వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు


చాలా రోజుల తర్వాత ఉషశ్రీ రామాయణం చదివాను. ఎప్పటినుంచో ఆ పుస్తకం ఇంట్లో ఉన్నా తెలిసిన కథే కదా అని ఇన్నాళ్ళూ చదవడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఆ మధ్య రామాయణం గురుంచి చర్చ వచ్చినప్పుడు వ్యవహారికంలో రామాయణానికి ఆపాదించబడ్డ చాలా విషయాలు మూలకథలో లేవని తెలిసింది. అప్పటి నుంచీ వాల్మీకి రామాయణం చదవాలని ఒకటే కోరిక. అయితే సరైన పుస్తకం ఏదీ అన్నదే ప్రశ్న. వెబ్ లో మైలవరపు శ్రీనివాసరావు గారు వ్రాసిన బాలకాండ చదివాను. ఎంతో చక్కగా ప్రతి విషయాన్ని, అందులోని భావాన్ని మనస్సుకు హత్తుకునేలా చెప్పారాయన. అది చదివాక 'మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని ' అర్థమయ్యింది. ఇన్నాళ్ళూ సినిమాలలో చూపిందో, లేక చిన్న చిన్న పుస్తకాలలో చదివిందో(బాలల బొమ్మల రామాయణం లాంటివి) అసలైన రామయణం అనుకునేవాన్ని. ఆ భ్రమలు తొలగించుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవక తప్పదు అనిపించింది. ఉషశ్రీ రామాయణం దాని ఆధారంగా వ్రాసిందే కాబట్టి నిన్నా మొన్న కూర్చొని ఎకబిగిన చదివేశాను.రామాయణం యొక్క గొప్పదనం, అందులోని పాత్రల వైశిష్ట్యం తెలుసుకొని చాలా సంతోషం వేసింది.అలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామనే ఈ టపా.



  1. 1.   దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.

  2. 2.   దశరథుడికి కైకంటే చాలా ఇష్టం. పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి. కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది. రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.

  3. 3.   దశరథ మహారాజు అశ్వమేధయాగం నిర్వర్తించి తరువాత పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. ఆ సమయంలో రావణుడు మరొక యజ్ఞదీక్షలో ఉంటాడు. అందుకే దశరథుని యాగాశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తాడు.

  4. 4.   తన వంశంలో పుట్టినవాడి చేతిలో మరణం తప్పదని ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణున్ని శపిస్తాడు.రాముడు అదే వంశంలో పుడతాడు.

  5. 5.   రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురిని పన్నెండు నెలలు(మాములుగా అయితే పది నెలలు) మోసి కంటారు కౌసల్య, కైకేయి, సుమిత్ర.

  6. 6.   బలపరాక్రమాలలో లక్ష్మణుడు రాముని తరువాతివాడు. భరతుడు వయసులో పెద్దవాడైన భుజబలంలో మాత్రం శతృఘ్నుడుకి సముడు .

  7. 7.   క్షీరసాగరమథనంలో ధన్వంతరి తరువాత ఉద్భవించిన వారు 60కోట్ల మంది అప్సరసలు. వీరిని ఎవ్వరూ వివాహమాడరు. సంచార వృత్తి కలిగివుంటారు. వీరి తర్వాత పుట్టినవి వారుణి(మద్యం), కౌస్తుభం.

  8. 8.   అహల్య వృత్తాంతం భిన్నంగా ఉంది. అహల్య అంటే ఎటువంటి వంకరలేని అందమైన స్త్రీ. ఆమె భర్త గౌతమ మహర్షి. ఆయన ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం పొందాక,ఆయన్ని పరీక్షించడానికి,నిజంగా కామక్రోధమదమాత్సర్యాలను జయించాడా అని కనుక్కోవడానికి ఇంద్రుడొక పథకం వేస్తాడు. ఆ ప్రకారం గౌతమునిలా వేషం ధరించి అహల్య చెంతకు వస్తాడు. అయితే తన పాతివ్రత్య బలంతో వచ్చినది ఇంద్రుడని గ్రహిస్తుంది అహల్య. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆమెతో కలవాలన్న తన కోర్కె తెలియజేస్తాడు. ఇక్కడ కలవటం అంటే మోక్షమివ్వటం అని అర్థం. శారీరక కలయిక కాదు. మోక్షమన్న మాటవినగానే క్షణకాలం పాటు ఆలోచిస్తుంది అహల్య. ఆమె మనస్సును క్షణకాలం చంచలం చెయ్యగలిగానే అనుకుని దేవేంద్రుడు నవ్వుతాడు. అహల్యకు అప్పుడు సత్యం బోధపడి 'నువ్వు వెళ్ళిపో' అని వేడుకుంటుంది. ఈ లోగా గౌతముడు అక్కడి వచ్చి పొరబడి,అవేశంతో ఇద్దరినీ శపిస్తాడు. ఆ విధంగా ఆయనకు ఇంద్రపదవి దూరమవుతుంది. ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని గౌతముడు ఆమెను శపిస్తాడు. అంతేకానీ రాయివి కమ్మని శాపం ఇవ్వడు.అలాగే ఇంద్రుడున్ని వృషణహీనుడవుతావని శపిస్తాడు.

  9. 9.   శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహమాడినప్పుడు మిగతా రాజకుమారులెవ్వరు అక్కడ లేరు. సీత కూడా విజయమాలతో నిల్చొని సిగ్గుపడుతూ సిద్ధంగా లేదు. సీతా స్వయంవరం అంతకు ముందే చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. ఎంతోమంది ప్రయత్నించి విఫలులయ్యారు. ఇంకొంతమంది యుద్ధానికి వస్తే వారిని జనకుడు ఓడించి పంపాడు. అలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు మిథిలా నగరం వస్తారు. రాముడు ధనువునెక్కుపెట్టి విరిచేస్తాడు.

  10. 10.   రావణుడు సీతాస్వయంవరానికి రాలేదు. శివధనువును ఎక్కుపెట్టటం అపచారమనే భావంతో అతను మిన్నకుండిపోయాడని తెలుస్తోంది. తన తరువాత మరెవ్వరూ ఆ ధనువును ఎక్కపెట్టరాదనే శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడు.

  11. 11.   వివాహమయ్యేనాటికి రాముని వయస్సు పన్నెండేళ్ళు. సీత వయసు ఐదేళ్ళు.

  12. 12.   పరశురామ గర్వభంగం సీతారాములు అయోధ్యకు వెళ్తూండగా మార్గమధ్యంలో జరుగుతుంది. జనకుడి రాజమందిరంలో కాదు.

  13. 13.   శ్రీరామున్ని వనవాసం చెయ్యమన్నందుకు ఆగ్రహించి లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ కైకను వధించటానికి కత్తి దూయరు. లక్ష్మణుడు ఆమె పరోక్షంలో ఆమెను,తండ్రిని నానామాటలంటాడు. భరతుడు తల్లిని మందలిస్తాడు.శతృఘ్నుడు మాత్రం మంధరను పాదతాడనం చేసి,భరతుడు వారిస్తే విడిచిపెడతాడు.

  14. 14.   వనవాసానికి వెళ్ళేనాటికి సీతారాముల వయస్సు 18,25 సంవత్సరాలు.

  15. 15.   దశరథుడు మరణించాక ఆయన దేహాన్ని పన్నెండురోజుల పాటూ తైలద్రోణంలో నిల్వ చేస్తారు. అంత్యక్రియలు చెయ్యడానికి కుమారులెవ్వరు అందుబాటులో లేకపోవటంతో భరత శతృఘ్నులు అయోధ్య వచ్చేవరకు శవం కుళ్ళి పోకుండా ఈ ఏర్పాట్లు చేస్తారు.

  16. 16.   నాస్తికవాదం రామాయణ కాలంలో కూడా ఉంది. రామున్ని అయోధ్యకు రప్పించటానికి భరతుడు సకల పరివారంతో వెళ్ళినప్పుడు జాబాలి అనే దశరథుని మంత్రి 'ఎవరు తండ్రి,ఎవరు తల్లి' అంటూ నాస్తికవాదం చేస్తాడు. దీన్ని శ్రీరాముడు నిరసించి,'మీవంటి వారిని నా తండ్రి ఎలా కొలువులో పెట్టుకున్నారో' అంటాడు.

  17. 17.   సీతారామలక్ష్మణులు వనవాసంలో మాంసాహారం తిన్నారు.

  18. 18.   ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ తన గోడు సోదరులైన ఖరదూషణాదులకు విన్నవించుకుంటుంది. ఆగ్రహంతో ససైన్యంగా వచ్చిన వారిని శ్రీరాముడు యమపురికి పంపిస్తాడు. అకంపనుడనే దూత ఈ సంగతంతా రావణుడికి చెప్పి,సీతాదేవి సౌందర్యం గురుంచి వివరించి, రామున్ని నిలువరించాలంటే సీతను అపహరించాలని ఉపాయం ఇస్తాడు. వాడి మాటలు విని రావణుడు వెళ్ళి మారీచున్ని కలుస్తాడు. మారీచుడు అతనికి హితబోధ చేసి పంపించేస్తాడు. శూర్పణఖ లంక వెళ్ళి రావణున్ని రెచ్చగొడుతుంది.

  19. 19.   జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న లక్ష్మణరేఖ గురుంచి వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణుడు అటువంటి రేఖ ఏదీ గీయడు

  20. 20.   రావణుడు ఎడమచేత్తో సీత జుట్టుపట్టుకొని,కుడి చేత్తో ఆమెను ఎత్తుకొని పిశాచాల్లాంటి గాడిదలు పూంచిన రథంలో ఆమెను కూర్చోబెట్టి లంకకు తీసుకుపోతాడు.

  21. 21.   రావణుడితో తలపడక ముందే జటాయువు సీతారామలక్ష్మణులకు పరిచయం అవుతాడు. వారు పంచవటికి విచ్చేసినప్పుడు జాటయువు తనను తాను పరిచయం చేసుకుంటాడు.

  22. 22.   వాలి మహాబలవంతుడు. తనతో యుద్ధానికి సిద్ధపడిన రావణున్ని సైతం ఓడించి పంపిన పరాక్రమశాలి. అతనితో ఎవరు ముఖాముఖి తలపడినా వారి బలంలో సగం వాలికి చెందేటట్లు వరం ఉంది. చెట్టు చాటు నుంచి వాలిని వధించటానికి గల కారణాల్లో ఇదొకటి.

  23. 23.   కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి (అవతార్ గుర్తొచ్చిందా). అవి ఎక్కడబడితే అక్కడ వాలి విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా అపార ప్రాణనష్టం జరుగుతూండటంతో ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించివేస్తాడు.

  24. 24.   అశోకవనంలో అన్నపానీయాలు ముట్టని సీతాదేవికి రహస్యంగా అమృతం యిస్తూ రక్షిస్తాడు ఇంద్రుడు.

  25. 25.   రావణుడు మారువేషంలో వచ్చి రాముడికి యుద్ధ ముహూర్తం నిర్ణయించడు.శ్రీరాముడే యుద్ధముహూర్తం నిర్ణయించి లంకకు బయలుదేరుతాడు.

  26. 26.   యుద్ధారంభానికి ముందే కుంభకర్ణుడు నిండుసభకు వచ్చి రావణుడికి హితబోధ చేస్తాడు.

  27. 27.   రావణుడి ఉదరంలో అమృతభాండం ఉన్నట్లు,విభీషణుడి సలహాతోనో మరొకరి సలహాతోనో దాన్ని పగలగొట్టి, రావణున్ని సంహరించినట్లు ఇందులో లేదు. అగస్త్య మహర్షి సలహా మేరకు శ్రీరాముడు, సూర్యున్ని ధ్యానించి బాణప్రయోగం చేసి రావణుడి గుండె చీలుస్తాడు.


11 comments

July 6, 2010 at 3:13 AM

Very very thanks for these informative facts.

Reply

ఉత్తరాదిన ఇంకా దారుణం.
కాళిదాసు కవిత్వం కొంత తన పైత్యం కొంత అన్నట్లు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు.

Reply
July 6, 2010 at 9:22 AM

ఉషశ్రీ గారి రామాయణ విషయం నాకు తెలియదుకానీ మీరు నిజం గా ఉషశ్రీ గారి రామాయణం నుండే పైన చెప్పిన పాయింట్లు ఉదహరించి ఉంటె మాత్రం పై వాటిలో అహల్యా వృత్తాంతం వాల్మీకి రామాయణం లోనిది మాత్రం కాదు.
వాల్మీకి రామాయణం ప్రకారం " వచ్చిన వాడి గౌతముని వేషములోని దేవేంద్రుడు అని గ్రహించినా,దేవేంద్రుడి అంతటి వాడు తన పొందు కోసం వచ్చాడని అహల్య అతనితో శారీరకంగానే కలుస్తుంది. అంతేకాక కలయిక తర్వాత తన ఆనందం కూడా వ్యక్తపరుస్తుంది. ఇక్కడ మోక్షం లాంటి భావనలు లేవు. గౌతముడు మహాతపోసంపన్నుడు. అతడు పొరబడలేదు. జరిగింది గ్రహించే అహల్యను ఆ పాపం నుండి విముక్తం చేయడానికి 1000 సంవత్సరాలు గాలిని ఆహారం గా స్వీకరిస్తూ బ్రతకమని, తర్వాత తిరిగి తను అహల్యను స్వీకరిస్తానని చెప్పాడు." అలానే స్వీకరించాడు కూడా.
అంతేకానీ మాహా ఋషి ఐన గౌతముడు పొరబడనూ లేదు, ఆవేశపడనూ లేదు.

Reply
July 6, 2010 at 9:28 AM

దయ చేసి మీకు వీలైతే వాల్మీకి రామాయణం కూడా చదవండి. ఒక రచన అధారంగా మరొక రచన చేసేప్పుడు 99% రచయితలు తమ భావాలను కూడా నిక్షిప్తం చేస్తారు. అలా నిక్షిప్తం చేసినవి ఎంత సహజంగా ఉంటాయంటే అవి నిజమేనేమోనని అనిపిస్తుంది. అందువలన మొదట మూలం చదివి తర్వాత కావాలంటే ఇతరాలు చదువుకోవచ్చు.

Reply
July 6, 2010 at 1:48 PM

ఈ మధ్య నేను చాగంటి కోటేశ్వర రావు గారి వాల్మికి రామాయణం వ్యాఖ్యానం విన్నాను. అందులో అహల్య గురించి మీరు రాసినట్టుగా చెప్పలేదు. వ్యాఖ్యానంలో ఆయన సంస్కృతం శ్లోకాల్ని తెలుగులోకి అనువదించి వివరించారు. మీరు వీలైతే అది వినండి. అద్భుతంగా వుంది. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. www.srichaganti.net వెబ్సైటు కి వెళ్లి వుచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Reply

@సాంబ గారు కృతజ్ఞతలు,

@విజయమోహన్ గారు,
ఎవరి ఉహాశక్తికి తగ్గట్లుగా వారు కథలను జోడించారు లేండి.

Reply

@సురేష్ బాబు గారు

మీరు అహల్య గురుంచి వ్రాసిన కామెంట్ కూడా పబ్లిష్ చేశాను కానీ,గూగుల్ ప్రాబ్లం వల్ల అది కనిపించటం లేదు.ఆ సమస్య పరిష్కారమయ్యాక మళ్ళీ పబ్లిష్ చేస్తాను.

ఇకపోతే ఉషశ్రీ రామాయణంలో కూడా అహల్య గురుంచి మీరు చెప్పినట్లే ఉంది.అయితే మైలవరపు శ్రీనివాసరావు గారు వాల్మీకి రామాయణం ఆధారంగా వ్రాసిన బాలకాండములో దీన్నే మరింత లోతుగా వివరించే ప్రయత్నం చేశారు.ఇంద్రుడంతటి వాడు వచ్చి మోక్షమిస్తానంటే(ఇంద్రుడితో కలవటం అంటే మోక్షం కిందే లెఖ్ఖ అని వారి భావం)అహల్య అంగీకరించి అంతలోనే తన తప్పు తెలుసుకుంది.ధర్మపత్ని కాబట్టి మోక్షవిషయంలో భర్తను సంప్రదించాలి,కానీ భర్తలేని సమయంలో ఇంద్రుడు ఆశపెట్టేసరికి ఆలోచనలో పడుతుంది.అదే ఆమె చేసిన అపచారం.శ్రీనివాసరావు గారి ప్రకారం అహల్య,జమదగ్ని మహర్షి భార్య రేణుక ఒకే విధంగా ప్రవర్తించారు.ఇద్దరికీ మానసిక చాంచల్యం కలిగిందే తప్ప శారీరకంగా వారిద్దరూ ఏ తప్పు చెయ్యలేదు.గౌతముడు మహాతపోధనుడైనా ఇంద్రుడి మాయోపాయంలో పడి,అహల్య మనస్సు చలించింది కాబట్టి ఆమెను శపిస్తాడు.

Reply

@ ప్రశాంత్ గారు,
Thankyou for the link.డౌన్లోడ్ చేసుకొని వింటాను.

అహల్య గురుంచి సురేష్ బాబు గారికి వ్రాసిన కామెంట్ ని చదవగలరు.

Reply
July 7, 2010 at 9:52 AM

వ్యాఖ్యాతలు వారి భావాలను తెలియజెస్తారండి. కాని మూల వాల్మీకి రామాయణంలో మాత్రం నేను ఇంతకు ముందు వ్యాఖ్యలో వ్రాసినట్లే ఉంది. ఇంకో విషయం ఇంద్రుడికి మోక్షం ఇచ్చే శక్తి లేదండీ.

Reply
July 7, 2010 at 5:33 PM

ఇంద్రో విశ్వస్య రాజతి - ఇంద్రుడు ఋగ్వేదం ప్రకారం ఆది దేవత. వికీ లో మరింత సమాచారం దొరకవచ్చు.

మీ పాయింట్స్ తో సంబంధం లేనిదే, ఆసక్తి కొద్దీ వెదికి చదివిన సమాచారం ఇక్కడ పరుద్దామని. నేను ఓ అర్నెల్ల క్రితం లీనమైపోయి చదివిన సమగ్ర చర్చలు ఇక్కడ ఉన్నాయి -
http://nagamurali.wordpress.com/2008/09/25/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-%E0%B0%86%E0%B0%A6/

http://mynoice.blogspot.com/2007/10/blog-post_24.html


ఇక పైపైన చూసినవి - http://mdileep.wordpress.com/2008/09/22/ramayanam_angi/

Reply

@ సురేష్ బాబు గారు,
ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా వాటిలో మంచిని,మనకు నచ్చినదానిని గ్రహించటం మేలని నా అభిప్రాయం.నాకు శ్రీనివాసరావు గారి వాదన సబబే అనిపించింది.ఇంద్రుడి శక్తుల గురుంచి ఉషగారు ఇచ్చిన కొన్ని లింకులు చూడండి.


@ ఉషగారు,

Thankyou for the links.

Reply
Post a Comment