తాచెడ్డ కోతి


నం బావుండాలి పక్కనోడూ బావుండాలి అనుకోవడం ఒక పద్దతి. మనమే బావుండాలి, పక్కనోడు నాశనమైపోయినా ఫర్వాలేదనుకోవడం ఇంకో పద్దతి. మొదటిది ఉదార స్వభావమయితే, రెండోది ఉన్మాద స్వభావం. ఉన్మాద ప్రవృత్తి ఉన్న వ్యక్తులకి చికిత్స అవసరం. వాళ్ళు ఉంటే ఇంటి నాలుగుగోడల మధ్య ఉండాలి లేద మానసిక వైద్యుల పర్యవేక్షణలోనన్నా ఉండాలి. అలా కాకుండా జనంలో స్వేచ్చగా తిరగనిస్తే తాచెడ్డకోతి వనమంతా చెరిచినట్లవుతుంది పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్నది అదే.

' తనను తన కుటుంబాన్ని అవమానిస్తున్నార ' ని జగన్ ప్రధాన అభియోగం.పదవీ కాంక్షతో తండ్రి శవం పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేల చేత బలవంతపు సంతకాలు చేయించుకొని, అది చాలదన్నట్టు పి.ఆర్.పీ నేతలతో మంతనాలు సాగించిన జగన్, తన తండ్రినే ఘోరంగా అవమానించారు. ' తండ్రి కోసం అసువులు బాసిన అభిమానుల కుటుంబాలని ఓదార్చటం పుత్రుడిగా తన ధర్మం' అని మనుధర్మాలు వల్లించే జగన్‌కి ఇది తెలియకపోవడం శోచనీయం. నిజానికి వైయస్ మరణాంతరం కూడా ఆయన కుటుంబానికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రయత్నమే చేసింది అధిష్ఠానం. అందులో భాగంగానే రెండు ప్రతిపాదనలు చేశారు. ఒకటి విజయమ్మకు పులివెందుల టికెట్ ,రెండోది జగన్‌కు కేంద్ర మంత్రి పదవి . సీ.ఎం.పదవి తప్ప మరో ధ్యాసలేని జగన్‌కు సహజంగానే రెండు ప్రతిపాదనలూ నచ్చలేదు. తన ధ్యేయం రాష్ట్రపీఠమైనప్పుడు, అసెంభ్లీకి వెళ్ళాలి కానీ కేంద్ర మంత్రిత్వం చెయ్యడమేంటన్నది ఆయన ఆలోచన. అసెంబ్లీకి వెళ్తే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి మరో అధికార కేంద్రాన్ని తయారుచెయ్యవచ్చు. సుముహూర్తం చూసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తను గద్దెనెక్కవచ్చు. కేంద్రమంత్రిగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించటం కష్టసాధ్యం. అందుకే ససేమిరా అన్నారు. కానీ ఒత్తిడికి తలొగ్గి తన తల్లిని అసెంబ్లీకి పంపక తప్పలేదు. అధిష్ఠానం కుడా జగన్ అసెంబ్లీకి వెళ్తే జరుగబోయే విపరీత పరిణామాలు దృష్టిలో ఉంచుకొనే ఆ ప్రతిపాదనలు చేసింది.ఇక వైయస్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? విజయమ్మ ఎమ్మెల్యే, జగన్ స్వయానా ఎం.పి. వైయస్ సోదరుడు వివేకానందరెడ్డి ఎమ్మెల్సి. బామ్మర్ది కడప మేయర్. పులివెందులలో సర్పంచ్,మున్సిపల్ ఛైర్మాన్ లాంటి ప్రధానమైన పదవులన్నీ వారివే. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ గనులశాఖామాత్యులు బలినేని శ్రీనివాసరెడ్డి, వైయస్ తోడల్లుడు వైయస్ సుబ్బారెడ్డికి దగ్గర బంధువు.ఇక వైయస్సార్ ఆత్మగా చెప్పబడే కే.వి.పి, రోశయ్య ప్రభుత్వంలో కూడా శాంతి భధ్రతల సలహాదారుగా కొనసాగి మొన్నమొన్ననే రాజీనామా చేశారు. అయన దగ్గర బంధువైన పార్థసారథికి ఎమ్మార్ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర ఉంది.ఇలా ఒకరా ఇద్దరా..ఆశ్రిత పక్షపాతం,అవినీతికి మారుపేరైన వైయస్ పాలనలో ఆయన్ను 'నమ్ముకున్న ' వారందరూ నిబంధనలతో నిమిత్తం లేకుండా కొన్ని తరాల వరకూ సరిపోయే కోట్లాది రూపాయిలు వెనకేసుకున్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉంటూ,అధిష్టానం అండదండలతోనే ఇదంతా చేయగలిగారే కానీ స్వంతంగా కాదు . అంత సామర్థ్యమే ఉంటే 2004 ఎన్నికలకు ముందు వైయస్ కుటుంబం ఆర్థికంగా దివాళా తీసే స్థాయిలో ఉండేదా? ఇన్నాళ్ళూ సీతగా కీర్తించిన సోనియాని ఇప్పుడు హఠాత్తుగా శూర్పణఖ అంటే ప్రజలు నవ్విపోతారు.

'సాక్షి' దినపత్రికలో వచ్చే వార్తలు చదివితే అదొక వార్తాపత్రికా లేక, జగన్ ట్విట్టర్ అకౌంటా అనిపిస్తుంది. 'ఇడుపులపాయ పుణ్యక్షేత్రం, ఇడుపులపాయ జనసంద్రం, మహానేత వైయస్, యువనేత జగన్, పోటెత్తిన జనం, అభిమానుల గుండెపోట్లు ' ఇవే ప్రధాన వార్తలు.' జగన్ ముఖ్యమంత్రి కావాలని వయసుతో సంబంధం లేకుండా ధర్నా చేసే చిన్నారులు, జగన్ రాలేదని నడిరోడ్లపై బైఠాయించే ప్రజలు, వచ్చాక తలనిమిరే ఒక ముసలవ్వ,తల పక్కకు వాల్చి ఆ ముసలవ్వ బుగ్గలనే కాకుండా,వచ్చిన వారి బుగ్గలనన్నీ పిసుకుతూ అటు ఏడుపు ఇటు నవ్వు, రెండు కాని భావాన్నొకటి మొహంపై పలికించే జగన్ ' ఇవి ఫోటో ఫీచర్‌లో కనువిందు చేసే ఫోటోలు. తండ్రి గతించి ఏడాది దాటినా ఇంకా ఓదార్పుయాత్ర అంటూ హడావుడి చేసి నలుగురిలో నానే ప్రయత్నం చేస్తున్న జగన్ అజెండా ఏమిటో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. పరామర్శలు, ఓదార్పులకి పరిమితం కావల్సిన యాత్రలో రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రాజకీయ ఉపన్యాసలు దంచి, అనుచరుల చేత రెచ్చగోట్టే ప్రకటనలు ఇప్పించి, అధిష్టానాన్ని యుద్ధానికి కవ్వించి, రాష్ట్రంలో తనను మించిన నాయకుడు లేడనే భ్రమలు కలిగించిన ఆయన, ఇప్పుడు అదే అధిష్టానం అస్త్రశస్త్రాలతో  సైయ్యంటే గగ్గోలు పెడుతున్నారు.'కుటుంబాన్ని చీల్చేయత్నం చేస్తున్నార' ని ఆశ్చర్యం వొలకబోస్తున్నారు. రాజకీయ రంగప్రవేశం చేసిన ఏడాదిన్నరకే సీ.ఎం కావాలని తహతహలాడుతున్న ఆయన, ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో పాతుకుపోయి మొదటిసారి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన తన స్వంత చిన్నాన్న పైన మాత్రం నిప్పులు చెరిగారు( పరిస్థితి కొట్టుకునేవరకు వెళ్ళబోతే అక్కడివారు సర్దిచెప్పారని PTI- Press Trust of India కథనం ). రామోజీరావు తోడల్లుడి కథనాలు, సుమన్ ప్రభాకర్‌ల ఇంటర్వ్యూలూ మొదటిపేజీలలో ప్రచురించి రామోజీ కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించిన జగన్ ఇప్పుడు అదే పరిస్థితి తనకూ వచ్చేసరికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు.

ఏడాదిన్నర కాలంగా మొద్దునిద్రలో ఉన్న రాష్ట్రపాలనా యంత్రాంగాన్ని నిద్రలేపి పరుగులు పెట్టించే బాధ్యతను భుజాన వేసుకున్నారు కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అయితే బొడ్డూడకుండానే బిర్యానీ తినాలనుకునే మనస్తత్వం కలిగిన జగన్, అతని అనుచరగణం ఆయనను ప్రశాంతంగా పనిచేసుకోనివ్వకపోవచ్చు.
 ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యవచ్చు. బలం లేక ఇప్పుడు వెనక్కితగ్గారు కానీ 'వైయస్ తెచ్చిన ప్రభుత్వం' అనే గౌరవంతో కాదు. తనకు మద్దతుగా పదుల సంఖ్యలో  కార్యకర్తలు, ఛోటా మోటా నాయకులు రాజీనామా చేసిన సంగతి అంకెలతో సహా తన పత్రికలో వేసుకున్నప్పుడే ఈ విషయం రూఢి అయ్యింది. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతివాదుల్ని, టీ.డీ.పీ, పీ.ఆర్.పీ లోని అసంతృప్తుల్ని జగన్ తనవైపు త్రిప్పుకోగలిగితే మధ్యంతర ఎన్నికలు అనివార్యమవుతాయి. మాటవినని మొండిఘటాలను శ్రేయోభిలాషులైన పెద్దలే దారిలో పెట్టాలి. అటువంటి వారెవరూ జగన్‌ దరిదాపుల్లో ఉన్నట్టు లేరు. ఉన్నా వినే ఓపికా సహనం జగన్‌కి లేదు. ఐతే కల్లు తాగిన కోతిని సైతం కట్టిపడేసే సత్తా కాలానికి ఉంది. రాబోయే కాలం ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డి కే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షా సమయమే.



7 comments

December 3, 2010 at 12:14 AM

జగన్ కి కేంద్ర మంత్రి పదవి యిస్తామన్నరని మీకెలా తెలిసింది?(ఆంధ్రజ్యోతి,ఈనాడు సోర్స్ అయితే, యిక మాట్లాడక్ఖర్లేదు).
జగనేకాదు, ఈరోజు రాజకీయాల్లో వున్నఎవరి అజెండా అయినా ఒక్ఖటే. ఏదో ఒకపదవి. అదికూడా విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. మరి తెలిసి మనమేం చెయ్యగలుగుతున్నాం? భారతదేశం సరిహద్దులెక్కడున్నాయో కూడా తెలియనివాణ్ణి, 2014లో ప్రధానిచెయ్య్డమే మా ఆశయం అని అందరూకీరిస్తుంటే, ముసిముసి నవ్వులు నవ్వుకునే అమ్మా, కొడుకులకి తెలియదా వాళ్ళు కూడా అదే పడవలో ప్రయాణిస్తున్నారని? ఎలాగూ మనకు ప్రత్యక్ష ఎన్నికలు లేవుకాబట్టి, మీకున్న మల్టిపుల్ చాయిస్ అబ్యర్ధులలో ఎవరో ఒకరికి వోట్ వేయడమే మిగిలింది. అలాక్కాదు, ఠాఠ్ నాక్కుదరదు అంటారా, యిలా బాధలు బ్లాగుల్లో చెప్పుకోవడమే.
అన్నీ ఆతానులో ముక్కలే. మీకుసరిపడే గుడ్డ దొరికిందా, లాక్కుని దర్జీ దగ్గరకు లగెత్తడమే.

Reply
December 3, 2010 at 1:06 AM

meeru kaani ccdb follow avutara emiti...
just a question...ignore if you dont understand it.

Reply

@ పండు గారు,

మీరు జగన్ అభిమానా? నేను ఆంధ్రజ్యోతి చదవను.అప్పుడప్పుడు 'సాక్షి' చదువుతాను.ఈ మధ్య ఆదివారం 'సాక్షి' మిస్సవకుండా ప్రయత్నిస్తున్నాను... యండమూరి సీరియల్ కోసం. 'ఈనాడు' మాత్రం రెగ్యులర్‌గా చదువుతాను. 'ఈనాడు' లోపాలు 'ఈనాడు'కున్నప్పటికీ ఇప్పుడున్న వార్తపత్రికలలో అదే కొంచెం బెటర్ అని నా ఉద్దేశ్యం. కాదు 'సాక్షి' అని మీరు వాదిస్తే నేనేం చెయ్యలేను.

జగన్‌కి కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేశారని బోల్డు పత్రికలు కోడై కూశాయి. నిన్న మొన్న కూడా మందా జగన్నాథం లాంటి వ్యక్తులు TV9లో ఇదే స్పష్టం చేశారు.సోనియా, రాహుల్‌లను నేను సపోర్టు చెయ్యడం లేదు.మనం చెయ్యగలిగిందల్లా ఎన్నికల సమయంలో ఫర్వాలేదనిపించే వ్యక్తికి ఓటెయ్యటమే.అలా కాకుండా రకరకాల కాలిక్యులేషన్స్ తో వోట్లు వేయబట్టే ఈ దుస్థితి.

@Kauphy గారు,
నాకు CCDB తెలుసు.

Reply
December 3, 2010 at 10:37 PM

నాకు CCDB తెలుసు.

mee pada prayogam chusi anukunnanu oka vela akkada kuda participate chestaru emo ani.

Reply
December 6, 2010 at 11:34 PM

This is one of the best pieces I've read on the current AP politics.
Thank you

Reply

కొత్తపాళీ గారు,

నెనెర్లు.ఎదో మీ అభిమానం

Reply
August 15, 2011 at 11:51 AM

If Rajiv Gandhi can become the PM after his mothers death why cant jagan become the CM of AP after the death of YSR?

thanu CM kaavaalanukovadam thappa?

Gandhi family ki okka rulu other families ki okka rulaa?

Reply
Post a Comment