కాకతీయ కదనశార్దూలం గోనగన్నారెడ్డి


నాకు మొదట్నుంచి కథలూ, కాకరకాయలంటే చాలా ఇష్టం. అందునా జానపద,చారిత్రాత్మక, పౌరాణిక గాథలంటే చెవికోసేసుకుంటాను. గోనగన్నారెడ్డి గురుంచి విన్న తొలిసారి అతనెవరో తెలుసుకుందామని గూగులమ్మలో వెతికితే తెలుగువన్.కాంలో అడవిబాపిరాజు గారి నవల ధారావాహిక రూపంలో కనిపించింది. ఒక పేజి చదివగానే,ఇదేదో సులభంగా చదివి అర్థం చేసుకొనే కథ కాదని అర్థమై ఆ ప్రయత్నానికి విరామం యిచ్చాను. ఇన్నాళ్ళకు ఆ కథ చదవాలన్న కోరిక మళ్ళీ పుట్టి, పుస్తకం కొని చదవడం జరిగింది.మొదట కథలోకి వెళ్ళి,తర్వాత కథనంలోకి వెళ్దాం.

కథ

గణపతిదేవుడు ఓరుగల్లు రాజధానిగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి.

కాకతీయ సామ్రాజ్యానికున్న అనేకానేక సామంతులలో బుద్ధపురం మహారాజు గోన బుద్ధారెడ్డి ఒకడు. అతని తమ్ముడు లకుమయారెడ్డి. బుద్ధారెడ్డి ప్రభుభక్తి పరాయణుడు. యాభై యేళ్ళకు అతనికి సంతానం కలుగుతారు.వారు కుప్పాంబ, గన్నారెడ్డి, విఠలరెడ్డి. వయోభారం పెరిగి అవసానదశకి చేరిన ఆయన, తమ్ముడు లకుమయ్యని పిలిచి, తన పెద్ద కొడుకు గన్నారెడ్డి పేరుతో రాజ్యపాలన చెయ్యమని, అతను పెద్దయ్యాక రాజ్యం అతనికే అప్పగించి,వేరొక నగరం పరిపాలించుకొమ్మని చెప్పి కన్నుమూస్తాడు. లకుమయ్య పసివాడైన గన్నారెడ్డి పేరుతో రాజ్యం చేస్తూ, ఆ పిల్లల్ని విద్యాభ్యాసం కోసం ఓరుగల్లు పంపిస్తాడు.

గణపతిదేవునికి పుత్రసంతానం లేరు. ఇద్దరూ కుమార్తెలే .పెద్దామె రుద్రమ్మదేవి, చిన్నది గణపాంబ. తన తర్వాత, తన వంశీయులే రాజ్యపాలన చేయాలనే సదాశయంతో, మహామంత్రైన శివదేవయ్య ఆదేశాలకనుగుణంగా, రుద్రమ్మదేవిని చిన్ననాటి నుంచి పురుషునిలాగే పెంచుతారు. ఆఖరికి చెల్లెలైన గణపాంబకు కూడా ఈ విషయం తెలియనంత రహస్యంగా ఉంచుతారు. గణపాంబను ఒక సామంతరాజుకిచ్చి వివాహం చేస్తారు. రుద్రమ్మదేవి రహస్యం కాకతీయ సర్వసేనానైన జయాపసేనానికి చెప్పి, అతని కుమార్తె ముమ్ముడమ్మను రుద్రమ్మకిచ్చి వివాహం చేస్తారు. రుద్రమ్మ స్త్రీ అని లోకానికి వెల్లడించిన రోజున, ముమ్ముడమ్మను ఒక ఉత్తమ వీరునికిచ్చి వివాహం చేస్తామని చెబుతారు. శోభనం రోజు రాత్రి రుద్రమ్మదేవి ముమ్ముడమ్మను పిలిచి, తానొక వ్రతం చేస్తున్నాని,అది అయిన వెంటనే ఆమె కోరిక తీరుతుందని చెబుతుంది.

గణపతిదేవుడు వృద్ధుడవుతాడు. రుద్రమ్మదేవి కాకతీయ సింహాసనం అధిరోహిస్తుంది. రాజ్యంలో అల్లకల్లోలం బయలుదేరుతుంది. లకుమయ్య తన అన్న కుమారులకు ధనం పంపడం మానేస్తాడు. తనే రాజులా చెలామణి అవుతాడు. రుద్రమ్మ పీఠం ఎక్కాక, ‘ఒక ఆడదాని మోచేతినీళ్ళు తాగాలా’ అని హుంకరించి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే స్త్రీపాలనలో తలదాచుకోవడానికి ఇష్టపడని మిగతా సామంతరాజులతో, రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహరదేవులు, మురారిదేవులు, ఇతర శత్రురాజులతో చర్చలు జరుపుతూంటాడు.

గోనగన్నారెడ్డి తండ్రిలాగే కాకతీయవంశ వీరాభిమాని. పినతాండ్రి తనకు చేసిన అన్యాయం, దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనించి కొంతమంది వీరులను తయారుచేసి, రుద్రమ్మదేవిని కలుస్తాడు. తామంతా గజదొంగలగా అవతారమెత్తి, రాజ్యంలో చెలరేగుతున్న అక్రమాలను పారద్రోలి, తిరుగుబాట్లను అణిచివేస్తామని, అందుకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతాడు. రుద్రమ్మదేవి సరేనంటుంది. గన్నారెడ్డి నల్లమల అడవులలో ఒక పాడుబడిన దుర్గాన్ని బాగుచేయించి, తన సేనతో రహస్యంగా అక్కడ ఉంటూ అధర్మనిర్మూలనం చేస్తూంటాడు.

లకుమయ్య తన కుమారుడు వరదారెడ్డిని ఆదవోని రాకుమారి అన్నాంబికకిచ్చి వివాహం చెయ్యాలని తలపోస్తాడు. అన్నాంబికకు ఆ పెళ్ళి ఇష్టం ఉండదు. గన్నారెడ్డి మెరుపులా వచ్చి వరదారెడ్డిని అపహరించుకుపోయి, కొంతకాలానికి విడిచిపెడతాడు. లకుమయ్య మళ్ళీ వివాహ ప్రయత్నం చెయ్యబోగా, గన్నారెడ్డి ఈ సారి వధువైన అన్నాంబికను అపహరించి, అక్క కుప్పాంబను తోడునిచ్చి బావగారి రాజ్యానికి చేరవేస్తాడు. యుద్ధానికి వచ్చిన వీరాధివీరుల తలలెగరగొట్టి,బేడ చెలువనాయకుని మహాఢక్కను స్వాధీనం చేసుకొని, అతనికి క్షమాభిక్ష పెడతాడు. కుప్పాంబ అన్నాంబికను ఓరుగల్లులో రుద్రమ్మ దగ్గర చేర్చి తిరిగి వస్తుంది.

వేటకు వెళ్ళి, ఏమరుపాటుగానున్న రుద్రమ్మని, పెద్దపులి బారినుంచి చాళుక్య వీరభధ్రుడనే సామంతుడు రక్షిస్తాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. స్త్రీ సహజమైన భావావేశాలకులోనై, రాజ్యభారం వదిలేసి, సాధారణ స్త్రీలా బ్రతకాలనుకుంటుంది. తన భుజస్కంధాలపై ఉన్న బాధ్యతలు గుర్తొచ్చి, తన మనః స్థితిని కప్పిపుచ్చుకొని సామ్రాజ్ఞిలా మెలుగుతూంటుంది. తను స్త్రీ అన్న విషయం ముమ్ముడమ్మకు తెలియజేసి, ఆమెను ఓదార్చి, ఉత్తముడైన ఒక వీరునితో ఆమె వివాహం జరిపిస్తానని మాటిస్తుంది. అన్నాంబిక గన్నారెడ్డి ప్రేమలో పడుతుంది. అతను గజదొంగ ఎందుకయ్యాడని బాధపడుతుంది. అతన్ని క్షమించమని రుద్రమ్మను కోరుతుంది. రుద్రమ్మ ఆజ్ఞ మేరకే గన్నారెడ్డి అదంతా చేస్తున్నాడని, పైకి మాత్రం ఆమె అశ్చర్యం నటించి, కోపం ప్రకటిస్తోందని అన్నాంబికకు తెలియదు. రుద్రమ్మ, అన్నాంబిక, ముమ్ముడమ్మ మంచి స్నేహితురాళ్ళు అవుతారు.

గోనగన్నారెడ్డి ఈలోగా రుద్రమ్మదేవిని ధిక్కరించిన కేశనాయకుడిని ఓడించి, అతని ధనం, సైన్యం, స్వాధీనం చేసుకొని వదిలేస్తాడు. గన్నారెడ్డిని హతమార్చాలని లకుమయ్య లక్షలాది సైన్యంతో బయలుదేరి శ్రీశైలం చేరుకుంటాడు.గన్నారెడ్డి మనుషులు శివభక్తులుగా వేషాలు దాల్చి, ఉత్సవాలు చేస్తూ, ప్రసాదంలో మత్తుమందు కలిపి లకుమయ్యను బంధించి ఓరుగల్లు చేరవేస్తారు. రుద్రమ్మదేవి లకుమయ్యను బుద్ధిగా తన దగ్గరే ఉండమని హెచ్చరిస్తుంది.

గోనగన్నారెడ్డి విజృంభిస్తాడు. తిరగబడిన కాచయనాయకున్ని పరాజితున్ని చేసి, మెడకు ఉచ్చి బిగించి అతని కళేబరాన్ని గుఱ్ఱంతో లాక్కుపోతాడు. ఇంతలో రుద్రమ్మదేవి బావగారిపై దాడిచేసి అతన్ని బంధిస్తారు పేర్మాడిరాయుడు, కాటయ్యలు. రాజ్యంలో తిరుగుబాట్లు అణిచివేయడనికి, శివదేవయ్య మంత్రి ఆదేశానుసారం రుద్రమ్మదేవి విజయయాత్రకు సంకల్పించి సైన్యంతో బయలుదేరుతుంది. అన్నాంబిక పురుషవేషం ధరించి అంగరక్షకురాలిగా ఆమె వెంట కదులుతుంది. గన్నారెడ్డి ఈలోగా పేర్మాడిరాయున్ని, కాటయ్యను తన కాలుమీద పడేసుకొని వదిలేస్తాడు. రుద్రమ్మ సైన్యం గుంటూరు నాగమహారాజుని సంహరించి కంచి వరకు నడిచిపోయి తిరిగి ఓరుగల్లు చేరుకుంటుంది.

వృద్ధుడైన గణపతిదేవుడు మరణిస్తాడు. రుద్రమ్మదేవి జరగబోయే పరిణామాలూహించి ఓరుగల్లును కట్టుదిట్టం చేస్తుంది.గణపతిదేవుడు చనిపోగానే అప్పటివరకూ వినయవిధేయతలతో ఉన్న రాజులు తిరుగుబాటు వ్యూహం రచిస్తారు. కాళ్యాణి చోడోదయుడు ఇతర ప్రాంతాలు ఆక్రమించుకుంటూ ఒకప్పుడు గన్నారెడ్డి తండ్రి పాలించిన వర్ధమానపురం మీద దాడి చేస్తాడు. గన్నారెడ్డి పులిలా అతనిమీదపడి అతన్ని బంధించి బుద్ధిచెబుతాడు. రాజేంద్రచోడున్ని, ఏరువ భీమున్ని, కొప్పరుజింగని తరిమికొడతాడు. వారి దగ్గర్నుంచి ధన,ధాన్యరాసుల్ని, సైన్యాన్ని కానుకగా రుద్రమ్మకు పంపిస్తాడు. గన్నారెడ్డి మీద ప్రేమతో అన్నాంబిక పురుషవేషంలో కొంతకాలం అతని రక్షణలో ఉండి అతనితో పాటూ యుద్ధాలలోపాల్గొని మళ్ళీ రుద్రమ్మను చేరుకుంటుంది.

ఒకనాడు రుద్రమ్మదేవి, అన్నాంబిక కొంతమంది వీరులతో కలిసి మొగిలిచెర్ల వెళ్ళి కాకతమ్మకు పూజలు చేస్తారు. తిరిగివస్తూండగా రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహర మురారిదేవులు సైన్యంతో విరుచుకపడతారు. చాళుక్య వీరభధ్రుడు సుడిగాలిలా ఊడిపడి వారిని తుదముట్టించి ఆమెను రక్షిస్తాడు. దేవగిరి యాదవ మహాదేవరాజు ఎనిమిది లక్షల మాహాసైన్యం పోగుచేసుకోని ఓరుగల్లు మీద దండయాత్రకు వస్తాడు. గన్నారెడ్డి అతని సైన్యంపై పడి అపారమైన ప్రాణనష్టం కలిగిస్తాడు. రుద్రమ్మదేవి మంత్ర దండనాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పక్కా ప్రణాళికతో, హోరాహోరీగా యుద్ధం చేసి అతన్ని తరిమికొడుతుంది. పారిపోతున్న అతని సైన్యాలని కొండలమాటున దాగి గన్నారెడ్డి సర్వనాశనం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో మహదేవరాజు రుద్రమ్మదేవి శరణుకోరి బ్రతికి బయటపడతాడు.

ఓరుగల్లులో సంబరాలు మిన్నంటుతాయి. నిండుసభలో గన్నారెడ్డి గజదొంగ కాదని స్పష్టం చేస్తాడు శివదేవయ్య మంత్రి. లకుమయ్యను, ఇతర స్వామిద్రోహులను క్షమించి విడిచిపెడతారు. రుద్రమ్మదేవి మారుపెళ్ళికి గణపతిదేవుడు విధించిన షరతులు మూడు. రుద్రమ్మను పెళ్ళాడిన పురుషుడు ఎంతగొప్పవాడైనా చక్రవర్తి కారాదు. రుద్రమ్మదేవియే రాజ్యాన్ని పాలించాలి. ఆమె కుమారుడు రాజ్యం వహించబోయే ముందు కాకతి వంశానికి దత్తత రావాలి. ఆ షరతులకన్నీ ఒప్పుకొని చాళుక్య వీరభధ్రుడు ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతని సోదరునితో ముమ్ముడమ్మకు వివాహం చేస్తారు. అన్నాంబిక తనరాజ్యం చేరుకుంటుంది. రుద్రమ్మదేవి, భర్తతో సహా ఆదవోని వచ్చి, అన్నాంబికకు గన్నారెడ్డికి వివాహం జరిపిస్తుంది. గోనగన్నారెడ్డి వర్ధమానపురం(నేటి వడ్డిమాని) రాజుగా పట్టాభిషక్తుడవుతాడు.

కథనం 


 అడవిబాపిరాజుగారు విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రుల సమకాలికుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యంలోనే కాక సంగీత, చిత్రలేఖనాల్లోనూ వారికి ప్రవేశం ఉంది. వారికి చిరకీర్తి సంపాదించిపెట్టిన నవలల్లో గోనగన్నారెడ్డి ఒకటి. ’ గోనగన్నారెడ్డి ‘ నవల చదవడానికి చాలా ఓపిక, ఏకాగ్రత కావాలి. రచన గ్రాంథిక భాషలో సాగటం యిందుకు కారణం కాకపోయినా, వాక్యనిర్మాణం, రాజవంశీయుల చరిత్రలు, వారి పేర్లు(ఒకే పేరు ఇద్దరు ముగ్గరికి వుండటం), బిరుదులు కొన్నిసార్లు తికమకపెడతాయి. కథలో ప్రధాన పాత్రలకే కాకుండా, ఇతర పాత్రలకు కూడా స్తోత్రపాఠాలు వ్రాశారు బాపిరాజు గారు. సగం పేజీ ఆక్రమించే ఆ బిరుదపాఠాలు చాలా చోట్ల అనవసరమనిపిస్తాయి. సాధారణ పాఠకుడికి తెలుగు నిఘంటువు అవసరం చాలాసార్లు కలుగవచ్చు. ఈ లోటుపాట్లను తట్టుకొని ఆసాంతం చదవగలిగితే గోనగన్నారెడ్డి మంచినవల అనిపిస్తుంది.

చారిత్రాత్మక కథ వ్రాయటం చాలా కష్టంతో కూడుకున్నపని. ఎన్నో వంశాల చరితల్ని, వారి సమకాలికుల్ని, ఆ నాటి సంఘటనలని, శాసనాలని, ఇతర ఆధారాలని క్షుణ్ణంగా పరీశీలించి నేర్పుగా వ్రాయాల్సి ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నవ్వులపాలు కాకతప్పదు. ఈ విషయంలో బాపిరాజుగారు పడ్డ కష్టం నవలలో ప్రతిఫలిస్తుంది. కాకతీయుల కాలంనాటి జీవనశైలిని, ఆహరపుటలవాట్లను, యుద్ధరీతుల్ని, కోటలను కళ్ళకు కట్టినట్లు వర్ణించడంలో బాపిరాజు కృతకృత్యులయ్యారు. ఆనాటి కాకతి ఉత్సవాలే నేటి బ్రతుకమ్మ పండుగలని చెబుతారు ఒక చోట. అలాగే ప్రధానపాత్రల చిత్రణ కూడా బావుంది. ముఖ్యంగా అటు రాజ్యక్షేమం కోసం పురుషుడిగా చెలామణి అవుతూ, ఇటు స్త్రీగా ప్రేమించినవాడి కోసం పరితపించే రుద్రమ్మదేవి మనస్తత్వాన్ని,ధీరమూర్తియైన గన్నారెడ్డి వ్యక్తిత్వాన్ని, అన్నాంబిక ప్రేమతత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. గన్నారెడ్డి చిత్రవిచిత్ర యుద్ధవిన్యాసాలు, మహదేవరాజు, రుద్రమ్మ సైన్యం తలపడినప్పుడు జరిగే సంఘటనలు రోమాంచకంగా తీర్చిదిద్దారు. అడవిబాపిరాజు గారి సాహితీయాత్రలో ‘ గోనగన్నారెడ్డి ‘ ఒక మేలుమజిలీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ప్రతులకి విశాలాంధ్ర బుక్ హౌస్ ని సంప్రదించండి.

పుస్తకం వెల: 125
ప్రచురణకర్తలు:
ప్రతుల కోసం సంప్రదించాల్సిన చిరునామా:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
4-1-435, విజ్ఞాన భవన్, అబిడ్స్,
హైదరాబాద్-001
ఫోన్:24744580/24735905

పుస్తకం.నెట్ లో మార్చి 17,2010 న ప్రచురితం


నేను - నా సైకిలు - భద్రాచలం


ది కొత్తగా నేను ఇంటర్మీడియట్ లో చేరిన నాటి సంగతి.


పదో తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణున్నై క్లాస్ ఫస్ట్ రావటంతో మా నాన్నగారు హీరో రేంజర్ సైకిలు కొనిచ్చారు నాకు.అంతకుముందు మా నాన్నగారిది పెద్ద సైకిల్ అట్లాస్ ఉండేది.దాన్లో స్కూల్ కి వెళ్ళేవాడిని.ఇప్పుడు నాకంటూ స్వంత వస్తువు రావటంతో చాలా సంబరపడ్డాను.మంగళవారం పూట కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి చిన్నసైజు పూజలు అవీ చేసాను.చీకట్లో కుడా నా పేరు మిలమిల మెరిసేలా రేడియం స్టిక్కర్ అంటించాను. తళాతళాలాడే ఆ కొత్త సైకిల్ పై కూర్చొని,నలిగిపోని పువ్వుల చొక్కా,నిగనిగలాడే బ్యాగీప్యాంటు తొడుక్కుని,బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలా కలలు కంటూ,యథాశక్తి నాకు వచ్చిన అరకొర విన్యాసాలు చేస్తూ మా కాలేజ్ వెళ్ళేవాడిని.






ఓ రోజు ఇలాగే నా సైకిల్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళాను.బయట చాలా సైకిళ్ళు,స్కూటర్లు పార్క్ చెయ్యబడి ఉన్నాయి.నేనూ నా సైకిల్ లాక్ చేసి స్టయిల్ గా లైబ్రరీ లోనికి వెళ్ళాను.అక్కడ దినపత్రికలు తప్ప ఏమీలేవు.వారపత్రికలు లేకపోతే పోయే కనీసం చందమామ,బాలమిత్ర లాంటివి కూడా లేకపొయ్యేసరికి మనకి బోర్ కొట్టింది.ఆ ఉన్న నాలుగైదు దినపత్రికలు చెల్లాచెదురైపోయి,చిరిగిపోయి పదిమంది చేతుల్లో విడివిడిగా దర్శనమిచ్చాయి.అపరాధ పరిశోధకుల్లా అందరూ తమ చేతుల్లోని పేపర్లలో తలమునకలైపోయి,వార్తలతో పాటూ,అందులోని అడ్వర్టైజ్మెంట్లు కూడా చదివివేస్తున్నారు.నాదాకా పేపర్ వచ్చే పరిస్థితి కనిపించలేదు.ఏం చెయ్యాలో పాలుపోక కాసేపు బిక్కమొగంవేసి 'ఓకే లెట్స్ గో హోం' అని నిర్ణయించుకొని బయటికి వచ్చాను.వచ్చి చూద్దును కదా నా సైకిల్ అక్కడ లేదు. గుండె గుభిల్లుమంది.






పధ్నాలుగువందలు పోసి కొన్న సైకిల్ అది.కొని పట్టుమని పదిరోజులు కుడా కాలేదు.నాకు చెమటలు పట్టేశాయి.ఎవరైనా దొంగలించారేమోనని చుట్టుపక్కల వీధులన్ని తిరిగేశాను.ఎక్కడా కనిపించలేదు.
మానవయత్నంతో పాటు దైవయత్నం కూడా ఉండాలని భధ్రాచలం రామున్ని కూడా వేడుకున్నాను.'నా సైకిల్ నాకు దొరికేలా చెయ్యి స్వామీ.సకుటుంబ సమేతంగా వచ్చి నీ దర్శనం చేసుకుంటా' అని మొక్కుకున్నాను.నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ లైబ్రరీ దగ్గరికే వచ్చాను.నా అవస్థనంతా చూసిన ఒక పెద్దమనిషి 'ఇందాకే ట్రాఫిక్ పోలీసులొచ్చి కొన్ని సైకిళ్ళు,స్కూటర్లు పట్టుకెళ్ళారు బాబు.ఎందుకైనా మంచిది వెస్ట్ పోలిస్ స్టేషన్లో వెదుకు ' అని ఆపద్భాంధవుడిలా మార్గదర్శనం చేశారు.నాలో ఆశ చిగురించింది.ఆయనకు కృతజ్ఞతలు చెప్పి పోలిస్ స్టేషన్ కి వెళ్ళాను.వెళ్తూ దారిపొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను ' నా సైకిల్ ఏమైనా రోడ్డుకడ్డంగా పెట్టానా ' అని.అలాంటిదేమీ లేదు.అక్కడ నా సైకిల్ తో పాటుగా చాలా సైకిళ్ళున్నాయి.వాటిని వదిలేసి నా సైకిల్ మాత్రం ఎలా పట్టుకెళ్తారు అనిపించింది.


వెస్ట్ పోలీస్ స్టేషన్లో నా సైకిల్ కనిపించగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది.
కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి నా సైకిల్ ఇవ్వమని అడిగాను.ఆయన వయస్సు నలభై - యాభై మధ్యలో ఉంటుంది.బానపొట్ట.నావైపు ఎగాదిగా చూసి మా నాన్నేం పని చేస్తారో కనుక్కొని ' రోడ్డుకడ్డంగా సైకిల్ పెట్టావ్, ఫైన్ కట్టి తీసుకెళ్ళు ' అన్నాడు.' నేనేం సైకిల్ అడ్డంగా పెట్టలేదు ' అని అతనితో వాదించాలని నాకనిపించింది.కాని ధైర్యం చాలలేదు.అవతల పోలిసోడితో వ్యవహారం.నీళ్ళు నమిలి ' నా దగ్గర లేదు సార్ ' అన్నాను. ఆయన ముఖం చిట్లించి అయితే రేపు కోర్టుకొచ్చి జరిమానా కట్టి,సైకిల్ తీసుకు ఫో' అన్నాడు.నాకు ఏడుపు వచ్చినంత పనైయ్యింది.సైకిల్ కోసం మొదటిసారి కోర్టుగుమ్మం ఎక్కాలా దేవుడా,నేను నా పరువు,ఇంటి పరువు ఏం కావాలని అరవ సినిమాలో హీరోలా తెగ కుమిలిపోయాను.


ఇంతలో గజేంద్రుడి మొరవిన్న విష్ణుమూర్తిలా ఎస్సై వచ్చాడు.నేను నాగోడు వెల్లబోసుకున్నాను.ఆయన కానిస్టేబుల్ ని పిలిచి విచారించాడు.నా వైపు తిరిగి ' ఏం బాబు.మీ నాన్న ఆఫీసర్ అని ఏదో పొగరుగా మాట్లాడావట ' అని అడిగాడు.కానిస్టేబుల్ తప్పు కప్పిపుచ్చుకోడానికి చెయ్యని నేరం నామీద వేస్తున్నాడని తెలిసి నాకు ఏడుపు వచ్చేసింది.బావురుమని నేనా పని చెయ్యలేదని విన్నవించుకున్నాను.నా ఏడుపు చూసి ఎస్సై కి విషయం అర్థమయ్యింది.ఆయన కానిస్టేబుల్ ని చీవాట్లు పెట్టి ' అడ్డమైన కేసులన్నీ తీసుకొస్తావ్ గదయ్యా.ఆ సైకిల్ అతనికిచ్చెయ్ ' అని విసుక్కున్నాడు.


సైకిల్ నాకిచ్చేస్తూ ' ఐదు రూపాయిలివ్వు.రిక్షాలో తీసుకొచ్చా ' అన్నాడు కానిస్టేబుల్.నా దగ్గర నయాపైసా లేదు.అదే చెప్పాను.చావు గిరాకీ తగిలిందని గొణుక్కుంటూ ఆయన వెళ్ళిపోయాడు.సైకిల్ దొరికిందన్న ఆనందంతో నేను బయటపడ్డాను.


అయితే నా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.గిట్టనోళ్ళు ఎవరు గింజుకున్నారో కానీ,పి.హెచ్.డి చేస్తున్న మా బాబాయ్ నా సైకిల్ తీసుకెళ్ళి పెడల్ విరగొట్టుకొచ్చాడు.ఆ పెడల్ స్క్రూ టైప్.అప్పట్లో కొత్తమోడల్ .మళ్ళీ బిగిద్దామంటే అలాంటి స్క్రూ ఏ సైకిల్ షాప్ లోను విడిగా దొరకలేదు.వెల్డింగ్ చేయించినా పెడల్ తేడాగానే ఉండిపోయింది.


దాంతోపాటు నా భధ్రాచలం మొక్కు కూడా అలానే ఉండిపోయింది .

' తెలుగురత్న' లో నా కథ- బలిపశువులు

  ( ' తెలుగురత్న' లో మార్చి 2 2010న ప్రచురితం)












   

   

కొడిగట్టిపోతున్న కర్షకుల జీవితాల్లా ఆకాశంలోని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఉసూరుమంటున్నాయి.శిథిలమైపోయిన ఊరిబావిలా సగం చిక్కిన చంద్రుడు నిర్వికారంగా చూస్తున్నాడు.కీచురాళ్ళ సొద,అప్పుడప్పుడు ఎక్కడినుంచో దూరంగా వినిపించే కుక్క అరుపు తప్ప అంతా స్తబ్ధుగా ఉంది.

ఊరి పొలిమేరలో !
తన చేను మధ్యలో !

అస్త్రసన్యాసం చేసి అంపశయ్య చేరిన భీష్మపితామహుడిలా నిస్సహాయంగా జారగిలబడి ఉన్నాడు అనంతరామయ్య.చుట్టూ వున్న కటిక చీకటిలాగే అతని గుండెల్లో గుబులు దట్టంగా పరచుకొని ఉంది.నిరాశా నిస్పృహలు దావానలంలా అతని నరనరాన్ని దహించి వేస్తున్నాయి.గురవయ్య విధించిన గడువు నేటితో తీరిపోయింది.జోళ్ళు అరిగేలా ఊళ్ళు తిరిగినా ఎక్కడా అప్పు పుట్టలేదు.ఇక పుట్టదనీ అర్థమైపోయింది.ఆఖరు బస్సుదిగి,ఇంటికి వెళ్ళడానికి మనసొప్పక ఇటువైపు వచ్చాడు.అప్పటికే అతనొక నిర్ణయానికి వచ్చేశాడు.

ఎండిపోయిన వేరుశెనగచేను వైపు పేలవంగా చూసి భారంగా నిశ్వసించాడతను.అతని కళ్ళలో జీవం లేదు.తడారిపోయిన నీటి చెలమల్లా ఉన్నాయి.గెడ్డం కలుపుమొక్కలా ఏపుగా పెరిగిపోయి అక్కడక్కడా నెరసిపోయింది.ముఖంపై ముడతలు ముంచుకొస్తున్న వార్ధక్యానికి సూచికల్లా ఉన్నాయి.చిరుగులు పడ్డ అతని పంచె పేదరికాన్ని మరుగున పెట్టలేక నానా అవస్థలు పడుతోంది.మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు మెదలింది.

రేచీకట్లు ముసురుకుంటున్న గోధూళి వేళ.పక్షులన్నీ గూళ్ళకు చేరుకుంటున్నాయి.వయసుడిగిపోయి,వ్యాపకాలు లేని వృద్ధులు రావిచెట్టు క్రింద రచ్చబండ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.తను పశువులు మేపుకొని అప్పుడే ఇంటికొచ్చాడు.దొడ్లో వాటిని కట్టేసి,వాటికి ఎండుగడ్డి వేసి,కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా అలజడి మొదలైంది.వీధిలోకి వచ్చి చూస్తే వడ్డీవ్యాపారి గురవయ్య,అతని మనుషులు.

గురవయ్య వీధిలోంచే తనకివ్వాల్సిన వడ్డీడబ్బుల గురుంచి గొడవ ప్రారంభించాడు.తను ' ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం ' అన్నా వినలేదు.ఈ రభసకు భార్య,కూతురు బయటికి వచ్చారు.నలుగురూ పోగయ్యారు.తాడోపేడో తేల్చుకోడానికి వచ్చినవాడిలా చిందులు తొక్కుతున్నాడు గురవయ్య.'కూతురు పెళ్ళి రెండునెలల్లో ఉంది.పెళ్ళయ్యాక తలతాకట్టు పెట్టైనా అప్పు తీర్చేస్తాను.అంతవరకూ ఆగమ 'ని తను వేడుకున్నా వినిపించుకోలేదు.గారపల్లు బయటపడేలా పెళుసుగా నవ్వి ' మింగ మెతుకు లేనోడికి మీసాలకు సంపెంగ నూనె దేనికిలే ? ఇప్పుడ్నీ కూతురికి పెండ్లికాకపోతే వచ్చే నష్టమేముంది? ' అనేశాడు తేలిగ్గా.తనకు తలకొట్టేసినట్లైంది.అప్పటికీ అక్కడ మూగిన జనంలో కొందరు తన వైపు వకాల్తా పుచ్చుకొని ' కూతురు పెండ్లంటున్నాడు కదా,కొన్ని రోజులు వోపికపట్టు.నీ సొమ్ము యాడికి బోదులే ' అన్నారు. గురవయ్య వాళ్ళ మీద కస్సుమంటూ పైకి లేచాడు.' చాల్చల్లేవయ్యా చెప్పొచ్చారు.పెతివోడూ నీతులు జెప్పేటోడే.మీకేం మీ సొమ్ముకాదు కాబట్టి ఎన్ని కబుర్లైనా చెబ్తారు.అవతల ఈళ్ళ దగ్గర డబ్బులొసూలు చెయ్యలేక నా పేనాలు పొతావుండాయి.ఇప్పటికి మూడ్నెలలు వడ్డీబాకీ.మీరెవురైనా హామీ వుంటానంటే చెప్పండి,ఇప్పుడే వదిలేస్తా ' అని కసురుకున్నాడు.ఎవ్వరూ కిక్కురుమనలేదు.అతను తనకు మూడురోజుల గడువిచ్చి,అది దాటితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్ళిపోయాడు.ఇంతటి ఘోరమైన అవమానం తనకెప్పుడూ జరగలేదు.ఎన్నో ఏళ్ళుగా వ్యయప్రయాసలకోర్చి తను నిర్మించుకున్న పరువుప్రతిష్ఠ ఆ రోజు మట్టిలో కలిసిపోయాయి.

సినిమా వదిలేశాక దాన్ని సమీక్షిస్తూ జనం విడిపోయినట్లు,అక్కడ మూగిన జనం కూడా తలోమాట మాట్లాడుకుంటూ చెదరిపోయారు.చేష్టలుడిగిన శిలాప్రతిమలా నడివీధిలో తాను నిలబడిపోతే,శెలవులలో ఇంటికొస్తూ జరిగిన దారుణమంతా చూసిన తన కొడుకు సూర్యం,తనను ఇంట్లోకి తీసుకువెళ్ళాడు.' తనిక డిగ్రీ చదవనని,పట్నంలో ఏదైనా పని చూసుకొని చేతనైన సహాయం చేస్తాన ' ని కొడుకు, ' ఇప్పట్లో పెళ్ళివద్దని ' కూతురు మొండికేశారు.అందరి కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.తనే వాళ్ళను సమాధానపరచి పట్టు సడలింపచేశాడు.అప్పట్నుంచి ఎక్కడైనా అప్పు దొరక్కపోదా అని తిరుగుతూనే ఉన్నాడు.తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.

కూతురిని తలచుకోగానే అనంతరామయ్య హృదయం దుఃఖంతో బరువెక్కింది.పెళ్ళిడొచ్చి ఏళ్ళు కావొస్తున్నా ఇంకా గడప దాటని కూతురు.తన ఈడు పిల్లలంతా తల్లులై సంసారాలీదుతుంటే తను మాత్రం ఇంకా వంటపని,పొలంపని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది.ఇప్పటికైనా ఆమెకు పెళ్ళి చెయ్యకపోతే తను విఫలమైనట్టే అనుకొని తనకున్న పరిమితులలో మంచి సంబంధం చూసి ఖాయం చేశాడు.కట్నకానుకలంటూ పెద్దగా లేకపోయినా కనీస ఖర్చులుంటాయి కదా.అతను అప్పు చేశాడు.వేరుశెనగ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సీజన్ లో వర్షాలు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి.ఒక పంటపండినా అతను కాస్త తెరపినపడ్డట్లే.

పంట ఏపుగా పెరిగి గింజపట్టే దశకు చేరుకొంది.అతని సంతోషానికి అవధుల్లేవు. ' ఇంకో పదును వానపడితే చాలు ' అనుకుంటూండగా పరిస్థితులు మళ్ళీ తిరుగుముఖం పట్టాయి.ఎలక్షన్లలో వాగ్దానాల్లా మెరిపించి మురిపించిన మేఘాలు,గెలిచిన నాయకుడికి మల్లే ముఖం చాటేశాయి.ఎండ తీక్షణత పుంజుకొంది.వేరుశెనగ వాడిపోవడం ప్రారంభించింది.ఊటబావిలోని కాసిని నీళ్ళతో కొన్నాళ్ళు నెట్టుకొచ్చాడు.తర్వాత అదీ ఎండిపోయింది.అతని నెత్తిన బండ పడ్డట్లైంది.గింజపట్టని నీళ్ళకాయలు అతనేం చేసుకోగలడు ?! హతాశుడయ్యాడు.

అనంతరామయ్యది వానాకాలం చదువు.ఉన్న ఆస్తల్లా తాతతండ్రుల ద్వారా సంక్రమించిన ఐదెకరాలే.తండ్రి కాలం చేశాక,తల్లి పోషణభారం కుటుంబబాధ్యతలు భుజానికెత్తుకొని కొన్నేళ్ళపాటూ పొలంలో బంగారమే పండించాడు.ఐదెకరాల ఆస్తికి మరో రెండెకరాలు జతచేసి ఏడెకరాలు చేశాడు. ఆ సమయంలోనే వొక ఇంటివాడై ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు.ఒక కూతురు,వో కొడుకు.

రోజులు దొర్లాయి.కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు.ఫెళఫెళకాస్తూ కరువొచ్చింది.అతను నిబ్బరంగా ఎదుర్కొన్నాడు. ' ఒక్క ఏడాదేలే' అనుకున్న కరువు మరో మూడేళ్ళు కొనసాగింది.కురవాల్సిన వర్షాలు సకాలంలో కురవక పొయ్యిమీది పెనంలా పొగలసెగలుపోయింది పుడమితల్లి.ఏనుగుదాహంతో అలమటిస్తున్నట్లు భూములన్నీ నోళ్ళు తెరచిపెట్టుకొని బీటలు వారాయి.అడుసునేలలో పరవళ్ళు త్రొక్కాల్సిన నాగళ్ళు మూలపడ్డాయి.కొమ్ములెగరేసి, కుప్పెలు ప్రదర్శిస్తూ ఠీవీగా తిరిగిన కాడెద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి.ఆకాశం పిండినా చుక్కచినుకు రాలేలా లేదు.పాతాళం తవ్వినా పచ్చిగంగ ముట్టేలా లేదు.జీవనోపాధి కరువైన జనం పొట్టచేతబట్టుకొని,

తిరునాళ్ళకెళ్ళినట్లు పొలోమంటూ వలసపోతున్నారు.పుట్టిన మట్టి,దుక్కిన నేలపై మమకారం చావని తత్తిమ్మా జనం అప్పోసప్పో చేసుకొని,కలోగంజో త్రాగుతూ జీవచ్ఛవాల్లా పడి ఉన్నారు.ఒకప్పుడు పిల్లాజెల్లా,ముసలీ ముతకాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు వీధులన్నీ బోసిపోయి మరుభూమిలా ఉంది.

అనంతరామయ్య తల్లి జబ్బునపడి మంచంపట్టింది.పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.అతని అవసరాలు పెరిగాయి.ఆసుపత్రులకి,మందులకి,బోర్లకి,మోటర్లకి,వాటి రిపేర్లకి తడిసిమోపెడయ్యింది. మునుపటిలా పిల్లలిద్దరినీ చదివించే స్థితిలో లేడు.కూతురు చదువు మానిపించేశాడు.ఖర్చుల కోసం,పంటల కోసం అప్పుచేశాడు.వాటిని తీర్చడానికి రెండెకరాలు అమ్మేశాడు.అలా విత్తుకున్న అప్పు మొక్క,ఏటేటా శాఖోపశాఖలు పరచుకొని కొడుకును కాలేజిలో చేర్పించేనాటికి గాఢంగా వేళ్ళూనిన వటవృక్షంలా రూపాంతరం చెందింది.వాటికి అదనంగా ఇప్పుడు కూతురు పెళ్ళి జతయ్యింది.
నడిసముద్రపు పెనుతుఫానులో చిక్కుకున్న ఒంటరి నావికుడిలా అయిపోయిందతని పరిస్థితి.తుఫాను ఎప్పుడు శాంతిస్తుందో తెలియదు.తీరం ఏవైపుందో తెలియదు.

చేయూతనివ్వడానికి ఎవ్వరూ లేరు.ఎంతకాలమని గుడ్డిగా ఎదురీత ఈదగలడు ?

ఆలోచనలతో అతని మనస్సంతా అతలాకుతలమైపోయింది.

కొడుకుగా,భర్తగా,తండ్రిగా అన్నిరకాలుగా తను విఫలమయ్యాడు.

ఇక మిగిలింది వొక్కటే !

ఆత్మహత్య !!

అతను తనచొక్కాజేబు తడుముకున్నాడు.బస్సెక్కబోతూ టౌనులో కొన్నాడు దాన్ని.అతని చేతికి చల్లగా తగిలింది పురుగులమందు సీసా !

ఒక్కసారి దాన్ని తేరిపార చూశాడు. చీడపురుగుల్ని మట్టుబెట్టడానికి ఉద్దేశించిన ద్రవాన్ని తను త్రాగబోతున్నాడు.తనూ చీడపురుగేనా ? మరి వీళ్ళంతా ఎవరు? మొలకెత్తని విత్తనాలతో మోసం చేసే విదేశీ కంపెనీలు,బ్లాక్ మార్కెట్ కి ఎరువులు తరలించి బ్యాంక్ బాలెన్సులు పెంచుకునే డీలర్లు,అసహాయతను ఆసరా చేసుకొని అధిక వడ్డీలతో పీల్చుకుతినే ఫైనాన్స్ కంపెనీలు,కొనుగోలుదారుడికి,రైతుకి మధ్య సైంధవుల్లా అడ్డుతగిలే దళారులు,పరిశ్రమల పేరుతో వ్యవసాయభూములు కారుచౌకగా కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తలు,ఎగువరాష్ట్రాలు అక్రమంగా నీళ్ళు వాడుకుంటున్నా చోద్యం చూసే రాజకీయనాయకులు,ప్రతి అరగంటకో రైతు బలవన్మరణం చెందుతున్నా సమస్యకు పరిష్కారం కనుక్కోకుండా డబ్బులు విదిలించి వదిలించుకొనే ప్రభుత్వాలు..వీళ్ళనేమనాలి ? కాదు..తను చీడపురుగు కాదు.ఆ మాటకొస్తే రైతనేవాడెవడూ చీడపురుగు కాదు.తామంతా బలిపశువులు.అనుక్షణం దగాపడుతూ,అవమానాల గ్రుక్కిళ్ళు దిగమింగుతూ బ్రతకడం చేతకాని బలిపశువులు.

అతను నిర్వేదంగా నవ్వి మూత తీశాడు !

మొండి ధైర్యంతో సీసాను గొంతులోకి వొంపుకున్నాడు !

మొదట నోరు....తర్వాత గొంతు...భగ్గున మండాయి !

అతను బాధను నొక్కిపట్టాడు.ఇంకెంత కొన్ని నిమిషాలేగా !!


* * *


అనంతరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్తతో ఆ ఊరు తెల్లారింది.శరాఘాతం తగిలిన లేడికూనలా ఆ కుటుంబం నిలువెల్లా వణికిపోయింది.ఒక్కసారిగా వాళ్ళ బ్రతుకులు అంధకారబంధురమైపోయాయి.

తండ్రి శవాన్ని చూడగానే సూర్యం మెదడు మొద్దుబారిపోయింది.
గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.రోదనలు మిన్నంటాయి.అనతరామయ్య భార్య దుఃఖంతో సొమ్మసిల్లిపడిపోయింది.
ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేస్తున్నారు.బంధువులు వొక్కొక్కరుగా వస్తున్నారు.పరామర్శించి వోదారుస్తున్నారు.తమలో ఒకడిగా,తలలో నాలుకలా మెలిగిన అనంతరామయ్యను కడసారిగా చూడ్డానికి చుట్టుప్రక్కల ఊళ్ళనుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు జనం.అతని విగత శరీరం వొక నగ్నసత్యాన్ని ఆవిష్కరిస్తూ వాళ్ళల్లో భవిష్యత్తుపట్ల భయాందోళనలు రేకెత్తిస్తోంది.

పంచాయితీ పెద్దలకు కబురు వెళ్ళింది.వాళ్ళూ వచ్చారు.రెవిన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే అవకాశాలున్నాయని సూర్యంకు చెప్పారు.అయితే ప్రజాస్వామ్యభారతంలో ప్రతిదానికీ వో రేటున్నట్లే,
ప్రభుత్వాధికారులు,డాక్టర్ల చేతులు తడపడానికీ రేట్లున్నాయని కనీసం ఐదారువేలన్నా అందుకు కావల్సివుంటుందని అనుభవజ్ఞులు కొందరు హెచ్చరించారు.సూర్యంకు అసలు ఆ ప్రతిపాదనే నచ్చలేదు.పోస్టుమార్టం పేరుతో తండ్రి దేహాన్ని ఛిద్రం చేసి,ఆ పై దానికి ' యింత ' అని వెలకట్టడానికి అతనికి మనస్కరించలేదు.

ఈ లోగా విషయం గురవయ్యకు తెలిసింది.అతనితో పాటూ అనంతరామయ్యకు అప్పిచ్చిన మిగతా జనం రెక్కలుకట్టుకొని ఊడిపడ్డారు.ఇటువంటి వ్యవహారాల్లో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు కొట్టిన పిండే.ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని వాళ్ళకు బాగా తెలుసు.ఎప్పటికైనా జరగాల్సిన తతంగమే కాబట్టి పెద్దమనుషులు కొందరు రంగప్రవేశం చేసి సూర్యం ను ప్రక్కకు పిలిపించి మంతనాలు నడిపారు.

అనంతరామయ్యకున్న ఐదెకరాలు తెగనమ్మి అప్పులు తీర్చేలా తీర్మానం చేశారు.కూతురు పెళ్ళికోసం తెచ్చిన డబ్బుకూడా ఆ జాబితాలో కలిసిపోయింది.చివరకు ఆ కుటుంబానికి తలదాచుకోను ఇల్లొక్కటి మిగిలింది.అప్పులవాళ్ళు శాంతించారు.
సూర్యం మస్తిష్కంలో మాత్రం అలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

చందాలు పోగయ్యాయి.ఏ మట్టిని నమ్ముకొని,ఎక్కడైతే అసువులు బాశాడో,అక్కడే ఆ సాయంత్రం అనంతరామయ్యకు అంత్యక్రియలు జరిగిపోయాయి.రైతుల పట్ల వివక్ష ప్రభుత్వాలకే కానీ,పంచభూతాలకు కాదన్నట్లుగా అగ్నిదేవుడు అతని దేహాన్ని ఆప్యాయంగా కౌగలించుకొని తనలో ఇముడ్చుకున్నాడు.ఎగసిపడుతున్న ఒక్కో అగ్నిశిఖ వైపు అనిమేషంగా చుస్తూ మనస్సులోనే యిలా ధృఢంగా అనుకున్నాడు సూర్యం.

" బ్రతుకుతెరువు కోసం కొద్దిరోజుల్లో నేను పట్నం వెళ్తున్నాను నాన్నా ! పుట్టినూరిని, కన్నతల్లిని,అక్కని,నానమ్మని..అందరినీ వదలి వెళ్తున్నాను.కడకు స్వంతరాష్ట్రం కూడా విడిచి వెళ్తున్నాను.ఎక్కడికని కదూ నీ ప్రశ్న? బెంగళూరు వెళ్తున్నాను.అక్కడ నా మిత్రులున్నారు.శెలవులలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తూ వేడినీళ్ళకు చన్నీళ్ళు లా తమ చదువుల కోసం డబ్బులు పోగుచేసుకుంటున్నారు.రోజుకి రెండొందల రూపాయులు జీతం.'అయ్యో ! డిగ్రీ చదువుతూ నా బిడ్డ కూలిపని చెయ్యాల్సి వచ్చిందే ' అని కించపడకు నాన్నా.చట్టబద్ధమైన ఏ పనికైనా కష్టపడటంలో తప్పు లేదు.అయినా ఎల్లకాలం కూలీగా ఉండిపోం కదా.స్వంత ఇల్లు తప్ప మనకింకేం మిగల్లేదు.అయినా సరే..నేను భయపడను.నా గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసం ఉంది.సాధించాలన్న కసి ఉంది. త్వరలోనే నేను ప్రయోజకుడినై తిరిగొస్తాను.అక్క పెళ్ళి ఘనంగా చేస్తాను.ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తాను.ఇప్పుడు మనం కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి సంపాదిస్తాను.వ్యవసాయం వొక జూదం కాదని నిరుపిస్తాను.నిరాశా నిస్పృహలతో నీలా ఇంకొకరు ప్రాణాలు తీసుకోకుండా,వాళ్ళకు ప్రేరణలా నిలుస్తాను.నన్ను ఆశీర్వదించు."


తెలుగురత్న లంకె


9 comments

Post a Comment