తిలా పాపం తలా పిడికెడు


మా తెలుగుతల్లి మూగబోయింది.

జాతి కోసం జ్యోతిలా వెలిగిపోయిన పొట్టి శ్రీరాములుగారు.. మీ త్యాగస్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చేశారు.

ఒక తాగుబోతుని, వదరుబోతుని, మనుషుల రవాణా కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ సరసన సింహాసనం వేసి మరీ రాజ్యాభిషక్తున్ని చేస్తున్నారు.

ఈ పాపం ఎవరిది ?

శుష్కవాదనలతో రంగుల లోకం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి వారి బలిదానాలకు, రాజకీయ అస్థిరతకు కారకులైన రాజకీయ రాబందులదా, నిరుద్యోగులదా ?

ఏ వాదమూ వినిపించని 2000లోనే కేవలం చంద్రబాబుని, బి.జె.పి.ని రాజకీయంగా ఎదుర్కోవటానికి ప్రత్యేక తెలంగాణ తీర్మానంపై సంతకం పెట్టి తెలుగు జాతి సమైక్యతకు తూట్లు పొడిచిన  వై.యస్.ఆర్ దా ?

స్వార్థప్రయోజనల కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక, మానసిక వైషమ్యాలను ఎగదోసి సంబరాలు జరుపుకుంటున్న కే.సి.యార్ దా? 

వ్యాపార ప్రయోజనాల కోసం సమైక్యవాణిని నొక్కిపట్టి పనికిమాలిన విషయాలపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వ్రాసి, విశ్లేషణలు జరిపి కాలం వెల్లబుచ్చిన పత్రికా యాజమాన్యాలదా ?

ముఖ్యమంత్రి పీఠంపై మరులు పెంచుకొని సిద్ధాంతాల్లేని పార్టీని స్థాపించి, అనవసర రాజకీయ సమీకరణలకు కారకుడై, ప్రజాభిమానం నవ్వులపాలేయ్యేలా పార్టీని విలీనం చేసిన చిరంజీవిదా ?

తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పడిన పార్టీని అధికారవ్యామోహంతో తెలంగాణా వాదానికి తాకట్టు పెట్టి, తెలుగుదేశానికి తలకట్టు లేకుండా 
చేసిన విఫల ప్రతిపక్ష నేత చంద్రబాబుదా ?

రాజకీయ మనుగడ కోసం రాష్ట్రాలను ముక్కలుగా చీల్చి జైఆంధ్ర లాంటి నిర్జీవ ఉద్యమాలను లేవదీస్తున్న బి.జె.పి దా ?

అసెంబ్లీ సాక్షిగా దాడులు చేసి మరీ తెలంగాణవాదం తలకెక్కిస్తూంటే అదేమిటనే ధైర్యం చెయ్యలేక  దద్దమ్మల్లా కూర్చున్న సీమాంధ్ర నాయకులదా ? సమైక్యవాదులదా ?

బానిసత్వపు బొమికలతో తయారై అధినేత్రి కృపాకటాక్షం కోసం అనుక్షణం అంగలారుస్తూ వంగి వంగి దణ్ణాలు పెట్టి పారిశ్రామిక అవసరాల కోసం పూటకో మాటమాట్లాడే సీమాంధ్ర కాంగ్రెస్  శాసనసభ్యులదా, ఎం.పి.లదా ?

ఒక కీలకమైన ప్రకటన చేస్తున్నప్పుడు సమగ్ర అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను  తెలుసుకోవాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేని గృహమంత్రి చిదంబరానిదా ?

అఖిలపక్షంలో నిర్భయంగా నిజం చెప్పలేక నీళ్ళు నమిలి గోడమీద పిల్లి వాటం ప్రదర్శించిన  సీమాంధ్ర  శాసనసభ్యులదా?

ఆరంభ శూరత్వం అలసత్వమే తప్ప అంతిమ కార్యాచరణ లేని సమైక్య ఐకాసలదా ? 

 యాభైయేళ్ళ పాటూ వెన్నుదన్నుగా నిలిచిన ఒక రాష్ట్రాన్ని, ఎం.పి.సీట్ల కోసం, ఆ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో నిమిత్తం లేకుండా, ఆ ప్రాంతపు సమస్యలపై ప్రాథమిక అవగాహన కూడా లేని ఇతర రాష్ట్రాల నాయకుల అంగీకారంతో ముక్కలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సోనియా గాంధీ దా? తను ప్రధానమంత్రో డూ డూ బసవన్నో తేల్చుకోలేని మన్మోహన్‌సింగ్‌దా?

ఇన్ని జరుగుతున్నా ఎప్పట్లాగే సిద్ధాంతాలతో పనిలేకుండా కులం కోసం, మతం కోసం, సినిమా గ్లామర్ కోసం  కుత్తుకలు తెగ నరుక్కొని, నోట్ల మత్తులో వోట్లు తనఖా పెట్టి అసమర్థ ప్రజా ప్రతినిధులను అందలాలెక్కించి ఆ తర్వాత ఈసురోమంటున్న సీమాంధ్ర ప్రజలదా ? వాళ్ళ అజ్ఞానానిదా ?

ఈ పాపం అందరిదీ.

తిలా పాపం తలా పిడికెడు.






7 comments

Post a Comment

సరసిని



ల్లున అందెలు కదల్చనీక
మెల్లన దరిచేరి మాటునదాగి
కళ్ళను నీ మృదుకరముల గప్పి
అల్లరి చేతల నలరింతు వీవు 

చక్కని చుక్కగ చెంతకు చేరి
చక్కిలిగింతల చిక్కులు రేపి
చెక్కిలి నొక్కగ చేయి చాపితే
చిక్కక చల్లగా జారుకొనేవు

పట్టుకోవాలని పైకిలేవగానే
పిట్టవోలే బెదరి పారిపొయేవు
పట్టుకోలేనని పకపకా నవ్వి
బెట్టుతో నిలువెల్ల పొంగిపొయేవు

అల్లంత దూరన అప్సరవోలె
కళ్ళింతచేసి కవ్వింతువీవు
ఎలకోయిల వలె ఎలుగెత్తి పిలిచి
కలహంస నడకల కదలిపోయేవు

తొణికిసలాడేటి తొలిప్రాయమందు
తనరారు నీ మేను తూగాడిపోవ
కనరానియందాల కనువిందు జేసి
మనసులో చెరగని ముద్రవేసేవు

దుడుకు కోర్కెల నాలో తలపింపజేసి
ఉడికించి ఊరించి ఉరకలేయించి
కడగంటి చూపుల్లో కొసరేటి-వలపు
వేడిమిలో నేను వేగిపోవంగ

సుడిగాలిలా వచ్చి చుట్టేసి -ప్రేమ
జడివానలో నన్ను ముంచెత్తివేసేవు

(పాతికేళ్ళ క్రితం  మా నాన్నగారు వ్రాసిన కవిత )


4 comments

Post a Comment