మునిపల్లె రాజు - అస్తిత్వనదం ఆవలితీరాన




మేజికల్ రియలిజం ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని అధ్యాత్మిక కోణంలో అన్వయించి చూసి మానవుడికి, జరుగుతున్న సంఘటనలకు మధ్యనున్న మార్మిక సంబంధాలని ఆవిష్కరించి, విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ ఉండదు. రచయిత రియాలిటీనీ కాపీ కొట్టటం కానీ, దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చెయ్యడు.సాధరణ విషయాలని అద్భుతంగా, అద్భుతమైన వాటిని సాధారణంగా వర్ణిస్తూ నిగూఢమైన రహస్యాలని తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు ‘ సెరమోని ‘ అనే పాశ్చాత్య కథలో ఒక యువతి ఆగ్రహంతో నృత్యం చేస్తూంటుంది.ఎన్నో వేల మైళ్ళ దూరంలో, ఆమెను మోసం చేసిన ప్రియుడు రాత్రి వేళలో తన పశువులపాకలో చెలరేగుతున్న అలజడి చూసి విస్తుబోతూంటాడు. ఆవేశంతో ఆ యువతి కదిలిస్తున్న పాదాలకు, పాకలో పశువులు అసహనంగా కదిలిస్తున్న గిట్టలకు రిలేట్ చేస్తాడు రచయిత. చివరకి ఆ పశువుల దాడిలో అతను మరణిస్తాడు.అతను మరణించిన విషయం రచయిత స్పష్టంగా చెప్పడు కానీ ఒక మోసపోయిన యువతి ఆగ్రహానికి, ఆమె అగ్రహంతో నాట్యం చేస్తే,అతని ప్రియుడే ప్రాణాలు కోల్పోతాడనే విషయానికి రచయిత ఇక్కడ ప్రాముఖ్యతనిస్తాడు. తెలుగులో ఈ తరహా రచనలు చేసిన కొద్దిమంది ప్రముఖులలో మునిపల్లె రాజు గారొకరు.




రాజు గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసి రిటైరయ్యారు. చాలా చిన్న వయసునుంచే అనేక కథలు,కవితలు, వ్యాసాలు వ్రాసి పలు పురస్కారాలు పొందారు.’అస్తిత్వనదం ఆవలి తీరాన’ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం. ఇందులో మొత్తం పదిహేను కథలు, ఒక మినీ నవల ( ‘పూజారి ‘. ఇదే 1964 లో బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా ‘ పుజాఫలం ‘ సినిమాగా వచ్చింది),కొన్ని స్వగతాలు ఉన్నాయి. గత శతాబ్ది గొప్ప కథలలో ఒకటిగా కీర్తికెక్కిన రాయలసీమ కరువు సమస్యల గాథ ‘ వీరకుంకుమ ‘ కూడా ఇందులో ఉంది. కథ ఏదైనా, ఇతివృత్తం ఎటువంటిదైనా దానిలో మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన, తాత్విక శోధన కనిపిస్తుంది. ‘ నైమిశారణ్యంలో సత్రయాగం’ లో విఫల ప్రేమతో అభయానంద గోస్వామి గా మారి నైమిశారణ్యంలో అధ్యాత్మిక పరివేదనలో మునిగిపోయి ఏళ్ళు గడిపి ఆఖరుకి అదే అరణ్యంలో ఒకప్పటి తన ప్రియురాలిని అంత్యదశలో కలుసుకొనే చక్రి , ‘ చేనేత చిత్రం’ లో కుగ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా ముంబయిలోని హస్తకళలపోటికి వచ్చి ద్వితీయ బహుమతి గెలుచుకొని, ఆ తర్వాత నగరంలోని జౌళిమిల్లులు, బట్టల ఖార్ఖానాలు చూసి వాటి ముందు తన చేనేత వృత్తి నిలబడగలదా అని పరితాపం చెందే ఓబయ్య, ’ స్తపతి మహోత్సవం’ లో యానాది కుష్టుమహిళకు ఆలయంలోని బంగారు పంచామృత పాత్రలో పాయసం తినిపించే సీతారాం’, ‘ఒక బాకీ తీరలేదు’ లో బాల్యంలో తనకు అన్నం పెట్టి ఆదుకున్న కమలమ్మ రుణం తీర్చుకోవడం కోసం విదేశాలనుంచి వచ్చే డాక్టర్ మురళి,వారు గతించారని చెప్పి మళ్ళీ అతనికి ఆతిథ్యమిచ్చే ఆ ఇంటి ముసలమ్మ, ‘మహాబోధి ఛాయలో ‘ లో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చెరువు గట్టునున్న ఒక మహావృక్షంతో అనుబంధాన్ని అల్లుకొని, ఆ వృక్ష ఛాయలోనే తన జీవితాన్ని మలచుకొని ,అనేక ఆటుపోట్లకు తట్టుకొని పరాయి రాష్ట్రంలో స్థిరపడి, చివరికో పని మీద మళ్ళీ స్వగ్రామం వచ్చి ఆ చెట్టు కనబడక తల్లడిల్లే కథానాయకుడు..ఇలా ప్రతి పాత్రా మానసాకాశంలో కారుమబ్బులా కదిలిపోతూ భావుకత్వపు కుంభవృష్టిలో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది. మనం కూడా కాసేపు సన్యాసులమై, కమండలాలు ధరించి,శాంతి వచనాలు వింటూ రావిచెట్టు నీడలో యోగముద్రలోకి వెళ్ళిపోతాం. నోరున్న మానవులే కాదు, నోరులేని చెట్టు,ఎద్దు, కుక్క, కూడా ఈయన కథలలో ముఖ్య పాత్రలు పోషించాయి. అంతులేని పోరాటాలతో,అంతరంగిక వేదనలతో అలసిపోయి చీకట్లో మ్రగ్గుతున్న సగటు మానవుడి జీవన విధానానికి వేదాంతపు వీవెన విసిరి, అస్తిత్వపు ఆసరానిచ్చి ఆవలి ప్రశాంత ప్రకాశ తీరాలను చేర్చే యత్నం కనిపిస్తుంది. ఆయనే అన్నట్లు ‘ కథలు రెండు రకాలు. మేధస్సుతో ప్రభావితమైనవి. హృదయంతో ప్రభావితమైనవి. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువ. ఎక్కడ పునాది హృదయమో ఆ కథ కళాబంధురం.’

హృదయపు పునాదుల మీద కట్టిన కథలు చాలానే ఉన్నాయి ఇందులో.

అన్ని పెద్ద బుక్ షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.దొరక్కపోతే ఈ క్రింది అడ్రస్సును సంప్రదించవచ్చు

నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ,హైదరాబాద్ -17
వెల:100/-
తొలి ప్రచురణ  పుస్తకం. నెట్ లో


4 comments

September 4, 2010 at 5:52 PM

sreekanth gaaroo:

ee vyaasam chadavagaane meeku raaddaamani anukunnaa. manchi vyaasam.

marinni vyaasaalu mee ninchi raavaalani..

afsar
www.afsartelugu.blogspot.com

Reply

అఫ్సర్ గారు, మీ వంటి వారికి నా వ్యాసం నచ్చినందుకు సంతోషంగా ఉంది.కృతజ్ఞతలు.

Reply

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

హారం

Reply

భాస్కరరామిరెడ్డి గారు,

కృతజ్ఞతలు.పండుగ హడావిడిలో పడి కాస్త ఆలశ్యంగా మీ కామెంట్ చూడ్డం జరిగింది.మీకు మీ కుటుంబానికీ వినాయక చవితి శుబాకాంక్షలు

Reply
Post a Comment