విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మూడవభాగం



దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత విశ్వనాథ వారి వేయిపడగలు నవల సమీక్షకు మూడవ భాగం వ్రాస్తున్నందుకు పాఠకులు క్షమించాలి. దీనికి ప్రధాన కారణం అంత పెద్ద కథను క్లుప్తంగా ఎలా చెప్పాలో వెంటనే బోధపడకపోవటం. అందువల్లనే దీనిని వెనక్కి నెట్టి మిగతా విషయాల మీద టపాలు వ్రాయటం జరిగింది. ఇప్పుడు వీలు చిక్కింది కాబట్టి నింపాదిగా ఒకటికి రెండుసార్లు చదివి మధ్యలోనే ఆగిపోయిన సమీక్షను కొనసాగించదలచుకున్నాను. ముందు మిగతా కథలోకి వెళ్దాం.

రామేశ్వరం తాలూకా అధ్యక్షుడవుతాడు. సినిమా వ్యాపారం మొదలుపెట్టి డబ్బులు బాగా వెనకేసుకుంటాడు. జోస్యులు అనే ఉపాధ్యాయుడు అతని ప్రాపు కోసం ప్రాకులాడి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. జోస్యులు భార్య మంగమ్మ. ఆమెకు నాగరిక లక్షణాలు తెలియవు. పైగా మగడంటే ఎక్కడలేని అయిష్టత. రామేశ్వరం మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకుంటాడు. విషయం తెలిసిన జోస్యులు తీవ్రంగా మథనపడి, సంగతి నలుగురికీ తెలిసిందని గ్రహించి అత్మహత్యాప్రయత్నం చెయ్యబోయి ధైర్యం చాలక గొల్లుమంటాడు.

పాఠశాలల తనిఖీకి వచ్చిన రామేశ్వరాన్ని చూసి జోస్యులు ఖాతరు చెయ్యకుండా నిద్రబోతాడు.రామేశ్వరం సంజాయిషీ కోరుతూ చీటీ పంపితే ' తాను సరిగ్గాలేడు గనకే తన భార్యను అతను ఏలుకొంటున్నాడని,తన నెల జీతం తనకు నెలా నెలా సరిగ్గా ముట్టజెప్పాలని,అలాగే తన భార్యతో కలిసి ఇంకా తను ఒకే ఇంట్లో ఉంటున్నందుకు పైకం పంపించాలని',తిరుగు టపా పంపుతాడు జోస్యులు. మంగమ్మ మోజులోపడిన రామేశ్వరం తన యావదాస్తిని ఆమె పేరిట వ్రాస్తాడు. అందరూ జోస్యుల్ని నపుంసకుడని గేలిచేస్తారు. జోస్యులు ఉన్మాదావస్థకు లోనై ఒకరోజు వీధిలో పెద్దమనుషులతో వెళ్తున్న రామేశ్వరం మీద కత్తితో దాడి చేస్తాడు. రామేశ్వరం మనుషులు అతని ఒళ్ళు హూనం చేస్తారు. పిచ్చివాడై రాత్రిపూట గుండేరు దగ్గర తిరుగుతున్న జోస్యులు హత్యకు గురవుతాడు.

రామేశ్వరం దొంగనోట్ల కేసులో అరెస్టవుతాడు. అతని పలుకుబడి ఆస్తిపాస్తులు అతన్ని రక్షించలేకపోతాయి. ఏడేండ్ల జైలుశిక్ష పడుతుంది. భర్తపోయాక గడసరితనం, నిర్భయత్వం అలవర్చుకున్న మంగమ్మ, జైలుకి వెళ్ళి రామేశ్వరాన్ని అపహాస్యం చేస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టయిన తన స్నేహితుడిని చూడటానికి అదే జైలుకు వచ్చిన ధర్మారావు, కటకటాల వెనుకనున్న రామేశ్వరాన్ని చూసి తగినశాస్తి జరిగిందని అనుకుంటాడు.

ధర్మారావు స్నేహితుడు కిరీటి. అతనికి తన మరదలంటే చాలా ఇష్టం. తన కూతురుని అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తానని చిన్ననాడు ప్రమాణం చేసిన అతని మేనమామ,ఆ తర్వాత నయాపైసా సంపాదన లేదని తెలిసి విముఖత చూపిస్తాడు.కిరీటి తల్లి మరణిస్తుంది.కిరిటి మరింత కృంగిపోయి నిద్రాహారాలు లేక నీరసించిపోతే,కబురందుకున్న అతని మేనమామ జాలిపడి తుదకు పెళ్ళికి అంగీకరిస్తాడు.

రాధాపతి ఒక మోస్తరు కవి. మంచి మాటకారి పైగా జిత్తులమారి. పనీపాటా లేకుండా ఆవారాగా తిరుగుతూంటాడు. బిజిలీ అనే ఒక నాటకాలపిల్లతో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపి,ఆమె తరపువాళ్ళు కర్రలు పుచ్చుకోవడంతో కాలికి బుద్ధిచెప్పి మనోచాంచల్యం చావక ట్రైనులో తారసపడిన ఒక ఉపాధ్యాయురాలిని బుట్టలో వేసుకుంటాడు. ఆమెతో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆమెను గర్భవతి చేస్తాడు. పెళ్ళి కాకుండా తల్లయినందుకు ఆమె కించపడి అబార్షన్ చేయించుకుంటుంది. అప్పటికి అతని వాలకం తేటతెల్లమై అతనితో తెగతెంపులు చేసుకుంటుంది. అప్పులవాళ్ళు పట్టుకుపోగా మిగిలిన ఆస్తిని కరిగించి బెజవాడలో అనాధ స్త్రీ శరణాలయం తెరుస్తాడు రాధాపతి. రామేశ్వరం ద్వారా ప్రాప్తించిన ధనంతో అక్కడికి చేరుకున్న మంగమ్మ, అతని తీపిమాటలకు మోసపోయి అతనితో పాటూ తిరిగి సుబ్బన్నపేట వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది.

పంకజమ్మ ఒక వితంతువు. ఆమె కూతురు శ్యామల కుమారస్వామి అనే ఒక పేదబ్రాహ్మణ విధ్యార్థిని ఇష్టపడుతుంది.పంకజమ్మకు ఇదంతా ఇష్టముండదు. అందరికీ తనమీద గౌరవం ఉండటం చేత వారు పిలిచినప్పుడల్లా వెళ్ళి చర్చల్లో పాల్గొంటూ అనేక విషయలమీదా వాదోపవాదాలు చేస్తూంటాడు ధర్మారావు. అతని ఆభిప్రాయాలు,భావాలు రాధాపతికి నచ్చవు. బి.సి.కాలం నాటి వాడంటూ అతన్ని ఈసడించుకుంటాడు. తనతో పాటూ బెజవాడ రావల్సిందిగా మంగమ్మను కోరుతాడు. ధర్మారావు ప్రభావంతో మారిపోయిన ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.

ధర్మారావు దంపతులు 'ఉండి' వెళ్ళి పశుపతి ఇంట్లో కొన్ని రోజులుంటారు. పశుపతి కూతురు పేరు కూడా అరుంధతే. ఆ పాపతో వారిద్దరికీ చనువు కుదురుతుంది. సుబ్బన్నపేటలోని బ్రాహ్మణవీధిలో మంటలంటుకొని ఇళ్ళు తగలబడిపోతాయి. పురపాలక సంఘం సమావేశమై కుళాయిలు విద్యుద్దీపాలు సమకూర్చుకోవాలని నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయాన్ని ధర్మారావు అన్నగారు వ్యతిరేకిస్తారు. ఉన్న అప్పులే తీరలేదని,కొత్తగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలందరిమీదా పన్నులభారం పడుతుందని వాదిస్తారు. ఆయన మాటలను అందరూ పెడచెవిని పెడతారు. సుబ్బన్నపేటకు కుళాయిలు,విద్యుద్దీపాలు వస్తాయి. స్త్రీ సంఘం ఏర్పాటై బాల్య వివాహాలు,విధవా వివాహాల మీద చర్చలు మొదలవుతాయి.

రంగారావు శ్రీలంక నుంచి ఒక ఫ్రెంచి వనితను తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు. ఇంగ్లీషు భార్యకు,ఫ్రెంచి భార్యకు మధ్య సవతుల గొడవ ప్రారంభవుతుంది. కోర్టుకెక్కి సమస్యలు తెచ్చుకోలేక ఫ్రెంచి వనితను నెలభరణానికి ఒప్పించి ఆమెను తిరిగి శ్రీలంక పంపేస్తాడు రంగారావు. ఇంగ్లీషు భార్య పేరు సుసానీ. సాధ్యమైనంత పైకం మూటగట్టుకొని ఇంగ్లాండుకు శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఆమెకు ఊహ కలుగుతుంది. ఈ లోగా రంగారావు అంతుచిక్కని వ్యాధికి గురవుతాడు. ఇంగ్లీషు మందులు పనిచెయ్యవు. ఇదే సమయమని భావించిన సుసానీ తను ఇంగ్లాండు వెళ్ళిపోతానని రంగారావుతో చెబుతుంది. అతను అంగీకరిస్తాడు. సుసానీ ఉన్నదంతా ఊడ్చుకొని ఇరవైలక్షల రూపాయలతో వెళ్ళిపోవాలని సన్నాహాలు చేసుకుంటుండగా రంగారావు కొడుకు హర్రప్ప వచ్చి తన తల్లి నగలు మాత్రం విడిచి వెళ్ళమని అర్థిస్తాడు. ఆమె ఒప్పుకొని మిగిలిన సొమ్మంతా పెద్ద పెద్ద పెట్టెలలో పోగేసుకొని ఇంగ్లాండు తీసుకుపోతుంది. అయితే ఆమెను మోసం చేసి పది లక్షలవరకు కాజేస్తాడు దివాను. హర్రప్ప రాజ్యాధికారం తన చేతుల్లోకి తీసుకొని అన్ని వ్యవహారాలు చక్కబెడతాడు. తండ్రికి ఆయుర్వేద వైద్యున్ని కుదుర్చి ధర్మారావుని తన దివానుగా నియమిస్తాడు. జీతం పుచ్చుకోడానికి ధర్మారావు అంగీకరించడు.

కుమారస్వామి,శ్యామల వివాహం జరుగుతుంది. బ్రతుకు గడవడం కోసం మంగమ్మ దగ్గర అప్పులు చేస్తూంటాడు. అతను పదే పదే ఇంటికి రావటం రాధాపతికి నచ్చదు. మంగమ్మ రాధపతిని లక్ష్యపెట్టదు. ఆమె సారంగధర నాటకంలో చిత్రాంగి వేషం కడుతుంది. అరుంధతి రోగగ్రస్తురాలవుతుంది.

హర్రప్ప నాయనమ్మకు, తల్లికి కర్మలు చేసి,వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలకు అంకురార్పణ చేస్తాడు. ధర్మారావు కుటుంబసభ్యులు సంతోషసాగరంలో మునిగిపోతారు. బంధుమిత్రాదులతో ధర్మారావు గృహం కళకళాడుతుంది. పిల్లవాడైన ధర్మారావు కొడుకు కోటకు ఒంటరిగా వెళ్ళి భయం లేకుండా సంచరిస్తూ,ముద్దు ముద్దు మాటలతో రోగిపీడుతుడైన రంగారావుకు ఉల్లాసాన్ని కలిగిస్తూంటాడు. ఇంతకాలం కళ్యాణోత్సవాల కోసమే ఎదురుచూసిన దేవదాసి,ఉత్సవాలలో అందంగా అభినయించి ప్రాణాలు విడుస్తుంది. ఈలోగా అరుంధతి అనారోగ్యం ముదిరి అవసానదశకు చేరుకుంటుంది.

తన ఆవేశం కారణంగా ఉద్యోగం కోల్పోతాడు కుమారస్వామి. మంగమ్మ అతన్ని కుమారునిగా భావించి ఆస్తంతా అతని పేర, ఏటా స్వామి ఉత్సవాల నిర్వహణ పేరిట రాసేస్తుంది. చిన్ననాడు ఇష్టపడిన తన బంధువుల అమ్మాయిని శరణాలయం వచ్చి తన బాగోగులు చూడవలసిందిగా అభ్యర్తిస్తాడు రాధాపతి. ఆమెకు ఇదివరకే పెళ్ళయ్యింది. మొగుడితో దెబ్బలాడి రాధాపతితో వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది. తనను ప్రేమించమని ఆమెనడుగుతాడు రాధాపతి. సహజీవనం చేస్తున్నా కూడా అతనిని ప్రేమించలేనంటుందామె. రాధాపతి విరక్తి చెంది సైనేడు మింగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయమంతా అతని సహచరుడు వ్రాసిన ఉత్తరం వలన మంగమ్మకు తెలుస్తుంది. ఆస్తంతా ఇతరులకు దానం చేసిందనే కోపంతో,నమ్మకంగా పనిచేస్తునట్లు నటిస్తూ వచ్చిన చెంగల్రావనే వ్యక్తి మంగమ్మను హత్య చేస్తాడు. పోలిసులతన్ని అరెస్టు చేస్తారు. అరుంధతి మరణిస్తుంది.ధర్మారావు శోకసముద్రంలో మునిగిపోతాడు.

రంగారావు ఆరోగ్యం కుదుటపడుతుంది. హర్రప్ప యోగమరణం పొందుతాడు. గణాచారి పాకలోనే తగలబడిపోతుంది. ధర్మారావు పశుపతి ఇంటికి వెళ్తాడు. పశుపతి కూతురు చిన్న అరుంధతి ధర్మారావునే పెళ్ళాడుతానని పట్టుబడుతుంది. పశుపతికి బాల్యవివాహాలు ఇష్టం లేకపోయినా కూతూరు మొండిపట్టుదలకు తలొగ్గి ధర్మారావుకిచ్చి పెళ్ళిచేస్తాడు. స్వర్గస్తురాలైన తన భార్య అరుంధతియే చిన్న అరుంధతినావహించినదని ధర్మారావు భావిస్తాడు . చిన్న అరుంధతి అవునని చెప్పటంతో నవల సమాప్తమవుతుంది.


(విశ్లేషణతో కూడిన చివరిభాగం తరువాతి టపాలో)


ధర్మస్థల - హళేబీడు - బేలూరు

ర్మస్థల..రెండు వారాల క్రితం, రిటైరై ఖాళీగా ఉన్న మా తల్లిదండ్రులు వేసవి శెలవులలో బెంగుళూరు వచ్చినప్పుడు వచ్చిందీ ప్రస్తావన.ఇరవై మూడేళ్ళ క్రిందట, మూడేళ్ళ మా చెల్లికి రెండవసారి తలనీలాలివ్వటానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ధర్మస్థలను చూశాను. అప్పుడు మేము తిరుపతి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఎప్పుడు మేమెక్కెడికి వెళ్ళినా కుటుంబసభ్యులందరినీ వెంటేసుకొని బయలుదేరే మా నాన్నగారు అప్పుడు కుడా మాతోపాటూ నాన్నమ్మను, తాతను, అమ్మమ్మను వెంటబెట్టుకొని వెళ్ళారు. అప్పట్లోనే ఆయన బేలూరు,హళేబీడు, శ్రవణబెళ్గోల చూడాలని ప్లాన్ చేశారు. కానీ ఈయనకు కన్నడ రాక, ఆయన చెప్పింది కన్నడ కండక్టరుకి అర్థం కాక ఆ ప్లాను బెడిసికొట్టి మా యాత్ర ధర్మస్థల దర్శనంతోనే ముగిసిపోయింది. వాళ్ళు ధర్మస్థలను మాత్రమే చూడాలనుకొన్నా,ఆ యాత్రకు బేలూరు,హళేబీడు కూడా జోడించి ఈ సారైనా వాళ్ళ కోరిక తీర్చాలని నేను గట్టిగా అనుకొన్నాను. టికెట్ ఏర్పాట్లు మా తమ్ముడు చూసుకున్నాడు.

బెంగళూరు నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉంది ధర్మస్థల. డైరెక్ట్ ట్రైన్స్ ఏవీ లేవు. హస్సన్‌లేదా మంగళూరులో దిగి మళ్ళీ బస్సులో ప్రయాణం చెయ్యాలి. బస్సులో అయితే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం. రాత్రి తొమ్మిదిన్నరకు బస్సెకితే తెల్లవారుజామున ఐదున్నరకి ధర్మస్థల చేరుకున్నాం. అప్పటికి చీకట్లింకా తొలగిపోలేదు. మా తల్లిదండ్రులను ధర్మసత్రాల దగ్గర కూర్చోబెట్టి ఖాళీగదుల కోసం కాటేజీలను,గెస్టవుస్‌లను వెదుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళిన ప్రతిచోటా గదులు లేవన్న బోర్డు వెక్కిరిస్తూ కనపించింది. అలా ఒక గంటసేపు తచ్చాడి ఇక లాభం లేదని ఓ కాటేజిలో దూరాను. మరో గంటన్నరపాటూ చాంతాడంత పొడుగాటి లైన్లో నిల్చుంటే రూం దొరికింది. రూం కేటాయించే సమయంలో తప్పనిసరిగా మీ బంధుమిత్రులందరూ అక్కడే ఉండాలి. అప్పుడే రూం లభిస్తుంది. మాకు ఐదవ ఫ్లోర్‌లో కేటాయించారు. ఆ లభించిన గది కూడా పేరుకు గదే కానీ అందులో మంచాలు,మాట్రెస్సులు లాంటివేం లేవు. మూడు పొడవాటి సిమెంటు అరుగులను గదిలో నిర్మించి వాటిమీద బస్‌సీట్లలాంటి నల్లటి కవర్లను కప్పారు. హతోస్మి అనుకున్నాను. ఆ రోజు మా అదృష్టం బాలేదో లేక మాములుగానే ధర్మస్థలలో రూములంతేనో తెలియలేదు. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా దేవస్థానం ఆధీనంలోనే ఉన్నాయని,ప్రైవేటు హోటళ్ళేవి లేవని విన్నాను. ఆలయ వెబ్‌సైట్‌లో అవుట్‌డేటెడ్ ఫోన్‌నంబర్లు దొరికాయి. పనిచేస్తున్న ఈ-మెయిల్ఐడి నుంచి జవాబు రాలేదు. గూగుల్‌లో వెదికినా ఇతర ప్రత్యామ్నాయాలు దొరకలేదు. ఒక్కటి మాత్రం నిజం. ధర్మస్థలలో సరైన వసతి సౌకర్యలు దొరికితే మీరదృష్టవంతుల కిందే లెక్క.

స్నానపానాదులు ముగించుకొని,టిఫన్ చేసి మంజునాథేశ్వరాలయానికి వెళ్ళాం. కేరళ లేక మంగళూరు సాంప్రదాయ శైలిలో కట్టిన ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. దీనిని జైనులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొలువై ఉన్న దేవుడు పరమశివుడు.
 


పూజలు చేసే పూజారులు వైష్ణవ తెగకు చెందినవాళ్ళు. ఇలా మూడు విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఇక్కడ శాంతి సౌభాతృత్వంతో మెలగుతూ దేవుడొక్కడే అన్న విషయాన్ని నిరూపిస్తారు. ఇక్కడ ప్రత్యేక దర్శనమంటూ ఏమీ లేదు. అందరూ మాములు క్యూలో వెళ్ళవలసిందే. క్యూలైన్లు పొడవుగా ఉన్నా క్యూ కదులుతూనే ఉంటుంది. గర్భాలయం సమీపమించినప్పుడు పురుషులు షర్టులు,బనియన్లు తీసివేయాల్సి ఉంటుంది. క్యూలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి బయటికి వచ్చేంతవరకు వివిధసేవలు,వాటికి దక్కే ప్రసాదాల వివరాలతో చెవులు ఊదరగొట్టేస్తారు నిర్వాహకులు. ఇది నాకు నచ్చలేదు. ఎంతసేపు ఈ గొడవే అయితే ఇక దేవుడి మీద మనస్సు లగ్నమయ్యేదెప్పుడు?

పూర్వకాలంలో ధర్మస్థలను కుడుమ అని పిలిచేవారు.ఇక్కడ జైన మతపెద్దైన పెర్గడె,అమ్ము బల్లత్తి దంపతులు ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు.ఒకనాడు మానవాకారాలు ధరించి వచ్చిన ధర్మదేవుని దూతలను పెర్గడె దంపతులు తమ ఆతిథ్యంతో సంతృప్తి పరుస్తారు.దేవదూతలు సంతోషించి ఆ రాత్రి పెర్గడె కలలో కనిపించి ప్రస్తుతం అతనుంటున్న ఇంటిని ఖాళీ చేసి ధర్మప్రబోధం చెయ్యవలసిందని అజ్ఞాపిస్తారు.

వారి ఆజ్ఞానుసారం కొత్తిల్లు కట్టుకొని,పాతింటిలో వెలసిన ధర్మమూర్తులను కొలుస్తూంటాడు పెర్గడె.మళ్ళీ వారు అతని కలలో కనబడి తమకు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించాలని,వాటి నిర్వహణ బాధ్యతలు అతనే తీసుకోవాలని,దానికి బదులుగా అతని కుటుంబాన్ని తాము రక్షించి సమృద్ధినిస్తామని చెబుతారు. వారు చెప్పినట్లే చేసిన పెర్గడె, పూజారుల కోరిక మేరకు అన్నప్ప ద్వారా మంగళూరు దగ్గరున్న కద్రి నుంచి శివలింగాన్ని కూడా తెప్పించి ప్రతిష్ఠిస్తాడు. 16వ శతాబ్దంలో ఉడిపి వడిరాజస్వామి వేంచేసి లింగానికి శాస్త్రయుక్తంగా పూజలు చేసి ఈ ప్రదేశాన్ని ధర్మస్థలగా నామకరణం చేస్తాడు.

గంటలో దర్శనం పూర్తయ్యింది. వెంట్రుకలివ్వాలనుకొనే వారికి ఆలయం వెలుపలే టికెట్లు లభిస్తాయి. మనవైపు ఆడవాళ్ళు మూడు కత్తెర్లు వేయించుకుంటే ఇక్కడ ఐదు కత్తెర్లు వేయించుకోవాలి. దీనిని పంచముడి అంటారు.

అక్కడి నుంచి దగ్గర్లోనే ఉన్న నేత్రావతి నదీ తీరానికి వెళ్ళాం. అది అధ్వానంగా ఉంది. భక్తులు నీటిని కలుషితం చేస్తారని నదికి చెక్‌డ్యాం కట్టి చిన్న చిన్న గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఆ నీరు ఏర్పరచిన గుంటలలో భక్తులు స్నానాలు

 


చేస్తూ,ఈదులాడుకుంటూ కనిపించారు. నదిలో దిగి నీళ్ళు చల్లుకొని ఒకటి రెండు ఫోటోలు దిగి తిరిగి వచ్చేశాం.అప్పటికి అపరాహ్ణవేళయ్యింది. సరైన హోటల్‌కోసం చూస్తే దేవస్థానం వారి ఉచిత అన్నదానం చాలా బావుంటుందని,అందరూ వాటినే ఆదరించటం మూలన పెద్దగా భోజన హోటల్స్ లేవని తెలిసింది. మేం దర్శనం కోసం క్యూలో నిలబడినప్పుడే అన్నదానం క్యూ ఆంజనేయుని తోకలా పొడవుగా ఉంది. మళ్ళీ గంటల తరబడి క్యూలో నిలబడే ధైర్యం లేక బస్టాండులో ఉన్న చిన్న హోటల్‌లో కాస్త కతికి భోజనం అయిందనిపించాం. అప్పటికే నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ధర్మస్థలలో ఎక్కువసేపుండటం కంటే ముందు హస్సన్ వెళ్ళిపోయి అక్కడ సరైన సౌకర్యాలున్న హోటలొకటి చూసుకోవాలని అనుకున్నాను. వెంటనే నా అలోచనను అమలులో పెట్టాను. మధ్యాహ్నం రెండున్నరకి హస్సన్‌బస్సు దొరికింది.మూడు దాటితే తర్వాత బస్సు రాత్రి ఎనిమిదిపైనేనని కండక్టరు చెప్పాడు. సౌకర్యలోపం కారణంగా తలెత్తిన ఇబ్బందులు ధర్మస్థల, దానికి చుట్టుపక్కలున్న ప్రదేశాలు చూడాలనుకొన్న నా పూర్వపు ఆలోచనలను వెనక్కి నెట్టేశాయి.

ధర్మస్థల నుంచి హస్సన్‌కు 110 కిలోమీటర్లు. ఘాట్‌రోడ్డు కాబట్టి బస్సులో నాలుగు గంటలు పట్టింది. దారికిరువైపులా పచ్చదనమే. ఎక్కడా రాయలసీమలోలా రాళ్ళగుట్టలు కనబడవు. పైగా విశాలమైన ఆవరణతో విలసిల్లే మంగళూరు శైలి గృహనిర్మాణాలు,పనసతోటలు,కాఫీ తోటలు మార్గమంతా ఎదురై ఆహ్లాదాన్ని పంచుతాయి. సకలేశ్‌పుర తర్వాత హోరున వర్షం కురిసి వాతావరణాన్ని మరింత ముగ్ధం చేసింది.

హస్సన్ కొత్తబస్టాండును తలదన్నే బస్టాండు ఆంధ్రదేశంలో ఏ జిల్లా కేంద్రంలోనూ లేదేమో .అంత స్టైలిష్‌గా విశాలంగా ఉంది. బస్టాండుకు కొద్ది దూరంలోనే మంచి హోటల్‌లో దిగి సేదతీరాం. ఆ తర్వాత బేలూరు,హళేబీడు,శ్రావణ బెళ్గోల చుట్టిరావడానికి టాక్సీలను, ప్రైవేట్ ట్రావెల్స్‌ను విచారించటానికి నేను రోడ్డు మీదకొచ్చాను. పదేళ్ళుగా బెంగుళూరులో పాతుకుపోయా కాబట్టి కన్నడ సంభాషణలపై నాకు మంచి పట్టే ఉంది. ట్రావెల్స్ వాళ్ళు 1500 అవుతుందని చెప్పారు. పైగా శ్రావణ బెళ్గోల హస్సన్ నుంచి బెంగళూరు వెళ్ళే మార్గంలో వస్తుందని, అక్కడ గోమటేశ్వరుని చూడ్డానికి ఎక్కవలసిన మెట్లు వందకుపైనే ఉన్నాయని చెప్పారు. మా తల్లిదండ్రులు అన్ని మెట్లెక్కలేరని లిస్ట్ లోంచి దాన్ని తీసేశాను. పాత బస్టాండు వెళ్ళి అక్కడున్న టాక్సీ డ్రైవర్లను కలిశాను. హీనపక్షం ఎనిమిదివందలిస్తే వస్తామన్నారు వాళ్ళు. అదే విషయం మా నాన్నగారికి ఫోన్లో చెబితే ' వృథా ఖర్చులెందుకు,అవే డబ్బులు హళేబీడు,బేలూరులో సైట్‌సీయింగ్‌కి ఖర్చుపెట్టోచ్చు.బస్సుల గురుంచి వాకబు చెయ్య'మని సూచించారు. బస్టాండులో ఆరాతీస్తే పొద్దున్నే ఆరున్నరకు హళేబీడుకు డైరెక్ట్ బస్సుందని చెప్పారు. ఆఖరికి అదే ఖరారయ్యింది. పొద్దున్నే స్నానం హళేబీడు బస్సెక్కేశాం. హస్సన్ నుంచి హళేబీడుకి 39 కిలోమీటర్ల దూరముంది. సమృద్ధమైన జలకళతో,పాడిపంటలతో,అరటి,కొబ్బరి తోటలతో అలరారే స్వచ్ఛమైన కన్నడ పల్లెసీమల్ని చూసి ముచ్చటపడుతూ గంటసేపటికి హళేబీడు చేరుకున్నాం.

హళేబీడు

హళేబీడు పల్లెటూరు. ఊరి మొదట్లో పెద్ద చెరువు. దాన్ని దాటుకొని లోనికివెళ్తే మూడురోడ్ల కూడలి మధ్య ఠీవీగా దర్శనమిస్తూ హొయశాల వృత్తం, అందులో సింహంతో పోరాడుతున్న శాళుడి ప్రతిమ(హొయశాల రాజచిహ్నం)కనువిందు

 


చేస్తాయి.అది ఈ మధ్యే నిర్మించినదైనా ఆ ప్రదేశానికున్న చారిత్రక ప్రాముఖ్యతను రొమ్ము విరుచుకొని చాటి చెప్పేలా ఉంది.దానికి ప్రక్కనే 890 ఏళ్ళనాటి హొయశాళేశ్వరుడు,శాంతలేశ్వరుల ఆలయాలున్నాయి. బస్టాండులో కాకాహోటల్లో టిఫన్ పూర్తిచేసి ఆలయసందర్శనకు ఉత్సాహంగా బయలుదేరాం.

హళేబీడు అసలు పేరు ద్వారసముద్రం. క్రీ.శ.12వ శతాబ్దంలో హొయశాలుల రాజధానిగా ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగింది. హొయశాలులు పశ్చిమ కనుమలలోని కొండజాతి వాళ్ళు. ప్రాథమికంగా జైనమతారాధకులైన వీరు తర్వాత హిందువులుగా మారిపోయి, అవసానదశలో ఉన్న ఆనాటి రాజవంశాల(పశ్చిమ గాంగేయులు, రాష్ట్రకూటులు) పరిస్థితులను ఆసరా చేసుకొని క్రమక్రమగా పట్టు సాధిస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తృతం చేశారు. వారిలో ముఖ్యుడు విష్ణువర్థన మహారాజు. ఆయన ఆనతి ప్రకారమే రెండు శివాలయాలను నిర్మించారు. ఒకటి హొయశాళేశ్వరుడికి, ఇంకొకటి కేదారేశ్వరుడికి. హొయశాలేశ్వరాలయాన్ని క్రీ.శ 1121లో దండనాయకుడైన కేతుమల్లుని పర్యవేక్షణలో ప్రారంభిస్తే, కేదారేశ్వరాలయాన్ని మహారాణి శాంతలాదేవి పేరుమీదుగా క్రి.శ 1219లో ప్రారంభించారు. శాంతలాదేవి అభీష్టం మేరకు నిర్మింపబడిన గుడి కాబట్టి కేదారేశ్వరునికే శాంతలేశ్వరుడని మరో పేరు. నిర్మాణానికి 105 ఏళ్ళు పట్టింది.


ఆలయ నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది.నక్షత్రాకారంలో వెలసిన ఎత్తైన వేదికపై రెండు ఆలయాలనూ నిర్మించారు.ఆలయాంతర్భాగంలో పైకప్పుపై అద్భుతమైన శిల్పాలు చేక్కారు.గర్భగుడి ద్వారమైతే శిల్పకళకు పరాకాష్టగా నిలుస్తుంది. క్రిందినుంచి 




పైవరకూ మొత్తం శిల్పాలలో అలంకరించేశారు. ద్వారపాలురైన నంది,భృంగి విగ్రహాలు,మానవ కపాళాలతో నిండిన వారి కిరీటాలు చూసి నోళ్ళువెళ్ళబెట్టకతప్పదు. కపాలం ఎంత డొల్లగా ఉంటుందో నంది,భృంగి కిరీటాలలోని కపాలాలు కూడా అంతే డొల్లగా ఉంటాయి. కపాలంలో ఒక రంధ్రం నుంచి మరో రంధ్రానికి చిన్న పుల్లను దూర్చి తియ్యవచ్చు. అలాగే విగ్రహాలు ధరించిన నగల మధ్య కూడా చేతి వ్రేళ్ళు దూరేంత ఎడమ ఉంది. శాంతలేశ్వరునికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడి ప్రతిమ 


 


ఆకట్టుకుంటుంది. భారతదేశం మొత్తం మీద ఇంత అందంగా రకరకాల అలంకరణలతో చెక్కబడిన మరో నంది విగ్రహం లేదంటే అతిశయోక్తి లేదు. హొయశాళేశ్వరునికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కూడా బావుంది కానీ దానికి ఇన్ని అలంకరణలు లేవు.

బాహ్యగోడలపై ఎనిమిది వరుసల శిల్పశైలి ద్యోతకమవుతుంది. క్రింద నుంచి మొదటి వరుసలో ఏనుగులు, రెండో వరుసలో సింహాలు, మూడవ వరుసలో లతలు తీగెలు,నాల్గవ వరుసలో ఆశ్విక దళం, ఐదవ వరుసలో మళ్ళీ లతలు తీగెలు, ఆరవ 


 


వరుసలో రామాయణ మహాభారత ఇతివృత్తాలు, ఏడవ వరుసలో మకరం, ఎనిమిదవ వరుసలో హంసలు కనిపిస్తాయి. వాటిపైన వెలసిన శిల్పాల అందచందాలని చూసి ఆస్వాదించాల్సిందే కానీ మాటలలో వర్ణించడం సాధ్యం కాదు.ప్రతి శిల్పం సహజత్వం ఉట్టిపడుతూ,శిల్పాచార్యుని సృజనాత్మక ప్రతిభకు నిలువుటద్దం పడుతుంది. ఒక్కో శిల్పం గురుంచి వివరిస్తూ పొతే చిన్న పుస్తకమే అవుతుంది. నాకు చేతనైన రీతిలో కొన్ని శిల్పాలు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

ఏనుగు ఉదరం చీల్చుకొని పరమశివుడు నృత్యం చేస్తున్న భంగిమ గజాసురవధ శిల్పంలో కనిపిస్తుంది.ఆనందంతో చిందులేస్తున్న నందిని, మృదంగం వాయిస్తున్న ప్రమదగణాలని పొట్టలోనే చూడవచ్చు. శంకరుని వాడైన గోళ్ళు ఎనుగు మృతకళేబరాన్ని చీల్చుకొని వెలుపలికి వచ్చినట్టు మలిచారు.త్రివిక్రమావతారమైన వామనావతార ఘట్టంలో ఒక పాదాన్ని బ్రహ్మదేవుడు కడుగుతున్నట్లు, ఆ నీరే నదిగా మారి జాలువారినట్లు,అందులో చేపలు ఇతర జలచరాలు

 


ఈదులాడుతున్నట్టు, గరుడుడు భక్తిప్రపత్తులతో మ్రొక్కుతున్నట్లు, దేవతా స్త్రీ వింజామరలు వీస్తునట్లు మలిచారు. దశకంఠుడైన రావణుడు కైలాసాన్ని ఎత్తే శిల్పంలో, శిఖరాగ్రభాగాన పార్వతీసమేతుడై కూర్చున్న పరమేశ్వరున్ని మలిచారు. భక్తుని బలదర్పానికి ఆగ్రహించిన నిరంజనుడు తన కాలిబొటనవ్రేలితో పర్వతాన్ని తొక్కిపట్టగా, జీవనాడులన్నీ కదిలిపోయి రావణుడు కనుగుడ్లు తేలవేసిన దృశ్యాన్ని శిల్పం ప్రతిబింబిస్తుంది. ఈ శిల్పానికి చేరో వైపు బ్రహ్మవిష్ణువులను చెక్కారు.

సాధారణంగా త్రిమూర్తుల చిత్రాలలో మహావిష్ణువు మధ్యలో ఉంటే ఆయనకు చెరోవైపు బ్రహ్మరుద్రులుంటారు.కానీ ఇది శివాలయం కాబట్టి శివున్ని కేంద్రస్థానంలో ఉంచి,విష్ణువుకి స్థానచలనం కలిగించారు.

హిరణ్యకశిపుని వధ శిల్పంలో ఆగ్రహోదగ్రుడైన స్వామివారు రాక్షసి మూకలో ఒకడి తల చర్మం వలిచి పైకి లేపినట్లు చూపారు. వరహావతారంలో ఒక వైపు హిరణ్యాక్షుని తొక్కి పట్టి మరోవైపు ఆయుధాలతో రాక్షసగణాన్ని చీల్చిచెండాడుతున్న దృశ్యం 


 


కనిపిస్తుంది. గోవర్ధన గిరిధారి శిల్పంలో పర్వతంలో వేటగాన్ని, కోతిని ఇతర జంతువులను, వృక్షాలను చిత్రించి వాటికి జీవకళ తీసుకొచ్చారు. రోదసీ వీక్షణానికి టెలిస్కోపుని, త్రాగడానికి స్ట్రాని పాశ్చ్యాత్యుల కంటే మనమే ముందుగా ఉపయోగించామని చెప్పే శిల్పం,ఆంగ్లేయుల తలకట్టును, వస్త్రధారణను పోలిన శిల్పం


 

కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెలిస్కొపును కనుగొన్నది, ఆంగ్లేయులు వ్యాపారనిమిత్తం మనదేశానికి వచ్చినది 17వ శతాబ్దంలో. త్రాగడానికి వ్రాడే స్ట్రాను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఈ విశేషాలన్నీ అంతకుముందే ఎప్పుడో పన్నెండు పదమూడో శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాల్లో చూచాయగా బయటపడటం అప్పటికే మనదేశీయులు సాధించిన అపూర్వమైన అభివృద్ధికి సమ్మున్నత తార్కాణంగా భాసిస్తుంది . షరా మాములుగా అద్భుత శిల్పసంపదకు ఆలవాలమైన ఈ ఆలయాలను 1311లో మాలిక్ కాఫర్ ఒకసారి, 1326లో మహమ్మద్‌బిన్ తుగ్లక్ ఒకసారి ధ్వంసం చేసి సంపదనంతా మూటలు గట్టి అనేకసార్లు ఒంటెలపై మోసుకొనివెళ్ళారు. మహమ్మదీయుల దాడిలో ధ్వంసమై ప్రాభవం కోల్పోయిన ఊరు కాబట్టి హళేబీడు(పాత నగరం)అన్న పేరు స్థిరపడింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశులు వీటి సంరక్షణభారం వహించారు. మొత్తం 35000 శిల్పాలకు పైగా శిల్పాలు ఈ ఆలయాల్లో ఉన్నాయని ఒక అంచనా. కొన్నింటిని ఆంగ్లేయులు తరలించుకొని పోయి లండన్‌లో భధ్రపరిచారని చెబుతారు.

ఆలయం వెలుపల పెద్ద సాక్షి గణపతి విగ్రహం ఉంది.దానికి ఎదురుగా హొయసల రాజలాంఛనం కనిపిస్తుంది.పూర్వం ఈ ద్వారం గుండానే మాహారాజ ప్రభృతులు పరతెంచి వచ్చి మొదట సాక్షి గణపతిని అర్చించి ఆ తర్వాత ఆలయ ప్రవేశం చేసేవారట. హొయసల రాజ చిహ్నం వెనుక ఓ కథ ఉంది. పూర్వం శాళుడు గురుకులంలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో అక్కడో సింహం జొరబడి భయోత్పాతం




 సృష్టించిందట. తక్కిన శిష్యులంతా భీతావహులై పరుగులుపెడితే, శాళుడు ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఒంటరిగానే సింహంతో కలియబడ్డాడట. శిష్యుడి ధైర్యసాహసాలకు ముగ్ధుడైన జైన గురువు సుదత్తుడు ' హొయ్ శాళా హొయ్ శాళా' అని అతన్ని ఉత్తేజపరిచారట.ప్రాచీన కన్నడ భాషలో' హొయ్ ' అంటే కొట్టు అని అర్థం. ఆ శాళుడు స్థాపించిన సామ్రాజ్యం కాబట్టి ఆ సంఘటనే రాజచిహ్నమయ్యింది.

ప్రధానమైన ఈ ఆలయాలు సందర్శించాక ప్రక్కనే ఉన్న జైనదేవాలయాలకు వెళ్ళాం. పార్శ్వనాథ స్వామి(జైనుల 23వ తీర్థంకరుడు) దేవాలయంలో నల్లశిలతో చెక్కబడిన పెద్ద విగ్రహం ఉంది. ఆ మూర్తి తలపై పడగలు విప్పిన ఏడుతలల సర్పాన్ని చెక్కారు. అయితే ఆలయమంతా గబ్బిలాల వాసనే. మందిరం ఎదురుగా ఉన్న రాతిస్తంభాల మండపం బావుంది. జైన దేవాలయాలకు కొద్దిగా ప్రక్కనే రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది.

హళేబీడు నుంచి బేలూరుకు 17మైళ్ళ దూరం. ప్రతి అరగంటకు బస్సులున్నాయి. మేం వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. అప్పటికే సమయం పదకొండయ్యి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూండటంతో, ఇంకో అరగంట వేచి చూసే ఓపిక లేక ప్రవేట్ బస్సులో బేలూరు బయలుదేరాం.

బేలూరు



యగచి నదీతీరంలో ఉంది బేలూరు పట్టణం. దీని పూర్వనామం వేలాపురి.హళేబీడు ధ్వంసమయ్యాక హొయసలులు దీనిని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన గావించారు. ఇక్కడున్న ఏకైక దర్శనీయ స్థలం చెన్నకేశవాలయం. దీని నిర్మాణానికి నాంది పలికింది కూడా విష్ణువర్థనుడే. చోళులపై తన ఘనవిజయానికి గుర్తుగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. హళేబీడులోని శివాలయాల కంటే ఈ ఆలయం చాలా పెద్దది. క్రీ.శ.1116లో శంఖుస్థాపన జరుపుకున్న ఈ ఆలయాన్ని మూడు



తరాలవాళ్ళు 103 ఏళ్ళు కష్టపడి నిర్మించారు. ఇక్కడి మూర్తి, మోహినీ అవతారంలో ఉన్న చెన్నకేశవస్వామి(చెన్న అంటే కన్నడలో అందమైన అని అర్థం). ఈ స్వామికే విజయనారాయణుడని, సౌమ్యనారయణుడని మరో పేర్లు. హొయసాలులు నిర్మించిన అనేక దేవాలయాల్లో నేటికీ ప్రతి ఉదయం,సాయంత్రం క్రమంతప్పకుండా ధూపదీప నైవేద్యాలందుకొంటున్న ఏకైక దేవాలయం ఇదొక్కటే. మోహినీ అవతారంలో మహావిష్ణువు భస్మాసురున్ని అంతమొందించింది ఇక్కడే అని భక్తుల విశ్వాసం.

ఆలయం వెలుపల ఉన్న 42 అడుగుల ఏకరాతి కార్తీకదీపోత్సవ స్తంభాన్ని విజయనగర పాలకులు ప్రతిష్ఠించారు.ఎటువంటి పునాదులు లేకుండా ఒక రాతి 





వేదికపై నిలబెట్టబడిన ఈ స్తంభం నేటికీ పడిపోకుండా నిలబడి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.ఆలయ ఆవరణలో చెన్నకేశవునికి అభిముఖంగా, ధ్వజస్తంభం వద్ద వెలసిన గరుడప్రతిమను ఇటీవలే ప్రతిష్ఠించారు.

ఆలయ ప్రాంగణంలో నాలుగు గుడులున్నాయి.మొదటిది ముఖ్యమైంది అయిన చెన్నకేశవస్వామి గర్భగుడి మధ్యలో ఉంటే,దానికి ఒకవైపు కప్పే చెన్నిగరాయని ఆలయం,మరోవైపు సౌమ్యనాయకి(లక్ష్మీదేవి),రంగనాయకి(భూదేవి) ఆలయాలున్నాయి .

ఆలయ నిర్మాణశైలి చాలావరకు హళేబీడులోని శివాలయాలను పోలి ఉంటుంది. ఇక్కడ కూడా నక్షత్రాకారపు వేదిక మెట్లెక్కి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆలయంలోకి ప్రవేశించాలి. బాహ్యగోడలపై దర్శనమిచ్చిన శిల్పాలు హళేబేడులోని కొన్ని శిల్పాలను గుర్తుచేస్తాయి. అయితే హళిబేడుకి బేలూరుకి ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమిటంటే హళేబేడు దేవాలాయాలకు బాహ్యసౌందర్యం ఎక్కువ. బేలూరు ఆలయానికి బాహ్యసౌందర్యం, అంతస్సౌందర్యం రెండూ ఉన్నాయి.

చెన్నకేశవాలయంలో ఉన్న 48 స్తంభాలు వేటికవే వైవిధ్యంగా ఉంటాయి.ఇందులో ఐదు స్తంభాలు ముఖ్యమైనవి.వాటిలో నరసింహ స్తంభం వినుతికెక్కింది.ఒకప్పుడు ఈ స్తంభం తనంతట తానే తిరిగేదట. ఇప్పుడు నిలిచిపోయింది. హొయసాలుల 




ఇష్టదైవమైన నరసింహస్వామి ప్రతిమను,ఇతర చిన్న శిల్పాలను ఈ స్తంభంలో మలిచారు. ఒక చోట ఉద్దేశపూర్వకంగానే ఖాళీని ఉంచి ఏ శిల్పి అయినా ఈ స్తంభం విశిష్టత చెదరకుండా ఆ స్థలంలో సరిపోయే శిల్పం చెక్కవచ్చునని సవాలు విసిరారు.అది ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మిగిలిన నాలుగు స్తంభాలు గర్భాలయానికి ఎదురుగా ఉన్న నవరంగ మండపం దగ్గరున్నాయి. ఒక్కో స్తంభంపైన ఒక్కో సాలభంజికను చెక్కారు. ఈ సాలభంజికలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఈ శిల్పాలకన్నిటికీ జగదేకసుందరి మహారాణి శాంతలాదేవి అందచందాలే ప్రేరణ అని చెబుతారు. శాంతలాదేవికి భరతనాట్యంలో మంచి ఆభినివేశం ఉంది. పురజనుల కోరిక మేరకు దేవాలయాల్లో మూలవిరాట్టుకు ఎదురుగా నృత్యం చేసి అందరినీ మెప్పించి నాట్య సరస్వతి,నృత్యశారద లాంటి అనేక బిరుదుల్ని పొందింది. నవరంగ మండపంలోనున్న ఒక స్తంభంపై నృత్యం చేస్తున్న ఆమె భంగిమ మనసు దోచుకొంటుంది. ఆ ప్రతిమ తలపై వ్రేలాడుతున్న పాపటిబిళ్ళ అల్లాడుతున్నట్లే ఉంటుంది.మొత్తం నలభైరెండు సాలభంజికలున్నాయి. వాటిలో నాలుగు నవరంగ మండపంలో ఉంటే తక్కినవి బాహ్యకుడ్యాలపై వెలిశాయి.

నవరంగ మండపం మధ్యలో పైకప్పుపై అద్భుతమైన శిల్పకళ ఆవిష్కృతమవుతుంది.వేలాడే స్తంభాన్ని పైకప్పులో వీక్షించవచ్చు .

బాహ్యగోడలపై చెక్కిన సాలభంజికలలో జగత్ప్రసిద్దమైనది దర్పణసుందరి ప్రతిమ. త్రిభంగి నృత్యకారిణి ప్రతిమలోని భంగిమను ఇప్పటివరకూ ఏ నృత్యకారిణి అనుసరించలేకపోయిందని ప్రతీతి. అలాగే మహావిష్ణువు దశావతారాలు, ఇతర రూపాలు, రామాయణ మహాభారత గాథలలోని సన్నివేశాలు సునిశిత పరిశీలనాశక్తితో ప్రాణంపోసుకొని నయనమనోహరంగా దర్శనమిస్తాయి. 




ఇక్కడున్న కప్పే చెన్నిగరాయ దేవాలయం గురించి కూడా చెప్పుకోవాలి.ఈ ఆలయం శాంతలాదేవి కోరిక మేరకు అమరశిల్పి జక్కన నిర్మించినది.కొడుకు పుట్టక ముందే ఆలయ నిర్మాణం కోసం ఊరు విడిచి వస్తాడు జక్కన్న.పెరిగి పెద్దవాడైన కొడుకు డంకణ్ణ, తండ్రిని వెదుక్కుంటూ బేలూరు వచ్చి అక్కడ మూలవిరాట్టు విగ్రహాన్ని చెక్కుతున్న జక్కన్నను చూస్తాడు.తండ్రి వాడుతున్న శిల దోషభూయిష్టమైనది చెబుతాడు.ఆవాక్కై ఆగ్రహానికి గురైన జక్కన్న, నింద రుజువు చేసిన పక్షంలో తన కుడిచేతిని నరుక్కొంటానని శపథం చేస్తాడు.డంకణ్ణ గంధపు ముద్దను తీసుకొని విగ్రహమంతా పులుముతాడు.శరీరమంతా పూసిన పూత ఒక్క నాభి దగ్గరే తడిగా మిగిలిపోతుంది.అక్కడ ఉలితో మోదగానే, పగిలి అందులోంచి ఇసుక,నీరు,ఒక కప్ప గెంతుకుంటూ బయటపడతాయి.జక్కనాచారి మాటమీద నిలబడి తన చేతిని నరుక్కొంటాడు.అప్పుడే అతనికి డంకణ్ణ తన కన్నకొడుకని తెలుస్తుంది.మాహావిష్ణువు ఆదేశాల మేరకు అతని స్వగ్రామంలో ఒక కేశవాలయం నిర్మించి పోయిన తన కుడిచేతిని మళ్ళీ పొందుతాడు.



దురదృష్టవశాత్తూ మేమా ఆలయాన్ని దర్శించలేదు. మేం కుదుర్చుకున్న గైడ్ మాకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మాకా అవకాశం లేకుండా చేశాడు. కప్పే చెన్నిగరాయని దేవలయాన్ని ముందుగా సాంపిల్‌గా నిర్మించి మధ్యలోనే ఆపేసి చెన్నకేశవాలయాన్ని నిర్మించారని మాకతను చెప్పాడు. దానికి తగ్గట్టుగానే బాహ్యకుడ్యాలపై ఎటువంటి శిల్పాలు లేక ఖాళీగా కనిపించటంతో మేమటువైపు వెళ్ళలేదు.ఫోటోలు తీసేపనిలో గుడికి అనేక ప్రదక్షిణలు చేసి అప్పటికే అలసిపోయాం. దానికితోడు మధ్యాహ్నం ఒంటిగంట కావడంతో, రాత్రికి బెంగళూరు చేరుకోవాలన్న విషయం గుర్తొచ్చి అప్పటికి స్వస్తి చెప్పాం. అయితే మా అమ్మగారు మాత్రం వాటిని కవర్‌చేశారు.

బేలూరులో మంచి వసతి సౌకర్యాలున్నాయి. మధ్యాహ్నం బేలూరులోనే భోజనం చేసి హస్సన్ బస్సెక్కాం. ఈ బస్సు మళ్ళీ హళేబీడు మీదుగా వెళ్ళి గంటన్నరపాటూ మా సమయాన్ని వృథా చెయ్యకుండా,వేరొక మార్గంలో ప్రయాణించి అరగంటలోనే గమ్యస్థానం చేరుకుంది. అక్కడ దిగి కాస్త ఫ్రెషపయ్యి రెండున్నరకంతా బెంగుళూరు బస్సెక్కేశాం.

అక్కడితో మా యాత్ర పరిసమాప్తమయ్యింది .


1 comment

Post a Comment

యాగంటి - బనగానపల్లె - బెలూం గుహలు

ప్రభుత్వోద్యోగిగా పనిచేసి, పదవీవిరమణ చెయ్యబోతున్న మా నాన్నగారిని కలవడానికి నేను మా తమ్ముడు గుంతకల్లు వెళ్ళాం. కార్యక్రమం ముగిశాక దగ్గర్లోని దర్శనీయ స్థలాలు చూడాలని ముందే నిర్ణయించుకున్నాం. యాగంటి,బనగానపల్లె,బెలూం గుహలు...ఇవన్నీ గుంతకల్లు నుంచి వందకిలోమీటర్లో పరిధిలో వుంటాయి కాబట్టి పొద్దున్నే బయలుదేరితే సాయంకాలానికి తిరిగివచ్చేయచ్చని నాన్నగారు చెప్పటంతో సరేనన్నాం. గుంతకల్లుకు ట్రాన్సఫరైన కొత్తలో అమ్మా,నాన్న అవన్నీ చూసేశారు. మా కోసం మా నాన్నగారు మళ్ళీ బయలుదేరారు.

లింగాకృతిలో స్వయంభూ ఉమామహేశ్వరస్వామి వెలసిన క్షేత్రం యాగంటి. గుంతకల్లు నుంచి 103 కిలోమీటర్ల దూరంలో ఉందీ పుణ్యక్షేత్రం. చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసుకుంటున్న సాధుపుంగవుల్లా గంభీరంగా ఉంటే,మధ్యలో ధవళకాంతులతో మెరిసిపోతున్న ఆలయం ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరునిలా ఉంటుంది.




గుడిలోకి ప్రవేశించగానే పుష్కరిణి స్వాగతమిస్తుంది. ఎక్కడో ఉద్భవించిన నీరు,నందికేశుని నోటినుండి ధారగా పడుతూ కోనేరుని నింపుతుంది.' సబ్బులు,షాంపూలు వాడరాదు.బట్టలు ఉతకరాదు ' అని తాటికాయంత అక్షరాలతో బోర్డులు పెట్టినా భక్తులు ఖాతరు చెయ్యకపోవటం వల్ల కోనేట్లో నీరు అపరిశుభ్రమైపోయింది. ఆలయ నిర్వాహకులు కూడా ఆట్టే పట్టించుకునేట్లు లేరు. పుష్కరిణిలో పాదప్రక్షాళనం చేసుకోని, నంది నోటి నుంచి పడుతున్న నీరు నెత్తిన చల్లుకొని ఆలయలోకి వెళ్ళాం. గర్భాలయంలో శివలింగానికి బదులుగా లింగాకృతిలో ఉన్న పార్వతీపరమేశ్వర స్వరూపం కనిపించింది. అమ్మవారికి బొట్టు పెట్టారు. స్వామివారికి తిలకం దిద్దారు. స్వామివారిని దర్శించుకొని వెలుపలికి వస్తే జీవకళ ఉట్టిపడుతున్న నిలువెత్తు నందికేశుడు కనువిందు చేస్తాడు.


స్థలపురాణం

ఈ క్షేత్రం గురుంచి ఒక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. యాగంటి అసలు పేరు నేగంటి. ఉత్తరభారతదేశ యాత్ర ముగించుకొని దక్షిణదేశానికి వచ్చిన అగస్త్య మహర్షి, ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడై ఇక్కడొక వేంకటేశ్వరాలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. తన తపోశక్తితో వేంకటేశుని విగ్రహాన్ని సృష్టించి దానిని ప్రతిష్ఠించాలని జపహోమాలు చెయ్యగా విగ్రహం యొక్క కాలి బొటనవ్రేలు గోరు విరిగిపోయింది. విరిగిన విగ్రహం అభిషేకాలకు పనికిరాదు కాబట్టి దానిని అక్కడే ఒక గుహలో స్థాపించి, జరిగిన దానికి విచారపడి పరమేశ్వరున్ని ప్రార్థించగా, ఆయన ప్రసన్నుడై ఈ ప్రదేశం శైవక్షేత్రంగా విలసిల్లగలదని ఆభయమిచ్చాడు. అగస్త్య మహర్షి కోరిక మేరకు లింగాకృతిలో ఉమామహేశ్వర స్వరూపంతో ఉద్భవించాడు.

చాలాకాలం తర్వాత గురుశిష్యులైన శివభక్తులిద్దరు, పశువులు మేపుతూ ఈ అటవీప్రాంతంలో సంచరిస్తూండగా లింగాకృతిలో ఉన్న ఉమామహేశ్వర విగ్రహం వారికి తారసపడింది. ఎన్నో ఏళ్ళుగా అదే ప్రాంతంలో తిరుగుతున్నా ఏనాడూ ఎదురవని లింగం ఆనాడు కనిపించేసరికి వారిద్దరూ ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఆనాటి నుంచి రోజూ నిష్ఠగా పూజలు చేస్తూ రెండు విస్తరాకులలో అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టేవారు. భక్తులిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో పరీక్షించాలని భావించిన స్వామి,వటువు వేషం దాల్చి తనకూ కాస్త ప్రసాదం పెట్టమని ఇద్దరినీ అడిగాడు. గురువు మౌనం వహిస్తే, శిష్యుడు సరేనన్నాడు. మరుసటి రోజు మూడు విస్తళ్ళలో నైవేద్యం సిద్ధం చేసి వటువు కోసం ఎదురుచూశాడు శిష్యుడు. 'మూడో విస్తరి ఎవరికోసం' అని అడిగిన గురువుకి 'అన్నార్థుల కోసమని సమాధనమిచ్చాడు . గురువు ధ్యానంలో మునిగిపోయాడు. వటువు రాలేదు కానీ పులి వచ్చింది. స్వామి వారే పులి రూపంలో వచ్చి 'ఆకలిగా ఉంద 'ని అర్థించారు. శిష్యుడు మారుమాట మాట్లాడకుండా ముందే సిద్ధం చేసిన మూడో విస్తరిని ముందుపెట్టాడు. నైవేద్యాన్ని ఆరగించిన పులి ఇకా ఆకలిగా ఉందంటే తన విస్తరిని కూడా సమర్పించుకున్నాడు. ఆకలి తీరని పులి ఇంకా అరుస్తూంటే శిష్యుడు సవినయంగా చేతులు జోడిచి ' ఓ వ్యాఘ్రమా ! ఆర్తుల కోసం ఉంచిన మూడో విస్తరిని ఇచ్చేశాను. నాకోసం దాచుకున్న విస్తరినీ నీకే దానం చేశాను. గురువుగారి విస్తరిని దానం చేసే అధికారం నాకు లేదు. ఇక మిగిలింది నేనే. నన్నే ఆహారంగా స్వీకరించు ' అంటూ పులినోట్లో తలపెట్టబోయాడు. పులి అంతర్థానమై సంతుష్టుడైన స్వామి సాక్షాత్కరించాడు. శిష్యుడికి మోక్షం ప్రసాదించి తనతో పాటూ కైలాసానికి తీసుకువెళ్ళాడు. ఇంతలో గురువు కళ్ళు తెరిచి శిష్యుడు కోసం చూస్తే, గగనవీధిలో శివపార్వతులతో కలిసి కైలాసం వెళ్తున్న శిష్యుడు కనిపించాడు. గురువు దీనంగా చేతులు జోడించి శివపార్వతులను పరిపరివిధాల స్తుతించి,శిష్యుని వైపు చూసి 'శిష్యా ! ఇంతకాలం ఇద్దరమూ కలిసిమెలిసి ఉన్నాం.భగవంతుడి సపర్యలు చేశాం.ఇప్పుడు ఒక్కడివే వెళ్ళిపోతావా? నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు ' అని వేడుకొన్నాడు. శిష్యుడు కరిగిపోయి 'గురువుగారు! ఇదిగో ఈ వస్త్రాన్ని వదిలేస్తున్నాను. దీనిని మీరు పట్టుకున్నట్లైతే నాతోపాటూ బొందితో కైలాసం వచ్చేస్తారు ' అని వస్త్రాన్ని జారవిడిచారు.క్రిందకు జారిన ఆ వస్త్రం కాలనాగై గురువు కంటబడింది.గురువు ముట్టుకొలేకపోయాడు.శిష్యుడు కైలాసం వెళ్ళిపోయాడు.

ప్రస్తుతమున్న శివాలయాన్ని విజయనగర ప్రభువులైన హరిహర బుక్కరాయల కాలంలో నిర్మించారు. గర్భగుడికి వెనుకవైపు అగస్త్య పుష్కరిణి ఉంది. ఇందులో నీళ్ళు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ ఉన్న పర్వతాలలో అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ,వేంకటేశ్వరస్వామి వారి గుహ,వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం వ్రాసిన గుహలు ఉన్నాయి. నిట్టనిలువుగా ఉన్న మెట్లు ఎక్కి గుహల్లోకి వెళ్ళాలి. బ్రహ్మంగారి గుహలోకి వెళ్తే నడుం బాగా వంచి వెళ్ళాలి. వృద్ధులకు స్థూలకాయులకు కష్టంతో కూడుకున్న పని.



యాగంటిలో కంటికి కనిపించే అద్భుతాలు మూడు

  1. 1.   యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించవు. పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటూంటే కాకాసురుడనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి గోల చేస్తూ ఆయన ప్రశాంతతకు భంగం కలిగించాడట. ఆగ్రహించిన ఆయన ఆ కాకిని భస్మం చేసి,కాకులెప్పుడూ ఈ ప్రాంతానికి రావటానికి వీళ్ళేదని ఆంక్షలు విధించాడట. కాకి శనేశ్వరుని వాహనం. కాకిని బహిష్కరించడమంటే ఆయనను వెలేసినట్టే. అందుకే ఈ శివాలయంలో నవగ్రహ మంటపం ఉండదు.

  2. 2.   ఈ క్షేత్రంలో ఎక్కడో ఉద్భవించిన నీరు ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. ఇవి త్రాగడానికి మాత్రమే పనికొస్తాయి. వ్యవసాయం కోసమో, మరే ఇతర అవసరాల కోసమో నీళ్ళు మళ్ళించాలని చూస్తే ఆ ప్రయత్నం సిద్ధించదు. పొలాల కోసం నీళ్ళు మళ్ళించాలని అనేక ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం చివరికి తన ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చింది. క్షేత్రం దాటిన వెంటనే నీళ్ళు భుమిలోకి ఇంకిపోయేవట.

  3. 3.  ఉమామహేశ్వరస్వామి గర్భగుడికి ఎదురుగా,ఈశాన్యమూలలో ఉన్న బసవయ్య విగ్రహం(నందీశ్వరుడు)నిత్యం పెరుగుతూనే ఉంది. తొంభై ఏళ్ళ క్రితం నాలుగుస్తంభాల మధ్య చిన్నదిగా ఉండి ప్రదక్షిణలకు అణువుగా ఉన్న ఈ విగ్రహం ఇప్పుడు అమాంతం పెరిగి పెద్దదైపోయి మండపం దాటి వెలుపలికి వచ్చేసింది. ప్రదక్షిణలు చెయ్యడం కష్టమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఇరవై ఏళ్ళలో ఈ విగ్రహం ఒక అంగుళం పెరిగింది. ఈ బసవయ్యే కలియుగాంతంలో కాలుదువ్వి రంకె వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం చెబుతోంది.


యాగంటి నుంచి పదికిలోమీటర్ల దూరంలో బనగానపల్లెలో బ్రహ్మం గారి నేలమఠం ఉంది. అక్కడే ఆయన వ్రాసిన కాలజ్ఞాన గ్రంథాలను ఒక చింతచెట్టు క్రింద నిక్షిప్తం చేశారు. వాటిల్లో ప్రస్తుతం ఒక గ్రంథం మాత్రమే బయటపడిందని,మిగతా రెండింటిని వీరభోగవసంతరాయల అవతారంలో బ్రహ్మంగారే వెలుపలికి తీస్తారని ఆలయ పూజారి చెప్పారు. అంతే కాదు ఈ చింతచెట్టు కాయలు తినడానికి పనికిరావని,కలియుగాంతంలో ఇదే చెట్టుకు మల్లెపూలు పూస్తాయని కూడా చెప్పారు.


అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రవ్వలకొండకి వెళ్ళం. అక్కడ కొన్నాళ్ళు అచ్చమ్మ గారి ఆలమందలు కాస్తూ, ఒక గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాశారట. పాతాళబావి లాంటి ఆ ప్రదేశానికి ఒకటే దారి. మెల్లగా మెట్లు దిగి నడుము బాగా వంచి చీకటిలో లోపలకి వెళ్తే బురదనీళ్ళతో నిండిన ప్రదేశం వస్తుంది. గాలి కూడా సరిగ్గా ఆడదు. పదిమంది కంటే ఎక్కువ మంది వెళ్తే ఊపిరాడక చనిపోయే అవకాశాలెక్కువ. అక్కడే శేషశాయి నీడలో కాలజ్ఞానం వ్రాసుకుంటున్న బ్రహ్మంగారిని చూసిన అచ్చమ్మ,ఆయన శిష్యురాలైపోయిందట.


బనగానపల్లెలో భోజనవిరామం తీసుకొని అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని బెలూం గుహలకు బయలుదేరాం. ప్రవేశద్వారం వద్దనున్న అతి పెద్ద బుద్ధవిగ్రహం చూపరులని ఆకట్టుకొంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలను 1884లో బ్రిటీషువారు

కనుగొన్నారు. తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటూ మరుగునపడిపోయిన వీటిని జర్మన్ దేశస్తుడైన గేబర్ సారథ్యంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గుహలకు తుది ఎక్కడో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే తవ్వకాలలో కనుగొన్నారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకే ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బౌద్ధమతానికి సంబందించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి. భూమట్టానికి 120 అడుగుల క్రింద వరకు వెళ్ళగలిగిన ఈ గుహ లోపల,ప్రకృతి సహజంగా ఏర్పడిన రకరకాల ఆకారాలకు పేర్లు పెట్టి, లైటింగ్, పైపుల ద్వారా వెంటిలేషన్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. మేం కూడా కొంతదూరం గుహలో బిక్కుబిక్కుమంటూ పాక్కుంటూ వెళ్ళి సాహసయాత్ర చేసినంత బిల్డప్పిచ్చి అలసిపోయి చివరికి ఇంటిదారి పట్టాం.




కొసమెరుపు
యాగంటి నుంచి బనగానపల్లె వెళ్ళే దారిలో ఒక పాడుబడిన నవాబుల బంగళా ఉంది. దానికే కాస్త గ్రాఫిక్స్ జోడించి ఒక పెద్ద కోటగా భ్రమింపజేస్తారు అరుంధతి సినిమాలో. అప్పటి నుంచి ఇది అరుంధతి కోటగా చేలామణి అవుతూ ఒక సందర్శన క్షేత్రమైపోయింది.


4 comments

Post a Comment