సమాజ జీవచ్ఛవం

 ప ఎన్నికల ఫలితాలు చుశాక నాకు గాయం  సినిమాలోంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వ్రాసిన ఈ క్రింది పాట గుర్తొచ్చింది .



ఈ క్రింది వార్తలు చూశారా? నాకైతే మూడింటికీ పెద్ద తేడా కనబడలేదు.





















ఒకరు దేశాన్ని కుదిపేసిన 2జి కుంభకోణానికి ప్రధానసూత్రధారి.  ఇంకొకరు మతం ముసుగులో ఆశ్లీల కార్యకలాపాలకు అవకతవకలు పాల్పడ్డ స్వామీజీ.  మరొకరు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని నిలువునా దోచేసి అనతి కాలంలోనే వేలకోట్లకు పడగలెత్తి, మృతదేహం రాకముందే ముఖ్యమంత్రై పోదామని కలలు గని ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్న జగన్. ముగ్గురూ మేము నిర్దోషులమని బుకాయిస్తున్నవాళ్ళే. రాజా దళిత కార్డు ఉపయోగిస్తూంటే, నిత్యానంద మతం కార్డు ప్రయోగిస్తున్నాడు. జగన్ తండ్రి, తల్లి, చెల్లి ద్వారా సెంటిమెంటు పండించటానికి కృషి చేస్తున్నాడు.

ఒకప్పుడు నేరం చేసినవాళ్ళు పట్టుబడినప్పుడు అవమానభారంతో తలదించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది. కోట్లాది రూపాయిలు మింగేసిన వాళ్ళు, రేపులు హత్యలు చేసిన వాళ్ళు దేశోద్ధారకులుగా చలామణీ అయిపోతున్నారు. ఎన్ని అవలక్షణాలుంటే వాడే హీరో.   తమ కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఆత్మార్పణలు   చేసుకునే వెఱ్ఱి జనాన్ని చూసి వీళ్ళంతా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జైళ్ళలో ఉన్నా రాజభోగాలు అనుభవిస్తూ  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.  రోజుకొకటి చొప్పున తామర తంపరగా పుట్టుకొస్తున్న టి.వీ.ఛానళ్ళు  రేటింగులకోసం వీళ్ళను కవర్‌చేసి యథాశక్తి హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి.

 అఫ్‌కోర్స్. మనదేశంలో ఇంతకంటే అద్భుతాలు  జరుగుతాయని ఊహించలేం. గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది. జనాన్ని మోసం చెయ్యటం చాలా తేలిక.  నిరక్షరాస్యులనైతే చెప్పక్కర్లేదు. చదువుకున్న వాళ్ళనైతే మరీ సులభం. చదవేస్తే ఉన్నమతి పోయినట్లు వీళ్ళ సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోయింది. చేతిలో ఒక పేపరు, చూడ్డానికో ఛానలు, చెప్పడానికి కొన్ని అబద్ధాలు ఉంటే ఇక తిరుగులేదు. ఒక్కసారి వీళ్ళకు బ్రెయిన్‌వాష్ చెయ్యగలిగితే ఆ తర్వాత వీళ్ళను మించిన వీరాభిమానులు మరొకరుండరు. రకరకాల వాదనలు లేవనెత్తి తమ నేతను మించిన నేత మరొకడు లేడని ఢంకా భజాయించి ప్రచారం చేస్తారు. ఒక నాయకుడు చనిపోతే ఆరొందల మంది ఆత్మహత్యలు చేసుకోవటం, హఠాన్మరణం చెందటం ఏమిటన్న కనీస అనుమానం వీళ్ళకు రాదు. ఈ జాబితా మొత్తం ఫేక్ అయినా వీళ్ళకు పట్టింపు లేదు. అలా మరణించిన వాళ్ళను రెండున్నరేళ్ళు ఓదార్చమేమిటన్న తలంపూ రాదు. 2004లో 9.18 లక్షలున్న ఆస్తి 2011 నాటికి 365 కోట్లెలా అయ్యిందంటే అదంతా తమ నేత అసమాన వ్యాపార దక్షత అని గుడ్డిగా వాదిస్తారు తప్ప అందులో వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం చెయ్యరు. ఒకవైపు వేల కోట్ల రూపాయిల కుంభకోణాలు కళ్ళకు కనపడుతున్నా, భూములు కోల్పోయి  ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి లబోదిబోమంటున్నా, అవినీతికి ఆధారాలున్నాయని కోర్టులు నొక్కివక్కాణిస్తున్నా, కరుడుగట్టిన నేరస్తులతో సంబంధ బాంధవ్యాలు బయటపడుతున్నా, అవన్నీ వొట్టి ఆరోపణలేనని రాజకీయ కుట్రలని బుకాయిస్తారు. ఇంకొంతమంది 'ఎవడు చెయ్యటం లేదు. అందరూ అదేగా చేస్తున్నది ' అని వేదాంతలు చెబుతారు. ఇంకొంతమంది ' ఎప్పుడూ అవినీతికి పాల్పడని వాళ్ళే జగన్‌ని విమర్శించాల ' ని సూత్రీకరిస్తారు. వీళ్ళ ప్రకారం సిగ్నల్‌జంప్ చేసి వందరూపాయిలు లంచమిచ్చిన వాడూ, వేలకోట్ల రూపాయిలు హవాలా మార్గంలో వెనకేసుకొని దేశద్రోహానికి పాల్పడ్డ వాడూ ఒకడే. ఈ గీతా సూత్రం తెలియక భారతీయ శిక్షా స్మృతి ఎన్నో సెక్షన్లు ఏర్పరచుకొంది పాపం.

ఈ దుస్థితి ప్రధాన కారణం పిరికి ప్రభుత్వం, అసమర్థ ప్రతిపక్షం, చవకబారు రాజకీయాలు, మీడియా, మేధావులు. మీడియా గురుంచి ఇదివరకే మాట్లాడుకున్నాం. ప్రభుత్వం గురుంచి, ప్రతిపక్షం గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మేధావుల మౌనం దేశానికి శాపం అని ఊరికే అనలేదు.  దురదృష్టవశాత్తూ జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా జగన్ అరెస్టయ్యేంతవరకూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర ఖజానాని లూటీ చేసిన వ్యక్తి అభిమానులు కూడా ఏ మాత్రం మొహమాటం, సిగ్గూ లేకుండా పబ్లిక్‌గ్గా తమ నేతను వెనకేసుకొస్తున్నప్పుడు ఒక నేరస్తుడిని నేరస్తుడు అని చెప్పడానికి మేధావులు, విలువలున్న నేతలు ఎందుకు అధైర్యపడుతున్నారో ఆలోచించుకోవాలి. వీళ్ళ నోళ్ళు పెగలనంతకాలం సాక్షి చెప్పిందే వేదం, చూపించిందే భాగవతం.


 మూడేళ్ళ క్రితం ప్రమాదవశాత్తూ చనిపోయిన ఒక వ్యక్తిని సానుభూతి వోట్ల కోసం హత్య చేశారంటూ ప్రచారం చేసి, కనీళ్ళు పెట్టుకోవడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఆ ఉదంతం మీద ఇప్పటికే కొన్ని కమిటీలు విచారణ చేసి ఇది ప్రమాదవశాత్తూ జరిగిందేనని, ఇందులో ఏ కుట్రకోణమూ లేదని తేల్చేశాయి. అయినా సరే ఎవో కుంటిసాకులు వెతికి జనాన్ని మభ్య పెట్టటం వీళ్ళకు అలవాటైపోయింది. పోనీ, నిజంగానే ఒక స్పష్టమైన నివేదిక కోసం ఎదురుచూస్తున్నారా అంటే అదీ లేదు. ప్రతిపక్షనాయకుడి ఆస్తుల విచారణ కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడంలో ఉన్న శ్రద్ధ, స్వంత మనిషి మృతి విచారణపై పోరాడటంలో లేదు. ఎక్కడో రైల్వే అకౌంట్స్‌లో పనిచేస్తున్న బ్రహ్మానందరెడ్డిని తీసుకొచ్చి ఏవియేషన్ కార్పొరేషన్‌కి ఎం.డి. ని చేసిన ఘనత వైయెస్సార్‌ది  . అకౌంట్స్ కి  ఏవియేషన్ కి ఏమైనా సంబంధముందా?  వ్యవస్థను అపహాస్యం చేసిన నియామకాల్లో ఇదొకటి. అర్హత లేని వ్యక్తుల్ని కీలకపదవుల్లో నియమించి ఆ తర్వాతి పరిణామాలకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం నిజంగా హాస్యాస్పదం. కిరణ్ ఎందుకు వైయస్‌తో పాటూ హెలికాప్టర్‌లో వెళ్ళలేదు అని వాదిస్తున్న జగన్ వర్గానికి దీని దగ్గర సమాధానముందా ? అసలు జగన్ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ ఆరోపణలుండేవా? ఏడుపులూ పెడబొబ్బలు ఉండేవా? కొన్ని వేలకోట్ల రూపాయిల హవాలా కుంభకోణానికి పాల్పడి, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాక కర్నాటక , సిక్కిం తదితర రాష్ట్రాలకు సైతం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన తన కొడుకుని అరెస్టు చేసినందుకు 'నా కొడుకు ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు ? నా కుటుంబానికి అన్యాయం చేశారు. పద్దెనిమిది నియోజక వర్గాల్లో మమ్మల్నే గెలిపించండి' అని కన్నీళ్ళు పెట్టుకోవటం విజయమ్మకే చెల్లింది.  జగన్‌ని ముఖ్యమంత్రి చెయ్యకపోవటం తప్ప వైయెస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏమీ లేదు. A1 నిందితున్ని ఎప్పుడో అరెస్టు చెయ్యకుండా ఎలెక్షన్ల ముందు అరెస్టు చేసి నిజానికి భారీ సాయమే చేసింది.


అబద్ధాలనే అక్షర సత్యాలుగా ప్రచారం చేసి జనం ఆలోచనా విధానంలో చాలా మార్పులే తీసుకొచ్చింది సాక్షి.  విపక్ష నాయకుల మీటింగులకు వెనుక నుంచి ఫోటోలు తీసి జనం రాలేదని ప్రచారం చెయ్యటం దగ్గర్నుంచి, జగన్ అరెస్ట్ అయ్యాడని తెలిసి తిండి మానేసిన చిన్నారి ఫోటోల వరకు ప్రతి వార్తా విలక్షమైనదే.  ఏళ్ళ తరబడి ప్రభుత్వ ప్రకటనలను ఏకపక్షంగా పొంది, తీరా ప్రభుత్వ నియంత్రణ విధించాక అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని, జర్నలిజంపై దాడని నెత్తీ నోరుబాదుకోవటం, దానికి కొంత మంది మేధావులు వంతపాడటం పెద్ద వింత. అసలు జర్నలిజం విలువలంటూ సాక్షిలో ఉన్నదెప్పుడని ? F.I.R లో రాజశేఖర్‌రెడ్డి పేరు చేర్చటం మహానేరంగా, జగన్‌ని అరెస్టు చెయ్యడం మహాపాపంగా, కోట్లు మింగేసిన వ్యక్తిని సాధారణ డొక్కు వ్యానులో కోర్టుకి తరలిస్తే ఉపద్రవం జరిగిపోయినట్లు  సాక్షి ప్రచారం చేసింది. అసలు వైయ్యెసార్ కుటుంబ చరిత్ర  ఎంతమందికి తెలుసు. (వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. పేజీ 64 నుంచి పేజి 78 వరకు, జగన్ గురించి పేజి 92 )  నెలకు రెండొందలు పింఛను ఇచ్చారనో, కాలేజీ ఫీజులు కట్టారనో, ఆరోగ్యశ్రీ అనో వైకాపాకి ఓట్లేసిన ప్రజలు దోపిడీకి గురైన వేల కోట్ల రూపాయిలు కూడా తమదేనని ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. నిరక్షరాస్యులైన ఎర్రచీరల అవ్వలకు, పచ్చచీరల అక్కలకు ఇప్పుడవి తెలియకపోవచ్చు . రోజుకి వందరూపాయిలు చూడ్డమే గగనమైపోయిన అమాయకులకు వేలకోట్లు ఎంతో బోధపడక పోవచ్చు. ఎలాగోలా వార్తల్లో కనబడాలనే జగన్ తాపత్రయం అర్థం కాకపోవచ్చు. ఏదో అన్యాయం జరిగిందన్న అపోహపడి వాళ్ళంతా గంపగుత్తగా ఫ్యాను గుర్తుకు వోటేసి ఉండవచ్చు. అంత మాత్రాన జగన్ నిర్దోషి అయిపోడు. ఒక రాజకీయ విశ్లేషకుడు విశ్లేషించినట్టు గాలి జనార్ధనరెడ్డిని జైల్లో పెట్టాక శ్రీరాములు యాభైవేల మెజారిటితో గెలిచాడు. బీహార్లో పప్పూయాదవ్ గెలిచాడు. శ్రీరాములు గెలిచినంత మాత్రాన  చేసిన అవినీతి మాయమైపోదు. గాలి నిజాయితీపరుడూ అయిపోడు.  పప్పూయాదవ్ ఉత్తముడూ అవడు. అలానే ఇదీ. సత్యమేవ జయతే.


11 comments

June 16, 2012 at 10:23 AM

తేలికగా కనపడినా, ఈ Dynamics చాలా లోతుగా ఉంటాయి. ఎంత ఏమన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే కీలకం. నాకు చాలా సార్లు అనిపిస్తుంటుంది, తప్పు చేయడం తప్పు కాదు - ఆ తప్పును ఒప్పుగా నిరూపించుకోవడమే ముఖ్యం - ప్రధానంగా మన దేశంలో. పైపెచ్చు కులాలు, మతాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇవి చాలవనట్లు, అవతలవాడు ఎంత అవినీతికి పాల్పడ్డాడో అనవసరం - అందులో నాకెంత ముట్టింది; ఇదే కీలకం.


*** जो जीता वहीं सिकंदर ***

మన ఖర్మ...

Reply
Anonymous
June 16, 2012 at 2:00 PM

"ఈ దుస్థితి ప్రధాన కారణం పిరికి ప్రభుత్వం, అసమర్థ ప్రతిపక్షం, చవకబారు రాజకీయాలు, మీడియా, మేధావులు"

చాలా బాగా చెప్పారు.

బహుశా ఓటర్లకి వాళ్ళ లాజిక్కులేవో వాళ్ళకి ఉండుంటాయి.

ఇందాక రీడిఫ్ డాట్ కాం లో ఒక చక్కని కామెంట్ చదివాను.

"అలీబాబా గెలిచాడు, 40 దొంగలు ఓడిపోయారు" అని.

Reply

తెలుగుభావాలు గారు,

వాస్తవం చెప్పారు.కానీ ఈ డైనమిక్స్ కారణంగా 'ప్రజా బలం నాకే ఉంది,మున్ముందు నా అవసరం మీకూ ఉంది ' అని బ్లాక్‌మెయిల్ చేసి,ఒత్తిళ్ళు తెప్పించి జగన్‌లాంటి అవినీతిపరులు నిర్దోషిగా బయటపడే ప్రమాదముంది.ఇప్పటికే విశ్వసనీయత,విధేయత అన్న పదాలకు అర్థాలు మారిపోయాయి.మరో పదేళ్ళు పోతే జగన్ అవినీతిని అందరూ మర్చిపోతారు.అప్పుడు నిజాయితీకి మరో పేరు జగనే అని వ్రాసుకున్నా అడిగేవాడుండడు.ఎటు వైపు ఈ ప్రస్థానం.

Reply

బోనగిరి గారు,
కామెంటు అదిరింది :-)

Reply
June 17, 2012 at 11:14 AM

బాగా చెప్పావు శ్రీకాంత్ !

నేర పరిశోదనా సంస్థలు, కోర్టులు జగన్ ఒక జగత్కిలాది అని నిరూపిస్తుంటేకూడా లక్షల ఓట్ల మెజారిటితో గెలిపిస్తున్న జనాలు .....పాలకపక్షమో, ప్రతిపక్ష్మో, మేధావులో, జయప్రకాశ్ నారాయణో చెప్పినంతమాత్రాన ఫలితం ఉంటుందంటావా?

ఇక 600 ఆత్మహత్యలు అంటావా: ఈమధ్య ఒక మనదేశం కాని ఫ్రెండ్ కి ఈవిషయం చెప్తే.........what about his(YSR) family members? అని అడిగాడు.

ఇప్పుడుండే పరిస్తితులకి సీతరామశాత్రి గారి ఆ పాటే సమాదానం (గాలి వాటు గమనానికి కాలిబాట దేనికి, గొర్రె దాటు ...... జ్ఞానబోధ దేనికి).

Reply

సోమా,
స్వాగతం.నా బ్లాగులో నీ మొదటి కామెంటు అనుకుంటా.టపా నచ్చినందుకు సంతోషం :-).బొత్స సత్తిబాబు లాంటి బ్యాచ్ చెబితే నమ్మకపోవచ్చు కానీ జయప్రకాష్ నారాయణ లంటి విలువలున్న నేతలు చెబితే తప్పకుండా ఆలోచిస్తారు. లోక్‌సత్తా సమస్య ఏంటంటే జనంలోకి యాక్టివ్‌గా వెళ్ళలేకపోవటం. ప్రెస్‌మీట్ పెట్టి ఓ రోజు మాట్లాడితే సరిపోదు.

Reply
June 17, 2012 at 9:54 PM

కుల గజ్జి కళ్ళని కమ్మేస్తే ప్రజా తీర్పు కూడా బూతు లాగా కనపడుతుంది. పచ్చ బాబు 200 కోట్లు పంచితే అది నీతి నిజాయితీ ,పైసా పంచని వాడు అవినీతి పరుడు.
ఓహో ,మీ లింక్ చూసాను. మరి అటువంటి YS ది నేరస్తుల కుటుంభం అయితే పచ్చ బాబు 9 సంవత్సరాలు గుర్రాలకి పళ్ళు తోముతున్నాడా ? ఎందుకు చర్య తీసుకోలేదు.
నోటికి ఏది పడితే అది వాగితే నిజమవుతుందా ? బెల్లం కొండ గాడిని తుపాకి పెట్టి కాల్చితే వాడితో వియ్యమంది నీతులు చెప్పే ఎదవలు ఉన్న సమాజం ఇది.

FIR ఉంటేనే నేరస్తుడు అవుతాడా ? ఏ న్యాయ శాస్త్రం చెపుతుంది ? ఇటువంటి స్వయం తీర్పులు ఇచ్చేసి కోట్లాది మంది ప్రజల తీర్పుని అపహాస్యం చేసే కుల గజ్జి గాళ్ళకి ఇటువంటి షాకులు మామూలే.

మీ ఏడుపులే ఈ ప్రజలకి శ్రీరామ రక్ష. తింటే తిన్నాడు ,మాకు కొంత పెట్టాడు. ఈ పచ్చ బాబులకి వోటు వేస్తె వాడికి వాడి కులపోళ్ళకే సరిపోదు .ఏమి చేస్తాము ఉన్న వాళ్ళలో జగనే బెటరు. మాకు కాస్తన్న పెడతాడు .

ప్రజలకి రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టిచ్చాడు ,పించన్లు ఇచ్చాడు ,పిల్ల ల ఫీజు కట్టాడు ,ఆపరేషన్లు చేయించాడు,రుణాలు మాఫీ చేయించాడు ,పావలా వడ్డీకి ఇచ్చాడు (మీ ద్రుష్టి లో పప్పు బెల్లాలు పంచాడు ),తను తిన్నాడు. అంతకు ముందోల్లు, తెలుగు దేశాపోల్లు ఆ మాత్రం పెట్టకుండా మొత్తం మింగారు గా,కనీసం ఆ పప్పు బెల్లాలు కూడా పెట్టలేదు. మొతం వాడికి ,వాడి కులపోల్లు నలుగురికే సరిపోలేదు. ఎటు చూసుకున్న రాజ శేఖర్ రెడ్డే బెటరు. అందుకే మా లాంటి ప్రజలు వోటు వేస్తారు. ఆ మాత్రం లాజిక్ అర్ధం కాలేదా శ్రీకాంత్ గారు !!!!!

మీకోసం ఈ ఆర్టికల్.

http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htm

Reply

భాస్కరరావు గారు,

నాది చంద్రబాబు కులం కాదు.నాకు కులగజ్జి అంటగట్టి జగన్‌ని వ్యతిరేకించే వాళ్ళంతా అదే కులం అనుకుంటే మీరు అపోహ పడినట్లే.జగన్ పైసా పంచకుండా ఎన్నికల్లో గెలిచాడా? నా కళ్ళు తెరిపించారు!! చంద్రబాబు నాయుడు నీతిమంతుడని నేను చెప్పలేదు.చంద్రబాబైనా మరెవరైనా జగన్ అవినీతి ముందు దిగదుడుపే నా నమ్మకం. కాదని రుజువైనా పక్షంలో నా అభిప్రాయాలు మార్చుకోడానికి సిద్ధమే.

వైయెస్సర్ మీద చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడిగారు.2004 నుంచి 2009 వరకు చంద్రబాబు మీద రాజశేఖర్‌రెడ్డి ఏం చేశాడో తనూ అదే చేశాడు.ప్రతి ఒక్కరికీ రోజు వస్తుంది.జగన్‌ని అరెస్ట్‌చెయ్యడానికి ఇన్నేళ్ళు పట్టింది.మిగతా వాళ్ళకూ ఆ రోజు వస్తుంది.అంతవరకూ వెయిట్ చెయ్యండి.FIRలో పేర్లు వుంటే నేరస్తులు కాకపోవచ్చు. కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే, కోర్టులు కీలక వ్యాఖ్యానాలు చేసి రిమాండును పొడిగిస్తున్నాయి, విచారణకు అనుమతిస్తున్నాయి.ఇక మీరు చెప్పిన ఇందిరమ్మ ఇళ్ళు వగైరా, వగైరా..అది జనం సొమ్ము.వైయెస్ ఏమీ తన జేబులోంచి తీసి ప్రజలకు పంచివ్వలేదు.వేలకోట్ల రూపాయిలు దిగమింగి ప్రజలకు ఎంగిలి మెతుకులు విదిలించారు. అదే మహాప్రసాదం అని మీరనుకుంటే అలాగే కానివ్వండి. దేశానికి ఇది కొత్తకాదు.

మీరు పెట్టిన లింకు నేను ఎప్పుడో చదివాను .

Reply
June 18, 2012 at 3:08 PM

సిగ్గు లేకుండా అబద్దాలు వల్లె వేయడం మీ లాంటి సో కాల్డ్ మేధావులకే చెల్లు. మీ అందరికీ ఉన్న భావన ఒక్కటే. రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమ్మంత్రిగా వెలగబెట్టిన నారా వారి పాలన గుర్తుందా మీకు? ఇప్పుడు అదే కుర్చీలో కూసున్న నల్లారి వారు చిత్తూరు జిల్లాకు ప్రాణాధారమైన గాలేరు - నగరి ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ కేటాయిచ్చారు? ఊరికే పై పెచ్చు రామోజీ అచ్చోసే కరపత్రం చదివి ఒక అభిప్రాయానికి రావొద్దు. ఎందుకీ తొందర? ఎందుకీ అసహనం? ప్రజలు తెలివి లేనివాళ్ళు కాదు. వాళ్ళ ఆలోచనా సామర్థ్యం పెరిగింది. మిది మిది జ్ఞానంతో తీరౌలిచ్చే మీ (నా) లాంటి వాళ్ళ మాటలకు ఇప్పుడు విలువ లేదు. ఎవరు తమకు మేలు (సంక్షేమం) చెయ్యగలరో వాళ్లకు బాగా తెలుసు.

Reply

విజయ్ గారు,

ఒక డెకాయిట్ ఫ్యామిలినీ సపోర్ట్‌చేస్తున్న మీకు లేని సిగ్గు నాకు దేనికండి? ఇక్కడ జగన్ గురుంచి, వైయెస్ గురుంచి నేను వ్రాసిన దాన్లో అబద్ధం ఒక్కటీ లేదు. డెకాయిట్ అని కూడా ఊరికే అనటం లేదు.పౌర హక్కుల సంఘం నేత స్వర్గీయ బాలగోపాల్ గారు వ్రాసిన పుస్తకం చదివారా? దాన్లో ఉన్నాయి లీలలన్నీ.ఇవన్నీ దాదాపు ప్రతి పత్రికలో వచ్చినవే. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అదీ నిజమైపోతుందన్న లోకనానుడిని సాక్షి బాగా వంటబట్టించుకొంది. మొన్నటిదాకా జగన్ అరెస్టు అక్రమం అన్నారు.కోర్టు సక్రమమే అని తీర్పీస్తే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. ఇలంటివి చెప్పాలంటే బోలెడు. అయినా ఒక దొంగని దొంగ అనటానికి మేధావితనం ఎందుకండి? కామన్‌సెన్స్ చాలు. ఎవరన్నారు నేను 'ఈనాడు' మాత్రమే చదువుతానని ? 'సాక్షి'ని కూడా చదువుతాను... కాసేపు పగలబడి నవ్వుకోడానికి. బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం గాలేరు నగరి ప్రాజెక్టుకు 2012-13 సంవత్సరానికి గాను 419.86 కోట్లు,హంద్రి నీవాకు 700 కోట్లు కేటాయించారు.అపర భగీరథుడు గారు 2004-2005 సంవత్సరంలో గాలేరు నగరి,హంద్రి నీవా రెండింటికి కలిపి 61.24 కోట్లు కేటయించారు.ఈ సమాచారం చాలా మీకు? ప్రజలకు అన్ని విషయలూ తెలియవు.భవిష్యత్తులో తెలుసుకుంటారనే భావిస్తాను.

Reply
October 31, 2012 at 3:12 AM

right is wrong and wrong is right andhra wrong route lo vundi

you r 100% right brother

Reply
Post a Comment