నీ కోసమే మేమందరం

పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం అనగానే అందరికీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది.డిసెంబర్31 నుంచే హంగామా మొదలవుతుంది. ప్రైవేట్ టి.వీ.ఛానల్స్‌లో ఆ రోజు రాత్రి పన్నెండు వరకు వచ్చే ప్రత్యేక కార్యక్రమాలు వీక్షించి ఆ తర్వాత ఒకరికొకరు విషెస్ చెప్పుకుని పడుకునేవాళ్ళు ఇప్పుడూ ఉన్నారు. అలా కాకుండా విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తూ అర్థరాత్రి దాటాక రోడ్ల పై సందడి చేసే యువత ఎప్పుడూ ఉంటారు. మరుసటి రోజు పెందరాళే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం,ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పాటించినా పాటించకపోయినా కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడం, డైరీలు వ్రాసే అలవాటు ఉంటే కొత్త డైరీ కొనుక్కోవటం, కాలెండర్లు కొనటం, బంధుమిత్రులతో సరదాగా గడపడం లాంటివి చేస్తూంటాం. వీలైనంతవరకూ ఆ రోజంతా సంతోషంగా గడపటానికే అందరం మనసా వాచా కర్మణా ప్రయత్నిస్తాం. ఆ రోజు ఎలా గడిస్తే సంవత్సరమంతా అలా గడుస్తుందనే నమ్మకం మనది.

శుభాకాంక్షలు తెలుపుకోటానికి ఇప్పుడైతే సెల్‌ఫోన్లు, ఎస్సెమ్మెస్లు ఉన్నాయి కానీ ఒకప్పుడైతే గ్రీటింగ్‌కార్డులు కొనటం తప్పని సరి. అదొక పెద్ద తతంగంలా జరిగేది. సైకిలేసుకొని స్నేహితులతో కలిసి గ్రీటింగ్‌కార్డ్స్ కోసం షాపులన్నీ తెగ తిరిగేవాళ్ళం.బాగా చిన్నతనంలొ అయితే సినిమా హీరోల ఫోటోలే గ్రీటింగ్‌కార్డ్స్‌గా ఇచ్చేవాన్ని. అవి అర్థరూపాయో ఎంతో ఉండేవి. వాటి వెనుక పేరు, శుభాకాంక్షలు వ్రాసి స్నేహితులకిచ్చేవాళ్ళం. సినిమాల పిచ్చి, హీరోల పిచ్చి విపరీతంగా ఉన్న ఫ్రెండ్స్‌కి అవి బోలెడంత సంతోషాన్ని కలిగించేవి. ఆ అసక్తి లేని ఇతర స్నేహితులకి మాములు గ్రీటింగ్‌కార్డ్స్ ఇచ్చేవాళ్ళం. స్పెషల్ ఫ్రెండ్స్‌ దగ్గర టాలెంట్  చూపించుకోటానికి పోస్ట్‌కార్డ్ టైపు వైట్ కార్డ్స్ పై దేవుళ్ళ బొమ్మలు అవీ పెయింటింగ్ వేసి ఇచ్చేవాన్ని. నాకు వచ్చిన గ్రీటింగ్‌కార్డ్స్, నేను ఇతరులకు పంపిన గ్రీటింగ్ కార్డ్స్ బేరీజు వేసుకునేవాన్ని. కష్టపడి పెయింటింగ్ వేశాక నా శ్రమను, దాని కోసం నేను వెచ్చించిన సమయాన్ని గుర్తించకుండా ఆ వైట్ కార్డ్ వెలను బట్టి తిరుగుటపా పంపించేవారిని చూస్తే నిరాశ కలిగేది. శుభాకాంక్షలు పంపినా ప్రతిస్పందించని ఫ్రెండ్స్‌కి నెక్స్ట్ టైం విషెస్ కట్ అన్నమాట.ఇంటెర్నెట్ యుగం వచ్చాక ఆన్లైన్ గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అలవాటయ్యింది.

ఆర్కుట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ఉద్ధృతికి అది కుడా తగ్గిపోయి సంక్షిప్త సందేశాలు పంపటం ఫ్యాషనైపోయింది. దేశం నలుమూలలా ఒకే టారిఫ్ వర్తించే ఈ రోజుల్లో ఎక్కడికైనా ఫోన్ చేసి అత్మీయంగా విషెస్ చెప్పే సౌలభ్యం కూడా ఉంది.

గతకాలము మిన్న వచ్చు కాలము కంటెన్ అని ఎవరన్నారో కానీ అది మన రాష్ట్రానికీ,దేశానికీ వర్తించదు. అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలమైపోతే, దిమ్మ తిరిగే స్కాములతో దేశం నివ్వెరపోయింది. కాబట్టి గత సంవత్సరం ఎవరికి ఎలా ఉన్నా ఈ సంవత్సరం మాత్రం అన్ని కష్టాలు తొలగిపోయి మంచే జరగాలని, శాంతి సుహృద్భావం వెల్లివిరియాలని మనసారా కోరుకుందాం. అవి రెండూ మనకిప్పుడు చాలా అవసరం.

ఒక చక్కటి తెలుగుపాటతో మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కొత్త సంవత్సరానికి సంబంధించిన పాటలు అనగానే నాకు గుర్తొచ్చే పాటలు రెండే రెండు.

  • మొదటిది మంచుపల్లకి  సినిమాలోంచి నీకోసమే మేమందరం పాట.
  • రెండోది వడ్డే నవీన్, అబ్బాస్, సిమ్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రియా ఓ ప్రియా కమ్మని కలలకు శ్రీకారం  సినిమాలోంచి   పాట.
రెండవ పాట పూర్తిగా హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్.దాన్ని వదిలేసి, వంశీ తోలిసారిగా దర్శకత్వం వహించిన  మంచుపల్లకీ  చిత్రం లోంచి చిరంజీవి అద్భుతంగా నటించిన ఈ క్రింది పాటను ఆస్వాదించండి. సంగీతం రాజన్‌నాగేంద్ర, సాహిత్యం గోపి
.



నందమూరి నామ సంవత్సరం -2010

ప్రతి సంవత్సరం దేశంలోకెల్లా అత్యథిక చిత్రాలు నిర్మించే పరిశ్రమగా తెలుగు సినీపరిశ్రమకు పేరుంది. అప్పుడప్పుడూ బాలీవుడ్ ఈ రికార్డుని తన్నుకుపోయినా అధికశాతం చిత్రాలు మన కంపౌండ్ నుండే విడుదలవుతూంటాయి. అయితే వాసి కంటే రాశి ఎక్కువన్న అపప్రథ మనకు చాలా కాలంగా ఉంది.దాన్నినిజం చేస్తూ ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోయిన సినిమాలలో చిన్న సినిమాలున్నాయి, కోట్ల రూపాయిల ఖర్చుతో ఏళ్ళ తరబడి షూటింగ్ జరుపుకున్న పెద్ద సినిమాలూ ఉన్నాయి. వందకు పైగా తెలుగు చిత్రాలు ఏటా రిలీజవుతూంటే ఘనవిజయాలు సాధించిన చిత్రాల శాతం కనీసం పదిశాతాన్ని దాటకపోవటం నిజంగా శోచనీయం .


ఈ ఏడాది విజయం సాధించిన తెలుగు చిత్రాలు ఇవీ (విడుదలైన క్రమంలో) 1. అదుర్స్ 2.బిందాస్ 3.లీడర్ 4.ఏ మాయ చేశావే 5. బెట్టింగ్‌ బంగార్రాజు 6.డార్లింగ్ 7.సింహ 8.మర్యాదరామన్న 9.రోబో 10. బృందావనం .


ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు ప్రతి ఒక్కరికీ లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక డైరెక్ట్ తెలుగు చిత్రం సింహ . 2004 లో విడుదలైన లక్ష్మీనరసింహ  తర్వాత ఆరేళ్ళ పాటూ సరైన సినిమా లేక వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ చిత్రం కొండంత ఉత్సాహాన్ని, ఉపశాంతిని కలిగించింది. ఎటువంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలైన ఈ చిత్రం మార్నింగ్‌షో నుంచే సూపర్‌హిట్ టాక్
తెచ్చుకొని బాక్సాఫీసు వద్ద  తిరుగులేని

 

 ఆధిపత్యాన్నిప్రదర్శించింది. అర్థశతదినోత్సవాలకే మొహం వాచిపోయిన తెలుగు సినీపరిశ్రమలో తొంభైకి పైగా కేంద్రల్లో శతదినోత్సవాన్ని, 3 కేంద్రాల్లో రజతోత్సవాన్ని, ఒక కేంద్రంలో 200 రోజుల పండుగను జరుపుకొని సంచలనం సృష్టించి Biggest hit of the year గా నిలిచింది.ఈ విజయం నందమూరి అభిమానులకి కొత్త ఊపిరిలూదింది.ఇమేజ్‌కి తగ్గ కథ, సామర్థ్యం ఉన్న దర్శకుడు దొరికితే తన చిత్రాలు సైతం యువహీరోలకు ముచ్చెమటలు పట్టిస్తాయని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించారు. డాక్టర్ నరసింహగా రౌద్రరస పోషణలో పరిణితి చెందిన నటన కనబరిచారు.అసందర్భోచితమైన డైలాగులు పేజీలకు పేజీలు వల్లించకుండా సింపుల్‌గా షార్ట్‌గా ఉన్న సంభాషణలను తనదైన శైలిలో చెప్పి మెప్పించారు. బోయపాటి శ్రీను ప్రతిభ గురుంచి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వై.వి.యస్ చౌదరిలా ఉత్తరకుమార ప్రజ్ఞలు చెయ్యకుండా సినిమా మీద దృష్టి పెట్టి బాలయ్య సినిమాల్లో దొర్లే పొరపాట్లు దొర్లకుండా చూసుకున్నారు.కథ ఎప్పుడో తొంభయ్యో దశకాల్లోని పాత చింతకాయ పచ్చడే అయినా దానికి వయొలెన్సు మసాలాను బాగా దట్టించి పకడ్బందీగా రూపొందించారు. డాక్టర్ నరసింహ గెటప్‌లోని బాలయ్య ఫోటోలు మెల్లమెల్లగా విడుదల చేస్తూ అభిమానుల్లో ఆశలు పెంచి, చక్కటి ట్రైలర్‌తో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళారు. పెద్దనిర్మాత నిర్మించకపోయినా, హ్యాపెనింగ్ ‌మ్యూజిక్ డైరెక్టర్ బాణీలు సమకూర్చకపోయినా, విదేశాల్లో పాటలు లేకపోయినా, నెంబర్‌వన్ డైరెక్టర్ దర్శకత్వం వహించకపోయినా ఈ చిత్రం విశేష ప్రజాదరణ పొందింది.

వెంకటేష్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన నమో వెంకటేశ  యావరేజ్‌గా మిగిలిపోతే, అందరిలో ఉత్సుకత రేపిన చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి , ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకొంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేర్పులు చెయ్యకుండా యాధాతథంగా సినిమా తియ్యడమొక కారణమైతే, అయిదుగురు హీరోయిన్లను పెట్టి కూడా వారికి తగ్గ పాత్రలు ఇవ్వకపోవడం ఇంకొక కారణం. జ్యోతిక అభినయం ముందు రిచా గంగోపాధ్యాయ, అనుష్క తేలిపోయారు. కన్నడ రీమేకులు తెలుగులో వర్కవుట్ కావని వాన (ముంగారు మళె), యోగి (జోగి), తాజ్ మహల్ (తాజ్ మహల్) లాంటి చిత్రాలు నిరూపించాయి.ఈ చిత్రం ఆ సెంటిమెంటును మరింత బలపరిచింది.

నాగార్జునవి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. కేడి  డిజాస్టర్ అయ్యింది. ఆనవాయితీ ప్రకారం క్రిస్‌మస్‌కు రిలీజైన రగడ  మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రం మాస్ ‌లా సూపర్‌హిట్ అవుతుందో లేక డాన్, కింగ్‌ ల సరసన చేరుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


యువ హీరోలలో ఏ ఏడాది విజయాన్ని అందుకున్నవాళ్ళు జూనియర్ ఎన్‌టియార్, ప్రభాస్, మనోజ్, నాగచైతన్య, రాణా, అల్లరి నరేష్.


అదుర్స్
‌తో శుభప్రదంగా సంక్రాంతికి స్వాగతం పలికి నవ్వులలో ముంచెత్తిన ఎన్‌టియార్ అదే ఊపును బృందావనం తో కొనసాగించారు. తన ఇమేజ్‌కి భిన్నంగా తొలిసారి ప్రేమికుడిగా నటించారు. పాత కొత్త చిత్రాల కలబోత అయిన ఈ
చిత్రంలో అటు
  కుటుంబబాంధవ్యాలకు పెద్ద పీట వేస్తూనే, ఇటు ఎన్‌టియార్ శైలికి తగ్గ ఫైట్లు, పాటలు ఉంచి కమర్షియల్‌గా సక్సెస్ అయ్యేలా జాగ్రత్తపడ్డారు దర్శకులు వంశీ పైడిపల్లి. ఏన్నాళ్ళుగానో ఊరిస్తున్న విజయాన్ని ఈ చిత్రంతో మళ్ళీ అందుకున్నారు దిల్‌రాజు.


జోష్  తర్వాత, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావే చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. చాలాకాలం తర్వాత, కలకాలం గుర్తుండిపోయే సంగీతాన్ని అందించి కుర్రకారుని ఒక ఊపుని ఊపారు ఏ.ఆర్.రెహమాన్. సంక్లిష్ట భావాలున్న అమ్మాయిగా తన మొదటి సినిమాలోనే సమంత
అద్భుతంగా

 నటిస్తే, ఆ అమ్మయి ప్రేమ కోసం అర్రులు చాచే కుర్రాడుగా నాగచైతన్య తన పరిధిలో మెరుగ్గా చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు జెస్సి , కార్తీక్ అనే రెండు పాత్రలే కనిపిస్తాయి కాని సమంత, నాగచైతన్యలు కనబడరు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న అటువంటి పాత్రలు సృష్టించి, ఎటువంటి అశ్లీలత, వెకిలి వేషాలు లేకుండా ఒక ప్రేమకథని ఎంత రొమాంటిక్‌గా ప్రెజంట్ చెయ్యవచ్చో అంతే అందంగా చిత్రీకరించి కే.బాలచందర్ వంటి సినీపండితుల ప్రశంసలు అందుకున్నారు గౌతమ్ మీనన్.


కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అల్లరి నరేష్‌, ఉషాకిరణ్ మూవీస్‌తో జతకట్టి బెట్టింగ్‌ బంగార్రాజు  రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు.ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకొంది. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభప్రదం  ఫెయిల్యూర్‌గా మిగిలిపోతే ఈ.వీ.వీ. దర్శకత్వంలో వచ్చిన కత్తి కాంతారావు  ఫర్వాలేదనిపించుకొంది.


ఛత్రపతి  తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ లేక డీలాపడ్డ ప్రభాస్‌కు డార్లింగ్  రూపంలో కాస్త ఓదార్పు లభించింది.

అలాగే బిందాస్  చిత్రం ద్వారా మంచు మనోజ్‌ మొదటిసారి సక్సెస్ చవిచూశారు .


రామానాయుడు కుటుంబం నుండి వచ్చిన రాణా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. వాచకంలో బాబాయి వెంకటేష్‌ని గుర్తుచేసే ఆయనకు ఈ చిత్రం సంతృప్తికరమైన ఫలితాన్నే ఇచ్చింది.


రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలకు భిన్నంగా రాజమౌళి రూపొందించిన మర్యాదరామన్న ప్రేక్షకుల మన్ననలు పొంది సునీల్‌ని బిజీ హీరోని చేసింది.ఒక ఊరిలో   సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై విజయాలు దక్కక తెరమరుగైపోయిన సలోనికి ఈ చిత్రం టర్నింగ్‌పాయింటే.

 
ఇమేజ్‌కి తగ్గ కథ కోసం మూడేళ్ళ విరామమిచ్చి ఖలేజా తో వీక్షకులను పలుకరించిన మహేష్‌బాబుకి చేదు అనుభవమే మిగిలింది. ఖలేజా   అనగానే ఒక పక్కా మాస్ చిత్రాన్ని ఆశించి థియేటర్లకొచ్చిన ఆభిమానులను పొంతన లేని కథ ఖంగు తినిపించింది. కథ కంటే కామెడీకే ప్రాధాన్యతనిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అనవసరమైన సన్నివేశాలతో సినిమా మొత్తం నింపేసి అభిమానులను నీరుగార్చేశారు. మహేష్ అనుష్కల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నా అవి చిత్రాన్ని రక్షించలేకపోయాయి.


మెగాఫ్యామిలీకి ఈ సంవత్సరం నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన అల్లు అర్జున్ వరుడు, పవన్‌కళ్యాణ్ కొమరం పులి, రామ్‌చరణ్‌ ఆరెంజ్ బాక్సాఫీసు దగ్గర ఘోర పరాజయాల్ని మూటకట్టుకున్నాయి. వరుడు లో గుణశేఖర్‌కు సెట్స్ మీదున్న మమకారం, కొమరం పులి లో ఎస్.జే.సూర్య పైత్యం ప్రస్ఫుటంగా కనిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ముఖ్యంగా కొమరం పులి లో యాక్షన్ సన్నివేశాలు హాస్యాస్పదం కావడం అభిమానులకి మింగుడుపడని విషయం.అయితే అల్లు అర్జున్, మనోజ్, అనుష్కల కాంబినేషన్‌లో వచ్చిన వేదం ఒక మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. గమ్యం తో అకట్టుకొన్న దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఐదు విభిన్నమైన పాత్రల చుట్టూ కథనల్లుకొని , చివర్లో వాటిని కలుపుతూ మానవతే జీవన వేదం అని చాటిచెప్పారు.
అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. మల్టిస్టారర్ చిత్రమే అయినా మార్కులు మొత్తం కేబుల్ కుర్రాడుగా నటించిన అల్లు అర్జున్ ఒక్కరే కొట్టేశారు. మగధీర తో ఘనవిజయం సాధించిన రామ్‌చరణ్ ఆరెంజ్  చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడిలో స్పష్టత లేకపోవటం వల్ల ఆరెంజ్ కొంతమందికే పరిమతమయ్యింది. హద్దులు దాటిన నిర్మాణవ్యయం, ప్రచార మాధ్యమాల్లో నాగబాబు వెళ్ళకక్కిన అర్థంలేని ఆవేదన (రుద్రవీణ నుంచి నిర్మాణరంగంలో ఉంటూ ,ఒక సాదాసీదా ప్రేమకథ కోసం ఆస్ట్రేలియా వెళ్ళి మగధీర కంటే ఒక పదిశాతం మాత్రమే తక్కువగా ఖర్చుబెట్టి, ఫెయిలయ్యాక దర్శకుడి మీదో హీరోయిన్ మీదో పడి ఏడవటం నాగబాబు తప్పు) ఈ సినిమాకి ప్రతికూలంగా పరిణమించాయి. నటనలో రామ్‌చరణ్ చూపించిన వైవిధ్యమొక్కటే అభిమానులకి ఊరటనిచ్చే అంశం.


సిద్దార్ధ్ బావ, గోపిచంద్ గోలీమార్ , జగపతిబాబు గాయం-2 పాసు మార్కులు తెచ్చుకోలేకపోయాయి.రవితేజ నటించిన శంభో శివ శంభో ,డాన్ శీను  చిత్రాలు మొదట్లో కాస్త సందడి చేసినా తర్వాత సద్దుమణిగాయి.వరుస ఫ్లాపులతో వరుణ్‌సందేశ్ తడిసిముద్దయ్యారు. మరో చరిత్ర  అతని సినీచరిత్రకే మాయని మచ్చగా మిగిలిపోయింది.


దేవ్ కట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం , చంద్ర సిద్ధార్థ అందరి బంధువయా, నరసింహ నంది 1940లో ఒక గ్రామం, క్రిష్ వేదం, తాతినేని సత్య భీమిలి కబడ్డీ జట్టు వైవిధ్యమున్న చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రస్థానం సాయికుమార్‌
నట వైదుష్యాన్ని ఆవిష్కరిస్తే,
 అందరి బంధువయా  చంద్ర సిద్దార్థ ఉత్తమాభిరుచుకి అద్దంపట్టింది. రెండు చిత్రాలలోనూ కథానాయకుడు శర్వానందే కావడం అతను ఎంచుకున్న మార్గాన్ని స్పష్టం చేస్తోంది. ఇది అభినందనీయమే అయినా వాచకాభినయాలలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం  మూడు నంది అవార్డులు, ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నేషనల్ అవార్డు గెల్చుకొని పతాక శీర్షికలకెక్కింది. అప్పటికి గాని లాబ్‌ల నుంచి ఈ చిత్రానికి మోక్షం లభించలేదు. రిలీజైన తర్వాత కూడా ఈ చిత్రాన్ని పట్టించుకొన్న నాథుడే లేడు.ఎంచుకున్న కథాంశం చాలా పాతది కావటం ప్రధాన కారణం. బలహీనమైన కథానాయిక, సాగతీత కారణంగా అందరి బంధువయా ఫెయిలయితే, ఇమేజ్‌లేని కథానాయకుడి కారణంగా ప్రస్థానం చతికిలబడింది.స్లో నెరేషన్ , ట్రాజెడి క్లైమాక్స్ భీమిలి కబడ్డీ జట్టు పాలిట ఆశనిపాతాలయ్యాయి.

అనువాద చిత్రాల విషయానికి వస్తే శంకర్-రజనీకాంత్-ఐశ్వర్యారాయ్-ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన రోబో బాక్సాఫీసు రికార్డ్లను తిరగరాసింది. విడుదలైన మొదటి మూడువారాలపాటూ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి లేదు. పిల్లా పెద్దా తేడా లేకుండా జనం విరగబడ్డారు.రోబో గా రజనీకాంత్ నటన, ఐశ్వర్యారాయ్ అందచందాలు, అత్యున్నత సాంకేతిక విలువలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి..ఆరుపదుల
వయసులో, కుర్రహీరోలతో పోటీపడుతూ
 దేశమంతా విస్తుబోయే విజయాలు సాధించటం ఒక్క రజనీకే చెల్లింది.రోబో స్థాయిలో కాకపోయినా వేసవిలో వచ్చిన సూర్య యముడు కూడా ఓ మోస్తరు ప్రేక్షకాదరణకు నోచుకుంది .అదే సమయంలో విడుదలైన మణిరత్నం విలన్ అట్టర్‌ఫ్లాపైంది.


ఆరంభం నుంచి పలు వివాదాలకు కేంద్రబిందువవుతూ ఉత్కంఠను రేకెత్తించిన రాంగోపాల్‌వర్మ రక్తచరిత-1,2 చిత్రాలు మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా కలెక్షన్లు రాబట్టుకోవడంలో విఫలమయ్యాయి.అమ్ముకొని నిర్మాతలు లాభపడ్డారేమో కాని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భంగపడ్డారు.శివ లా చరిత్ర సృష్టిస్తాయనుకున్న సినిమాలు వారం రోజులు హడావుడి చేసి నిశ్శబ్దంగా వైదొలగిపోవటం చూసి ' ఒక రాజమౌళో, వి.వి.వినాయకో ఈ కథను తెరకెక్కించి ఉంటే కలెక్షన్ల సునామీ వచ్చేద ' ని యాక్షన్ చిత్రాల అభిమానులు కొందరు వాపోయారు .


ఏతావాతా కథను నమ్ముకోకుండా కాంబినేషన్లను నమ్ముకున్న శింగనమల రమేష్ లాంటి నిర్మాతలు కోలుకోలేని దెబ్బలు తింటే, పక్కా స్క్రీన్‌ప్లేతో ముందుకెళ్ళిన పరుచూరి కిరీటి లాంటి చిన్ననిర్మాతలు జాక్‌పాట్ కొట్టారు.కళ్యాణ్‌రామ్ కత్తి ని మినహాయిస్తే సంక్రాంతి నుంచి క్రిస్‌మస్ వరకు నందమూరి హీరోల హవా కొనసాగింది.తారకరత్నకు ఉత్తమ ప్రతినాయకుడిగా (అమరావతి ) నంది అవార్డు ప్రకటింపబడింది కూడా ఈ సంవత్సరమే.ఇలా ఏ రకంగా చూసినా ఇది నందమూరి నామ సంవత్సరం అని చెప్పక తప్పదు.


5 comments

Post a Comment

దెయ్యాలు భూతాల కబుర్లు


మధ్య నాగవల్లి గురుంచి వింటూంటే దెయ్యాలు భూతాల మీదా ఒక టపా వ్రాద్దామనిపించింది

దెయ్యాలు భూతాలు అనగానే నాకు నా చిన్నప్పటి ' ఓ స్త్రీ రేపు రా ' కథ టక్కున గుర్తొస్తుంది. 1988-89 ప్రాంతంలో అనుకుంటాను, ఒక పెద్ద పుకారు జనాల్ని చాలా భయపెట్టింది. ఒక స్త్రీమూర్తి ప్రేతమైపోయి రాత్రివేళల్లో సంచరిస్తూ నానా భీభత్సం సృష్టిస్తోందని , ఆవిడ బారిన పడకుండా ఉండాలంటే ఇంటి తలుపుల మీదో, గోడల మీదో 'ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాయడమొక్కటే మార్గమని ఒక ప్రచారం బయలుదేరింది. అందరూ తలుపులు బిడాయించుకుని, ముసుగులు తన్నేశాక, రాత్రిపూట తీరిగ్గా వచ్చిన ఆడదెయ్యం అది చదువుకొని తనను చూసి భయపడుతున్నారన్న గర్వంతోనో, లేక ఆ ఇంటి వాళ్ళ మీద జాలితోనో, ఆ పూటకి వాళ్ళనేమీ చెయ్యకుండా విడిచిపెట్టేసి,మరుసటి రోజు వస్తుంది.ఇలా రోజూ వచ్చి, చదివిన వాక్యాలే మళ్ళీ మళ్ళీ చదువుకొని ఈ 'రేపు' అన్నది ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలుసుకోలేక తికమకపడి ఆఖరికి విసుగొచ్చి వెళ్ళిపోతుందన్నమాట.ఈ పుకారు ఎవరు ఎలా మొదలుపెట్టారో కానీ చాలా తొందరగా పాపులరైపోయింది.అదిగో పులి అంటే ఇదిగో తోక అని హడావుడిపడిపోయే బాపతు జనం మా కాలనీలో కూడా ఉన్నారు.వాళ్ళు ఈ దెయ్యానికి జడుసుకొని ముందు జాగ్రత్తచర్యగా గోడల మీద,తలుపుల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ' ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాసి పడేసారు. మా నాన్నగారు ఇలాంటివన్నీ నమ్మరు కాబట్టి, పైగా మేం అద్దె ఇంట్లో ఉండే వాళ్ళం కాబట్టి మా ఇంటి గోడలు, తలుపులు ఖరాబు కాలేదు.నాలుగైదు రోజులు గడిచి ఎవరికీ ఏమీ జరక్కపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకుని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు.బహుశా ' రేపు రా ' అనగానే బుద్ధిగా తలూపి మరుసటి రోజు వచ్చే ఆడదెయ్యానికి, తుచ్ఛ మానవులు తనను వేళాకోళం చేస్తున్నారని ఆ మాత్రం పసిగట్టలేని తెలివిలేని దెయ్యానికి మనం భయపడటమేమిటని గ్రహించి కాబోలు.

నాకు ఊహ తెలిసాక నేను థియేటర్లో చూసిన మొట్టమొదటి దెయ్యం సినిమా  శ్రీదేవీ కామాక్షీ కటాక్షం . మా ఊళ్ళో ఐ.యస్.మహల్ అని ఒక థియేటర్ ఉంది. అందులో ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలో, హిందీ సినిమాలో వేస్తూంటారు. ఏ అమవాస్యకో, పౌర్ణమికో అందరూ తిరస్కరించిన తెలుగు సినిమానో, లేక వందరోజుల కోసం లాగబడే తెలుగు సినిమానో ఆడించినా మిగతా రోజులన్నీ ఇంగ్లీషు,హిందీ చిత్రాలనే ప్రదర్శించేవాళ్ళు. అటువంటిది హఠాత్తుగా ఆ థియేటర్ ఓనర్‌కి ఏమయ్యిందో కానీ విఠలాచార్య దర్శకత్వంలో కే.ఆర్.విజయ ప్రధానపాత్రధారిణిగా ఒక భక్తిరసచిత్రం తీసి జనం మీదకి వదిలేశాడు.పల్లెటూరు నుంచి వచ్చిన మా తాత ఊరికే ఉండకుండా,ఏడవ తరగతి చదువుతున్న నన్ను కూడా ఆ సినిమాకు లాక్కెళ్ళాడు.ముసలాళ్ళ ద్వారా కూడా ఉపద్రవాలు వచ్చిపడతాయని నాకప్పుడే చూచాయగా తెలిసింది.

ఆ సినిమాలో ప్రతి రాత్రీ పన్నెండయ్యేసరికి దెయ్యం ఆవహించి భర్తపై విరుచుకపడే భార్యగా ముచ్చెర్ల అరుణ నటించింది.తెరపై గోడ గడియారం పన్నెండు కొట్టగానే,ముచ్చెర్ల అరుణ ఇంతింత కళ్ళేసుకుకొని,జుట్టు విరబోసుకొని నాలుక బయటపెట్టి వికృతంగా అరుస్తూ మొగుడు మీదకు ఎగిరి దూకుతూంటే థియేటర్లో కుర్చీలో కూర్చున్న నాకు పై ప్రాణాలు పోయినట్లే అనిపించింది.ఫస్ట్‌షో నుంచి ఇంటికొచ్చాక మా తాతను బాగా తిట్టుకొని సైలెంట్‌గా భోజనం చేసేసుకొని గట్టిగా ముసుగుతన్ని పడుకున్నాను.రాత్రి పన్నేండయ్యేసరికి మా ఇంట్లో గోడగడియారం ఠంగ్ ఠంగ్ మంటూ చప్పుడు చేస్తూంటే భయంతో బిక్కచచ్చిపోయేవాన్ని.టాయిలెట్ కోసం కూడా లేచేవాన్ని కాదు.అప్పట్లోనే చందూసోంబాబు నవల  ది మాన్‌స్టర్  చదివాను.అందులో హీరోయిన్ స్నానం చేస్తూంటే షవర్లోంచి రక్తం కారటం లాంటి సన్నివేశాలున్నాయి.నేను కూడా స్నానం చేస్తూ షవర్ వైపు చూసేవాన్ని.అయితే అదే వయసులో ఈవిల్‌డెడ్ లాంటి సినిమాను నింపాదిగా చూడగలిగాను. నేటివిటి ప్రాబ్లెం వల్ల ఆ సినిమా నన్నంత భయపెట్టలేకపోయింది.

పెరిగి పెద్దయ్యాక  దెయ్యాలు భూతాలంటూ అంతగా భయపడిన సన్నివేశాలు లేవు. రాత్రి, అమ్మోరు , 13బి, అరుంధతి, మంత్ర, చంద్రముఖి  లాంటి సినిమాలలో అక్కడక్కడ వళ్ళు జలదరించినా, తులసీదళం, అష్టావక్ర  లాంటి నవలలు చదివినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నా ఆ అనుభూతి ఎక్కువకాలం వెన్నంటలేదు.నాగవల్లి తోనైనా వెంకీ ఆ పని చేస్తాడేమో చూడాలి.


2 comments

Post a Comment

బలివాడ కాంతారావు - 'దగాపడిన తమ్ముడు '



మంచి పుస్తకాల కోసం తెలుపు.కాం వెదుకుతూండగా మొదటిసారి  ఈ పుస్తకం గురుంచి చదవటం జరిగింది. అప్పటికి బలివాడ కాంతారావుగారెవరో, ఆయనేమేం పుస్తకాలు వ్రాశారో నాకు తెలియదు. టైటిల్ ఆకర్షణీయంగా ఉండటంతో ఆర్డర్ చేశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ పుస్తకం ఒక గొప్ప రచయితని, చిరకాలం మనస్సుపొరల్లో నిక్షిప్తమైపోయే  ఒక చక్కటి కథను పరిచయం చేసింది.దగాపడిన తమ్ముడు ఒక ఆర్ద్రపూరిత విషాదాంత నవల. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆంధ్రదేశంలో రైతులు ఎదుర్కొంటున్న కడగండ్ల  నేపథ్యంలో కథ సాగుతుంది. చెప్పుకోవడానికి ఆనాటిదే అయినా  ఇందులోని కొన్ని సన్నివేశాలు ఈనాటీకీ వర్తిస్తాయి. మన కళ్ళ ముందే మెదులుతూ మనస్సుని వికలం చేస్తాయి. ఇందులో పాత్రలు కనబడవు, మట్టిని నమ్ముకున్న అమాయకమైన  మనుషులే కనిపిస్తారు. జీవం ఉట్టిపడుతున్న రక్తమాంసాలతో వాళ్ళు ఆహ్వానిస్తే, పాఠకుడు వాళ్ళతో కలిసిపోయి వారి సాధక బాధలు పంచుకుంటూ వాళ్ళు నవ్వితే తనూ నవ్వుతాడు, రగిలిపోతే తనూ పిడికిళ్ళు బిగిస్తాడు, గుండెలు బాదుకుంటే తనూ మౌనంగా ఆ శోకాన్ని అనుభవిస్తాడు.

కథ

ఆంధ్రదేశంలో ఉత్తరాన వంశధార నదీతీరాన గల నవిరి అనే కుగ్రామంలో దాసుడికి గ్రామదేవత పూని ఊళ్ళో ఉత్సవాలు చెయ్యాలని శివాలెత్తటంతో కథ ప్రారంభమవుతుంది. గౌరిపున్నమికి ఉత్సవాలు చేస్తారు ప్రజలందరూ.  అక్కడ డప్పువాద్యాలకు ఉత్సాహంగా పాదాలు కదుపుతూ పరిచయమవుతాడు కథానాయకుడు పుల్లయ్య.  పుల్లయ్య సాముగరడిలో ఘటికుడు. ఉక్కులాంటి శరీరం, నల్లటి శరీరంపై నిగనిగలాడే కండలు, గిరజాల జుత్తు, మెలితిరిగిన మీసాలతో పోతపోసిన విగ్రహంలా ఉంటాడు. అతనికున్న ఆస్తల్లా అతని తండ్రి గడించిన యాభై సెంట్ల భూమి మాత్రమే. అది కాకుండా పట్నం దొరకున్న రెండకరాల పొలం కూడా కౌలుకు దున్నుతూ ఏ చీకూ చింతా లేకుండా కులాసాగా బ్రతికేస్తూంటాడు. నవిరి గ్రామంలోనే కాక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అంతటి అందగాడు, డప్పు శబ్దానికి లయబద్ధంగా నృత్యం చేసేవాడు లేడని ప్రతీతి.

‘నా’ అనే వాళ్ళు లేని పుల్లయ్య, పేదింటి పిల్లైన నీలిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె చేతికి ఎముక ఉండదు. అపకారికి ఉపకారం చేసే రకం.చిన్నప్పుడు చెడు సావాసాలు  చేసి  ప్రస్తుతం గుడ్డివాడైన ముసలి వెంకన్నకే కాకుండా, తన ఇంటి గడప తొక్కిన లేనివాళ్ళందరికీ కలోగంజో పోసి కడుపు నింపి పంపుతూంటుంది . ఆమె కడుపు పండి కొడుకు పుడతాడు. ’అయ్యే పుట్టాడ ‘ని సంబరపడిపోయిన పుల్లయ్య అ పిల్లవాడికి తన అయ్య పేరే పెడతాడు ‘మల్లునాయుడ ‘ని.  వాడితోనే అతని లోకం.  వాడు పెరిగి పెద్దయ్యి తనలాగే డప్పు వాద్యాలకు అద్భుతంగా చిందులెయ్యాలని, న్యాయం ధర్మం నిలిపే మారాజు కావాలని, అయ్య పేరు, తన పేరు నిలబెట్టాలని కలలు కంటూ సంతోషపడిపోతూంటాడు.

కాలం గడుస్తుంది. ఎప్పటిలాగా పంటలు పండటం లేదు.  అయినా కౌలు ధాన్యం కొలిచి ఇవ్వాల్సిందే కాబట్టి మిగిలిన దాంతోనే సరిపెట్టుకుంటారు పుల్లయ్య,నీలి.  రేషన్ కోసం గవర్నమెంటు ధాన్యం సేకరణ ప్రారంభిస్తుంది.  ధరలు మండిపోతాయి.  ఊళ్ళో పెద్దలు,  పేదల కోసం పైసా విదిలించకపోయినా  కోపరేటివ్ స్టోర్సు సరుకుల్ని రాత్రికి రాత్రే  పట్నం తరలించి రెట్టింపు ధరలకు అమ్ముకుంటూంటారు.  ఆ పెద్దమనుషుల్లో రాజిగాడు ఒకడు.  ఈ అన్యాయం గురుంచి ప్రశ్నించిన గ్రామదేవత దాసుణ్ణి, రాజిగాడు కొట్టబోతే పుల్లయ్య అడ్డుకొని అవతలకి విసిరేస్తాడు . రాజిగాడు అదను చూసి రేషన్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్లని వెంటబెట్టుకొని వస్తాడు.  తనకు మిగిలింది తనకే సరిపోదు. అలాంటప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు కాని ధరలకి ధాన్యం ఎలా ఇవ్వాలని ఎదురు తిరుగుతాడు పుల్లయ్య. పోలీసులు కల్పించుకుంటే పుల్లయ్య తన బాణకర్రతో వాళ్ళ వొళ్ళు హూనం చేస్తాడు. అంతలోనే ‘ కండ లేని వాళ్ళను కొట్టానే ‘ అని బాధపడిపోతే పోలీసులు అతనికి సంకెళ్ళు తగిలిస్తారు. అతన్ని బెయిలు మీద విడిపించటానికి, వకీలు ఖర్చులకు, కోర్టు విధించిన 100 రూపాయిల జరిమానా చెల్లించటానికి రాజిగాడి పెళ్ళాం దగ్గర పుల్లయ్య పొలం తాకట్టు పెడుతుంది నీలి.

ఊళ్ళో పరిస్థితులు దిగజారిపోతాయి. చిన్నా చితకా రైతుల పరిస్థితి అధ్వానమైపోతుంది. దొంగతనాలు పెరిగిపోతాయి. ఒకప్పుడు బాగా బ్రతికిన పీస లాంటి వాళ్ళు ఊళ్ళో దొంగతనాలకు తెగబడతారు. పోషించే దిక్కులేక  దాసుడు మరణిస్తాడు. దైన్యం కమ్ముకొంటూంటే  జరుగుబాటు కోసం ధాన్యం వర్తకం ప్రారంభిస్తాడు పుల్లయ్య. అతనికి  ఇష్టం లేకపోయినా నీలి కూడా కూలికి  వెళ్ళటం  ప్రారంభిస్తుంది . తన కొడుకు పెరుగుతూంటే రోజులిలా తయారయ్యాయేమిటని విసుక్కుంటాడు పుల్లయ్య. పిల్లవాడైన మల్లు క్షణం కూడా తండ్రిని వదలకుండా తిరుగుతూ అజమాయిషీ చేస్తూంటాడు. నీలి ఈ మారు ఆడపిల్లకు జన్మనిస్తుంది.  పుల్లయ్య కౌలుకి సాగు చేసుకుంటున్న భూమిని, పట్నం దొర రాజిగాడికి అమ్మేస్తాడు. పుల్లయ్య బ్రతిమాలుకున్నా లాభం లేకపోతుంది. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటూ వస్తున్న భూమి పరులపాలైపోతూంటే మూడేళ్ళ మల్లుని కావలించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు పుల్లయ్య. యవ్వనంలో తన చెడు తిరుగుళ్ళకు ఫలితంగా పుట్టిన రాజిగాడు, పుల్లయ్యకు అన్యాయం చేశాడని తెలిసి కోపంతో అతన్ని శిక్షించటానికి వెళ్ళి అందరికీ దొరికిపోతాడు గుడ్డివెంకన్న.పుల్లయ్యే అతన్నీ పనికి పురమాయించాడని ఊరంతా అనుమానిస్తుంది. నీలి నచ్చజెబితే పుల్లయ్య గుండె దిటవు చేసుకొని కూలికి వెళ్తాడు. కట్టెల వ్యాపారం చేస్తాడు. ఏదీ కలసిరాదు. తాకట్టు పెట్టడానికి ఏమీ లేకపోవటంతో ఊళ్ళో అప్పు పుట్టదు. ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మనసొప్పక పట్నం వెళ్ళి బాగుపడదామని నిశ్చయించుకుంటాడు. భార్య పిల్లలతో కలిసి వాల్తేరు వెళ్తాడు.

వాల్తేరులో  మురుగుకాల్వ పక్కన ఒక పాక అద్దెకు తీసుకొని కాపురముంటారు నీలి, పుల్లయ్య. పొట్టకూటి కోసం పుల్లయ్య నానా అగచాట్లు పడతాడు. మార్కెట్లో కూలిపనికి వెళ్తాడు. చదువు రాకపోయినా ఉద్యోగం ఇప్పిస్తారేమోనన్న ఆశతో ఎంప్లాయిమెంటు ఎక్స్‌ఛేంజ్ ఆఫీసరు కాళ్ళు పట్టుకుంటాడు. కడుపు నిండా తిండి పెట్టి నాలుగు డబ్బులిప్పిస్తారంటే ఎన్నికల ప్రచారానికి వెళ్తాడు. ఎన్ని చేసినా నలుగురు మనుషుల నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళటం అంతంతమాత్రంగానే ఉంటుంది. దాంతో అభిమానం చంపుకొని పిల్లల ఆకలి తీర్చటంకోసం  దొంగగా మారతాడు. ఆ డబ్బుతో కొన్నాళ్ళు కుటుంబానికే  లోటు లేకుండా చూసుకుంటాడు. పేకాట, బ్రాకెట్టు మరిగి డబ్బులు నాశనం చేసుకుంటాడు. ఎలాగైనా పెద్దమొత్తం దొంగతనం చేసి మళ్ళీ తన స్వగ్రామం వెళ్ళి పాత పుల్లయ్యలా దర్జాగా బ్రతకాలని అనుకుంటాడు.  ప్రయత్నం వికటించి, కొడుకు మల్లునాయుడు కారణంగా పోలీసులకు పట్టుబడిపోతాడు. నిజం తెలిసి నీలి కొయ్యబారిపోయినా ధర్మానికి కట్టుబడి కోర్టులో నిజమే చెబుతుంది. బరువెక్కిన హృదయంతో పుల్లయ్య కూడా  నేరం అంగీకరిస్తాడు. మూడు-నాలుగేళ్ళు ఖైదు తప్పదని ఇన్‌స్పెక్టర్ చెబుతాడు. పిల్లలిద్దరితో కలిసి నిండు చూలాలైన నీలి రోడ్డున పడటంతో కథ సమాప్తమవుతుంది.

బలివాడ కాంతారావు గారి రచనా శైలి ఆకట్టుకుంటుంది. ఆణిముత్యాల్లాంటి అచ్చమైన తెలుగు సామెతలను విరివిగా వాడుకొని, వాస్తవికతకు దగ్గరగా రకరకాల  మనస్తత్వాలని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.చినుకు రాలినప్పుడు చిగురించే మట్టివాసన లాంటి పరిమళం, సంభాషణల్లో గుభాళిస్తుంది . చిన్నప్పుడు దొంగతనాలు చేశాడని గుడ్డి వెంకన్నను ఈసడించుకున్న పుల్లయ్య, కొడుకు ఆకలి తీర్చటం కోసం ఒక బిచ్చగత్తె దగ్గర తనూ అదే పని చెయ్యాల్సి వచ్చినప్పుడు పడే అంతర్మథనాన్ని, దొంగలించిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి అతను పొందే ఆనందాన్ని చక్కగా వర్ణిస్తారు రచయిత. అలాగే పుల్లయ్య అతని కొడుకు మల్లునాయుడుల మధ్య ఉన్న బంధాన్ని కూడా హృద్యంగా మలచారు. చెడులో కూడా మంచిని చూడమని చెప్పే నీలి, ఆమె ముసలితల్లి  మూర్తీభవించిన మానవత్వానికి  ప్రతీకలుగా నిలిచిపోతే, విలువలకు కట్టుబడి, మారుతున్న కాలంతో రాజీపడలేక నిత్యం అంతః సంఘర్షణకు  లోనయ్యి తుదకి పతనమైపోయే సగటు మానవుడిగా పుల్లయ్య మిగిలిపోతాడు.’ నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ పీడిత వర్గపు ప్రతినిధుల గుండెచప్పుళ్ళే ఇందులో ప్రతిఫలిస్తాయి. ప్రతి పాఠకుడి పర్సనల్ గ్రంథాలయంలో పదిలంగా ఉండాల్సిన పుస్తకం ఇది.  ప్రజాదరణ పొందిన ఈ నవలని నేషనల్ బుక్ ట్రస్టు వారు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు.

ప్రతులకి విశాలాంధ్ర  బూక్‌హవుస్‌ని సంప్రదించండి.
వెల :75 రూపాయిలు.

(తొలి ప్రచురణ  పుస్తకం.నెట్ లో )

తాచెడ్డ కోతి


నం బావుండాలి పక్కనోడూ బావుండాలి అనుకోవడం ఒక పద్దతి. మనమే బావుండాలి, పక్కనోడు నాశనమైపోయినా ఫర్వాలేదనుకోవడం ఇంకో పద్దతి. మొదటిది ఉదార స్వభావమయితే, రెండోది ఉన్మాద స్వభావం. ఉన్మాద ప్రవృత్తి ఉన్న వ్యక్తులకి చికిత్స అవసరం. వాళ్ళు ఉంటే ఇంటి నాలుగుగోడల మధ్య ఉండాలి లేద మానసిక వైద్యుల పర్యవేక్షణలోనన్నా ఉండాలి. అలా కాకుండా జనంలో స్వేచ్చగా తిరగనిస్తే తాచెడ్డకోతి వనమంతా చెరిచినట్లవుతుంది పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్నది అదే.

' తనను తన కుటుంబాన్ని అవమానిస్తున్నార ' ని జగన్ ప్రధాన అభియోగం.పదవీ కాంక్షతో తండ్రి శవం పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేల చేత బలవంతపు సంతకాలు చేయించుకొని, అది చాలదన్నట్టు పి.ఆర్.పీ నేతలతో మంతనాలు సాగించిన జగన్, తన తండ్రినే ఘోరంగా అవమానించారు. ' తండ్రి కోసం అసువులు బాసిన అభిమానుల కుటుంబాలని ఓదార్చటం పుత్రుడిగా తన ధర్మం' అని మనుధర్మాలు వల్లించే జగన్‌కి ఇది తెలియకపోవడం శోచనీయం. నిజానికి వైయస్ మరణాంతరం కూడా ఆయన కుటుంబానికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రయత్నమే చేసింది అధిష్ఠానం. అందులో భాగంగానే రెండు ప్రతిపాదనలు చేశారు. ఒకటి విజయమ్మకు పులివెందుల టికెట్ ,రెండోది జగన్‌కు కేంద్ర మంత్రి పదవి . సీ.ఎం.పదవి తప్ప మరో ధ్యాసలేని జగన్‌కు సహజంగానే రెండు ప్రతిపాదనలూ నచ్చలేదు. తన ధ్యేయం రాష్ట్రపీఠమైనప్పుడు, అసెంభ్లీకి వెళ్ళాలి కానీ కేంద్ర మంత్రిత్వం చెయ్యడమేంటన్నది ఆయన ఆలోచన. అసెంబ్లీకి వెళ్తే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి మరో అధికార కేంద్రాన్ని తయారుచెయ్యవచ్చు. సుముహూర్తం చూసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తను గద్దెనెక్కవచ్చు. కేంద్రమంత్రిగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించటం కష్టసాధ్యం. అందుకే ససేమిరా అన్నారు. కానీ ఒత్తిడికి తలొగ్గి తన తల్లిని అసెంబ్లీకి పంపక తప్పలేదు. అధిష్ఠానం కుడా జగన్ అసెంబ్లీకి వెళ్తే జరుగబోయే విపరీత పరిణామాలు దృష్టిలో ఉంచుకొనే ఆ ప్రతిపాదనలు చేసింది.ఇక వైయస్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? విజయమ్మ ఎమ్మెల్యే, జగన్ స్వయానా ఎం.పి. వైయస్ సోదరుడు వివేకానందరెడ్డి ఎమ్మెల్సి. బామ్మర్ది కడప మేయర్. పులివెందులలో సర్పంచ్,మున్సిపల్ ఛైర్మాన్ లాంటి ప్రధానమైన పదవులన్నీ వారివే. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ గనులశాఖామాత్యులు బలినేని శ్రీనివాసరెడ్డి, వైయస్ తోడల్లుడు వైయస్ సుబ్బారెడ్డికి దగ్గర బంధువు.ఇక వైయస్సార్ ఆత్మగా చెప్పబడే కే.వి.పి, రోశయ్య ప్రభుత్వంలో కూడా శాంతి భధ్రతల సలహాదారుగా కొనసాగి మొన్నమొన్ననే రాజీనామా చేశారు. అయన దగ్గర బంధువైన పార్థసారథికి ఎమ్మార్ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర ఉంది.ఇలా ఒకరా ఇద్దరా..ఆశ్రిత పక్షపాతం,అవినీతికి మారుపేరైన వైయస్ పాలనలో ఆయన్ను 'నమ్ముకున్న ' వారందరూ నిబంధనలతో నిమిత్తం లేకుండా కొన్ని తరాల వరకూ సరిపోయే కోట్లాది రూపాయిలు వెనకేసుకున్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉంటూ,అధిష్టానం అండదండలతోనే ఇదంతా చేయగలిగారే కానీ స్వంతంగా కాదు . అంత సామర్థ్యమే ఉంటే 2004 ఎన్నికలకు ముందు వైయస్ కుటుంబం ఆర్థికంగా దివాళా తీసే స్థాయిలో ఉండేదా? ఇన్నాళ్ళూ సీతగా కీర్తించిన సోనియాని ఇప్పుడు హఠాత్తుగా శూర్పణఖ అంటే ప్రజలు నవ్విపోతారు.

'సాక్షి' దినపత్రికలో వచ్చే వార్తలు చదివితే అదొక వార్తాపత్రికా లేక, జగన్ ట్విట్టర్ అకౌంటా అనిపిస్తుంది. 'ఇడుపులపాయ పుణ్యక్షేత్రం, ఇడుపులపాయ జనసంద్రం, మహానేత వైయస్, యువనేత జగన్, పోటెత్తిన జనం, అభిమానుల గుండెపోట్లు ' ఇవే ప్రధాన వార్తలు.' జగన్ ముఖ్యమంత్రి కావాలని వయసుతో సంబంధం లేకుండా ధర్నా చేసే చిన్నారులు, జగన్ రాలేదని నడిరోడ్లపై బైఠాయించే ప్రజలు, వచ్చాక తలనిమిరే ఒక ముసలవ్వ,తల పక్కకు వాల్చి ఆ ముసలవ్వ బుగ్గలనే కాకుండా,వచ్చిన వారి బుగ్గలనన్నీ పిసుకుతూ అటు ఏడుపు ఇటు నవ్వు, రెండు కాని భావాన్నొకటి మొహంపై పలికించే జగన్ ' ఇవి ఫోటో ఫీచర్‌లో కనువిందు చేసే ఫోటోలు. తండ్రి గతించి ఏడాది దాటినా ఇంకా ఓదార్పుయాత్ర అంటూ హడావుడి చేసి నలుగురిలో నానే ప్రయత్నం చేస్తున్న జగన్ అజెండా ఏమిటో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. పరామర్శలు, ఓదార్పులకి పరిమితం కావల్సిన యాత్రలో రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రాజకీయ ఉపన్యాసలు దంచి, అనుచరుల చేత రెచ్చగోట్టే ప్రకటనలు ఇప్పించి, అధిష్టానాన్ని యుద్ధానికి కవ్వించి, రాష్ట్రంలో తనను మించిన నాయకుడు లేడనే భ్రమలు కలిగించిన ఆయన, ఇప్పుడు అదే అధిష్టానం అస్త్రశస్త్రాలతో  సైయ్యంటే గగ్గోలు పెడుతున్నారు.'కుటుంబాన్ని చీల్చేయత్నం చేస్తున్నార' ని ఆశ్చర్యం వొలకబోస్తున్నారు. రాజకీయ రంగప్రవేశం చేసిన ఏడాదిన్నరకే సీ.ఎం కావాలని తహతహలాడుతున్న ఆయన, ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో పాతుకుపోయి మొదటిసారి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన తన స్వంత చిన్నాన్న పైన మాత్రం నిప్పులు చెరిగారు( పరిస్థితి కొట్టుకునేవరకు వెళ్ళబోతే అక్కడివారు సర్దిచెప్పారని PTI- Press Trust of India కథనం ). రామోజీరావు తోడల్లుడి కథనాలు, సుమన్ ప్రభాకర్‌ల ఇంటర్వ్యూలూ మొదటిపేజీలలో ప్రచురించి రామోజీ కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించిన జగన్ ఇప్పుడు అదే పరిస్థితి తనకూ వచ్చేసరికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు.

ఏడాదిన్నర కాలంగా మొద్దునిద్రలో ఉన్న రాష్ట్రపాలనా యంత్రాంగాన్ని నిద్రలేపి పరుగులు పెట్టించే బాధ్యతను భుజాన వేసుకున్నారు కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అయితే బొడ్డూడకుండానే బిర్యానీ తినాలనుకునే మనస్తత్వం కలిగిన జగన్, అతని అనుచరగణం ఆయనను ప్రశాంతంగా పనిచేసుకోనివ్వకపోవచ్చు.
 ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యవచ్చు. బలం లేక ఇప్పుడు వెనక్కితగ్గారు కానీ 'వైయస్ తెచ్చిన ప్రభుత్వం' అనే గౌరవంతో కాదు. తనకు మద్దతుగా పదుల సంఖ్యలో  కార్యకర్తలు, ఛోటా మోటా నాయకులు రాజీనామా చేసిన సంగతి అంకెలతో సహా తన పత్రికలో వేసుకున్నప్పుడే ఈ విషయం రూఢి అయ్యింది. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతివాదుల్ని, టీ.డీ.పీ, పీ.ఆర్.పీ లోని అసంతృప్తుల్ని జగన్ తనవైపు త్రిప్పుకోగలిగితే మధ్యంతర ఎన్నికలు అనివార్యమవుతాయి. మాటవినని మొండిఘటాలను శ్రేయోభిలాషులైన పెద్దలే దారిలో పెట్టాలి. అటువంటి వారెవరూ జగన్‌ దరిదాపుల్లో ఉన్నట్టు లేరు. ఉన్నా వినే ఓపికా సహనం జగన్‌కి లేదు. ఐతే కల్లు తాగిన కోతిని సైతం కట్టిపడేసే సత్తా కాలానికి ఉంది. రాబోయే కాలం ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డి కే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షా సమయమే.



7 comments

Post a Comment

ముగ్గురు ముఖ్యమంత్రుల కథ

మొదటి వ్యక్తి.. మన ప్రియతమ ( ?) ముఖ్యమంత్రి రోశయ్య .

వైయస్సార్ దుర్మరణం తర్వాత కురువృద్ధుడైన రోశయ్య నాయకత్వంలో రాష్ట్రానికి కాస్తైనా మంచి జరుగుతుందని ఆశించిన అనేకానేక వెర్రిబాగులోల్లలో నెనొకన్ని. అదేం ఖర్మమో కానీ ఆయన పీఠం ఎక్కిందగ్గర్నుంచి రాష్ట్రాన్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. తనకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించి  మనల్ని గట్టున పడేస్తాడనుకుంటే  ఆయన వెలగబెడుతున్న నిర్వాకం, పెనం మీద నుంచి పొయ్యిలోకి త్రోస్తూ ఉంది. మూర్తీభవించిన నిష్క్రియాపరత్వం,  ఉన్న వాటిని పరిష్కరించటం పోయి లేనివాటిని సృష్టిస్తోంది. తన పదవిని కాపాడుకోవడమే ఆయనకు ప్రధాన కార్యక్రమమైపోయింది. మచ్చుకి 'ఈనాడు' లోని ఈ వార్త చదవండి.



కాంగ్రెస్ పార్టీ ఏర్పడి  125 సంవత్సరాలు, భారతదేశానికి స్వాతంత్ర్యం  సిద్ధించి 63 సంవత్సరాలు గడిచాయి. బానిస బుద్ధులు మాత్రం ఇంకా వదిలినట్టు లేదు. ఒక్క రోశయ్యకే కాదు, ఆ  పార్టీ నాయకులందరికీ ఇదే జాడ్యం. ముక్కు మూసుకొని నిత్యం దేవతా స్తోత్రాలు వల్లించే మునిపుంగవుల్లా వీళ్ళు కూడా  ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ అనే నాలుగు మంత్రాలు పఠిస్తూంటారు. బలహీన వర్గాల కార్యక్రమం నుంచి బహిర్భూమి పథకం వరకు ప్రతి అడ్డమైన పనికీ రాజీవ్ ,ఇందిరల పేర్లు వాడుకోవల్సిందే. ఇలా చేసే  ఎన్నో ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన కడప జిల్లాను, జగన్ వర్గీయులని అనునయించటం కోసం, ఒక్క కలంపోటుతో వైయస్సార్ కడప జిల్లాగా మార్చిపారేశారు. ఇప్పుడు వారి  దృక్కులు మెదక్ జిల్లాపై  ప్రసరించినట్లున్నాయి . మాహాత్ముల చూపులు సోకటమే మహద్భాగ్యంగా మనమంతా తన్మయమవ్వాలి. ఈ దివ్య మంత్రోపదేశాలు వినీ వినీ అలవాటు పడిపోయి రేప్పొద్దున్న మనం మన పిల్లలకు ఈ పేర్లే పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన  పని లేదు. వేంకటేశ్వరస్వామి పేరు పెట్టుకున్న పాఠశాలలకు,కళాశాలలకు  టి.టి.డి ధన సహాయం చేసినట్లు, కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషించి మనల్ని అనుగ్రహించే అవకాశం ఉంది . రోశయ్య గారి దృష్టిలో రాష్ట్రంలో ఇంతకంటే   ప్రధానమైన ఆంశాలు,సమస్యలు లేవు. ఒకవేళ ఉన్నా, రెండు పక్షాలుగా చీలి పరస్పరం రాళ్ళు రువ్వుకుంటున్న మంత్రులాయన మాట వినరు. అధికారుల సంగతి సరే సరి.వైయస్సార్ ఉన్నప్పుడే  అడిగే నాథుడు లేదు.ఇప్పుడెవరు చూడొచ్చారు? అది మన గ్రహచారం అనుకొని తృప్తిపడాలి .

ఇక రెండవ వ్యక్తి ,..  హేతువాదిగా తనను తాను అభివర్ణించుకొనే తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. ట్రాయ్ నిబంధనలు, ప్రధాని ఆదేశాలు బేఖాతరు చేసి లక్షల కోట్ల రూపాయిల నష్టానికి కారణభూతుడైన మాజీ మంత్రి అండిముత్తు రాజాను అంబేద్కర్‌తో పోల్చాడు కరుణానిధి. రాజా దళితుడు కాబట్టే ఓర్వలేని అగ్రవర్ణాల వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం  చేసి అతన్ని బజారుకీడుస్తున్నాయని ఆయన సూత్రీకరించారు. నాకు తెలిసి అంబేద్కర్ ఎటువంటి కుంభకోణాలకు పాల్పడలేదు. అటువంటి నాయకున్ని రాజా లాంటి అక్రమార్కుడితో  పోల్చి దారుణంగా అవమానించినందుకు దళితసంఘాలేవైనా ఉద్యమిస్తాయో లేదో వేచి చూడాలి. మనదేశంలో కులమతాలు, రాజకీయాలు అవిభక్త కవలల్లాంటివి. తమ గుట్టు బయటపడినప్పుడల్లా, ఓట్లు రాల్చుకోవాల్సినప్పుడల్లా ఉపయోగపడే తారక మంత్రాలివే. అందుకే మ్యాచ్  ఫిక్సింగ్  ఉదంతంలో అజారుద్దీన్ మైనారిటి కార్డు ప్రయోగించగలిగాడు, 2G స్కాములో కరుణానిధి దళితకార్డుని వినియోగించగలిగాడు. రాజా పై శిక్షను రాజీనామాతో సరిపెట్టేశారు. ఛార్జిషీటు లేదు, అరెస్టు లేదు. ఏడువేల కోట్ల రూపాయిల మోసానికి జైలుపాలైన రామలింగరాజు కిన్ని తెలివితేటలు, అంగబలమూ లేకపోయాయి. రాజాకి అవి రెండు ఉన్నాయి కాబట్టి అతన్ని రక్షించటానికి, ప్రతిపక్షాలని శాంతపరచటానికి  ప్రభుత్వం పార్లమెంటరీ కమిటి వేసి కాలయాపన చేయ్యొచ్చు. కరుణానిధి కథ మాటలు సమకూర్చుతున్న 75వ చిత్రంలో ఇటువంటి చమక్కులు ఏమైనా ఉంటాయేమో. ఆశించటంలో తప్పులేదు.

ఇక మూడవ వ్యక్తి.. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప. ఏడ్చే మగవాన్ని నమ్మకూడదన్న సామెత ఈయన విషయంలో అతికినట్టు సరిపోతుంది. దక్షిణాదిన తొలిసారిగా అధికారం కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆనందం బి.జె.పి కి అట్టే నిలిచేలా లేదు.మొన్నటిదాక  అసమ్మతివాదులు పొగబెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తే ఇప్పుడు యడ్యూరప్ప తనయులే భూఆక్రమణల ఆరోపణలలో పీకలలోతు కూరుకుపోయారు. దానికి తోడు గోతి కాడ నక్కల్లా  కుమారస్వామి, దేవెగౌడ ఉండనే ఉన్నారు. యడ్యూరప్ప, ఆయన తనయులు తత్వం తెలిసిన వాళ్ళు కాబట్టే  తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి సి.ఎం పదవి పై ఆశలు పెట్టుకోకుండా అధికారం ఉండగానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరని బీరాలు పోయే బి.జె.పి ప్రభుత్వంలో ఘనుల దొంగలు, స్నేహితుని భార్యను బలాత్కరించిన వాళ్ళు, నర్సుతో అక్రమసంబంధాలు పెట్టుకున్నవాళ్ళు, స్కాముల్లో పాత్రధారులు, మంత్రులుగా పనిచేశారు, చేస్తున్నారు.దీన్నిబట్టి తేలిందేమిటంటే రాజకీయం అన్నాక ఏ పార్టీయైనా ఒక్కటేనని, అంతా ఆ త్రాసులో ముక్కలేనని.

ఎటొచ్చీ ప్రజలే పిచ్చిమాలోకాలు. వాళ్ళకు నిలువుదోపిడీ తప్పదు


2 comments

Post a Comment

వడ్డాది పాపయ్య శాస్త్రి గారి చిత్రాలు ( 'స్వాతి' నుంచి) -1

నా అభిమాన చిత్రకారుల్లో వపా(వడ్డాది పాపయ్య శాస్త్రి) గారొకరు. చిత్రలేఖనం అంటే ఆయిల్‌పెయింటింగ్సే అనుకునే రోజుల్లో వాటర్ కలర్స్‌తోనే అద్భుతాలు సృష్టించి సంచలనం రేపారాయన. ఆంధ్రులందరికీ చిత్రకళ అనగానే బాపుగారే ముందు గుర్తొస్తారేమో కానీ నాకు మాత్రం మొదట పరిచయమైన చిత్రకారుడు వీరే. 'స్వాతి' వారపత్రికకు ఆ పుణ్యం దక్కుతుంది. ఆ పత్రిక కోసం వారు వేసిన కొన్నిచిత్రాలు ఇక్కడ చూడండి.




5 comments

Post a Comment

నరకాసుర వధ (చిత్రం)




అందరికీ దీపావళీ శుభాకాంక్షలు


2 comments

Post a Comment

భూదేవికి విష్ణువిచ్చిన వరాలు, బలరాముని లీలలు ఇతర భాగవత విశేషాలు.

ఇంకొన్ని భాగవత విశేషాలు.
  1. 1.   త్రివిక్రముడైన వామనమూర్తి పాదాలను బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడుగగా ఉద్భవించినదే గంగానది.

  2. 2.   విశ్వరూపున్ని చంపిన ఇంద్రుడుకి బ్రహ్మహత్యామహాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని భూమి, వృక్షాలు, నీరు, స్త్రీలు పంచుకుంటారు. అందుకే భూమ్మీద కొంతభాగం ఎడారిగా నిర్మానుష్యంగా ఉంటుంది. వృక్షాలు స్రవించే ద్రవాలను (కల్లు వగైరా) త్రాగరాదని, బుడగలు నురగతో నిండిన నీరు నిరుపయోగమని, ఋతుమతియైన స్త్రీలని అంటరాదని పెద్దలు చెబుతారు. తన పాపాన్ని పంచుకున్నందుకు ప్రతిగా ఇంద్రుడు, త్రవ్విన ప్రతి గుంత తనంతట తనే పూడుకుపోతుందని భూమికి, కొమ్మలు నరికేసినా మళ్ళీ చివురిస్తాయని వృక్షాలకు, కలిసిన ప్రతి వస్తువు పెరుగుతుందని నీటీకి, అపరిమితమైన క్రీడాసక్తిని కలిగి ఉంటారని స్త్రీలకు వరాలిస్తాడు.

  3. 3.   వృత్తాసురుడు పూర్వజన్మలో చిత్రకేతుడనే రాజు. విష్ణుభక్తుడైన ఆయన, ఒకనాడు దివ్యవిమానంలో లోకాలన్నీ సంచరిస్తూ, కైలాసంలో ప్రమదగణాలన్నీ పరివేష్టించి ఉండగా సతీదేవిని ఆలింగనం చేసుకున్న పరమశివున్ని చూసి విరగబడి నవ్వుతాడు. సతీదేవి ఆగ్రహించి అతన్ని అసురుడవై పుట్టమని శపిస్తుంది.


  1. 4.   ఇక్ష్వాపు వంశీయుడైన యువనాశ్వుడనే మహారాజు సంతానప్రాప్తి కోసం ఇంద్రుని గూర్చి యజ్ఞం చేస్తాడు. యజ్ఞం పరిసమాప్తమయ్యాక మంత్రించిన పుణ్యజలాన్ని ప్రమాదవశాత్తూ మింగి గర్భం దాలుస్తాడు. అతని ఉదరం చీల్చుకొని పుట్టినవాడే మాంధాత. పుట్టగానే గ్రుక్కపట్టి ఏడ్చిన ఇతనికి ఇంద్రుడే స్వయంగా అమృతం తినిపిస్తాడు. మాంధాత షట్చక్రవర్తులలో ఒకడు.

  2. 5.   అత్రి మహర్షి ఆనందబాష్పముల నుండి ఉద్భవించినవాడు చంద్రుడు.

  3. 6.   చంద్రవంశానికి ఆద్యుడు పూరూరవుడు.ఇతను ఇళ-బుధు (గ్రహం) ల  కుమారుడు.సూర్యవంశపు మూలపురుషుడైన శ్రాద్ధదేవుని కూతురు ఇళ. ఆమెను వశిష్టుడు తపోశక్తితో పురుషునిగా మార్చి సుద్యుమ్నుడని నామకరణం చేస్తాడు. సుద్యుమ్నుడు ఒకనాడు వేటకు వెళ్ళి నిషిద్ధప్రాంతంలో కాలుమ్రోపి శాపవశాత్తూ మళ్ళీ స్త్రీగా మారిపోతాడు. వశిష్టుని ప్రార్థనకు  పరమశివుడు కరిగిపోయి సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీగా మరొకనెల పురుషునిగా బ్రతుకుతూ  జీవితం కొనసాగిస్తాడని వరమిస్తాడు.అలా సుద్యుమ్నుడు స్త్రీగా ఉన్న సమయంలోనే చంద్రుని కుమారుడైన బుధునితో కలిసి పురూరవునికి జన్మనిస్తాడు.

  4. 7.   ప్రజాపతి ద్రోణుడు, ఆయన భార్య ధర, బ్రహ్మ అజ్ఞానుసారం నందుడు,యశోదగా జన్మిస్తారు.

  5. 8.   ఉగ్రసేన మహారాజు భార్య, సఖులతో కలిసి వనవిహారం చేస్తూంటే  ద్రమిళుడనే గంధర్వుడు ఆమెను చూసి మోహిస్తాడు.ఉగ్రసేనుడి రూపం ధరించి ఆమెను ఏకాంతంలో కలుసుకుంటాడు.ఆమె గర్భవతౌవుతుంది. ఆలస్యంగా విషయం తెలుసుకొని కోపంతో, తనకు పుట్టబొయే బిడ్డ రాక్షసుడవుతాడని శపిస్తుంది. ద్రమిళుడు, ఆ బిడ్డ తనవారి చేతనే ద్వేషింపబడుతాడని  ప్రతిశాపం యిస్తాడు.అలా పుట్టినవాడే కంసుడు. ఈ రహస్యాన్ని నారద మహర్షి అతనికి తెలియజేస్తాడు.

  6. 9.   వసుదేవునికి దేవకి కాకుండా ఇంకో ఆర్గురు భార్యలున్నారు. వారిలో రోహిణి ఒకతె. దేవకీదేవి గర్భాన ఏడవ కుమారుడిగా జన్మించిన బలరామున్ని విష్ణువు రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెడ్తాడు. అలాగే వసుదేవునికి ఐదుగురు అక్కచెళ్ళెళ్ళు. వారిలో కుంతీదేవి ఒకతె. ఆమె శ్రీకృష్ణునికి స్వయానా మేనత్త.

  7. 10.   ఏడేళ్ళ వయసులో ఏడు రోజుల పాటూ  గోవర్ధనగిరిని తన చిటికెనవ్రేలి పై మోస్తాడు బాలకృష్ణుడు. అలా గోవులను కాచినందుకే 'గోవిందు'డౌతాడు.

  1. 11.   కుబేరుడు మెల్లకన్ను కలవాడు. పార్వతిదేవి సౌందర్యం చూసి క్షణకాలం మనస్సు చలించటంతో మెల్లకన్ను పొందుతాడు.

  2. 12.   నలకూబర, మణిగ్రీవులు కుబేరుని పుత్రులు. గంధర్వకాంతలతో కలిసి మధువు సేవిస్తూ వివస్త్రులై ఒళ్ళుపై తెలియకుండా ఆకాశగంగలో స్నానం చేస్తూంటే, ఆ దారెంట వెళ్తున్న నారద మహర్షి కనిపిస్తాడు. గంధర్వ స్త్రీలంతా హడావుడిగా బట్టలు కట్టుకొని ఆయనకు భయభక్తులతో నమస్కరిస్తే, వీరిద్దరూ గర్వాంధకారంతో ఏమీ పట్టనట్లు దిసమొలతో నిలబడి, మిన్నకుండిపోతారు. నారదుడు ఆగ్రహించి వారిని వంద దివ్య సంవత్సరాలపాటూ మద్దిచెట్లై పడుండమని శపిస్తాడు. కృష్ణావతారంలో భగవంతుడు నడుముకి రోకలి కట్టుకొని ఈ మద్దిచేట్ల మధ్యలోనే వెళ్ళి వాటిని పడద్రోసి వారికి శాపవిమోచనం కలిగిస్తాడు.

  3. 13.   బృందావనంలోని యమునా నదిలో సౌభరి అనే ఋషి నిలబడి గొప్ప తపస్సు చేసుకునేవాడు. ఆ నదిలోని ఒక మగచేపను ఒక గ్రద్ద చంపి తినటంతో చేపలన్నీ వెళ్ళి మునితో తమ బాధను చెప్పుకుంటాయి. ఆయన జాలిపడి, గరుత్మంతుడితో సహా ఏ పక్షైనా మరోసారి ఇటువైపు వస్తే మరణం తధ్యమని శపిస్తాడు.

  4. 14.   రమణక ద్వీపంలో నివసించే పాములకు గరుత్మంతుడికీ మధ్య ఒక ఒప్పందం ఉంది. గరుత్మంతుడు పాములనన్నిటినీ ఇష్టం వచ్చినట్లు ఆరగించకుండా నెల నెలా ఒక కుటుంబం పెట్టే బలి ఆహారాన్ని మాత్రమే పుచ్చుకోవాలని ఒడంబడిక చేసుకుంటారు. తన వంతు వచ్చినప్పుడు కాళీయుడు ఆ ఒప్పందాన్ని ధిక్కరించి విషం క్రక్కుతూ గరుత్మంతుడిపై దాడి చేస్తాడు. ఆయన దాన్ని తరుముకుంటూ వెళ్తాడు. కాళీయుడు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోకాలన్నితిరిగి తిరిగీ చివరకి అధోలోకాలకి వెళ్ళి అనంతుడి కాళ్ళపై పడితే, ఆయన బృందావనంలోని యమునా నదిలో దాక్కుంటే గరుత్మంతుడు ఏమీ చెయ్యలేడని సలహా ఇస్తాడు.అలా కాళీయుడు యమునానది చేరుకొని తన మహోగ్ర విషంతో అందులోని జీవజాలాన్ని నాశనం చేసి స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడు. కృష్ణుడు అతని పీచమణచి, తిరిగి రమణకద్వీపం వెళ్ళిపొమ్మని, తలపై తన పాదముద్రలున్నాయి కనుక గరుడుడు ఏమీ చెయ్యడని అభయమిస్తాడు.

  5. 15.   రామావతారంలో గర్భవతియైన సీతమ్మను పరిత్యజించటానికి ప్రధానకారణమైన చాకలివాడిని కృష్ణావతారంలో అంతమొందిస్తాడు మహావిష్ణువు. గతజన్మ వాసనలవల్ల ద్వాపరయుగంలో కూడా చాకలిగా జన్మించిన అతను, కంసుని దగ్గర సేవకుడిగా పనిచేస్తూ బ్రతుకు వెళ్ళదీస్తుంటాడు. ధనుర్యాగం కోసం మధురానగరం వచ్చిన బలరామకృష్ణులు, వీధులలో కలయతిరుగుతూ కంసుని పట్టువస్త్రాలు మోసుకెళ్తున్న అతన్ని చూస్తారు. అతని వద్దనున్న మూటలోంచి కొన్ని పట్టువస్త్రాలు తమకూ కట్టుకోవటానికి ఇవ్వమని అడుగుతారు. చాకలివాడు ఆ బట్టలు ఇవ్వకపోగా 'పాలు పెరుగుతిని క్రొవ్వుతో కొట్టుకుంటున్న గొల్లవార' ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో, యుగాలు మారినా ఇతని ఆలోచనా ధోరణి మారలేదని గ్రహించిన కృష్ణుడు ఒక్క పిడికిలిపోటుతో అతన్ని యమపురికి పంపిస్తాడు.

  6. 16.   పంచజనుడనే రాక్షసుని శరీరం నుండి పుట్టినదే పాంచజన్యమనే శంఖం.గురువైన సాందీపుని కుమారున్ని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు ఆ రాక్షసుని చంపి శంఖాన్ని తీసుకుంటాడు.

  7. 17.   వరాహమూర్తిగా ఉన్నకాలంలో మహావిష్ణువు భూదేవికి పలు వరాలిస్తాడు.భూమిపుజ అలా వచ్చిన వరమే.అలాగే పుస్తకం నేల మీద పెడితే చదువు సిద్ధించకూడదని, శంఖం నేల మీద పెడితే మంగళం జరుగరాదని, తులసిని పువ్వులని నేల మీద పెడితే దేవతలు వారి ఇంట పూజలు స్వీకరించరాదని, శివలింగం నేలపెట్టిన ఇంట దేవతలు నివసించరాదని భూదేవి వరాలు కోరుతుంది.

  8. 18.   నరకాసురుని భార్య పేరు చతుర్దశి.

  9. 19.   నరకాసురుడు చెరపట్టిన 16100 మంది కన్యలను 16100 రూపాలతో ఏకకాలంలో వివాహం చేసుకుంటాడు కృష్ణ పరమాత్ముడు.ప్రతి భార్యతోను 10 మంది పిల్లలు కలిగారు. వీళ్ళ పిల్లలు, మనవళ్ళకు చదువు చెప్పడానికి నియమించిన గురువుల సంఖ్య మూడు కోట్ల ఎనభైవేల ఒక వంద.

  10. 20.   రుక్మిణిదేవి అన్న రుక్మిని బలరాముడు చంపేస్తాడు. పాచికలాడి పలుమార్లు బలరామున్ని ఓడించి  పకపకా నవ్వుతాడు రుక్మి. బలరాముడు పట్టుదలగా ఆడి గెలిచినా ఒప్పుకోక, ' గొల్లవార' ని అవహేళన చెయ్యటంతో ఆయన ఆగ్రహించి అతన్ని పరలోకం పంపిస్తాడు.

  11. 21.   మన్మథుడు ఒక్క రతీదేవికి తప్ప మిగతా వారెవ్వరికీ కనిపించడు.అతను అనంగుడు.

  12. 22.   బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. వాళ్ళలో పెద్దవాడు శివభక్తుడైన బాణాసురుడు.

  13. 23.   ద్వివిదుడు నరకాసురుని మిత్రుడు.ఇతను వానరరాజైన సుగ్రీవుని మంత్రి మైందుని తమ్ముడు. అయినా యుగప్రభావం వల్ల తన మిత్రుని చంపిన కృష్ణుడిపై పగబట్టి యాదవ గ్రామాలను, నగరాలను ధ్వంసం చేస్తాడు. రైవతక పర్వతం పైనున్న బలరాముడు కొంతసేపు ఉపేక్షించి ఇక లాభం లేదని అతన్ని సంహరిస్తాడు


  1. 24.   జాంబవతి-కృష్ణుల కొడుకు సాంబుడు. అతను దుర్యోధనుడి కూతురైన లక్షణ స్వయంవరానికి వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకువెళ్తూంటే కౌరవులంతా దాడి చేస్తారు. అతని శౌర్యప్రతాపాగ్నికి తట్టుకోలేక అందరు చుట్టిముట్టి, కట్టడి చేసి బంధిస్తారు. శాంతిప్రియుడైన బలరాముడు కృష్ణుడికి నచ్చజెప్పి హస్తినాపురం వెళ్ళి వారిని వదిలేయమని హితుల ద్వారా చెప్పి పంపిస్తాడు. దుర్యోధనుడు పెడచెవిన పెడతాడు. బలరాముడు ఆగ్రహించి,' హస్తినాపురాన్ని యమునా నదిలో కలిపేస్తా' నని తన నాగలి భూమిలో గ్రుచ్చి నగరం మొత్తాన్ని పైకి లేపేసరికి అందరూ హాహాకారాలు చేస్తారు. దుర్యోధనుడు కాళ్ళబేరానికొచ్చి యువదంపతులను విడిచిపెడతాడు.


1 comment

Post a Comment

అరటిచెట్టు ఎలా పుట్టింది, కంసుడి జన్మరహస్యం ఇతర భాగవత విశేషాలు

వారం భాగవతం లోంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
  1. 1.   అష్టాదశ పురాణాలు వ్యాస భగవానుడే వ్రాశాడు.

  2. 2.   పరీక్షిత్తు అసలు నామధేయం విష్ణురాతుడు. కలిపురుషుడి వేడుకోలుకు కరిగిపోయి అతను జూదశాలల యందు, మధుశాలల యందు, వ్యభిచారుల యందు, జంతు వధ్యశాలల యందు, బంగారమందు ఉండవచ్చని అభయం ఇస్తాడు. కలి పురుషుడు పరీక్షిత్తు కిరీటంలో ప్రవేశించి, అతని బుద్ధిని పెడత్రోవ పట్టించి, ధ్యానమగ్నుడైన శమీక మహర్షి మెడలో చనిపోయిన త్రాచు పామును వేలాడదీసేలా చేస్తాడు.

  3. 3.   కురుక్షేత్ర యుద్ధకాలంలో విదురుడు తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు.

  4. 4.   హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో హిరణ్యకశిపుడు పెద్దవాడు. తన కొడుకులిద్దరూ విష్ణువు చేతిలో మరణిస్తారని దితికి ముందే తెలుసు. ఆయన భయంతోనే వాళ్ళను 100 సంవత్సరాలు గర్భంలో దాచుకుంటుందామె.

  5. 5.   అనుహ్లాదుడు, సమ్హ్లాదుడు, హ్లాదుడు  ప్రహ్లాదుని సోదరులు.


  1. 6.   ప్రహ్లాదుని మనవడు రాహువు. అతని తల్లి సింహిక. అమృతం పంచే సమయంలో రాహువు మారువేషంలో దేవతల వరుసలో కూర్చున్నాడని మోహినీ అవతారమెత్తిన విష్ణువుకు ముందే తెలుసు. అయినా వరుసలో కూర్చున్నవాడిని లేపడం ధర్మం కాదు కాబట్టి, అతను అమృతం తాగిన వెంటనే, అది గొంతు దిగక ముందే అతని శిరస్సుని ఉత్తరిస్తాడు. అయితే అమృతం మింగిన శిరస్సు అమరత్వం పొందింది కాబట్టి గ్రహస్థితిని కల్పిస్తారు.

  2. 7.   గజేంద్రుని భార్యలు 10లక్షల కోట్ల ఆడేనుగులు. గజేంద్రుడు వేయి సంవత్సరాల పాటూ మొసలిపట్టులో ఉండి పోరాడుతాడు. ఆ తర్వాత ఓపిక సన్నగిల్లి విష్ణువుని శరణు వేడితే, ఆయన ఆఘమేఘాల పై వచ్చి రక్షిస్తాడు.

  3. 8.   వృత్తాసురుని కంఠాన్ని వజ్రాయుధంతో కొయ్యటానికి  ఇంద్రునికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టింది.

  4. 9.   నముచి అనే రాక్షసుడు అటు తడి, ఇటు పోడి కాని వస్తువు ద్వారా మరణించాలని కోరుకుంటే, దేవేంద్రుడు సముద్రపు నురగలో వజ్రాయుధం ముంచి అతన్ని సంహరిస్తాడు.

  5. 10.   బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి.

  6. 11.   దుర్వాసో మహర్షి భార్య కందళియే కదళీ వృక్షం (అరటి చెట్టు) గా రూపుదాల్చింది. ఆమె ఔర్వుడనే మహర్షి కూతురు. తలబిరుసు ఎక్కువ. ఆమె విషయం ముందే చెప్పి దుర్వాసో మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు ఔర్వుడు. చాలా కాలం ఆమె ప్రవర్తన భరించిన దుర్వాసో మహర్షి ఒక రోజు ఆమె చెప్పిన పని చెయ్యకపోయేసరికి ఆగ్రహించి భస్మీపటలం చేస్తాడు. విషయం తెలుసుకున్న ఔర్వుడు కోపించి ఒక రాజర్షి ( అంబరీషుడు) చేతిలో ఘోరావమానం పొందుతావని శాపమిస్తాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన దుర్వాసో మహర్షి ఆమె వృక్షంగా జన్మించి అమృతతుల్యమైన ఫలాలిస్తుంది వరమిస్తాడు.

  7. 12.   కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు.దేవాసుర సంగ్రామంలో అతన్ని సుదర్శనచక్రంతో సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.అసుర గురువు శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యతో అతన్ని తిరిగి బ్రతికిస్తాడు. రోషిల్లిన కాలనేమి, తీవ్రమైన తపస్సు చేసి విష్ణువు చేతిలో కానీ, ఇతర ఏ దేవతల చేతిలో కానీ మరణం కలగకుండా బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు.కంసుడిగా జన్మిస్తాడు.అతను కోరుకున్నది విష్ణువు చేతిలో కానీ ఇతర ఏ దేవతల చేతగానీ మరణం సంప్రాప్తించకూడదని. అందుకు తగ్గట్టుగానే భగవంతుడు విష్ణు రూపంలో అతన్ని పరిమార్చకుండా, కృష్ణావతారం ఎత్తి అతన్ని నిర్జిస్తాడు.

  8. 13.   కంసుడు మహాపరాక్రమశాలి.తను యువరాజవగానే దిగ్విజయ యాత్ర ప్రారంభించి అన్ని దేశాలూ గెలుస్తాడు. యాత్రలో భాగంగా జరాసంధుని రాజధాని చేరుకున్నప్పుడు, అతను కువలయపీడం అనే మత్తగజాన్ని కంసునిపై పురిగొల్పుతాడు.కంసుడు రెండు చేతులతో దాన్ని ఒడిసిపట్టి గిరగిరా త్రిప్పి అది జరాసంధుని సభాప్రాంగణంలో పడేలా విసిరేస్తాడు. జారాసంధుడు అతని బలపరాక్రమాలకి ముగ్ధుడై తన కూతుళ్ళైన అస్థి, ప్రాప్తిలను అతనికిచ్చి వివాహం చేస్తాడు. అస్థి మొహం ఎప్పుడూ ఇంకాసేపట్లలో తుమ్మబోయేలా ఉంటే, తుమ్మిన తర్వత మొహం ఎలా ఉంటుందో ప్రాప్తి మొహం అలా ఉంటుంది.

  9. 14.   కంసుడు ఆ తర్వాత చాణూర ముష్టికాదులను ఓడించి వారిని తన అనుచరులుగా మార్చుకుంటాడు.అదే ఊపులో వానరుడైన ద్విందుడుని, ఋష్యమూక పర్వతంపై నివశిస్తున్న కేశి ని ఓడించి వారితో సఖ్యం ఏర్పరుచుకుంటాడు.ఆ తర్వాత మహేంద్రపర్వతం వెళ్ళి పరశురాముని కవ్విస్తే, ఆయన తన ధనస్సు అతనికిచ్చి ఎక్కుపెట్టమంటాడు. కంసుడు అలవోకగా ఆ ధనువు చేతబట్టి ఎక్కుపెడితే, ఆ ధనస్సుని అతనికే ఇచ్చివేసి, మహావిష్ణువు పరిపూర్ణావతారం అతని అంతఃపురానికి వచ్చి దాన్ని తిరిగి ఎక్కుపెట్టగలదని, ఆ అవతారం చేతిలో మరణం తధ్యమని చెబుతాడు.

  10. 15.   ప్రజాపతి సుతపుడు,అతని భార్య పృష్ణి పన్నెండువేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి మహావిష్ణువునే కొడుకునుగా పొందే వరం పొందుతారు. మూడు జన్మలలో వారి కొడుకై జన్మించి వారిని తరింపచేస్తాడు నారాయణుడు.మొదట సుతపుడు-పృష్ణి దంపతులకు పృష్ణిగర్భుడిగా,తర్వాత అదితి,కశ్యపులకు వామనుడిగా, పిదప దేవకీ వసుదేవులకు శ్రీ కృష్ణుడిగా జన్మిస్తాడు.

  11. 16.   కంసుని చేత వధింపబడిన ఆరుగురు దేవకి వసుదేవ పుత్రులకు ఒక శాపముంది. వారు గతంలో మరీచి, ఊర్ణాదేవి అనే ఋషి దంపతుల పిల్లలు. ఒకసారి సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుని చూసి నవ్వటంతో రాక్షసులై పుట్టండని ఆయన శపిస్తాడు. అలా మొదట కాలనేమి (కంసుని పూర్వజన్మ) పుత్రులుగా జన్మిస్తారు.తర్వాత హిరణ్యకశిపుని తనయులుగా పుడతారు. ఆ జన్మలో గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి దీర్ఘాయువును  వరంగా పొందుతారు. తనకులేని దీర్ఘాయువు తన కొడుకులు పోందటంతో హిరణ్యకశిపుడు ఆగ్రహించి మీరంతా దీర్ఘనిద్రలో ఉండి చనిపోతారని, పూర్వజన్మలో మీ తండ్రే రాబోయే జన్మలో మిమ్మల్ని చంపుతాడని శపిస్తాడు.

(మిగతా విశేషాలు తరువాతి టపాలో)

3 comments

Post a Comment

ఆవేశమంతా ఆలాపనే లే

వినడానికి అద్భుతంగా ఉండి చిత్రీకరణలో తేలిపోయిన ఎన్నో పాటల్లో ఇదొకటి. లిరిక్  విని పాట ఇలా తీసుంటారని అలా తీసుంటారని ఏదేదో ఉహించుకున్నాను.పల్లవి విని ఇదేదో కథానాయకుడు ఆవేదనతో పాడే పాటేమోననుకున్నాను. చరణాలు విన్నాక ' కాదు ఇది హీరో తన భావావేశాన్నే హృద్యంగా వెల్లబుచ్చే పాట ' అనుకున్నాను.అప్పటికి నేనీ సినిమా చూడలేదు. అయితే హీరోయిన్ భానుప్రియ అని,దర్శకుడు వంశీ అని తెలుసు. హీరో మోహన్ అని మాత్రం తెలీదు. పాట బాగా నచ్చడంతో చాలా సార్లు మళ్ళీ మళ్ళీ విన్నాను. విన్న ప్రతిసారీ కథానాయకుడి మన:స్థితిని పొంది ఒక తియ్యని అనుభూతికి లోనయ్యాను.



మొన్నామధ్య తేజ టీ.వి లో ఈ సినిమా వస్తూంటే ఆత్రంగా చూశాను. పది నిమిషాలయ్యేసరికి సినిమా నిరుత్సాహాన్ని కలిగించింది. వంశీ లాంటి భావుకుడు కూడా అంత చప్పగా  పాటను ఎలా తీశారా అని అనిపించింది. పాటలో ఉన్న గాఢతను తెర మీద ప్రతిఫలించటంలో ఆయన విఫలమయ్యారు. తర్వాత చూడలేక ఛానల్ మార్చేశాను.





ఈ పాటకు సంగీతం ఇళయరాజా. సాహిత్యం వేటూరి. ఇందులో మొదటి చరణంలో వేటూరి భావసౌందర్యం చూడండి

అల పైట వేసే సెలపాట విన్నా
గిరి వీణ మీటే జలపాతమన్నా
( సెలయేరు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఉప్పొంగి ఎగసే అలలు దానికి పైటలాగా ఉన్నాయట.  పర్వతం ఒక వీణయితే,అ పర్వతం పైనుంచి దూకే జలపాతం ఆ వీణకున్న తంత్రి అట.అలతి పదాలలో ఎంత అద్భుతమైన భావం ఇమిడ్చారో చూశారా !  )

నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన

ఝరుల గమన నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గళమధువులడిగే గానం
(గళమధువులన్నది ఇంకో మంచి ప్రయోగం)
నిదురలేచే నాలో హృదయమే

వేటూరి ఇంటిపేరుని 'పాటూరి' గా మార్చినా తప్పులేదేమో. అంత అపుర్వమైన పాటలు వ్రాశారాయన.


3 comments

Post a Comment

కోట్లు ఖర్చుపెట్టినా పసలేని సినిమాలు



కొన్ని సినిమాలు ఆరంభం నుంచే ఊరిస్తూంటాయి.హీరో హీరోయిన్ల కాంబినేషన్ వల్లనో,హీరో దర్శకుల అరుదైన కలయిక కారణంగానో,ఒక ప్రతిష్ఠాత్మకమైన బేనర్ నిర్మించే చిత్రం కావటం వల్లనో,లేక ఒక హిట్ కాంబినేషన్ రిపీటవ్వడం మూలానో ఎక్కడలేని క్రేజ్ ఏర్పడుతుంది.షూటింగ్ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి చిత్రీకరణ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టి విడుదలయ్యే నాటి వరకు ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు.దానికి తగ్గట్టు 'ఈ సినిమాలో హీరోని ఎవ్వరూ ఊహించని విధంగా చూపిస్తున్నాం,ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్,ప్రసిద్ధ కెమెరామెన్,సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు, సినిమాని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాం,ఇన్ని సెట్స్ వేశాం,ఎవరూ చూడని ప్రదేశాలు చూపిస్తున్నాం,ఇన్ని కోట్లు ఖర్చుపెట్టాం, క్వాలిటీ విషయంలో  రాజీపడకుండా నిర్మిస్తున్నాం' అని విడుదలకు ముందు సదరు నిర్మాతలు చెవినిల్లు కట్టుకొని పోరుపెడతారు.నిజమే కాబోలని నమ్మేసి ముందూ వెనక ఆలోచించకుండా డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున డబ్బులు చెల్లించి హక్కులు కొంటారు.వేలకు వేలు తగలేసి అభిమానులు బేనర్లు కటౌట్లు పెడతారు.ఉత్సాహంతో ర్యాలీలు చేస్తారు. పిచ్చి ముదిరి పాకాన పడిన ఇంకొంతమంది రిలీజ్‌కు ముందే 'మా సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది,ఈ రికార్డ్ బ్రేక్ చేస్తుందని' పందేలు వేసుకుంటారు.

సినిమా రిలీజవుతుంది.
కథ ఉండదు,కథ ఉంటే లాజిక్ ఉండదు,రెండూ ఉన్నా కథనం ఉండదు.

సినిమా బాక్సాఫీసు దగ్గర చతికిలపడుతుంది.
పరువుపోయిందని అభిమానులు బూతులు తిట్టుకుంటూ మొహాలు వేళ్ళాడదీసుకొని బయటికివస్తారు.
తెచ్చిన అప్పు,కట్టాల్సిన వడ్డీ తలుచుకోని డిస్ట్రిబ్యూటరు బావురుమంటాడు.

దీనికంతటికీ కారణం ఎవరు?

అనుభవజ్ఞుడైన శిల్పి ఒక విగ్రహాన్ని దీక్షగా చెక్కినట్టు తెగ బిల్డప్పిచ్చి చివరకు తలతోకా లేని సినిమాను తీసిన దర్శకుడిదా?
గుడ్డిగా అతన్ని నమ్మి డబ్బుని మంచినీళ్ళలా ఖర్చుపెట్టిన నిర్మాతదా?
ఫైట్లు,డాన్సుల మీద ఉన్న ఇంటరెస్టు, కథ మీద లేని హీరోలదా ?

ఉదాహరణకు ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు తీసుకుందాం.పవన్‌కళ్యాణ్  నటించిన ' కొమరం పులి ' సినిమా దాదాపు రెండేళ్ళపాటు నిర్మాణం జరుపుకొని ఆ మధ్యే రిలీజయ్యింది.ఈ సినిమాని చూసిన ప్రేక్షకుడికెవరికైనా ఇంత నాసిరకం సినిమాకి అన్నేళ్ళు అన్ని కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారో ఒక పట్టాన అర్థం కాదు.కథ లేదు,ఉన్న లైన్ కుడా బాగా నలిగిపోయిన కథ.పోనీ అదే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు.బ్యాంకాక్ లో సన్నివేశాలు చిత్రీకరించి వాటిని హైదరాబాద్ కి ఆపాదిస్తాడు దర్శకుడు.ఇక హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యటానికి సృష్టించిన పోరాటాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

మహేష్ ' ఖలేజా ' కుడా అంతే. మూడేళ్ళ తర్వాత వచ్చిన ఈ చిత్రంలో కాస్త కథ ఉన్నా,దాని మీద కసరత్తు చెయ్యకుండా తన ట్రేడ్ మార్క్ కామెడీ  మీద దృష్టిపెట్టాడు దర్శకుడు.పాటలు వీక్.వినడానికి బావున్న కొన్ని పాటలు, చిత్రీకరణలో అంతంతమాత్రం. సమయం సందర్భం లేకుండా వచ్చిపోతూంటాయి.దానికి తోడు కథకు సంబంధం లేని టైటిల్. ' కొమరం పులి ' కి 42కోట్లు ఖర్చైతే, ' ఖలేజా ' కి 50కోట్ల బడ్జెటయ్యిందనీ నిర్మాత సెలవిచ్చారు. ' వరుడు 'లో ఐదురోజుల పెళ్ళి విశిష్టత గురుంచి చెప్పాలనుకున్న గుణశేఖర్, కేవలం ఆ పెళ్ళి, ఆ సెట్టింగు మీదే మనస్సుపెట్టటంతో సినిమా ఘోరపరాజయం పాలై అల్లు అర్జున్ కి షాక్‌నిచ్చింది. ఈ చిత్రానికైన ఖర్చు 31 కోట్లని ఒక రూమరు. ఈ సొమ్ములో ఒక్కశాతం ఇచ్చినా ఇంతకంటే మంచి కథలు అందించేవాళ్ళు మన వర్ధమాన రచయితలు. అంత ఓపిక లేదు. ఈ స్పీడుయుగంలో ఎంత త్వరగా నాలుగురాళ్ళు వెనకేసుకుంటే అంత గొప్ప కాబట్టి హడావుడిగా సినిమా ప్రారంభిస్తారు. చివరకి ఏం తియ్యాలో తెలియక, తీసినవాటిని మార్చి ,మార్చిన వాటిని మళ్ళీ తీసి, ఇలా ఏళ్ళు గడిపి చివరకి ఏదో అయ్యిందనిపిస్తారు. దాని ఫలితం కూడా అలానే ఉంటుంది.

ఈ వ్యాధి ఒక్క మన తెలుగు దర్శక నిర్మాతలకే కాదు మణిరత్నం లాంటి లబ్ధప్రతిష్టులైన దర్శకులకి ఉంది. ఒక సాదాసీదా కథకి రామాయణన్ని, ముఖ్యంగా అందులో రావణుడి వ్యక్తిత్వాన్ని విశ్లేషించే యత్నం చేసినట్లు ప్రొజెక్ట్ చేసి కుతూహలం పెంచారు. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు. ప్రధాన పాత్రధారుల నటన, ఫోటోగ్రఫీ, సంగీతం బావున్నా, కథ తేలిపోవటంతో ఈ సినిమా బోల్తాపడింది. ఈ విషయంలో శంకర్‌కి కూడా మినహాయింపేమీ లేదు. 150 కోట్లు(అనధికారిక అంచనా 200 కోట్ల పైనే) ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాలో కథ అంతంతమాత్రమే. ఇదే కాన్సెప్ట్ తో కన్నడలో ఉపేంద్ర ' హాలీవుడ్ ' అనే చిత్రాన్ని తీసాడు చాలా కాలం క్రితం. అది గొప్ప ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. అదే కథకి కాస్త టెక్నాలజీనీ జోడించి శంకర్ మళ్ళీ  ప్రేక్షకుల మీదకు వదిలాడు. చిత్ర కథానాయకుడు రజనీ కావటం,కొన్ని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో సినిమా కాస్త బయటపడింది కానీ లేకుంటే డిస్ట్రిబ్యూటర్లు మసైపోయేవాళ్ళు.(తమిళ సోదరులు ఎంత గింజుకున్నా రోబో తెలుగులో 20 కోట్లకు మించి చెయ్యదని ట్రేడ్ పండితుల అంచనా.ఒక డబ్బింగ్ చిత్రం అంత వసూలు చెయ్యటం గొప్ప విషయమే కానీ,దాన్ని కొన్నది 30 కోట్లకు.కాబట్టి నష్టం తప్పదు).

ఏతావాతా చెప్పోచ్చేదేమిటంటే సినిమాకు కథ ముఖ్యం.

కథనం ఊపిరైతే కథ శరీరం లాంటిది.
 

ఈ రెండూ లేకుండా  సరిగ్గా లేనప్పుడు మిగతా ఎన్ని హంగులు,ఆర్భాటాలు ఉన్నా సినిమాని రక్షించలేవు.ఈ విషయం మన దర్శక,నిర్మాతలు ఇప్పటికైనా గ్రహిస్తే భవిష్యత్తులో ఇలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరగవు.లేకపొతే తెలుగు సినిమా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.



8 comments

Post a Comment

ఎవర్ని ఉద్ధరించటానికి ఈ కామన్‌మెన్ వెల్త్



పంతొమ్మిదవ కామన్వెల్త్ ఆటలపోటీల నిర్వహణ కోసం కెనడాతో పోటీపడి మనదేశం అవకాశం దక్కించుకున్నప్పుడు ఎంతో మంది సంతోషించి ఉంటారు.వారం రోజుల నుంచి ఆ ఆనందమంతా ఆవిరైపోతోంది.

ఈ క్రింది గణాంకాలు చూడండి

  • 2003లో బిడ్ గెలిచినప్పుడు ప్రభుత్వం అంచనా - 1835 కోట్లు
  • 2007 ఏప్రిల్ లో బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం ఖర్చు -3566 కోట్లు
  • 2010 మార్చిలో కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ జనరల్ వి.కె.వర్మ ప్రకారం -10,000 కోట్లు
  • ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం -11,494 కోట్లు

అనధికార లెక్కల ప్రకారం ఈ ఖర్చు 30,000 నుంచి 35,000 కోట్లకు మధ్యలో ఉండొచ్చు.ప్రభుత్వ లెక్కలు ప్రామాణికంగా తీసుకున్నా ఏడేళ్ళలో,ఈ అంచనాలు, ఖర్చులు 600 శాతం పైనే పెరిగాయి.ఇక అనధికారిక వర్గాల సంఖ్యలు పరిగణనలోకి తీసుకుంటే కళ్ళుబైర్లు కమ్మి మూర్ఛపోవటం ఖాయం.పోనీ ఇంత ఖర్చు పెట్టి మనవాళ్ళు ఏ విశ్వకర్మ సృష్టించిన మయసభా భవన సముదాయాల్లాంటి
క్రీడాప్రాంగాణాలో,అతిథిగృహాలో నిర్మించారా అంటే అదీ లేదు.వివిధ వెబ్సైట్లలో దర్శనమిస్తున్న ఛాయాచిత్రాలు దేశప్రతిష్ఠని మంటగొలిపేలా ఉన్నాయి.విదేశీ ఆటగాళ్ళు కాదు కదా కనీసం స్వదేశీ సెంట్రీలు సైతం కాలుమోపలేనంత దుర్గంధభూయిష్టంగా ఉన్నాయి.

మరి..ఇంత డబ్బూ ఏమైపోయినట్లు?
అంచనాలకి,వాస్తవ ఖర్చులకి ఎందుకింత వ్యత్యాసం?

ఇదే అనుమానాన్ని ముందు పెడితే 'బీజింగ్ ఒలంపిక్స్ కోసం చైనా 140,000 కోట్లు ఖర్చు పెడితే మనం కేవలం 10,000కోట్లతో ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నామ'ని వి.కె.వర్మ గారు శెలవిచ్చారు.అయ్యా, చైనా ఆర్థిక పరిస్థితి ఏంటి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? చైనీయుల క్రమశిక్షణ ఎంత? మన నిర్మాణాల్లో అవినీతి ఎంత?  సగటు చైనీయుడి దినసరి బత్తెం ఎంత, భారతీయుడి రోజు కూలీ ఎంత?  ప్రభుత్వ కేటాయింపుల్లో వాస్తవంగా ఖర్చు పెట్టిందెంత? స్వాహా చేసిందెంత?  చైనాతో పోటీపడవల్సింది ఇలాగేనా? మనం చీద్కరించుకున్న చైనా నవంబరులో జరుగబోయే ఏషియన్ క్రీడల కోసం రెండు నెలలముందే సర్వసన్నద్ధంగా ఉంది.మరి మన ప్రగల్భాలు ఏమయ్యాయి? ఏడేళ్ళుగా ఏం చేస్తునట్లు?

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు, ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రెటరి లలిత్ భానోట్ గారు ఇంకొకడుగు ముందుకేసి పదితరాలు గుర్తించుకోవాల్సిన మాటనేశారు. 'మీకూ,మాకు అవి పరిశుభ్రంగానే ఉన్నాయి.విదేశీయుల  ప్రమాణాలు వేరుగా ఉంటాయి.ఏదైనా మనం చూసే విధానంలో ఉంది.' అని తేల్చేశారు.నిజమే మరి.అక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేదనుకుంటే లేదు.సర్వం మిథ్య అయినప్పుడు అలా అనుకోవడంలో తప్పేముంది? వెనకటికొక శిష్యుడు 'దేవుడనే వాడున్నాడా' అని సందేహం వెల్లబుచ్చితే ఆ గురువుగారు వెంటనే శిష్యుడి గూబ గుయ్యిమనిపించారట. ' అదేమిటి గురువు గారు,అలా పీకారంటే ' , ' శిష్యా ! ఇప్పుడు నీ చెంప పగలగొట్టినప్పుడొచ్చిన శబ్దం ఏ రూపంలో ఉందో చెప్పగలవా,అలానే దేవుడు కూడా.అంతా మన భావనలో ఉంది' అన్నాట్ట.కాబట్టి మనకి తెలియని విషయాల గురుంచి ఆట్టే అడిగి ప్రయోజనం లేదు,మన బుద్ధికి ఇంకా అంతటి పరిపక్వత కలుగలేదు అని సరిపెట్టుకోవటం తప్ప.కర్మసిద్ధంతాన్ని ఇంతబాగా వంటబట్టించుకున్న అధికారులు అత్యున్నత పదవులలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. ఇంతటి స్థితప్రజ్ఞత ఉంది కాబట్టే ' చేసేదెవ్వడు, చేయించునదెవ్వడు ' అనుకుంటూ మనవాళ్ళు వారం రోజుల ముందు కూడా ముఖ్యక్రీడాంగణం ముందు తాపీగా పేవ్‌మెంట్లు, 
రోడ్లు నిర్మిస్తున్నారు.లీగు మ్యాచుల్లో అలసత్వంగా ఆడి ఓడిపోయి, చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచుల్లో చెమటోడ్చటం మనకు అలవాటే.అలాగే ఐదేళ్ళు అలసత్వం ప్రదర్శించిన ఘనత వహించిన షీలా దీక్షిత్ ప్రభుత్వం,రెండేళ్ళకు ముందు నిద్ర మేల్కొని,ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది.అదీ ప్రధానమంత్రి స్వయంగా జ్యోక్యం చేసుకున్నాక.అడిగేవాడుంటేనే వొళ్ళు దగ్గర పెట్టుకుంటాం.లేకపొటే మనమే రాజు,మనమే మంత్రి.ఒక విధంగా ఇది మన సంస్కృతి.పాశ్చాత్యులకి ఇది విడ్డూరంగా అనిపిస్తే అది వాళ్ళ అజ్ఞానం.ఈ సమయంలో మనం చెయ్యగలిగిందొక్కటే. ఈ దేశాన్ని నవ్వులపాలు చేసే సంఘాటనలేవీ జరక్కుండా ఆటలపోటీలు సాఫీగా సాగిపోవాలని ఆ పరమాత్మున్ని ప్రార్థించటం.

కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

  • గేమ్స్ ముగిశాక క్రీడాగ్రామం పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇలాంటి ఇంకో కార్యక్రమం జరిగే వరకు అదలా ఉత్సవ విగ్రహంలా పడుండాల్సిందేనా?
  • కోట్లాది మంది ప్రజలు దారిద్ర్యంలో మగ్గుతున్న ఈ దేశంలో ఇంత భారీ ఎత్తున క్రీడలు నిర్వహించి ఈ దేశం సాధించేదేమిటి? ఎవర్ని ఉద్ధరించాలని ?
  • పేదరికాన్ని నిర్మూలించటానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? ఢిల్లీ నగరంలో బిచ్చగాళ్ళందరినీ బలవంతంగా తరలించినట్లు, మళ్ళీ ఏ అంతర్జాతీయ కార్యక్రమమో నిర్వహించినప్పుడు పేదల్నందరినీ తరిమేసి,దేశంలో పేదరికాన్ని రూపుమాపామని చంకలు గుద్దుకుంటారా? లేక పేదరికాన్ని నిర్మూలించాలనే చిత్తశుద్ధి నిజంగా ప్రభుత్వానికి ఉందా?
  • కొన్ని వేల కోట్ల రూపాయిలు చేతులు మారిన ఈ కుంభకోణంలో బాధ్యులైన అధికారులు,నాయకుల పై ప్రభుత్వం ఇకనైనా కఠిన చర్యలు చేపడుతుందా లేక షరా మాములుగా ఏ బలవంతపు పదవీవిరమణో, శాఖామార్పిడో చేయించి చేతులు దులుపుకుంటుందా?
  • అన్నిటికన్నా ముఖ్యమైనది,అందరినీ పీడించేది.. కొన్ని కోట్ల మంది రెక్కల కష్టాన్ని అప్పనంగా దోచుకుతిని,దర్జాగా తిరిగే సంస్కృతికి అంతమెప్పుడు?


6 comments

Post a Comment

పెద్దలకోసం ఒక పిట్టకథ

నగనగా ఒక పల్లెటూరి అన్నయ్య.అతనికి చదువబ్బలేదు.ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూంటాడు. పెళ్ళై ఒక పిల్లాడు కూడా ఉన్నాడు.అతని చెల్లెలికి మంచి సంబంధం కుదిరింది. వైభవంగా వివాహం జరిగి ఆమె కాపురానికి పట్నం వెళ్ళింది.ఒక శుభక్షణాన పండంటి ఆడపిల్లని ప్రసవించింది. అమ్మలక్కంతా వదిన చుట్టూ చేరి ' నీకు కోడలు పుట్టిందేవ్ ' అని ఊదరగొట్టారు.వాళ్ళ మాటలకు ఉబ్బితబ్బిబైపోయిన ఆమె ఉయ్యాలలో ఉన్నఆ పసిపాపను తన నాలుగేళ్ళ కొడుక్కి చిరునవ్వుతో చూపిస్తూ "అదిగో..అదే  రా, నీ పెళ్ళాం" అంది .చుట్టూ ఉన్న అమ్మలక్కలు ముసిముసి నవ్వులు నవ్వారు.

పిలుచుకోవడానికి పేరు కూడా పెట్టకముందే  ఆ పాపకు భర్త ఎవరో నిర్ణయమైపోయింది....తన ప్రమేయం లేకుండా !
 

అది ప్రారంభం.

*                                                 *                                                   *

రెండేళ్ళు గడిచాయి.
 

చెల్లెలు కూతురుని తీసుకొని సంక్రాంతికి పుట్టింటికొచ్చింది. ఆ పాపకు రెండేళ్ళు.తన మానాన తను ఆడుకుంటూ ఉంది.అన్నయ్య కొడుక్కి చదువంటే అసక్తి లేదు.ఎక్కడో గోళీకాయలాడుకుంటున్న వాడు,' పెళ్ళాం వొచ్చింద ' ని చెబితే పరుగెట్టుకుంటూ ఇంటికెళ్ళాడు.ఆ పాప దగ్గరికి వెళ్ళి ' ఇదిగో ! ఇప్పట్నుంచి నేను చెప్పినట్లు వినాలి..తెల్సిందా ' అని బెదిరించాడు.పాప భయంగా వాడి వైపు చూసింది.చెల్లెలది చూసి సరదాగా ' ఏంట్రోయ్ మా పాపను బెదిరిస్తున్నావ్ ' అని  గదమాయించింది.రోట్లో పచ్చడి దంచుతున్న వదిన ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్నా, పక్కనే ఉన్న పొరుగమ్మ అందుకని ' ఏమమ్మా ఆ మాత్రం అనకూడదా నా కోడల్ని.వాడికి హక్కుంది కాబట్టి అన్నాడు.ఇంతలోనే నీ కూతురేం కందిపోదులే.అయినా ఎప్పటికైనా వాడి మాట వినాల్సిందే కదా ' అంది.

అనటమే కాకుండా తన చేతిలో ఉన్న ఏ తాయిలమో ఆ పాప చేతిలో పెట్టి,పిల్లాడికి కూడా కొంచెం ఇవ్వమంది.పాప అమాయకంగా ఆ పని చేస్తే ' అబ్బో ,ఎంత ప్రేమో బావ మీద ' అని దీర్ఘాలు తీసింది.

ఇది కొనసాగింపు.

 
*                                                 *                                                   *

పాపకు పదేళ్ళు వచ్చాయి.పిల్లాడికి పధ్నాలుగు.

పాప చదువులో,ఆటపాటల్లో చురుగ్గా ఉంది.అన్నింటిలో ముందంజ వేస్తోంది.
పిల్లాడు పదవ తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్
పెట్టేశాడు.చదువనేది అతని పాలిట కొరకరాని కొయ్యే అయ్యింది.మితిమీరిన  గారాబం వల్ల ఏ పనీపాటా లేకుండా జల్సారాయుడిలా తిరుగుతున్నాడు.అతను ఎదురైనప్పుడల్లా  పాప పడే భయానికి ' సిగ్గు ' అని భాష్యం చెప్పుకొని సంతోషిస్తున్నారు బంధువులు.ఎదిగే వయసులో ఏది నిజం ఏది అబద్ధం అన్న తార్కిక జ్ఞానం కొరవడి నలుగురు చెప్పిందే నిజమని గుడ్డిగా నమ్ముతున్నారు పిల్లలు. ఆకర్షణ ఏర్పడింది.చవకబారు సినిమాలు సీరియళ్ళు చూసి,సాహిత్యం చదివి అదే ప్రేమనే అంధవిశ్వాసంలో కూరుకుపోయారు.

*                                                 *                                                   * 


పాప అమ్మాయయ్యింది.పిల్లాడు అబ్బాయయ్యాడు.

వీళ్ళ వ్యవహారం బయటపడి ఇంట్ళో పెద్ద దుమారం బయలుదేరింది.చదువులో రాణిస్తూ ఇంజనీరింగ్ లో సీట్ తెచ్చుకున్న అమ్మాయిని,చదువు సంధ్యాలేని ఒక పల్లెటూరి ఆకతాయికి ఇవ్వడానికి చెల్లెలు ఒప్పుకోలేదు.అన్నా చెల్లెళ్ళ సంబంధం బీటలు వారింది.కుర్రది కుర్రాడు మాత్రం తమ పట్టు వదల్లేదు.

కథ చివరి అంకానికి చేరుకున్నాక, ముగింపు ఒక్కో కుటుంబంలో ఒక్కోలా ఉంటుంది.

ఈ మొత్తం వ్యవహారంలో తప్పు బట్టవలసిందెవరినైనా ఉంటే అది ముందుగా ఇరుగమ్మ పొరుగమ్మ లాంటి పెద్దల్నే.
పిల్లలు పుట్టగానే  ఇలా హడవుడిగా వరసలు కలిపేసి భార్యాభర్తలుగా ఎందుకు నిర్ణయిస్తారో నాకర్థం కాదు.బాల్యంలో పిల్లలకు చెప్పాల్సిన మాటలు అవి కావు.' శ్రద్ధగా చదువుకొని,సద్బుద్ధులు అలవర్చుకొని,ప్రయోజకులు కండి' అని చెప్పాలి.అదే వాళ్ళకు మంచి నడవడిని నేర్పుతుంది.పిల్లలు వృద్ధిలోకొస్తే వాళ్ళ జీవిత భాగస్వాముల్ని వాళ్ళే ఎంచుకుంటారు.అలా కాకుండా చిన్నపటి నుంచే అస్తమానం ' అది నీ భార్య ' ,' వీడు నీ మొగుడు'  అని నూరిపోస్తే ఇంక చదువేమెక్కుతుంది.వయసుకు మించిన ఆలోచనలు చేసి,లేనిపోని విషయాలపై ధ్యాస మళ్ళి ఉపద్రావాలను కొనితెచ్చుకుంటారు.బాల్యంలో ఉన్నట్లే ఎల్లకాలం ఉండరు కదా.చిన్నప్పుడు కుదురుగా ఉన్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఒట్టి చవటలు గా తయారవచ్చు.అలాగే ఎందుకూ పనికిరారనుకున్నవాళ్ళు అద్భుతాలు చేయవచ్చు.ఏదో ముచ్చట కోసం వరుసలు కట్టి పెళ్ళి ప్రస్తావనలు తీసుకొచ్చే పెద్దలు ఈ వాస్తవాన్ని గుర్తించాలి.చదువులో ప్రతిభ కనబరుస్తున్న ఒక అమ్మాయి జీవితాన్ని ఏ విధంగా పెద్దలు ప్రభావితం చేశారో పై ఉదాహరణ చెబుతుంది.దీనివల్ల నష్టపోయేది ఆ అమ్మాయే. ' కోడలు', ' అల్లుడు' అని ఎక్కడలేని అప్యాయతలు ఒలకబోసిన పెద్దలు ఆమెకేమీ సహాయం చెయ్యరు.వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే. తాంబూలం సేవిస్తూ ఏ రచ్చబండ దగ్గరో,కొప్పులు సరిచేసుకుంటూ ఏ గిలక బావి దగ్గరో ఇంకో కోడలు,అల్లుడు కోసం ఆత్రంగా వెదకటం.

1 comment

Post a Comment

మునిపల్లె రాజు - అస్తిత్వనదం ఆవలితీరాన




మేజికల్ రియలిజం ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని అధ్యాత్మిక కోణంలో అన్వయించి చూసి మానవుడికి, జరుగుతున్న సంఘటనలకు మధ్యనున్న మార్మిక సంబంధాలని ఆవిష్కరించి, విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ ఉండదు. రచయిత రియాలిటీనీ కాపీ కొట్టటం కానీ, దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చెయ్యడు.సాధరణ విషయాలని అద్భుతంగా, అద్భుతమైన వాటిని సాధారణంగా వర్ణిస్తూ నిగూఢమైన రహస్యాలని తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు ‘ సెరమోని ‘ అనే పాశ్చాత్య కథలో ఒక యువతి ఆగ్రహంతో నృత్యం చేస్తూంటుంది.ఎన్నో వేల మైళ్ళ దూరంలో, ఆమెను మోసం చేసిన ప్రియుడు రాత్రి వేళలో తన పశువులపాకలో చెలరేగుతున్న అలజడి చూసి విస్తుబోతూంటాడు. ఆవేశంతో ఆ యువతి కదిలిస్తున్న పాదాలకు, పాకలో పశువులు అసహనంగా కదిలిస్తున్న గిట్టలకు రిలేట్ చేస్తాడు రచయిత. చివరకి ఆ పశువుల దాడిలో అతను మరణిస్తాడు.అతను మరణించిన విషయం రచయిత స్పష్టంగా చెప్పడు కానీ ఒక మోసపోయిన యువతి ఆగ్రహానికి, ఆమె అగ్రహంతో నాట్యం చేస్తే,అతని ప్రియుడే ప్రాణాలు కోల్పోతాడనే విషయానికి రచయిత ఇక్కడ ప్రాముఖ్యతనిస్తాడు. తెలుగులో ఈ తరహా రచనలు చేసిన కొద్దిమంది ప్రముఖులలో మునిపల్లె రాజు గారొకరు.




రాజు గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసి రిటైరయ్యారు. చాలా చిన్న వయసునుంచే అనేక కథలు,కవితలు, వ్యాసాలు వ్రాసి పలు పురస్కారాలు పొందారు.’అస్తిత్వనదం ఆవలి తీరాన’ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం. ఇందులో మొత్తం పదిహేను కథలు, ఒక మినీ నవల ( ‘పూజారి ‘. ఇదే 1964 లో బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా ‘ పుజాఫలం ‘ సినిమాగా వచ్చింది),కొన్ని స్వగతాలు ఉన్నాయి. గత శతాబ్ది గొప్ప కథలలో ఒకటిగా కీర్తికెక్కిన రాయలసీమ కరువు సమస్యల గాథ ‘ వీరకుంకుమ ‘ కూడా ఇందులో ఉంది. కథ ఏదైనా, ఇతివృత్తం ఎటువంటిదైనా దానిలో మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన, తాత్విక శోధన కనిపిస్తుంది. ‘ నైమిశారణ్యంలో సత్రయాగం’ లో విఫల ప్రేమతో అభయానంద గోస్వామి గా మారి నైమిశారణ్యంలో అధ్యాత్మిక పరివేదనలో మునిగిపోయి ఏళ్ళు గడిపి ఆఖరుకి అదే అరణ్యంలో ఒకప్పటి తన ప్రియురాలిని అంత్యదశలో కలుసుకొనే చక్రి , ‘ చేనేత చిత్రం’ లో కుగ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా ముంబయిలోని హస్తకళలపోటికి వచ్చి ద్వితీయ బహుమతి గెలుచుకొని, ఆ తర్వాత నగరంలోని జౌళిమిల్లులు, బట్టల ఖార్ఖానాలు చూసి వాటి ముందు తన చేనేత వృత్తి నిలబడగలదా అని పరితాపం చెందే ఓబయ్య, ’ స్తపతి మహోత్సవం’ లో యానాది కుష్టుమహిళకు ఆలయంలోని బంగారు పంచామృత పాత్రలో పాయసం తినిపించే సీతారాం’, ‘ఒక బాకీ తీరలేదు’ లో బాల్యంలో తనకు అన్నం పెట్టి ఆదుకున్న కమలమ్మ రుణం తీర్చుకోవడం కోసం విదేశాలనుంచి వచ్చే డాక్టర్ మురళి,వారు గతించారని చెప్పి మళ్ళీ అతనికి ఆతిథ్యమిచ్చే ఆ ఇంటి ముసలమ్మ, ‘మహాబోధి ఛాయలో ‘ లో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చెరువు గట్టునున్న ఒక మహావృక్షంతో అనుబంధాన్ని అల్లుకొని, ఆ వృక్ష ఛాయలోనే తన జీవితాన్ని మలచుకొని ,అనేక ఆటుపోట్లకు తట్టుకొని పరాయి రాష్ట్రంలో స్థిరపడి, చివరికో పని మీద మళ్ళీ స్వగ్రామం వచ్చి ఆ చెట్టు కనబడక తల్లడిల్లే కథానాయకుడు..ఇలా ప్రతి పాత్రా మానసాకాశంలో కారుమబ్బులా కదిలిపోతూ భావుకత్వపు కుంభవృష్టిలో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది. మనం కూడా కాసేపు సన్యాసులమై, కమండలాలు ధరించి,శాంతి వచనాలు వింటూ రావిచెట్టు నీడలో యోగముద్రలోకి వెళ్ళిపోతాం. నోరున్న మానవులే కాదు, నోరులేని చెట్టు,ఎద్దు, కుక్క, కూడా ఈయన కథలలో ముఖ్య పాత్రలు పోషించాయి. అంతులేని పోరాటాలతో,అంతరంగిక వేదనలతో అలసిపోయి చీకట్లో మ్రగ్గుతున్న సగటు మానవుడి జీవన విధానానికి వేదాంతపు వీవెన విసిరి, అస్తిత్వపు ఆసరానిచ్చి ఆవలి ప్రశాంత ప్రకాశ తీరాలను చేర్చే యత్నం కనిపిస్తుంది. ఆయనే అన్నట్లు ‘ కథలు రెండు రకాలు. మేధస్సుతో ప్రభావితమైనవి. హృదయంతో ప్రభావితమైనవి. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువ. ఎక్కడ పునాది హృదయమో ఆ కథ కళాబంధురం.’

హృదయపు పునాదుల మీద కట్టిన కథలు చాలానే ఉన్నాయి ఇందులో.

అన్ని పెద్ద బుక్ షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.దొరక్కపోతే ఈ క్రింది అడ్రస్సును సంప్రదించవచ్చు

నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ,హైదరాబాద్ -17
వెల:100/-
తొలి ప్రచురణ  పుస్తకం. నెట్ లో


4 comments

Post a Comment

రౌడీయిజం చేస్తున్న రాష్ట్రపతి కావల్సిన నేత




ళ్ళు గడిచే కొద్దీ వయస్సు పెరుగుతుంది.
వయసు పెరిగే కొద్దీ జ్ఞానం రావటం సహజం.
వస్తుందని ఆశించటంలో తప్పులేదు.

కానీ ఇవన్నీ మాములు మనుషులకు వర్తించే అంశాలు.రాజకీయ నాయకులకు కాదు.వాళ్ళు ఇటువంటివాటికి అతీతులు.యుక్తవయస్సులో ఉన్నా ముదిమి మీదపడుతున్నా వాళ్ళ వ్యవహారశైలి ఒకేలా ఉంటుంది.చెప్పేదొకటి చేసేదొకటి.తర్కానికి అందదు.'తొండ ముదిరి ఊసరవెల్లి అయిన'ట్లు వీళ్ళలో కొంతమంది ధోరణి నానాటికీ మరీ దిగజారిపోతూంటుంది.భావితరాలకి దిశానిర్దేశం చెయ్యాల్సిందిపోయి విచక్షణ మరిచిపోయి అకృత్యాలకి తెగబడే ఇలాంటి నేతల్ని చూస్తుంటే అసహ్యం కలగక మానదు.


ఇప్పటికే మీరు గ్రహించి ఉంటారు.


కాంగ్రెస్ కురువృద్ధుడైన కాకా అలియాస్ జి.వెంకటస్వామి గురించే ఇదంతా. కురువృద్ధుడన్న పదం ఇక్కడ ఉపయోగించినందుకు క్షమించాలి. భారతంలో భీష్మ, ద్రోణ, విదురాది వయోవృద్ధులంతా కురుసభలో న్యాయం కోసం పరితపించిపోయారే గానీ, వారే స్వయంగా ఏనాడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. కానీ ఇక్కడ గౌరవనీయులైన కాకా గారే ఒక నటుడి స్థలాన్ని( శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా హీరోగా ఒక సినిమాలో నటించాడు) నిర్లజ్జగా కబ్జా చేశారు. కబ్జా చెయ్యటమే కాకుండా ఈ వివాదంలోకి తెలంగాణా వాదాన్ని కూడా లాగారు. సీనియర్ నాయకున్నని, రాష్ట్రపతి కావల్సిన వ్యక్తినని స్వోత్కర్ష చెప్పుకొనే వెంకటస్వామి కబ్జా చెయ్యటం సిగ్గుపడాల్సిన అంశమైతే, దాన్లోకి తెలంగాణా వాదాన్ని లాగి ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనుకోవడం పతనమైపోతున్న రాజకీయ విలువలకు పరాకాష్ట.  'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అని తన చర్యను సమర్థించుకుంటూ ఆయనిచ్చిన వివరణ వింటే ఆ పార్టీ నేతలంతా తలవంచుకోవాలి. తన స్థలం పక్కనే ఉంది కాబట్టి తననడిగి స్థలం కొనుగోలు చేసుండాల్సిందని ఆయనొక పసలేని వాదన లేవదీశారు. శ్రీకాంత్ తమ్ముడి స్థలమే కాకుండా రెండొందల ఎకరాల దళితుల స్థలాలను కూడా వెంకటస్వామి ఆక్రమించారని అక్కడి గ్రామస్తులు కొందరు ఆరోపించారు.  నిత్యం పదవీ కాంక్షతో తహతహలాడిపోతూ, వైయస్ ఉన్నంతకాలం మింగలేక కక్కలేక ఉండి సందుదొరికితే మైకు ముందుకొచ్చి అవినీతి గురించి లెక్చర్లు దంచిన వెంకటస్వామి నిర్వాకం చూసి, ఇప్పుడు రాష్ట్రప్రజలంతా నోళ్ళు వెళ్ళబెట్టి విస్తుపోతున్నారు.(నేను వైయస్ కు కానీ జగన్ కు కానీ అభిమానిని కాను) కబ్జా చేసిన స్థలంలో టీ.ఆర్.ఏస్. జెండాలను పాతిపెట్టి వివాదంలోకి ప్రాంతీయతత్వాన్ని లాగినా, ఆంధ్రా హీరోల సినిమాల విషయంలో ప్రవర్తించిన రీతిలో కాకుండా తెలంగాణా జె.ఏ.సి, బాధితుడైన శ్రీకాంత్ వైపే నిలబడటం ముదావహం. పోలీసులు కూడా న్యాయం శ్రీకాంత్ వైపే ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.మరోవైపు ఆయన మీద ఇటువంటి ఆరోపణలు కొత్తకాదని పత్రికలు కోడై కూస్తున్నాయి. ఇంత జరిగినా కనువిప్పు కలగని వెంకటస్వామి తాను తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశానని,అటువంటి తనకు సపోర్ట్ ఇవ్వకుండా ఆంధ్రుడైన శ్రీకాంత్ కు సపోర్ట్ ఇవ్వడమేంటని హుంకరిస్తున్నారు. పోలింగ్ శాతం కేవలం యాభైశాతం దాటటానికే ఆపసోపాలు పడే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అటువంటి దేశంలో ఇటువంటి నేతలకు కొదవ లేదు. గుడ్డిలో మెల్ల ఏంటంటే వాళ్ళు  మనదేశానికి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కాకపోవటం. 

అంతవరకూ మనం అదృష్టవంతులమే.


2 comments

Post a Comment

రాధాకృష్ణ (వాటర్ పెయింటింగ్)



ప్పటిదాకా నేను వేసిన పెయింటింగ్స్ లో కొంచెం తేడాకొట్టిన పెయింటింగ్ ఇదేనని నా ఆభిప్రాయం.కలర్ కాంబినేషన్ సరిగ్గా కుదరలేదు.మొదట్లో వెయ్యాలనుకున్న కలర్స్ వేరు. కలర్ మిక్సింగ్ సరిగ్గా కుదరక ఇలా తయారయ్యింది. అయినా కూడా మా నాన్నగారు దీన్ని ఫ్రేం చేయించారు.


2 comments

Post a Comment

కర్ణాభిమన్యుల జన్మరహస్యం,ఏకలవ్యుని మరణం ఇతర విశేషాలు



తిహాసం అంటే 'ఇది ఇలాగే జరిగిందని ' అర్థం. పంచమవేదమైన మహాభారతం ఎన్నో అద్భుతమైన గాథలకు మారుపేరు. భారతంలో లేనిది ఎక్కడా లేదు, ఎప్పుడూ జరుగబోదు కూడా. పూర్వం దేవలోకంలో నాలుగువేదాలని ఒక వైపు, మహాభారతాన్ని ఒక వైపు వేసి తూస్తే, త్రాసు భారతం వైపే మొగ్గిందట. అటువంటి మహోన్నతమైన గ్రంథంలోంచి కొన్ని విశేషాలు ఇక్కడ.

  1. 1.   మహాభారతం వ్రాయడానికి వేదవ్యాసునికి మూడేళ్ళు పట్టింది.

  2. 2.   వేదాలను నాలుగు భాగాలుగా విభజించినందువలన వ్యాసునికా పేరు వచ్చింది. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు (నల్లగా ఉంటాడు,ద్వీపంలో పుట్టినవాడు).

  3. 3.   అమృతం కోసం గరుత్మంతుడు అమృతభాండం ఉంచిన దర్భలను ఆబగా నాకి పాముల నాలుకలు రెండవుతాయి.

  4. 4.   యాగశాలకున్న వాస్తుదోషం కారణంగా సర్పయాగం ఆగిపోతుందని యాగారంభానికి ముందే లోహితుడనే వాస్తుశాస్త్ర నిపుణుడు జనమేజయున్ని హెచ్చరిస్తాడు.

  5. 5.   బ్రాహ్మణులు కల్లు త్రాగరాదని, త్రాగితే నరకప్రాప్తి తథ్యమని శుక్రాచార్యులు శాపమిస్తాడు.

  6. 6.   కులాంతర వివాహాలు ఆనాడే ఉన్నాయి. యయాతి క్షత్రియుడు. దేవయాని బ్రాహ్మణ కన్య.'బ్రాహ్మణులు క్షత్రియ కన్యలను వివాహమాడవచ్చు కానీ,రాజులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడరాద 'ని యయాతి అంటే శుక్రాచార్యులు అతని సందేహాన్ని తీర్చి వారిద్దరి వివాహానికి ధర్మబద్ధతను కల్పిస్తాడు.

  7. 7.   శకుంతలకు దుర్వాస మహర్షి శాపమివ్వటం, దుష్యంతుడు ఆమెను మరచిపోవటం, జాలర్లు తెచ్చిన ఉంగరం చూసి అతనికి అంతా గుర్తుకు రావటం..ఇదంతా మహాకవి కాళిదాసు కల్పనా వైచిత్ర్యం. వ్యాస భారతంలో కథ వేరు. అసలు దుర్వాస మహర్షి ప్రస్తావనే లేదు. దుష్యంతుడు ప్రజాపవాదుకి భయపడి నిండు సభలో శకుంతల ఎవరో తెలియనట్లు నటిస్తే, ఆకాశవాణి వారి వివాహాన్ని గురుంచి సభికులందరికీ చెబుతుంది.దుష్యంతుడు అప్పుడు అంగీకరిస్తాడు.

  8. 8.   దుష్యంతుని కుమారుడు భరతుడు. అతనికి పుట్టిన కొడుకులెవ్వరు ప్రయోజకులు కాకపోవటంతో ,ఆగ్రహించి భరతుడే వారందరినే చంపి,గొప్ప యాగం చేసి, భరధ్వాజుని ద్వారా భూమన్యుడనే కొడుకుని పొందుతాడు.

  9. 9.   మహాభారతం ఒక విధంగా దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం అనుకోవచ్చు.అమృతం పొందిన దేవతలకు ఎదురొడ్డి నిలువలేక దైత్యులు,దానవులు భూప్రపంచంలో వివిధ రూపాలతో జన్మించి తమ ఆధిక్యాన్ని నిరూపించుకుంటూంటే దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి భూభారం తగ్గించటానికి దేవతలు కూడా మానవజన్మలెత్తుతారు.

    ధృతరాష్ట్రుడు - హంస అనే గంధర్వుడు
    పాండురాజు - వాయుదేవుని అంశ
    కుంతి,మాద్రి -సిద్ధి, ధృతి
    గాంధారి - మతి
    విదురుడు - యమధర్మరాజు
    ద్రోణుడు - బృహస్పతి
    కృపాచార్యుడు - ఏకాదశరుద్రుల అవతారం
    ద్రుపదుడు,విరాటుడు - వాయుదేవుని అంశ

    దుర్యోధనుడు - కలిపురుషుని అంశ
    దుర్యోధనుడి సోదరులు 99 మంది - రాక్షసులు
    శకుని - ద్వాపరయుగాంశ సంభూతుడు
    అశ్వత్థామ - రుద్రుడు,యముడు, కామ క్రోధాంశ సంభూతుడు
    శల్యుడు - ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు
    శిఖండి -గుహ్యకుడనే రాక్షసుడు
    ధృష్టద్యుమ్నుడు - అగ్ని అంశ
    ద్రౌపది తనయులు - విశ్వులు

    కంసుడు - కాలనేమి అనే రాక్షసుడు
    పదహారువేల మంది గోపికలు - అప్సరసలు
    జరాసంధుడు - దానవులలో మొదటివాడు విప్రచిత్తి
    రుక్మి (రుక్మిణీదేవి అన్న) - క్రోధుని కుమారుడు
    సాత్యకి (శ్రీకృష్ణుని తమ్ముడు)- మరుత్తులు

  10. 10.   కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు. నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు చేధిస్తారు. మిగిలిన ఒక్క కవచంతో అతను పారిపోయి సూర్యునిలో దాక్కుంటాడు. నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మిస్తారు.

  11. 11.   కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. జన్మతహ వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి చీల్చి ఇంద్రునికి దానం చేస్తాడు కాబట్టి అతనికి కర్ణుడనే పేరు వచ్చింది. దుర్యోధనుని ప్రాపకం పొందేనాటికే అతనికి కవచ కుండలాలు లేవు. దానమిచ్చేశాడు. మన సినిమాలలో, సీరియల్స్ లో దుర్యోధనుడి చెంత వున్న కర్ణున్ని కవచ కుండలాలలో చూపించి, యుద్ధసమయంలో అతను వాటిని ఇంద్రునికి దానం చేసినట్లు చూపిస్తారు.

  12. 12.   పెళ్ళికి ముందే గాంధారి శివుని గూర్చి తపస్సు చేసి నూటొక్క పిల్లల్ని కనే వరం పొందుతుంది.

  13. 13.   గాంధారి, ఆమె చెల్లెళ్ళు పదిమందితో కలిపి ధృతరాష్ట్రునికి వందమంది భార్యలు.

  14. 14.   అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్ఛస్సు అంశతో జన్మించినవాడు. కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు అతనికి పదహారోయేడు కలిగినవెంటనే తిరిగివచ్చేయాలని షరతు విధిస్తాడు .తత్పలితంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణిస్తాడు.

  15. 15.   కర్ణుడు సైతం ద్రోణాచార్యుడి వద్ద కొంతకాలం విద్యనభ్యసించాడు. కురుపాండవుల అస్త్రవిద్యాప్రదర్శనం కంటే ముందు అతనెవరో ద్రోణుడికి తెలుసు.

  16. 16.   ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి పినతండ్రైన దేవశ్రవుని(వసుదేవుని తమ్ముడు)కుమారుడు.క్రోధుని కుమారులలో ఒకరి అంశతో జన్మించినవాడు. జరాసంధుని సైన్యాధిపతైన హిరణ్యధ్వజుడనే నిషాదరాజు ఇతన్ని పెంచుకుంటాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళుతున్నప్పుడు, అడ్డుపడి జరాసంధుని తరపున పోరాడి అతని చేతిలో ప్రాణాలు కోల్పోతాడు.

  17. 17.   హిడింబ అసలు పేరు కమలపాలిక.

  18. 18.   ఘటోత్కచుడికి నెత్తిన జుట్టు లేదు. బోర్లించిన కుండలా బట్టతలతో ఉంటాడు కాబట్టే అతనికా పేరు.



5 comments

Post a Comment

కౌముది.నెట్ లో నా కథ 'శ్రీకారం'

కౌముది.నెట్ లో నా కథ 'శ్రీకారం'


కౌముది.నెట్ తాజసంచికలో(Aug 2010) కథాకౌముది విభాగానికి వెళ్ళి నా కథ 'శ్రీకారం' చదివి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియజేయండి.ఈ సందర్భంగా ఆలయం గురుంచి కొన్ని వివరాలు తెలియచేసిన మిత్రుడు సామల ప్రశాంత్ కుమార్ కి,కథ నిడివి విషయంలో నా సందేహాలు నివృత్తి చేసిన సుప్రసిద్ద రచయిత్రి వసుంధర గారికి, ప్రచురించిన కౌముది యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.

7 comments

Post a Comment

శాలివాహన (వాటర్ పెయింటింగ్)


ఆంధ్రుల తొలి తెలుగు రాజులు శాతవాహనులు.ఆయితే వీళ్ళెవరనేదాని మీద బోల్డంత గందరగోళం ఉంది.శాలివాహనుడు విక్రమాదిత్యున్నే ఓడించిన రాజని ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది.మన పురాణాల ప్రకారం శాలివాహనుడు విక్రమాదిత్యుని మనవడు, అగ్నివంశపు రాజు.విదేశీ చరిత్రకారుల ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణే శాలివాహనుడు.కొంతమంది స్వదేశీ చరిత్రకారులు దీనితో విభేదిస్తారు.అయితే ఇంద్రదత్తమైన సింహాసనం పొంది,భేతాళున్ని వశం చేసుకున్న విక్రమాదిత్యుడెవరు అనేదానిమీదే చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు.
అటువంటప్పుడు అతన్ని ఓడించి శక శకానికి శ్రీకారం చుట్టిన శాలివాహనుడెవరో తెలుసుకోవడం కష్టం.వీళ్ళు ఎవరైనా ఆంధ్రజాతికి వీళ్ళే మొదటి తెలుగు పాలకులన్నది సుస్పష్టం.

ఆ శాలివాహనుడి ఊహాచిత్రమే ఈ చిత్రం.


3 comments

Post a Comment