సమాజ జీవచ్ఛవం

 ప ఎన్నికల ఫలితాలు చుశాక నాకు గాయం  సినిమాలోంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వ్రాసిన ఈ క్రింది పాట గుర్తొచ్చింది .



ఈ క్రింది వార్తలు చూశారా? నాకైతే మూడింటికీ పెద్ద తేడా కనబడలేదు.





















ఒకరు దేశాన్ని కుదిపేసిన 2జి కుంభకోణానికి ప్రధానసూత్రధారి.  ఇంకొకరు మతం ముసుగులో ఆశ్లీల కార్యకలాపాలకు అవకతవకలు పాల్పడ్డ స్వామీజీ.  మరొకరు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని నిలువునా దోచేసి అనతి కాలంలోనే వేలకోట్లకు పడగలెత్తి, మృతదేహం రాకముందే ముఖ్యమంత్రై పోదామని కలలు గని ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్న జగన్. ముగ్గురూ మేము నిర్దోషులమని బుకాయిస్తున్నవాళ్ళే. రాజా దళిత కార్డు ఉపయోగిస్తూంటే, నిత్యానంద మతం కార్డు ప్రయోగిస్తున్నాడు. జగన్ తండ్రి, తల్లి, చెల్లి ద్వారా సెంటిమెంటు పండించటానికి కృషి చేస్తున్నాడు.

ఒకప్పుడు నేరం చేసినవాళ్ళు పట్టుబడినప్పుడు అవమానభారంతో తలదించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది. కోట్లాది రూపాయిలు మింగేసిన వాళ్ళు, రేపులు హత్యలు చేసిన వాళ్ళు దేశోద్ధారకులుగా చలామణీ అయిపోతున్నారు. ఎన్ని అవలక్షణాలుంటే వాడే హీరో.   తమ కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఆత్మార్పణలు   చేసుకునే వెఱ్ఱి జనాన్ని చూసి వీళ్ళంతా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జైళ్ళలో ఉన్నా రాజభోగాలు అనుభవిస్తూ  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.  రోజుకొకటి చొప్పున తామర తంపరగా పుట్టుకొస్తున్న టి.వీ.ఛానళ్ళు  రేటింగులకోసం వీళ్ళను కవర్‌చేసి యథాశక్తి హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి.

 అఫ్‌కోర్స్. మనదేశంలో ఇంతకంటే అద్భుతాలు  జరుగుతాయని ఊహించలేం. గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది. జనాన్ని మోసం చెయ్యటం చాలా తేలిక.  నిరక్షరాస్యులనైతే చెప్పక్కర్లేదు. చదువుకున్న వాళ్ళనైతే మరీ సులభం. చదవేస్తే ఉన్నమతి పోయినట్లు వీళ్ళ సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోయింది. చేతిలో ఒక పేపరు, చూడ్డానికో ఛానలు, చెప్పడానికి కొన్ని అబద్ధాలు ఉంటే ఇక తిరుగులేదు. ఒక్కసారి వీళ్ళకు బ్రెయిన్‌వాష్ చెయ్యగలిగితే ఆ తర్వాత వీళ్ళను మించిన వీరాభిమానులు మరొకరుండరు. రకరకాల వాదనలు లేవనెత్తి తమ నేతను మించిన నేత మరొకడు లేడని ఢంకా భజాయించి ప్రచారం చేస్తారు. ఒక నాయకుడు చనిపోతే ఆరొందల మంది ఆత్మహత్యలు చేసుకోవటం, హఠాన్మరణం చెందటం ఏమిటన్న కనీస అనుమానం వీళ్ళకు రాదు. ఈ జాబితా మొత్తం ఫేక్ అయినా వీళ్ళకు పట్టింపు లేదు. అలా మరణించిన వాళ్ళను రెండున్నరేళ్ళు ఓదార్చమేమిటన్న తలంపూ రాదు. 2004లో 9.18 లక్షలున్న ఆస్తి 2011 నాటికి 365 కోట్లెలా అయ్యిందంటే అదంతా తమ నేత అసమాన వ్యాపార దక్షత అని గుడ్డిగా వాదిస్తారు తప్ప అందులో వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం చెయ్యరు. ఒకవైపు వేల కోట్ల రూపాయిల కుంభకోణాలు కళ్ళకు కనపడుతున్నా, భూములు కోల్పోయి  ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి లబోదిబోమంటున్నా, అవినీతికి ఆధారాలున్నాయని కోర్టులు నొక్కివక్కాణిస్తున్నా, కరుడుగట్టిన నేరస్తులతో సంబంధ బాంధవ్యాలు బయటపడుతున్నా, అవన్నీ వొట్టి ఆరోపణలేనని రాజకీయ కుట్రలని బుకాయిస్తారు. ఇంకొంతమంది 'ఎవడు చెయ్యటం లేదు. అందరూ అదేగా చేస్తున్నది ' అని వేదాంతలు చెబుతారు. ఇంకొంతమంది ' ఎప్పుడూ అవినీతికి పాల్పడని వాళ్ళే జగన్‌ని విమర్శించాల ' ని సూత్రీకరిస్తారు. వీళ్ళ ప్రకారం సిగ్నల్‌జంప్ చేసి వందరూపాయిలు లంచమిచ్చిన వాడూ, వేలకోట్ల రూపాయిలు హవాలా మార్గంలో వెనకేసుకొని దేశద్రోహానికి పాల్పడ్డ వాడూ ఒకడే. ఈ గీతా సూత్రం తెలియక భారతీయ శిక్షా స్మృతి ఎన్నో సెక్షన్లు ఏర్పరచుకొంది పాపం.

ఈ దుస్థితి ప్రధాన కారణం పిరికి ప్రభుత్వం, అసమర్థ ప్రతిపక్షం, చవకబారు రాజకీయాలు, మీడియా, మేధావులు. మీడియా గురుంచి ఇదివరకే మాట్లాడుకున్నాం. ప్రభుత్వం గురుంచి, ప్రతిపక్షం గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మేధావుల మౌనం దేశానికి శాపం అని ఊరికే అనలేదు.  దురదృష్టవశాత్తూ జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా జగన్ అరెస్టయ్యేంతవరకూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర ఖజానాని లూటీ చేసిన వ్యక్తి అభిమానులు కూడా ఏ మాత్రం మొహమాటం, సిగ్గూ లేకుండా పబ్లిక్‌గ్గా తమ నేతను వెనకేసుకొస్తున్నప్పుడు ఒక నేరస్తుడిని నేరస్తుడు అని చెప్పడానికి మేధావులు, విలువలున్న నేతలు ఎందుకు అధైర్యపడుతున్నారో ఆలోచించుకోవాలి. వీళ్ళ నోళ్ళు పెగలనంతకాలం సాక్షి చెప్పిందే వేదం, చూపించిందే భాగవతం.


 మూడేళ్ళ క్రితం ప్రమాదవశాత్తూ చనిపోయిన ఒక వ్యక్తిని సానుభూతి వోట్ల కోసం హత్య చేశారంటూ ప్రచారం చేసి, కనీళ్ళు పెట్టుకోవడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఆ ఉదంతం మీద ఇప్పటికే కొన్ని కమిటీలు విచారణ చేసి ఇది ప్రమాదవశాత్తూ జరిగిందేనని, ఇందులో ఏ కుట్రకోణమూ లేదని తేల్చేశాయి. అయినా సరే ఎవో కుంటిసాకులు వెతికి జనాన్ని మభ్య పెట్టటం వీళ్ళకు అలవాటైపోయింది. పోనీ, నిజంగానే ఒక స్పష్టమైన నివేదిక కోసం ఎదురుచూస్తున్నారా అంటే అదీ లేదు. ప్రతిపక్షనాయకుడి ఆస్తుల విచారణ కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడంలో ఉన్న శ్రద్ధ, స్వంత మనిషి మృతి విచారణపై పోరాడటంలో లేదు. ఎక్కడో రైల్వే అకౌంట్స్‌లో పనిచేస్తున్న బ్రహ్మానందరెడ్డిని తీసుకొచ్చి ఏవియేషన్ కార్పొరేషన్‌కి ఎం.డి. ని చేసిన ఘనత వైయెస్సార్‌ది  . అకౌంట్స్ కి  ఏవియేషన్ కి ఏమైనా సంబంధముందా?  వ్యవస్థను అపహాస్యం చేసిన నియామకాల్లో ఇదొకటి. అర్హత లేని వ్యక్తుల్ని కీలకపదవుల్లో నియమించి ఆ తర్వాతి పరిణామాలకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం నిజంగా హాస్యాస్పదం. కిరణ్ ఎందుకు వైయస్‌తో పాటూ హెలికాప్టర్‌లో వెళ్ళలేదు అని వాదిస్తున్న జగన్ వర్గానికి దీని దగ్గర సమాధానముందా ? అసలు జగన్ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ ఆరోపణలుండేవా? ఏడుపులూ పెడబొబ్బలు ఉండేవా? కొన్ని వేలకోట్ల రూపాయిల హవాలా కుంభకోణానికి పాల్పడి, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాక కర్నాటక , సిక్కిం తదితర రాష్ట్రాలకు సైతం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన తన కొడుకుని అరెస్టు చేసినందుకు 'నా కొడుకు ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు ? నా కుటుంబానికి అన్యాయం చేశారు. పద్దెనిమిది నియోజక వర్గాల్లో మమ్మల్నే గెలిపించండి' అని కన్నీళ్ళు పెట్టుకోవటం విజయమ్మకే చెల్లింది.  జగన్‌ని ముఖ్యమంత్రి చెయ్యకపోవటం తప్ప వైయెస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏమీ లేదు. A1 నిందితున్ని ఎప్పుడో అరెస్టు చెయ్యకుండా ఎలెక్షన్ల ముందు అరెస్టు చేసి నిజానికి భారీ సాయమే చేసింది.


అబద్ధాలనే అక్షర సత్యాలుగా ప్రచారం చేసి జనం ఆలోచనా విధానంలో చాలా మార్పులే తీసుకొచ్చింది సాక్షి.  విపక్ష నాయకుల మీటింగులకు వెనుక నుంచి ఫోటోలు తీసి జనం రాలేదని ప్రచారం చెయ్యటం దగ్గర్నుంచి, జగన్ అరెస్ట్ అయ్యాడని తెలిసి తిండి మానేసిన చిన్నారి ఫోటోల వరకు ప్రతి వార్తా విలక్షమైనదే.  ఏళ్ళ తరబడి ప్రభుత్వ ప్రకటనలను ఏకపక్షంగా పొంది, తీరా ప్రభుత్వ నియంత్రణ విధించాక అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని, జర్నలిజంపై దాడని నెత్తీ నోరుబాదుకోవటం, దానికి కొంత మంది మేధావులు వంతపాడటం పెద్ద వింత. అసలు జర్నలిజం విలువలంటూ సాక్షిలో ఉన్నదెప్పుడని ? F.I.R లో రాజశేఖర్‌రెడ్డి పేరు చేర్చటం మహానేరంగా, జగన్‌ని అరెస్టు చెయ్యడం మహాపాపంగా, కోట్లు మింగేసిన వ్యక్తిని సాధారణ డొక్కు వ్యానులో కోర్టుకి తరలిస్తే ఉపద్రవం జరిగిపోయినట్లు  సాక్షి ప్రచారం చేసింది. అసలు వైయ్యెసార్ కుటుంబ చరిత్ర  ఎంతమందికి తెలుసు. (వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. పేజీ 64 నుంచి పేజి 78 వరకు, జగన్ గురించి పేజి 92 )  నెలకు రెండొందలు పింఛను ఇచ్చారనో, కాలేజీ ఫీజులు కట్టారనో, ఆరోగ్యశ్రీ అనో వైకాపాకి ఓట్లేసిన ప్రజలు దోపిడీకి గురైన వేల కోట్ల రూపాయిలు కూడా తమదేనని ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. నిరక్షరాస్యులైన ఎర్రచీరల అవ్వలకు, పచ్చచీరల అక్కలకు ఇప్పుడవి తెలియకపోవచ్చు . రోజుకి వందరూపాయిలు చూడ్డమే గగనమైపోయిన అమాయకులకు వేలకోట్లు ఎంతో బోధపడక పోవచ్చు. ఎలాగోలా వార్తల్లో కనబడాలనే జగన్ తాపత్రయం అర్థం కాకపోవచ్చు. ఏదో అన్యాయం జరిగిందన్న అపోహపడి వాళ్ళంతా గంపగుత్తగా ఫ్యాను గుర్తుకు వోటేసి ఉండవచ్చు. అంత మాత్రాన జగన్ నిర్దోషి అయిపోడు. ఒక రాజకీయ విశ్లేషకుడు విశ్లేషించినట్టు గాలి జనార్ధనరెడ్డిని జైల్లో పెట్టాక శ్రీరాములు యాభైవేల మెజారిటితో గెలిచాడు. బీహార్లో పప్పూయాదవ్ గెలిచాడు. శ్రీరాములు గెలిచినంత మాత్రాన  చేసిన అవినీతి మాయమైపోదు. గాలి నిజాయితీపరుడూ అయిపోడు.  పప్పూయాదవ్ ఉత్తముడూ అవడు. అలానే ఇదీ. సత్యమేవ జయతే.


11 comments

Post a Comment