కురుపాండవుల తదుపరి జన్మలు -1


కురుపాండవులకు తదుపరి జన్మలున్నాయా? భవిష్య పురాణం ఉందనే చెబుతోంది.


కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు చేరుకొంది. అటు పాండవ శిబిరంలోనూ ఇటు కౌరవ శిబిరంలోనూ యోధాగ్రేసరులందరో అసువులు బాశారు. కౌరవులు పరాజితులై పాండవులు విజేతలయ్యారు. యుద్ధం చివరి రోజైన పద్దెనిమిదవ రోజు సాయంత్రం, జరిగిన నష్టాన్ని తలచుకొని శ్రీకృష్ణుడు కాలస్వరూపుడైన పరమేశ్వరున్ని స్తుతించాడు. పాండవులకు రక్షణగా ఉండమని ప్రార్థించాడు.

నమ:శాంతాయ రుద్రాయ భూతేశాయ కపర్దినే
కాలకర్త్రే జగద్భర్త్రే పాపహర్త్రే నమోనమ:
పాండవాన్రక్ష భవన్మద్భక్తాన్ భూతభీరుకాన్

రుద్రుడు సంతుష్టుడై త్రిశూలం దాల్చి నందిని అధిరోహించి పాండవ శిబిరానికి కాపలాగా వచ్చాడు. శ్రీకృష్ణుడు సెలవు తీసుకొని గజస నగరానికి వెళ్ళిపోయాడు. తొడ విరిగిపోయి నెత్తుటిమడుగులో పడి ఉన్న దుర్యోధనుని చేత సర్వసైన్యాధ్యక్షునిగా నియమింపబడ్డ అశ్వత్థామ, కుంతిభోజుడు, కృపాచార్యుడు శతృసంహారం కోసం రాత్రి పూట పాండవ శిబిరానికి రహస్యంగా వస్తారు. రక్షకుడిగా సాక్షాత్తు రుద్రుడే నిలబడివుండటం చూసి నివ్వెరపోతారు. అశ్వత్థామ పరిపరివిధాలా పరమేశ్వరున్ని ప్రార్థించి దివ్యఖడ్గాన్ని పొందుతాడు. పరమేశ్వరుడు మార్గానికి అడ్డు తొలగి దారినిస్తాడు.అశ్వత్థామ రెట్టించిన ఉత్సాహంతో శిబిరాల్లోకి దూరి నిద్రిస్తున్న ఉపపాండవులను (పాండవ కుమారులు ఐదుమంది) పాండవులుగా భ్రమించి తన దివ్యఖడ్గానికి బలిస్తాడు. ధృష్టధ్యుమ్నాదులను పరలోకానికి పంపుతాడు.కార్యం ముగిశాక దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెవిన వేస్తాడు. శాత్రవ సంహారం జరిగిందన్న సంతృప్తితో రారాజు మరణిస్తాడు.

కుపితులైన పాండవులు దీనికంతటికి పరమేశ్వరుడే కారణమని అతన్ని నిందించి శస్త్రప్రయోగం చేస్తారు. ప్రయోగించిన ప్రతి ఆయుధం శివుడిలో ఐక్యమైపోతుంది. ఆగ్రహం చల్లారని పాండవులు తన మీద పడి పిడిగుద్దులు గుద్దితే పరమేశ్వరుడు కోపించి " మీరు కృష్ణ భక్తులు గనుక మిమ్మల్ని చంపగలిగీ సహించి రక్షించాను. పునర్జన్మలెత్తి ఈ నేరానికి శిక్షను అనుభవించండి" అని శపిస్తాడు. పాండవులు పశ్చాత్తాపం చెంది హరిని హరున్ని ఇద్దరినీ స్తోత్రం చేస్తారు. భక్తసులభుడైన పరమేశ్వరుడు శాంతించి ఏం వరం కావాలో కోరుకొమ్మంటాడు. శరీరంలో ఐక్యమైన ఆయుధాలు శస్త్రాలు తిరిగి పాండవులకు ప్రసాదించవలసిందిగా కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించి త్వరపడి వారిని శపించానని ఆయినా తన వాక్కు వృధా కాదు కనుక వివిధ నామధేయాలతో పాండవులు పునర్జన్మలెత్తి పాపఫలం అనుభవిస్తారని చెబుతాడు.

ఆ ప్రకారం..

ధర్మరాజు బలఖానిగా
భీముడు వీరణుడిగా
అర్జునుడు బ్రహ్మానందుడిగా
నకులుడు లక్షణుడిగా
సహదేవుడు దేవసింహునిగా
ధృతరాష్ట్రుడు పృథ్వీరాజు గా
అతని కుమార్తె వేల గా ద్రౌపది
ఆమె అన్న తారకుడిగా కర్ణుడు
జయసింహుడనే పేరుతో శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మిస్తారు.
(సశేషం ..)