తాదాత్య్మంతో సాగిపోవచ్చు. కోట్ల విలువ చేసే భూములున్నా సాధారణ జీవితం గడపటానికే ఇక్కడి ప్రజలు మొగ్గు చూపుతారని వాళ్ళ ఆహార్యం చెప్పకనే చెబుతుంది. గోదావరి జిల్లాల ప్రజలు మాటలంటే చెవికోసుకుంటారని, అనుబంధాలకు ప్రాణమిస్తారని, తమ శైలికి భిన్నమైన ఇతర జిల్లాల వాళ్ళతో వాళ్ళు సులభంగా సంబంధాలు ఏర్పరుచుకోలేరని చెప్పాడు డ్రైవరు. ఆ మాట నిజమేననిపించింది.


గునుపూడి సోమేశ్వరాలయం


పరమశివుడికున్న అనేక నామాల్లో భీమ ఒకటి. ఆ పేరు మీదనే ఒక్కప్పుడు ఈ ప్రాంతం భీమపురంగా పిలవబడేదని, కాలక్రమేణా అదే భీమవరంగా మారిందని చెబుతారు. భీమవరం గురుంచి మా స్నేహితులు గొప్పగా చెప్పారు కానీ నాకదేమీ కనిపించలేదు. బహుశా మేమెంచుకున్న మార్గం సరికాదేమో.  అశ్వారూఢుడైన సర్ అర్థర్ కాటన్, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దాటుకుని మావుళ్ళమ్మ గుడి మీదుగా ఊళ్ళోకి వెళ్తే రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మరో దారి చూపించారు. ఇరుకు రోడ్ల మీద  నేర్పుగా వాహనాన్ని నడుపుతూ గునుపూడిలోని సోమేశ్వరాలయం చేర్చాడు డ్రైవరు.


దక్షారామం, కుమారారామాలలోని లింగస్వరూపాలతో పోల్చితే సోమారామంలోని లింగస్వరూపం చిన్నది. చంద్రుడు ప్రతిష్టించి పూజించిన లింగం కాబట్టి సోమేశ్వరుడన్నారు. దానికి తగ్గట్లుగానే పౌర్ణమి నాడు 



శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూ నేత్రానందం కలిగిస్తారు స్వామి వారు. దేవాలయానికి  అభిముఖంగానున్న 
సోమకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. దేశంలో మరో శివాలయంలోనూ లేని విధంగా, ఆలయానికి ఎదురుగా ఎత్తైన స్తంభం మీద కూర్చున్న నందీశ్వరుడూ ఇక్కడే కనిపిస్తాడు. స్వామి వారి ఆలయంపైనే అన్నాపూర్ణాదేవి కొలువై ఉండటం మరో విశేషం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్థన స్వామి.

పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి


సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ప్రతిష్టించి పూజించిన లింగం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు. పాలకొల్లును పూర్వం క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురం అనే పేర్లతో పిలిచేవారట. ఈ క్షేత్రం మీద రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

శివభక్తాగ్రేసరుడైన వ్యాఘ్రపాద మహర్షి కుమారుడు ఉపమన్యుడు. బాల్యంలో ఆయనోసారి మామగారింటికి వెళ్ళి అక్కడ ఆవుపాల మాధుర్యం చవిచూసి, తిరిగి వచ్చాక తనకు రోజూ ఆవుపాలే కావాలని మారం చేస్తూంటే ఆయన తల్లి పేదరికంతో కలిగిన తన ఆశక్తతను తెలియజేసి, చరాచర సృష్టికి మూలాధారుడైన పరమేశ్వరున్నే ప్రార్థించమని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. తల్లి ఉద్బోధతో ప్రభావితుడైన ఉపమన్యుడు హిమాలయాలకు వెళ్ళి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి తదేక దీక్షతో తపమాచరిస్తూంటే దేవతలే ఆశ్చర్యపోయారు. ఉపమన్యుడి భక్తితత్పరతను పరీక్షించదలచిన పార్వతీ పరమేశ్వరులు శచీంద్రులలా రూపాలు మార్చుకుని, ఐరావతంగా మారిన నందీశ్వరున్ని అధిరోహించి, ప్రమథ గణాలు దేవతా స్వరూపాలై వెంటరాగా  పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యారు. భోళాశంకరున్ని నమ్మి ఇంత బూది మిగుల్చుకోవటం కంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమరేంద్రున్ని కొలవటమే ఉత్తమమని అతని మనస్సు మార్చే ప్రయత్నం చేస్తారు. ఇంత తపస్సు చేసి వినరాని మాటలు వినాల్సి వచ్చినందుకు ఉపమన్యుడు బాధపడిపోతాడు. శివ నింద చేసినందుకు ఇంద్రుడిగా భావించిన శివుడిపై అఘోరాస్త్రం ప్రయోగించి ఆత్మాహుతికి సిద్ధపడతాడు. శివపార్వతులు సంతోషించి తమ నిజస్వరూపాలతో ప్రత్యక్షమై ఆ బాలున్ని  శాంతపరచి వరం కోరుకోమంటారు. ఉపమన్యుడు ఆనందాతిశయంతో పరమేశ్వరున్ని పరిపరివిధాలా ప్రార్థించి తన మనస్సుకు శివ వైక్లభ్యం కలగని స్థితిని, నిత్యం శివుడి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, తన వంశంలో ఎవరికీ ఆవు పాలకు కరువు రాని అదృష్టాన్ని కోరుకుంటాడు. కోరుకున్న వరాలతో పాటూ జ్ఞానాన్ని, గణాధిపత్యాన్ని ప్రసాదించి తన పుత్రుడిగా స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి నిత్యయవ్వనాన్ని, క్షీరసాగరాన్ని కరుణిస్తుంది. అలా ఈ క్షేత్రానికి ఉపమన్యుపురం, పాలకొలను, క్షీరపురి అనే పేర్లు వచ్చాయి.

పరమేశ్వర కృపతో శ్రీమహావిష్ణువు సుదర్శనచక్రం పొందిన క్షేత్రం ఇదేనని, త్రేతాయుగంలో సీతారాములు కొలిచిన లింగం కాబట్టి రామలింగేశ్వరుడయ్యాడని ఇంకొన్ని గాథలు చెబుతాయి. కాశిలో ఏడాదిపాటూ భక్తితో గడిపితే కలిగే పుణ్యం ఇక్కడ ఒక్క నిద్రతో కలుగుతుందని క్షేత్ర ప్రాశస్త్యం చెబుతోంది.

అల్లువారి గీతా థియేటర్‌ని, అల్లురామలింగయ్య విగ్రహాన్ని దాటుకుని ఆలయాన్ని చేరుకున్నాం. ఇతర దేవాలయాలకున్నంత విశాలమైన ఆవరణ ఈ ఆలయానికి లేదు. ఇరుకు సందులో ఉంది. వాహానాలన్నీ ఆలయానికి ఆమడ దూరంలో ఆపి ఉంచి దర్శనానికి వెళ్ళాలి.



ఆలయంలోకి ఆడుగుపెట్టగానే ధ్వజస్తంభం దగ్గర తపోదీక్షలో ఉన్న ఈశ్వర స్వరూపం ముచ్చటగొలుపుతుంది. సోమేశ్వరలింగంలా క్షీరారామలింగం కూడా చిన్నది. లింగం మొనదేలి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కుమారస్వామి బేధించిన లింగానికి ఇది శిరోభాగమని భక్తుల విశ్వాసం. ఆలయంలోపలి గోడలపై చెక్కిన వివిధ దేవతా మూర్తుల శిల్పాలు, పురాణ ఘట్టాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రానికీ జనార్థనస్వామే క్షేత్రపాలకుడు.

ఇక్కడితో మా పంచారామ యాత్ర పూర్తయ్యింది.

తరువాత మజిలీ అంతర్వేది.


అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి



పాలకొల్లు నుంచి అంతర్వేది వెళ్ళే మార్గం మనోహరంగా ఉంది. చించినాడ బ్రిడ్జి దగ్గర గోదావరి చిద్విలాసాలు చూడాల్సిందే. దిండి మీదుగా వెళ్తూంటే ఎటుచూసినా చేపల చెరువులు, కొబ్బరితోటలు లేదా పంటపొలాలూను. పోనుపోను రోడ్లు సన్నబడిపోయి, కారులోంచి క్రిందకు దిగి  ఏమరుపాటున  కుడివైపుకో ఎడమవైపుకో రెండడుగులు వేస్తే పిల్లకాలువలో పడిపోయేలా తయారవుతుంది పరిస్థితి. వన్వే ట్రాఫిక్ అన్నమాట. రోడ్డుకు రెండువైపులా కాలువగట్ల మీద స్థిరనివాసలేర్పరుచుకున్న మనుష్యుల్ని చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఇళ్ళకు రోడ్డుకు మధ్య కొబ్బరిబోదెలే వారధులు. సూర్యుడు కరుణించినంతవరకూ వీళ్ళ సుఖజీవనానికి ఢోకా లేదు. ఒక్క రెండు పదున్ల వానపడితే మాత్రం బిక్కు బిక్కుమంటూ గడపాల్సిందే. కాలువలు పొంగెత్తి ఇళ్ళను ముంచెత్తక మానవు. వర్షాకాలంలో ఇక సరేసరి. భావావేశం పేరిట పైత్యం వ్రాసే నాబోటి వాడెవడైనా ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి వివశుడైపోయి ఒక ఇల్లు కట్టుకుని, రెండు కొబ్బరిచెట్ల మధ్య ఊయల బిగించి, కొబ్బరాకుల కిటికీల్లోంచి ఆకాశంవైపు చూస్తూ ఆలోచనా స్రవంతిలో జీవితాన్ని మమేకం చేద్దామని ఆశపడితే ఒక్క నిమిషం మళ్ళీ పునరాలోచించాల్సి ఉంటుంది.

అంతర్వేది చేరేసరికి మధ్యాహ్నమైంది. సముద్రతీరం కాబట్టి ఇసుకమేటలు ఎక్కువ పచ్చదనం తక్కువ. ఊరు కూడా చాలా చిన్నది. గుడి, గుడిదగ్గర్లో కొన్ని ఇళ్ళు..అంతే.

విశాలమైన అంతర్వేది ఆలయం నవనారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నృసింహుడు పశ్చిమాభిముఖుడై భక్తులకు దర్శనమివ్వడం విశేషం.ఇక్కడే వశిష్టగోదావరి నది సముద్రంలో కలుస్తుంది. వశిష్టగోదావరికి, సముద్రానికి మధ్యనున్న ఈ స్థలంలోనే పూర్వం బ్రహ్మదేవుడు వేదిక నిర్మించి రుద్రయాగం చేశాడని ఆనాటి నుండి ఈ క్షేత్రం అంతర్వేదిగా పిలువబడుతోందని పురాణం చెబుతోంది. ఆనాడు బ్రహ్మ ప్రతిష్ఠించిన నీలకంఠేశ్వరుడే ఇక్కడి క్షేత్రపాలకుడు.






మరో గాథ ప్రకారం హిరణ్యుక్షుడి కొడుకైన రక్తవిలోచనుడనే రాక్షసుడు వరగర్వంతో వశిష్టాశ్రమంపై దాడి చేసి అందరిని చంపి తినేయటంతో ఆయన కలత చెంది స్థితికారకుడైన శ్రీమన్నారాయణున్ని శరణు కోరాడు. శ్రీహరి అభయమిచ్చి నృసింహావతారియై వచ్చి రక్తవిలోచనుడి శిరస్సును సుదర్శన చక్రంతో ఖండించబోతే, ఆశ్చర్యంగా క్రింద పడిన ప్రతి రక్తపుబొట్టు నుండి మరో రక్తవిలోచనుడు ఉద్భవించి ఆయుధాలు విసరడం ప్రారంభించాడు. నృసింహుడు మహామాయను ప్రేరేపిస్తే  ఆమె అశ్వారూఢయై వచ్చి ఆ రాక్షసుడి రక్తం ఒక్క చుక్క నేలపాలవకుండా మొత్తం తాగేసి సంహారానికి సహకరించింది. వశిష్ట మహర్షి కోరిక మేరకు లక్ష్మీ నరసింహుడిగా వెలసి ఆనాటి నుండి పూజలందుకొంటున్నాడు మహావిష్ణువు. మహామాయ  
అశ్వారూఢాంబికగా ,గుర్రాలక్కగా పూజలందుకుంటోంది. ఆమె ఆనాడు తాగి విడిచిన రక్తం రక్తకుల్యానదిగా పిలవబడుతోంది.  ఆలయానికి ఓవైపు ఎర్రటివర్ణంతో ప్రవహిస్తున్న నది అదేనని ఒక విశ్వాసం. రాక్షస సంహారానంతరం నృసింహుడు సుదర్శనచక్రం కడిగిన తీర్థం చక్రతీర్థంగా ప్రఖ్యాతికెక్కింది.

దైవదర్శనం పూర్తి చేసుకుని యథాప్రకారం గుడిలో జరిగే అన్నదానంతో మా జఠరాగ్నిని శాంతపరిచి ఆలయం వెలుపలికి వస్తే వశిష్టగోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి తీసుకెళ్తామంటూ కొందరు పడవలవాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. మిట్టమధ్యాహ్నం సముద్రంలోకి వెళ్ళడమా అని మేం సందేహిస్తూంటే మా డ్రైవరు అవసరం లేదు ఫోమ్మంటూ వాళ్ళను కసురుకున్నాడు. కమీషన్ల కోసం కక్కుర్తిపడుతున్నావంటూ వాళ్ళు మా డ్రైవరు మీద విరుచుకుపడ్డారు. అతని బాధ అతనిది. మేం ఇప్పుడు  సముద్రంలోకి వెళ్తే  తిరిగొచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అప్పుడు యానాం వెళ్ళడం కష్టమని అతని ఉద్దేశ్యం. తనే అన్ని ప్రదేశాలూ చూపిస్తానని మమ్మల్ని ఒప్పించి అంతర్వేది బీచ్‌ని, తీరం నుంచే దూరంగా కనిపిస్తున్న సంగమ స్థానాన్ని చూపించాడు. అంతర్వేది బీచ్ అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. సునామీల సమయంలో కోతకు గురైన తీరప్రాంతాన్ని గమనిస్తే ఆ ఊళ్ళో ఎందుకు అంత తక్కువమంది నివసిస్తున్నారో అవగతమైంది.


యానాం

అంతర్వేది నుంచి రాజోలు, అమలాపురం వైపుగా యానాం వెళ్ళాం. అటు కోనసీమను ఇటు యానాంను కలుపుతూ గోదావరి నది పై 110 కోట్లతో నిర్మించిన బాలయోగి వారధి ఒక అద్భుతం. బ్రిడ్జి పైనుంచి వెళ్తూ పరవళ్ళు తొక్కుతున్న గోదావరి నదిని పరికిస్తే సంభ్రమాశ్చర్యాలతో నోరుమూతబడ్డం ఖాయం. దివంగత స్పీకర్ బాలయోగి ఈ వారధి ద్వారా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. భౌగోళికంగా గోదావరిజిల్లాలో ఉన్నా యానాం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోకి వస్తుంది. విశాలమైన వీధులు,  పరిశుభ్రత, ప్రజల జీవన విధానం ముచ్చటగొలుపుతుంది. యానాం బీచ్ దగ్గరున్న పొడవైన శివలింగం చూపరులని ఆకర్షిస్తుంది. ప్రక్కనే చేపల మార్కెట్. చుట్టుప్రక్కలా అనేక లంక గ్రామాలు, చిన్న చిన్న ద్వీపాలు. ఓపిగ్గా చూడాలంటే ఒక్కరోజైనా కావల్సిందే.






కాసేపు బీచ్‌లో గడిపి అస్తమిస్తున్న సంధ్యవెలుగులతో ఆత్మశక్తిని రగలించుకొని తిరిగి రాజమండ్రి ప్రయాణమయ్యాం. వస్తూ వస్తూ ఒక చిన్న పల్లెటూరు దగ్గర రోడ్డు ప్రక్కన్నే చేస్తున్న వేడి వేడి మిరపకాయబజ్జీలు తినేసరికి ప్రాణం లేచివచ్చినట్లయ్యింది. బెంగుళూరులో ఇలా ఘాటుగా మసాలా దట్టించి, మధ్యలో ఉల్లిపాయలు వేసి,నిమ్మరసం పిండి మిరపకాయబజ్జీలు వడ్డించే బజ్జీకొట్ల కోసం ఎంత వెదికానో, ఎంత 
వెదుకుతున్నానో.


-(సశేషం)





1 comment

Post a Comment

గోదావరి యాత్ర-3 (దక్షారామం,సామర్లకోట, అన్నవరం, పీఠాపురం, కాకినాడ)

దక్షారామం


దాక్షారామం గురుంచి చెప్పుకునే ముందు పంచారామాల గురించి తెలుసుకోవాలి.

తారకాసుర సంహార సమయంలో అతని గొంతులో ఉన్న తన తండ్రి పరమశివుడి ఆత్మలింగాన్ని ఆగ్నేయాస్త్రంతో బేధిస్తాడు కార్తికేయుడు. ఆత్మలింగం ఐదు ముక్కలైపోయి ఒక్కో ముక్క ఒక్కో క్షేత్రంలో పడుతుంది. ముక్కలైన లింగాలు ఆకర్షణాశక్తితో తిరిగి ఏకమవ్వాలని, పెరిగిపోయి ఆకాశం వైపు సాగిపోతుంటే, దాన్ని నిలువరించటానికి  సూర్య చంద్రులు, కార్తికేయుడు, ఇంద్రుడు, మహావిష్ణువు ఆ లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అలా ఏర్పడినవే పంచారామ క్షేత్రాలు - అమరావతి, దక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, గునుపూడి. అమరావతి దూరమైపోతుంది కాబట్టి మిగతా నాలుగు ఆరామాలు దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం. 

దక్షారామానికి విశేషమైన పురాణ ప్రాశస్త్యంఉంది. ఇది పంచారామాలలో ఒకటి మాత్రమే కాదు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కూడా. దక్షప్రజాపతి నిరీశ్వరయాగం చేసి నిహతుడై మేకముఖంతో పునర్జీవితుడైన స్థలం ఆలయానికి దగ్గర్లోనే ఉంది. సతీవియోగంతో ఖిన్నుడైన పరమేశ్వరుడు  ఆగ్రహంతో ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేస్తూంటే  అఖిలలోకాలు గడగడలాడాయి. అందరూ స్థితికారకుడైన మహావిష్ణువు శరణు కోరితే, ఆయన శివున్ని శాంతపరచడానికి తన సుదర్శన చక్రం ప్రయోగించి సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు. అలా ఖండింపబడ్డ శరీరభాగాలు పద్దెనిమిదిచోట్ల పడి అవే అష్టాదశ శక్తిపీఠాలయ్యాయి. ఇక్కడ అమ్మవారి నాభి పడింది. ఆమె మాణిక్యాంబగా కొలువై ఉంది. సూర్యభగవానుడు పూజించిన ఈ లింగానికి తూర్పు చాళుక్య భీముడు ఆలయం నిర్మించాడు. అందుకే భీమేశ్వరాలయం అయ్యింది. తనకు తన శిష్య పరివారానికి భిక్ష దొరకలేదన్న కారణంతో కాశీ నగరాన్ని శపించబోయి పరమేశ్వరుని ఆగ్రహానికి గురై వెలేయబడ్డ వ్యాస మహర్షి ఇక్కడే భీమేశ్వర-మాణిక్యాంబ సేవలో తరించి ఉపశమనం పొందారు.





ఆలయ ప్రవేశం చేయబోయేంతలో ద్వారం వద్దే బ్రాహ్మణుల గుంపు ఒకటి మమ్మల్ని  అటకాయించింది. వాళ్ళలో చొరవ కలిగిన బ్రాహ్మణుడొకరు ఆలయ విశేషాలన్నీ విపులంగా చెబుతామని,మరే క్షేత్రంలోనూ ఇంత వివరంగా చెప్పే వాళ్ళు దొరకరని,విశేషాలు చెప్పినందుకు ప్రతిగా భక్తులు తమకు తోచిన సొమ్ము  బ్రాహ్మణ సంఘానికి దానం చెయ్యాల్సి ఉంటుందని, ఆ ధనాన్ని తాము పేద బ్రాహ్మణ సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పాడు. ఇదేదో ఉభయ తారకంగా ఉందని, చొరవగా మాట్లాడిన బ్రాహ్మణున్నే మేం  కుదుర్చుకున్నాం.

ఆ బ్రహ్మణుడు నిజమే చెప్పాడని తర్వాత తెలిసింది. అమరావతి సంగతి తెలియదు గానీ, మిగతా పంచారామాల్లో ఇలా క్షేత్ర మహత్యాన్ని, విశేషాలని చెప్పే వాళ్ళు నిజంగానే లేరు. పైగా ఆయన స్వస్థలం మా ఊరి దగ్గరే - శ్రీకాళహస్తట. చాలా ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారట. ఎంతో ఓపికతో ఆలయం అంతా కలయతిప్పి సంగతులన్నీ తెలియజేశారు.

దక్షారామం భోగస్థానం. ఇక్కడికెవరైనా అనుకోకుండా వస్తారు కానీ ముందే ప్రణాళికలు వేసుకొని రావడం జరగదట. రావణ సంహారానంతరం బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకొనే ప్రయత్నంలో సాక్షాత్తూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన లక్ష్మీనారాయణుడు ఇక్కడి  క్షేత్రపాలకుడు. ఆలయంలోపల ఓ వైపు గర్భాలయం నమునాలో ఏకశిలతో చెక్కిన మరుగుజ్జు కట్టడం ఉంది. అది నమునా కాదని, నమునాలు కట్టి నిర్మాణాలు చేసేది మానవులు కాని దేవతలు కారని, అది భవిష్యత్తులో పాపాలు పెరిగి మనుష్యులు అంగుష్ఠ మాత్రులైనప్పుడు వారి సౌకర్యార్థం నిర్మించిన ఆలయమని చెప్పారు.





గర్భాలయానికి అభిముఖంగా ఠీవిగా నిలబడ్డ నిలువెత్తు నందీశ్వరుడు అబ్బుర పరుస్తాడు. త్రివిక్రముడైన భీమేశ్వరుడు ఇక్కడ తన  ధవళ  స్వరూపాన్ని తొమ్మిడడుగులకు కుదించుకుని రెండంతస్థులు ఆక్రమించి  భక్తులను అలౌకికానుభూతికి గురి చేస్తాడు. ప్రాతఃకాలంలో ఉషాకిరణాలు స్వామి వారిపై పడినప్పుడు మరింత వైభవంగా ఉంటుందట. క్రింద పానవట్టం దర్శించుకొని  మెట్లెక్కి పైకి వెళ్ళి పూర్తి లింగస్వరూపాన్ని దర్శించుకోవాలి. లింగం పైనున్న చిహ్నాలు కుమారస్వామి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం గుర్తులని కొందరు, కిరాతుని రూపంలో అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు ధరించిన పులిచర్మం గుర్తులని ఇంకొందరు అంటారు.  భీమేశ్వరుని ప్రక్కనే సతీదేవి కొలువై ఉంటుంది. గర్భాలయం లోపల చీకటిగా ఉంటుంది. పూర్వం వెలుతురు కోసం గోడలకు వజ్రాలు,మణులు తాపించారట. ఔరంగజేబ్ దండయాత్రల కాలంలో ఇతరుల పాలవడం ఇష్టం లేక వాటంత అవే రాళ్ళుగా మారిపోయాయని గోడలపై పొడుచుకొచ్చిన రాళ్ళను చూపించి చెబుతారు.




మాణిక్యాంబ అమ్మవారు వామాచార స్వరూపిణి. ఎడమవైపు చూస్తూంటారు. హిమవంతుడు-మేనకాదేవిల ముద్దులపట్టి కనుక పార్వతీదేవికి మైనాకాంబ అని మరో పేరుంది. అదే మాణిక్యాంబగా రూపాంతరం చెందింది. అమ్మవారి స్వరూపం క్రింద శ్రీచక్రాన్ని నిక్షిప్తం చేశారు. అమ్మవారు స్వామివారు సమాన స్థాయిలో వినుతికెక్కిన ఆలయాల్లో ఇదొకటి. మిగతా రెండు ఆలయాలు- కాశీ (అన్నపూర్ణ,విశ్వనాథుడు), శ్రీశైలం (భ్రమరాంబ,మల్లికార్జునుడు).శ్రీనాథ కవిసార్వభౌముని భీమఖండం దాక్షారామ వైభవాన్ని తెలియజేస్తుంది.

దర్శనం పూర్తయ్యాక మాకు గైడ్‌గా వ్యవరించిన బ్రాహ్మణుడికి సంతోషంతో కొంత సొమ్ము ముట్టజెప్పబోయాం. ఆయన తనకొద్దొంటూ యువకుడైన మరో బ్రాహ్మణున్ని చూపించి ఆయనకివ్వమన్నారు. ఆ యువకుడికి మేమిచ్చిన మొత్తం నచ్చలేదు. సొమ్ము పుచ్చుకోకుండా పెదవి విరిచి ఇక్కడికొచ్చే భక్తులు కనీసం మూడువేలకు తక్కువ కాకుండా విరాళాలు ఇస్తారని అలకబూనాడు. మేమంత తూగలేమని చెప్పాం. అతను వినలేదు. చివరికి మా గైడ్ ఏమనుకున్నాడో మరి అతనికి నచ్చజెప్పి సొమ్ము స్వీకరించేలా చేశాడు
.

సామర్లకోట కుమారారామ భీమేశ్వరాలయం

శివపుత్రుడైన కుమారస్వామి సేవించిన లింగం కాబట్టి కుమారారామ భీమేశ్వరుడంటారు. ఈ ఆలయం దక్షారామాన్ని పోలి ఉంటుంది. దక్షారామంలో లాగే ఇక్కడున్న శివలింగం కూడా పొడుగ్గా ధవళ కాంతులతో మెరిసిపోతూ రెండంతస్థులు ఆక్రమించి ఉంటుంది. పంచారామాల్లోని మిగతా లింగాలు భోగప్రదాయకమైనవైతే ఇది యోగకారక లింగం. అమ్మవారి పేరు బాలాత్రిపురసుందరి. చైత్ర  వైశాఖ మాసాలలో సహస్రకరములతో  సూర్యభగవానుడు  పగటి పూట స్వామివారి పాదాలకు, సాయంకాలం అమ్మవారి పాదాలకు ప్రణమిల్లుతాడని ప్రతీతి. 






సామర్లకోట పూర్వ నామధేయం స్వాములకోట లేదా శ్యామల కోట అట. పూర్వం వైష్ణవ స్వాములు ఎక్కువగా నివసించిన స్థలమని ఓ కథనం చెబితే, శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోట ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని మరో కథనం చెబుతుంది.  మా దర్శనం పూర్తైన వెంటనే  మధ్యహ్నమయ్యిందని గుడి మూసేయటంతో అదృష్టం కోద్దీ దర్శనం లభించిందనే చెప్పాలి.

సామర్లకోట నుంచి పీఠాపురం వెళ్ళేసరికి పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వర స్వామి వార్ల ఆలయం ముసేశారు. పునర్దర్శనం మధ్యహ్నం మూడున్నర తర్వాతే అని తెలిసింది. భోజనాల కోసం వీధులు వెదుక్కుని హోటళ్ళ చుట్టూ తిరగటం కంటే దేవాలయాల్లో జరిగే ఉచిత నిత్యాన్నదానంతో కడుపు నింపుకుంటే ఇటు పుణ్యం అటు సమయం కలిసొస్తుందని మాకు ముందే చెప్పాడు మా డ్రైవరు. దర్శనానికి విరామమిచ్చినా భోజనాలు వడ్డిస్తూండటం చేత గుడి తలుపులు తెరిచే ఉంచారు.ఆకలి రుచెరగదంటారు కదా. అందరం భోంచేసి, వేడి వేడి అన్నం తినటం చేత, ఉక్కబోత చేత పట్టిన చెమటని తుడుచుకుంటూ కాసేపు ఆలయ మండపంలో విశ్రాంతి తీసుకొని, మరో రెండు గంటలు ఏం చెయ్యాలో తెలియక తర్జనభర్జన పడి చివరికి అన్నవరం వెళ్ళిరావాలని నిర్ణయించుకున్నాం.

అన్నవరం


పంపానదీ తీరాన రత్నగిరిపై కొలువైన భక్తవరదుడు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. మేరువు కుమారులు భధ్రుడు,రత్నాకరుడు. ఘోర తపస్సు చేసి శ్రీరామచంద్రున్ని తనపై కొలువుంచుకునే వరం పొందిన అన్నయ్యను చూసి, రత్నాకరుడూ స్పూర్తిని పొందాడు. తదేక దీక్షతో శ్రీమహావిష్ణువును మెప్పించి త్రిమూర్త్యాత్మకమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణుని రూపంలో స్వామివారిని మోసే భాగ్యం పొందాడు.

స్వామివారి స్వరూపం అనేక విశేషాలకు ఆలవాలం. మూలవిరాట్టు క్రిందిభాగంలో ప్రతిష్టించిన నారాయణయంత్రం సర్వశక్తిమంతమైనది. అది బ్రహ్మస్వరూపం. పంచాయతనానికి గుర్తుగా ఆయనకు నలువైపులా వినాయకుడు, బాలాత్రిపురసుందరి, మహేశ్వరుడు, సూర్యనారాయణుడు కొలువై ఉంటారు. యంత్రం మీదుగా లింగాకృతిలో పైకి లేచిన మధ్యభాగం పరమశివుడికి ప్రతీక. ఊర్థ్వభాగంలో విష్ణు స్వరూపమై ధనుర్బాణాలు, వంపులు తిరిగిన



మీసకట్టుతో శ్రీ సత్యనారాయణుడు కనువిందు చేస్తాడు. స్వామివారికి ఎడమవైపు అనంతలక్ష్మి అమ్మవారు,కుడివైపున మహేశ్వరుడు నెలవై ఉంటారు. సృష్టి, స్థితి, లయకారకులను ముగ్గురినీ సూచించే స్వరూపం కనుకనే త్రిమూర్త్యాత్మకం  అన్నారు.  బ్రహ్మకు పూజలు జరిగే అతికొద్ది దేవాలయల్లో ఇదొకటి.  సీతారాములు ఈ ఆలయానికి క్షేత్రపాలకులు. దగ్గర్లోనే కొలువై ఉన్న వనదుర్గ ఆలయం మహామహిమాన్వితమైనది. ఆమె రాత్రి పూట నగర సంచారం చేస్తూ ప్రజలను రక్షిస్తూంటుందని ఓ నమ్మకం.

స్వయంభువుగా వెలసిన సత్యదేవుడు పూర్వం ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మణుడి కలలో కనబడి తను రత్నగిరిపై వెలసి ఉన్నానని, తనను ప్రతిష్ఠించి శాస్త్రప్రకారం తనకు పూజాదులు నిర్వహించమని ఆదేశించారు .బ్రాహ్మణుడి స్వప్న వృత్తాంతం తెలుసుకున్న ఆ ఊరి జమిందారు గారు గ్రామస్తుల సాయంతో వెదికించి, స్వామివారిని గుర్తించి, వెలికితీయించి, ప్రతిష్ఠించి పూజాదులు ప్రారంభించారు. అన్న (అడిగిన) వరాలను తీర్చే క్షేత్రం కనుక అన్నవరమైంది.

అన్నవరం చిన్న టౌన్. క్షేత్రం, క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రీకుల కోసం వెలసిన హోటళ్ళు తప్ప పెద్ద వూరేం లేదు. భక్తులు వెళ్ళేందుకు ఉన్న నడకదారిని చూసి శంకరాభరణం సినిమాలోనున్న చంద్రమోహన్, రాజ్యలక్ష్మిల సన్నివేశం గుర్తొచ్చింది. కొండపైకి ప్రయాణం తిరుమల ఘాట్‌రోడ్లను తలపించింది. వాహనాలను నేరుగా గుడి వెనుక భాగం వరకు తీసుకువెళ్ళచ్చు కాబట్టి వయస్సుమీదపడినవాళ్ళు తిరుమలోలా ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేదు. భక్తుల రద్దీ లేకపోవటం చేత పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది.







వైష్ణవులు,శైవులు అన్న భేదం లేకుండా అన్ని విశ్వాసాలవాళ్ళు కొలిచే దైవం శ్రీ సత్యనారాయణస్వామి. గోధుమఊక, ఏలకులు, పచ్చకర్పూరం, పాలు, నెయ్యి మొదలైన పదార్థాలతో  చేసిన ప్రసాదం స్వామివారికి ప్రీతిపాత్రం. ఆలయంలో భక్తులు వ్రతాలు చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ఘాట్‌రోడ్ మీదుగా క్రిందకు దిగుతూంటే ప్రశాంతంగా ప్రవహిస్తున్న పంపానది  కాసేపు తన అందచందాలతో కట్టిపడేసింది.



పీఠాపురం (పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం) 


పీఠాపురానికి మూడు ప్రత్యేకతలున్నాయి.

మొదటిది- దీన్ని పాదగయ క్షేత్రం అంటారు. ఇక్కడ పరమశివుడు కుక్కుటేశ్వర స్వామి రూపంలో పూజలందుకుంటున్నాడు. కుక్కుటం అంటే కోడి. పూర్వం గయాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి శ్రీమహావిష్ణువును మెప్పించి ఒక విచిత్రమైన వరం పొందాడు. భూప్రపంచంలో తనను మించిన పవిత్రమైన ప్రాణి, తన శరీరాన్ని మించిన పవిత్రమైన స్థలం మరెక్కడా ఉండకూడదని, తనను ఎవరు దర్శించినా, స్పృశించినా వాళ్ళ పాపం తొలగిపోయి పునీతులవ్వాలని వరం పొందాడు. దీంతో ఇంద్రాది దేవతలకు కొత్త చిక్కు వచ్చి పడింది. భూలోకంలో పాపుల సంఖ్య నానాటికీ క్షీణించి సకల ప్రాణులతో స్వర్గం నిండిపోతూండటంతో వాళ్ళు తలలు పట్టుకున్నారు. త్రిమూర్తులను శరణు వేడారు. వాళ్ళు చిరునవ్వు నవ్వి బ్రాహ్మణ రూపాలు ధరించి గయాసురున్ని సమీపించారు. తామొక దివ్యయజ్ఞం తలపెడుతున్నామని అయితే దానికి అనువైన పవిత్ర స్థలం గయాసురుని శరీరం తప్ప మరొకటి లేదని, ఏడు రోజులపాటు తమ యజ్ఞానికి సహకరించాలని కోరారు.

గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని భారీగా విస్తరింపజేశాడు. త్రిమూర్తులు అతని శరీరంపై కూర్చుని యజ్ఞం ప్రారంభించారు. వేయినాల్కలలో ఎగిసిపడుతున్న యజ్ఞాగ్నిని భరిస్తూ కదలకుండా పడుకుని కోడికూతతో రోజులు లెక్కపెట్టుకొంటూ ఆరురోజులు నెట్టుకొచ్చాడు గయాసురుడు. ఏడవరోజు సమీపిస్తూండటంతో పరమశివుడు ఇక లాభం లేదని కుక్కుట రూపం ధరించి ముందుగానే కూతపెట్టాడు. గడువైపోయిందని గయాసురుడు తన దేహాన్ని కదిలించేసరికి యజ్ఞానికి విఘ్నం కలిగింది. ఏడురోజులపాటూ యజ్ఞాగ్ని భరించలేనివాడివి ఇతరులపాపాలు ఎలా భరించగలవని ప్రశ్నిస్తారు బ్రాహ్మణులు. యజ్ఞానికి ఆటంకం కలిగించావు కనుక సంహారం తప్పదంటే, వచ్చినవారు త్రిమూర్తులే అని గ్రహించిన  గయాసురుడు తన దేహానికి పూజార్హత కలిగించమని వేడుకున్నాడు. అలా


గయాసురుని శిరోభాగం (బుద్ధగయ-బీహార్), నాభి (జాజ్‌పూర్-ఒరిస్సా), పాదాలు (పీఠాపురం) పావనమయ్యాయి. పరమశివుడే ఇక్కడే కుక్కుటేశ్వరుడిగా వెలశాడు.



రెండవది -ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఇక్కడ అమ్మవారి ఎడమచేయి పడింది. గౌతమ మహర్షిచే శాపగ్రస్తుడైన ఇంద్రుడు ఇక్కడే అమ్మవారిని సేవించి పురుషత్వాన్ని తిరిగి పొందాడని పురాణ కథనం చెబుతోంది. పురుహూతికా దేవి నాలుగు చేతులలో కమలము, బీజాలు, పరశువు, మధుపాత్ర ధరించి అలరారుతూంటుంది. బీజాలు కమలము ధరించిన రూపాన్ని పురుహూత లక్ష్మిగా సమయాచారులు, పరశువు, మధుపాత్ర ధరించిన రూపాన్ని పురుహూతాంబగా వామాచారులు కొలిచేవారని మరో కథనం.


మూడవది -శ్రీమహావిష్ణువు పరిపూర్ణ స్వరూపం దత్తాత్రేయుడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించిన క్షేత్రం పీఠాపురం.

పీఠాపురంలోనే ఉన్న కుంతిమాధవాలయం ప్రశస్తమైనది.పాండవమాత కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవాలయం ఇది.

కాకినాడ


కాకినాడ చేరేసరికి సాయంకాలమైంది .

అధ్యాత్మిక ప్రవచనాలు వినేవాళ్ళాందరికీ కాకినాడ అంటే ముందు గుర్తొచ్చేది పూజ్య గురువు శ్రీ చాగంటి కోటేశ్వర్రావు గారు. ఆయన వాగ్గంగలో మునకలేసి తమ జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నవాళ్ళు నాతో సహా ఎందరో. అటువంటి విద్వత్వరేణ్యులు కాకినాడలో ఉండటం కాకినాడ వాసుల అదృష్టం. కాకినాడ పూర్వనామం కోకనదమట. ఒకప్పుడు ఎర్రటి కలువలతో నిండిన ప్రదేశం కనుక ఆ పేరట. ఆంగ్లేయులకు  షరా మాములుగా నోరు తిరక్క గో కేనడా అనటం మొదలుపెట్టి జనబాహుళ్యానికి వచ్చేసరికి అది కాకినాడగా మార్పుచెందింది.





పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన మమ్మల్ని సముద్రతీరం సేదతీర్చింది. పొంగెత్తే కెరటాలను సవాలు చేస్తూ పొగరుగా నిల్చున్న కుర్రకారు, ఎగిసిపడే అలలని చూసి భయపడుతూనే వెనక్కి జరిగి, తీరా ఆ అలలు పాదాలను ముంచెత్తి కాళ్ళ క్రింద ఇసుకను లాగేస్తే చక్కిలిగింతలు పెట్టినట్లయ్యి కేరింతలు కొట్టే పసిమనస్సులు, జీవనసంధ్యలో ఉన్నా ఒడ్డున కూర్చుని, త్రుళ్ళిపడే తమ పిల్లల్లో ప్రాత:కాలపు ఉషస్సులు వెదుక్కుని మురిసిపోయే వయోవృద్ధులు, దగ్గరకొచ్చినట్లే వచ్చి అంతలోనే దూరం జరుగుతూ ఒడ్డుకు విరహతాపాన్ని పెంచుతున్న ఓడలు, గూట్లో పెట్టిన నేతి దీపాల్లా దూరంగా మిణుకుమిణుకుమంటూన్న విద్యుద్దీపాలు..ఓహ్.. కొన్ని క్షణాలు అజరామరాలు..

భారమైన హృదయాలతో రాజమండ్రికి తిరుగుప్రయాణమయ్యాం. కాకినాడలో సుబ్బయ్య హోటల్ చాలా ప్రఖ్యాతి కెక్కిందని మా డ్రైవరు చెబితే  రాత్రి భోజనాలకు అక్కడే పార్శిల్ చేయించుకున్నాం. హోటల్  చూడ్డానికి మాములుగా చిన్నగా ఉంటుంది కానీ రుచిలో మాత్రం దానికి తిరుగులేదు. అక్కడలేని వెరైటీలు లేవు. పూర్తి శాకాహార భోజనశాల. భోజనాలు చేసేవారందరికీ తమ దగ్గరున్న రకాలు చెప్పి యజమానే కొసరి కొసరి వడ్డిస్తాడని చెప్పాడు డ్రైవరు.ఇక్కడ పార్శిల్ బుట్టల్లో చేస్తారు. ఒక బుట్ట ఇద్దరికి పూర్తిగా సరిపోయి ఇంకొంత మిగులుతుందంటే  మేం రెండు బుట్టలు తీసుకున్నాం. ఒక్క బుట్ట ఖాళీచెయ్యడానికే ఆపసోపాలు పడ్డాం. మరో బుట్టను వృథాచెయ్యడం ఇష్టం లేక హోటల్‌లోని పనిపిల్లలకు ఇస్తే పాపం వాళ్ళు  చాలా సంతోషించారు.

మరుసటి రోజు యాత్రకు ప్రణాళికలు వేసుకొని కమ్మని జ్ఞాపకాలతో కలల్లోకి జారుకున్నాం.


-(సశేషం)



4 comments

Post a Comment

గోదావరి యాత్ర-2

రాజమండ్రిలో మేమున్న హోటల్ పేరు పర్ణశాల ప్రిన్స్‌లి. పుష్కరఘాట్ కి కాస్త దగ్గర్లో కుమారి థియేటర్ రోడ్డులో ఉంది. గదులూ అవీ ఫర్వాలేదు కానీ మూడు చిక్కులున్నాయి. ఒకటి - హోటల్ క్రిందనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. రెండవది-హోటల్ రెసెప్షన్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి లిఫ్టున్నా అది పనిచెయ్యదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిగతా అంతస్తులకు మాత్రమే పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్దవాళ్ళెవరైనా ఉంటే  మొదటి అంతస్తు వరకు మెట్లెక్కి వెళ్ళడం కష్టం. మూడవ చిక్కు విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచెయ్యదు. గదులకు ఏ.సి మాత్రం పనిచేస్తుంది.

ఇలాంటి హోటల్‌లో ఎలా ఉన్నావయ్యా వారం రోజులంటే నా సమాధానాలు ఇవి - హోటల్‌లో మేము గడపదలచుకున్న సమయం చాలా తక్కువ. ప్రొద్దున్నే ఏడున్నర-ఎనిమిదికళ్ళా బయటపడి  మళ్ళీ రాత్రి ఏడుగంటలకు హోటల్ చేరుకొనేవాళ్ళం. కేవలం రాత్రి విశ్రమించడానికే అయితే సౌకర్యంగానే ఉంది .  పర్ణశాల ప్రిన్స్‌లి ప్రక్కనే అక్షయ్ రెసిడెన్సీ అని మరో హోటల్ ఉంది.  అందులో గదులు బావున్నాయి. ధర కూడా ఫర్వాలేదు. విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచేస్తుంది కాని ఏ.సి. పని చెయ్యదు. ఫ్యాన్లు పనిచేస్తాయి. రాజమండ్రిలో వేసవిని తట్టుకోవాలంటే ఫ్యాన్లు సరిపోవు. ఏ.సి ఉండాల్సిందే. హోటల్ ఎత్తులో కట్టడం వల్ల మెట్ల సమస్య దానికీ ఉంది. ఇక బార్ అండ్ రెస్టారెంట్ విషయానికొస్తే  దానికి జనాల తాకిడి లేకపోవటం పెద్ద ఊరటనిచ్చే అంశం. ఒకరిద్దరు కంటే ఎక్కువమందిని అక్కడ చూసినట్లు నాకు గుర్తులేదు. ఇదే తిరుపతిలో అయితే ఒక సూపర్‌స్టార్ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షోకి జనం ఎలా కొట్టుకుంటారో అలా ఎగబడేవాళ్ళు. బెంగుళూరులో కూడా ఈ తంతు కొన్ని చోట్ల గమనించాను. వేసవిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని మొన్నామధ్య పేపర్లో చదివి నేనేం ఆశ్చర్యపోలేదు. దేశంలో తాగడానికి మంచి నీళ్ళు లేనప్పుడు పుష్కలంగా దొరికేదేదో అది తాగి ప్రాణాలు నిలుపుకోవాలి కదా !

మరుసటి రోజు ప్రొద్దున్నే ఎనిమిదిన్నరకు  మారుతి టూరిజం వారి ఇన్నోవాలో అందరం  బయలుదేరాం.  

కోనసీమ అందాలతో పరిచయం, రాజమండ్రి నుంచి బిక్కవోలుకు వెళ్ళే దారితో ప్రారంభమయ్యింది. రోడ్డుకు ఇరువైపులా పంటకాలువలు, వాటి పక్కనే కంటిచూపు ఆనినంతవరకూ పచ్చటి పైరుపొలాలు. ఈడొచ్చిన  తెలుగుపిల్లలా భూకన్య పచ్చటివోణీ తొడుక్కుని సిగ్గుతో మురిసిపోతూంటే, ఆ సిగ్గును పల్చటి మేలి ముసుగుతో కప్పుతున్నట్లు జలతారు మంచుతెర, ఇంతటి సుందర సన్నివేశానికి ఆహ్వానాలు మోసుకెళ్తున్న నెచ్చెలుల్లా గగనసీమలో కొంగల బారు ..నయనమనోహర దృశ్యాలు దారిపొడవునా సాక్షాత్కరించాయి . శీతాకాలంలో మంచు తెరలు మాములే కానీ నిండు వేసవిలో బారెడు పొద్దెక్కాక మంచు తెరలు చూడటం ఇదే మొదటిసారి.

బిక్కవోలు 

బిక్కవోలు చిన్నగ్రామం. ఇక్కడున్న ప్రసిద్ధమైన ఆలయ సముదాయం శ్రీగోలింగేశ్వర స్వామి దేవాలయం. క్రీ.శ.9వ దశాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలు తురుష్కుల దండయాత్రలలో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలక్రమంలో పుట్టలు,పొదలు పెరిగి అరణ్యంతో కప్పబడిపోయిన ఈ ఆలయాలని గోవులు తమ క్షీరధారలతో అభిషేకించటం గమనించి ఆశ్చర్యపోయిన కరణం, పుట్టలను తవ్వించి లింగాన్ని బహిర్గతం చేశారు. గోవుల క్షీరధారలతో అభిషిక్తమైన మూర్తి కనుక గోలింగేశ్వరుడయ్యాడు. ఆయననే ఆలింగన చంద్రశేఖరుడని కూడా అంటారు.




బిక్కవోలు పూర్వనామం బిరుదనవోలట. పూర్వం ఇక్కడి నుంచి పెద్దాపురానికి సొరంగమార్గం ఉండేదని , బ్రిటీషు వాళ్ళు బిగ్‌హోల్ అని పిలవటం మూలన కాలగర్భంలో అది బిక్కవోలుగా మారిందని ఒక కథనం.




గోలింగేశ్వరస్వామి వారి ఆలయానికి దగ్గర్లో పచ్చటి పోలాల మధ్యలోనున్న స్వయంభూ లక్ష్మీగణపతి ఆలయం కనువిందు చేస్తుంది. గణపయ్య ఎంత బొద్దుగా ఉంటే అంత అందం. ఇక్కడ స్వామివారు విశాలమైన చెవులు, కుడివైపుకు తిరిగిన పొడవాటి తొండం, పెద్ద బొజ్జతో భూమిలో కూరుకుఫోయి ఉంటారు. స్వామి చెవులలో మన ఈప్సితాలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని ప్రతీతి.





బిక్కవోలు, గొల్లల మామిదాడ, దాక్షారామం, పీఠాపురం, అన్నవరం, కడియం - ఇవి ముందుగా మేం బుక్‌ చేసుకున్న ప్యాకేజి ప్రకారం  మొదటిరోజు వెళ్ళవలసిన  ప్రాంతాలు. బిక్కవోలు చూశాక స్థానిక ప్రాశస్త్యం ఉన్న చిన్న గుళ్ళ కంటే లోకప్రాశస్త్యం ఉన్న దేవాలయాలు, ప్రాంతాలు దర్శించడం  ఉత్తమమనిపించింది . మా రూట్‌మ్యాప్‌లోంచి గొల్లల మామిదాడ , కడియం తొలగించి వాటి స్థానాల్లో సామర్లకోట, కాకినాడ చేర్చాం. మా డ్రైవరు  మాటకారి, బ్రతకనేర్చినవాడు కాబట్టి దానికి అంగీకరించాడు. పనిలో పనిగా మరుసటిరోజు ప్యాకేజ్‌కు బదులు వాహనాన్నే మాట్లాడుకోమని, దాని ద్వారా బోలెడంత డబ్బు ఆదా అవుతుందని (తనకూ, మాకూ) ,ఇష్టమొచ్చిన ప్రదేశాలు చూడవచ్చని సలహా ఇచ్చాడు. మాకా సలహా నచ్చింది.


కారు దాక్షారామం వైపు బయలుదేరింది.

(సశేషం..)


6 comments

Post a Comment

గోదావరి యాత్ర -1




నీటి ఆవశ్యకత దేహానికి ఎంత ముఖ్యమో, నాగరికత వికసించి ప్రజలు వర్థిల్లాలన్నా ఒక ప్రాంతానికి అంతే ముఖ్యం. నీరు పుష్కలంగా ఉన్న చోట పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటలు సమృద్ధిగా పండిన చోట సుఖసంతోషాలు తాండవిస్తాయి. కడుపు నిండిన చోట కళాభివృద్ధికి కొదవేముంది?

భారతీయ సంస్కృతిలో నదీనదాల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ' గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ' అని శ్లోకం. సప్తనదులలో ఒకటైన గోదావరి నదిని, ఆ మహానది ఒడ్డున వెలసిన శ్రీరామచంద్రున్నిదర్శించుకోవాలన్న కోర్కె చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. దాన్ని తీర్చుకొనే అవకాశం ఈ వేసవిలో దక్కింది .సాక్షాత్తూ గంగానదికి ప్రతిరూపమైన గోదావరినది గొప్పదనం గురుంచి అనేక విధాలుగా ముందే విని ఉన్నాను. నాటి ' మూగమనసులు ' నుంచి నేటి ' గుండెల్లో గోదారి ' వరకు అటు మన తెలుగు సినిమా దర్శకులు, ఇటు ఇతర మీడియా వాళ్ళు గోదావరి అందాలని యథాశక్తి దృశ్యరూపంలో బంధించి కనువిందు చేశారు. దీంతో గోదావరిని చూడాలన్న కోరిక మరింత బలపడింది . కావల్సిన సమాచారం సేకరించి వారం రోజుల ప్రణాళిక వేసుకున్నాం. రాజమండ్రిలో దిగి ముందు గోదావరి జిల్లాల్లోని ముఖ్యప్రదేశాలు సందర్శించి , ఒక రోజు విశ్రాంతి తీసుకొని తర్వాత తమ్ముడి కుటుంబంతో కలిసి భద్రాద్రి  రామున్ని దర్శించుకుందామని ప్లాన్ వేశాం. బెంగుళూరు నుంచి బయలుదేరి వారం రోజులలో ఒంటికి శ్రమ తెలియకుండా అన్ని ఊళ్ళూ చుట్టి రావాలంటే విమాన ప్రయాణమే శ్రేయస్కరం అనిపించింది. ఆఫీసులో ఎల్.టి.ఏ క్లెయిం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరికీ రానూపోను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేశాను. 

రెక్కలిచ్చిన తల్లిదండ్రులతో కలిసి రెక్కలున్న లోహవిహంగంలో ప్రయాణించడం ఒక మధురమైన అనుభూతి. మా తల్లిదండ్రులకి, మా పాపకి అదే మొదటి విమానప్రయాణం. మా పాప అయితే  ఉత్సాహంతో గంతులు వేస్తునే ఉంది. విమానాశ్రయంలో ప్రవేశించాక చుట్టూ ఉన్న విమానాలను అబ్బురంగా చూడటం, టేకాఫ్, ల్యాండ్ అవుతున్న విమానాలను ఆసక్తితో గమనించటం, సీటులో కూర్చున్నాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచుడటం, టేకాఫ్ అవుతున్నప్పుడు ఆ వేగానికి బెదిరిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, సర్ది చెప్పాక స్థిమితపడి కిటికిలోంచి ప్రక్కనే కనిపిస్తున్న మబ్బుడొంకలను , క్రింద లీలగా కనిపిస్తున్న ఊళ్ళను చూస్తూ ఆశ్చర్యపోవడం..ఇలా తన ప్రతిచర్యా అపురూపమైన క్షణాలే. ఇక అమ్మానాన్నల ముఖాల్లో ప్రస్ఫుటమైన భావావేశాలు చాలు జీవితాంతం పదిలపరచుకోడానికి.   

రాయలసీమ ఎండలకు రాళ్ళు కూడా ఆవిరైపోతాయని తెలుసు కానీ కోస్తా ఎండలకు కొండలైనా కరిగిపోతాయని కొత్తగా తెలిసింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి హోటల్‌కు కారులో వెళ్తూంటే వెచ్చటి గాలులు మొహంపై వాతలు పెట్టాయి .అసలే వేసవి. కాసేపు ఎండలో నిల్చుంటే చాలు గోదావరిలో స్నానం చేసినట్లే. దానికి తోడు విపరీతమైన విద్యుత్‌కోతలు. ఇంతటి ఉక్కబోతలో సామాన్యజనం జీవితాలు ఎలా వెళ్ళదీస్తున్నారో అర్థం కాలేదు. విద్యుత్ మీదే అధారపడి నడిచే జిరాక్స్‌సెంటర్లు, జ్యూస్‌షాపులు వగైరా వేసవిలో ఉచితంగా సర్వీస్ చేసినట్లే లెక్క. వచ్చే రాబడి జనరేటర్ డీజల్ ఖర్చులకే సరిపోదు. ఏప్రిల్ మాసాంతంలోనే రాజమండ్రి లాంటి పట్టణాలలో ఇంత అధ్వానంగా ఉంటే ఇక మారుమూలపల్లెల్లో పరిస్థితి ఊహించుకోవచ్చు. నేల నలుచెరగులా నీరున్నా విద్యుత్‌కు నోచుకోని దుస్థితికి కారణం నాయకులా? నిగ్గదీసి అడగలేని ప్రజలా ? 

ప్రకృతి ఎంత గొప్పదో ఆ సాయంత్రం పుష్కరఘాట్‌లో మళ్ళీ బోధపడింది.





సంధ్య వెలుగులో స్నానాలాచరిస్తూ కొందరు, బోటు షికారు చేస్తూ ఇంకొందరు, నీళ్ళలో ఆటలాడుకొంటూ మరికొందరు, ఘాట్ ప్రక్కనున్న 


పాత బ్రిడ్జినెక్కి అంత ఎత్తు నుంచి గోదావరిలో దూకి ఈతకొడుతూ కేరింతలు కొడుతూ ఇంకొందరు, ఒడ్డున నిల్చుని పిల్లల్ని పర్యవేక్షించే తల్లిలా పవిత్ర గోదావరి విగ్రహం, ఈ సందడికంతా కాస్త దూరంగా ముఖద్వారం వద్ద  సర్వం నాకు తెలుసన్నట్లు  తపస్సమాధిలోని పరమశివునిలా గంభీరంగా ఉన్న ఎత్తైన శివలింగం. పడవలో విహరిస్తున్నంతసేపు నాలో 'వేదంలా ఘోషించే 


గోదావరి '  మార్మ్రోగుతూనే ఉంది. తిరిగి వస్తూ రేవు గట్టునున్న గోదారమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించాను. నిజంగా ఈ గోదావరి నదే లేకపోతే వేసవిలో ఈ ప్రజలకు ఉపశాంతి ఎక్కడిది?


..(సశేషం)


3 comments

Post a Comment

నాట్య మయూరి

మా నాన్నగారు చాలా కాలం క్రితం వేసిన కొన్ని చిత్రాలు








3 comments

Post a Comment

విషాదాంధ్ర



బాధతో హృదయం ద్రవిస్తోంది !

గుండెల్లో నిరంతరం మార్మ్రోగి ఉత్తేజాన్ని రగిలించిన మా తెలుగుతల్లికీ మల్లెపూదండ నేడు రెండు ముక్కలైపోయి మూగబోయింది.

దేశానికే అన్నం పెట్టిన ఆంధ్రమాతా అన్నపూర్ణా, ఇకనుంచి నువ్వు ఢీల్లీ నడివీధుల్లో  అడుక్కుతినాలి.

నీ పిల్లలం మేం, నిధుల మెతుకుల కోసం కాట్లకుక్కల్లా  కొట్లాడుకుంటూ 
వైరివైషమ్యాలతో కలకాలం  వర్థిల్లుతాం. 

దేశ రాజకీయాల్లో ఇదో దుర్దశ.  


ఒకప్పటి భారతంలో వలువలు విప్పింది దుశ్శాసనుడొక్కడే, సహకరించింది మిగిలిన దుష్టచతుష్టయమే . నేటి భారతంలో ప్రజాస్వామ్యం ఓ పాంచాలి, అడుగడుక్కీ ఓ దుశ్శాసనుడు, అందరూ కౌరవులే. పాండవులు, పరమాత్మ శ్రీ కృష్ణుడే లేనే లేరు.

గోరంతను కొండంతలు చేసి,  కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, అనేకమంది అమాయకుల బలిదానం సాక్షిగా  కొన్ని శక్తులు నడిపిన ప్రత్యేకవాద  ఉద్యమం అనేక దిశలు, దశలు దాటి ఆఖరి మజిలీ చేరుకుంది . 

ఎనభైలకు ముందు తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే కానీ  ఆ తర్వాత జరగడానికి పెద్దగా ఆస్కారాలు లేవు. కొన్ని సంఘటనలు జరిగినా అవి రాష్ట్రాన్ని విభజించేటంత తీవ్రమైనవి కావని నా ప్రగాఢ విశ్వాసం . అసలు ఏ ప్రాతిపదిక మీద తెలంగాణ ఇచ్చారో ఇప్పటికీ చెప్పుకోలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వముంది. వెనుకబాటుతనం దోపిడీ కారణాలైతే  ముందు రాయలసీమ వేరుపడాలి. సెంటిమెంటు ప్రకారమైతే అనేక ప్రాంతాల్లో వేరుపడాలన్న సెంటిమెంటుంది. అంతకు రెట్టింపు ప్రాంతాల్లో కలిసుండాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. హేతుబద్ధత లేని ఇటువంటి విభజనలు మునుముందు దేశాన్ని ఏ సంక్షోభంలోకి నెడతాయో కాలమే సమాధానం చెప్పాలి.

సరే ..కారణాలేవైనా  ఒక ప్రాంతాన్ని విభజిద్దామనుకున్నాక  రెండు ప్రాంతాల వారికీ సమన్యాయం చెయ్యడం కనీస ధర్మం.  అలా కాకుండా విభజన కోరుతున్న వారి విజ్ఞప్తులన్నీ అంగీకరించి, అవశేష ఆంధ్రప్రదేశ్ వాసుల ఆక్రోశాన్ని పెడచెవిన పెట్టి కేంద్రం బిల్లును రూపొందించటం ఘోరం.  రాహుల్‌గాంధీని ప్రధానిని చెయ్యాలన్న ఏకైక లక్ష్యంతో తెరాస  అజెండాకు  అనుగుణంగా అసంబద్ధమైన బిల్లును హడావిడిగా రూపొందించి దాన్నే పదికోట్ల ఆంధ్రులపై ఏకపక్షంగా రుద్దాలనుకోవటం నీచాతి నీచం. సంపూర్ణ తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణావాదులు కూడా లోపభూయిష్టమైన బిల్లును అక్కున చేర్చుకుని, సీమాంధ్రులు ఎలా పోయినా పర్లేదు ఇప్పటికిప్పుడు రాష్ట్రం దక్కితే చాలన్నట్లు ప్రవర్తించటం విడ్డూరం.

తెలంగాణా వ్యవహారం ద్వారా నాకు కొన్ని విషయాలు బోధపడ్డాయి.


విష రాజకీయాలలో కాంగెస్ పార్టీని తలదన్నే పార్టీ భారతదేశంలో లేదు.


 కాంగ్రెస్ పెద్దలకు అసాధ్యమైనదేదీ లేదు. పుట్టినరోజు కానుకలుగా రాష్ట్రాలనే పంచగలరు . ఎవరినైనా లొంగదీసుకోగలరు, లొంగని వాళ్ళను జైళ్ళకు పంపించగలరు, చివరికి అదే దొంగలతో జట్టు కట్టనూగలరు. అందుకే ఇన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నా కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలసిపోకుండా ఇంకా సజీవంగా ఉంది.


నోరున్న పదిమంది కలిసి అవాస్తవాలు ప్రచారం చేసి, దాన్నే చరిత్రగా వక్రీకరించి వందమందిని మభ్యపెట్టో , భయపెట్టో , బాధపెట్టో ఏమైనా సాధించుకోవచ్చు. అడిగే నాథుడు లేడు.



తెలంగాణా నేతలకున్న తెగువ, పోరాట స్ఫూర్తి సీమాంధ్ర నాయకులలో ఏ కోశానా లేవు.

నిమ్మరసం తాగి నిద్రపోదాం అనుకున్న కచరా నడ్డి విరిచి ఉద్యమ వీధుల్లోకి లాక్కొచ్చారు. తమ మాట లక్ష్యపెట్టని ఎంపిలను, ఎమ్మెల్యేలను సామదానబేధదండోపాయాలతో తమదారికి తెచ్చుకున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. సీమాంధ్రుల శైలి వేరు,మా శైలి వేరంటే ఇన్నాళ్ళూ ఏదో అనుకున్నా కానీ ఈ రోజు ఆ మాటల్లో వాస్తవం తెలుస్తోంది. ఆంధ్రులు ఆరంభశూరులన్నమాట మరోసారి రుజువయ్యింది. ఐక్యతకు మనకూ ఆమడ దూరం. ఎవడి దారి వాడిదేసమైక్య సమావేశాలు సీమాంధ్రలో నిర్వహించే బదులు తెలంగాణలో నిర్వహించాల్సింది. జనం నాడి తెలిసేది. బలం పెరిగి సమైక్య నినాదానికున్న సత్తా తెలిసేది. విడిపోదామనుకున్నది తెలంగాణా వాదులు కానీ సీమాంధ్రులు కాదు కదా. సీమాంధ్ర వీధుల్లో స్వరతంత్రులు తెగేలా ఘోషించి, శోషించి పడిపోతే సమైక్యశక్తి లోకానికెలా తెలుస్తుంది ? ఏ.పి.ఎంజివోలు ఇతర ప్రజా సంఘాల నేతలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు ?


కోట్లు ఖర్చుబెట్టి ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులని ఎన్నుకోవటం శుద్ధదండగ. 

క్యూలలో బారులుతీరి ఓపికతో ఓట్లు వేసే వయసుడిగిపోయిన అవ్వలారా, తాతలారా ! ఏమిటి మీ వెఱ్ఱి తాపత్రయం ? ఎవరిని ఉద్ధరిద్దామని మీ సంకల్పం? మీకు గానీ, మీ చేత  ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు కానీ  రాష్ట్రం మీద ఎటువంటి హక్కులూ లేవు. మెజారిటీ తగ్గిందనిపిస్తే పది సీట్ల కోసం  అధికారంలో ఉన్న ఏ జాతీయ పార్టీయైన రాష్ట్రాన్ని ముక్కలు చేయవచ్చు. ఈ  లోగా అమాయకంగా మా రాష్ట్రం, మా తల్లి, మా జాతి అని భ్రమలు పెట్టుకుని భావగీతాలు పాడుకుని మురిసిపోవడం మూర్ఖత్వం. కేంద్రం తలుచుకుంటే తల్లికి చెల్లిని, అమ్మమ్మని సృష్టించగలదు. 


జగన్ కాంగ్రెస్‌ల రుణానుబంధం 


 సీమాంధ్ర ఏ గంగలో కలిసినా పర్లేదన్నట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందంటే దానికి  మూలకారకుడు ఆర్థిక ఉగ్రవాది వైయస్‌జగనే. కాంగ్రెస్ ఎంపీలే నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్న నగ్నసత్యం ఇది. జగన్‌కున్న ఏకైక అజెండా ఎలాగైనా ముఖ్యమంత్రి అవటం .శవరాజకీయాలు, ఓదార్పు యాత్రలు చేసి అధిష్ఠానాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చటంతో సీమాంధ్రలో తన నూకలు చెల్లాయనే సత్యం కాంగ్రెస్ పార్టికీ బోధపడింది. నెంబర్‌గేంలో భాగంగా అటు బాబుకు,ఇటు జగన్‌కు చెక్‌పెట్టడానికి తెలంగాణను ముందుకు తీసుకొచ్చింది. సీమాంధ్ర ప్రజలు వినోదప్రియులు. జగన్ ద్వారా అది పుష్కలంగా లభిస్తూండటంతో అభిమానంతో కొంతమంది, ఆవేశంతో కొంతమంది ఓట్లవర్షం గుప్పించారు. విజయం తలకెక్కించిన ధీమాతో జగన్ తనకు తిరుగులేదనుకున్నాడు. జేడి లక్ష్మీనారాయణ రూపంలో అతని జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. కటకటాలపాలై ఏడాదికిపైగా ఊచలు లెక్కబెట్టేసరికి వాస్తవం కళ్ళముందు సాక్షాత్కరించింది. తనపై పెట్టిన కేసుల తీవ్రత తెలిసొచ్చి తప్పించుకొనే దారులు వెదకటం ప్రారంభించాడు. సోనియా ముంగిట సాష్టాంగప్రణామం చేసి త్వమేవ శరణం మమ అనటం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. అందుకు తగ్గట్లుగానే విజయమ్మ పలుమార్లు ఢిల్లీయాత్రలు చేసి బేరసారాలు కుదుర్చుకున్నారు. సోనియానే హంతకురాలన్న నోటితోనే సార్వత్రిక ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని జాతీయ మీడియాలో ప్రకటనలు చేశారు. జగన్‌కు స్వేచ్ఛా జీవితం లభించింది.  ఆపైన అధిష్థానం ఆదేశాలకు అనుగుణంగా సమైక్యనినాదాన్ని తలకెత్తుకోవటం, రాజీనామాలు చెయ్యటం, సభలు సమావేశాలు నిర్వహించటం చకచకా జరిగిపోయాయి. డిగ్గీరాజా కనిపిస్తే చెంప పగలగొట్టాలని తొడగొట్టి హూంకరించిన మడమతిప్పని పోరాటయోధుడు జగన్, స్వయంగా పీకల్లోతు బురదలో కూరుకుపోయి మళ్ళీ మిగతావారిపై బురదజల్లే ఆయన ఎం.పీ లు పార్లమెంటులో కుక్కిన పేనుల్లాగ ఎందుకు పడి ఉన్నారో తెలుసుకోలేనంత తెలివితక్కువ దద్దమ్మలుకారు తెలుగు ప్రజలు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం కలిగించాలకున్న అసమ్మతినేతలకు ఎటువంటి సాయం చేయకుండా మొహం చాటేయ్యడమూ మర్చిపోదగింది కాదు. ఈ రోజు ఎంత బుకాయించినా నివురుగప్పిన నిప్పు దహించక మానదు .   


ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల సొమ్ముతో పోషింపబడుతున్న ప్రజాప్రతినిధులు ఆ ప్రజల భావోద్వేగాలకు కట్టుబడాల్సిన పని లేదు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. 


ప్రజలని నమ్ముకుంటే ఏమొస్తుంది బూడిద ! ఇవాళ గుర్తించుకుంటారు, రేపు మర్చిపోతారు. అదే అధిష్టానం కాళ్ళముందర  అతివినయంతో తోకూపితే రాజ్యసభ బిస్కెట్టో, గవర్నరుగిరీ బిర్యానియో దక్కుతుంది. 





సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఆత్మాభిమానం అంటూ ఏమీ లేదు. ఎప్పుడో అధినేత్రి ముంగిట్లో తాకట్టు పెట్టేశారు .

ఒకవైపు సీమాంధ్ర తగలబడుతున్నా, సోనియాగాంధీని ఒక్కమాటంటే శివాలెత్తినట్టు చిందులువేసే వీళ్ళని తిట్టాలంటే తెలుగు భాష సరిపోదు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బిల్లును టేబుల్ఐటెంగా తెచ్చినప్పుడు, చదువుకోవడానికి రెండురోజుల సమయం కోరితే కుదరదన్నప్పుడు, ఆంటోనీ కమిటి పేరుతో ప్రజలను మభ్యపెట్టినప్పుడు, యుద్ధవిమానంలో ఆఘమేఘాల మీద బిల్లు తరలించినప్పుడు, ఇతర రాష్ట్రాల ఎం.పిలను ఉసిగొల్పి ముష్టిఘాతాలు కురిపించినప్పుడు, ప్రసారాలు నిలిపేసి బిల్లును నెగ్గించుకున్నప్పుడు ఆవేశంతో స్పందించిన సీమాంధ్ర నేతల్ని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆస్తులు తగలబెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అధిష్టానాన్నే నమ్ముకుంటున్న బొత్స సత్యానారాయణ, ఇంత జరిగినా ఇంకా ఏదో వెలగబెట్టాలని పదవులు పట్టుకువేలాడుతున్న చిరంజీవి , ఆనం, రఘువీరా, డొక్కా లాంటి నేతల్ని చూస్తూంటే  జుగుప్స కలుగుతోంది.  నాటకమో నిజమో కిరణ్‌కుమార్ రెడ్డి తన ప్రయత్నమంటూ తను చేశాడు. బెనిఫిట్ ఆఫ్ డవుట్ కింద ప్రస్తుతానికి ఆయన్ని వదిలేద్దాం. మీరేం ఒరగబెట్టారని ఆయన్ని విమర్శిస్తున్నారు? యూ.టి వల్ల ఎవరికి ఉపయోగం ? సీమాంధ్రుల ఈగో చల్లారాలంటే యూ.టి చెయ్యాలా ? ఇంతకంటే మెరుగైన ప్రతిపాదనలేవీ లేవా మీ దగ్గర ? ముఖ్యమంత్రి పీఠం మీద మరీ ఇంత అలవిమాలిన మోజా ?


ఈ దేశంలో అధికారపక్షం ప్రతిపక్షం అంటూ రెండు లేవు. ఉన్నది ఒకే పక్షం. అది అధికారదాహ పక్షం.

ధికార దాహంతో విలువలకు తిలోదకాలు ఇచ్చి అడ్డమైన గడ్డీ కరచి   ' మేము ప్రత్యేకం ' అంటూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. అనిల్ అంబానీ విషయంలో కాంగ్రేస్‌తో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయిన భాజపా, తెలంగాణ బిల్లు విషయంలో మరింత నిర్లజ్జగా పట్టుబడిపోయింది. విపక్ష  పార్టీ నాయకురాలై ఉండి సీమాంధ్రులు  భారతీయులే కానట్ట్లు వారి కోసం ఒక్క అమెండుమెంటూ ప్రతిపాదించకుండా తెలంగాణాకు తలూపి, 'నన్ను గుర్తించుకోండి ' అని అధికారపక్షాన్ని దేబరించటం దిగజారిన విలువలకు పరాకాష్ట. ప్రజాగ్రహం వెల్లువెత్తాక కూడా  'అన్యాయం జరిగిన మాట వాస్తవమే. వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి  మేం చూసుకుంటాం ' అని ఎటువంటి సిగ్గూ బిడియం లేకుండా మాట్లాడుతున్న వీళ్ళని చూస్తే సిగ్గుకే సిగ్గొస్తుందేమో. రాజ్యసభలో ఓ వైపు సుశీల్‌కుమార్ షిండే్ ప్రభృతులు మేం విసిరే ఎంగిలి మెతుకులు ఇవే ,ఇష్టముంటే తీసుకోండి లేకపోతే ఇదీ లేదన్నట్లు  అహంకరిస్తూంటే సీమాంధ్రుడై ఉండీ సాటి సీమాంధ్రుల మేలు కోసం పట్టుబడకుండా చేతులెత్తేసి సంధి చేసుకున్న వెంకయ్య గారూ, వృద్ధాప్యంతో మీకు పౌరుషం పోతే పోయింది, కనీసం  సీమాంధ్రుల పట్ల జాలి కుడా కలుగలేదా ? తృణమూల్ కాంగ్రెస్  పార్టీ సభ్యులకున్న శక్తి కూడా మీ పార్టీకి  లేదా ? ఉమ్మడి రాజధాని నిధులు ఒక రాష్ట్రానికే పంచటం ఎంత దుర్మార్గమని నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా ? అణు ఒప్పందం నుంచి తెలంగాణ బిల్లు వరకు ప్రతీ బిల్లూ  లోపభూయిష్టమైనవే  అంటూ అన్నిటికీ సహకరించి బిల్లులు పాస్ చేయించిన  మీకూ, కాంగ్రెస్‌కు తేడా ఏంటి ? అభివృద్ధి పేరుతో చిన్న రాష్ట్రాలకు మద్దతు పలికే మీకు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గురుంచి మాట్లాడే హక్కు ఎక్కడిది ?


ప్రతిపక్షనాయకుడు మంచి పరిపాలనాదక్షుడైతే సరిపోదు అతనికి నాయకత్వ లక్షణాలూ ఉండాలి. 


తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రినని తంబూరా మీటే రెండుకళ్ళ సిద్ధాంతకర్త చంద్రబాబులో ఇదే లోపించింది.  తెలంగాణకు మద్దతిచ్చి  తెరాసతో పొత్తుపెట్టుకోవటం చారిత్రాత్మిక తప్పిదం.  పోనీ  మేధోపరమైన చర్చలు జరిపి, విడిపోతే తెలంగాణ, సీమాంధ్ర భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని లెక్కలు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. కేవలం చిరంజీవి చీల్చబోయే ఓట్ల శాతాన్ని తగ్గించటానికి తెలంగాణకు జైకొట్టారు. విభజన సాకారమవుతున్న దశలో కుడా స్పష్టత లేకుండా రెండు కళ్ళు, రెండు కొడుకుల సిద్ధాంతాలతో ముందుకొచ్చారు. సమన్యాయమంటే ఏమిటని జాతీయ మీడియా ప్రశ్నిస్తే ఉక్కిరి బిక్కిరయ్యి నీళ్ళునమిలారు. మీకు నిజంగా సమన్యాయమే కావల్సి వస్తే 'తెలంగాణకు కావల్సినవివీ, సీమాంధ్రకు కావల్సినవివీ, అప్పుడే మేం విభజనకు అనుకూలం ' అని ముందే ఎందుకు  ధైర్యంగా చెప్పలేకపోయారు ? అలా చేసుంటే మీ క్రెడిబిలిటీ పెరిగేది కదా ? సమైక్యతే మీ నినాదమైతే తెలంగాణలో ఉంటూ ' సమైక్య రాష్ట్రానికే నా ఓటు ' అని నిబ్బరంగా చెప్పుకున్న తూర్పు జయప్రకాష్‌రెడ్డికున్న కన్విక్షన్ మీకు లోపించిందా ? ఓ వైపు తెరాస నాయకులు వాగ్ధాటితో విజృంభిస్తూ చెడుగుడు ఆడుకుంటూంటే  ఆంగ్లం ఒక్క ముక్కారాని, సి.ఎం.రమేశ్ లాంటి వాళ్ళని  రాజ్యసభకు, జాతీయ మీడియాలో చర్చావేదికలకు పంపి మీరు సాధించిందేమిటి, మరింత గందరగోళం సృష్టించటం, నవ్వులపాలవటం తప్ప. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి పీఠంపైనా, పదేళ్ళు ప్రతిపక్షంలోనూ కూర్చున్న మీనుంచి ఇంత అపరిపక్వత ఆశించలేదు. పుసుక్కుమని పాదయాత్రలకు బయలదేరేముందు ఒంటరిగా కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోండి. లోపం ఎక్కడుందో తెలుస్తుంది. 


సీమాంధ్రులకున్న కులపిచ్చి తెలంగాణావాదులకు లేదు


కమ్మ, కాపు, రెడ్డి..ఇలా టాగ్‌ని బట్టి టోకున ఓట్లు కుమ్మరించే సీమాంధ్రలో ఇంతకంటే గొప్ప నాయకులని ఊహించటం ప్రజల అవివేకం. మనకులపోడు అందలమెక్కితే అదే మనకు గర్వకారణం. వాడెంత అసమర్థుడైనా, అయోగ్యుడైనా ,లక్షల కోట్లు దిగమింగినా మనకక్కర్లేదు. 'ఎందుకింత రాద్ధాంతం ? మావోడు ఒక్కడే తిన్నాడా ? ఎవడు తినటం లేదు ఈ లోకంలో ? .ఎంత దుర్మార్గుడైనా మన కులపోన్ని మనం చాకిరేవు పెట్టి కులానికి చెడ్డపేరు తీసుకురాకూడదు. మనోడికి మనమే మద్దతివ్వకపోతే ఇంకెవరు మద్ధతిస్తారు ' . ఇదీ.. .మన ఆలోచనా ధోరణి. చదువురానివాడి దగ్గర్నుంచి చదువుకున్నవాడి వరకు ఇదే మైండ్‌సెట్. ఇది మారనంత వరకు అద్భుతాలు ఊహించటం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిది.

ఏతావాతా తెలంగాణ పదేళ్ళు ,సీమాంధ్ర ముప్పైయేళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డాయి !

సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయిన సీమాంధ్రులారా ! ఇకనైనా కళ్ళు తెరిచి సరైన నాయకులని ఎన్నుకోండి !

సినిమా నటుల మీద వ్యామోహాన్ని సినిమాల వరకే పరిమితం చేయండి. మీకో నటుడు నచ్చితే అతని సినిమాను వందసార్లు చూడండి. దానివల్ల దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. కానీ అతనికి లేనిపోని విశేషణాలు తగిలించి వ్యక్తి పూజలు చేయకండి. కులమతాల కంపునుంచి వెలుపలికి వచ్చి కొత్తలోకాన్ని సృష్టించడానికి శాయశక్తులా ప్రయత్నించండి. మిమ్మల్ని మళ్ళీ బుట్టలో వేసుకోవాలనే నేతలకు మీ కాళ్ళకు చెప్పులున్నాయనే వాస్తవం తెలియజేయండి. ఇప్పటి మీ నడవడిక మీదే మీ పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందన్న సత్యాన్ని మరచిపోకండి.


అంతవరకూ జై తెలుగు జాతి !






4 comments

Post a Comment